నేడు డిప్యూటీ సీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం పర్యటన

Published Thu, Mar 6 2025 12:30 AM | Last Updated on Thu, Mar 6 2025 12:30 AM

-

ఖమ్మం వన్‌టౌన్‌/ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ హెలీకాప్టర్‌లో ముదిగొండ చేరుకోనున్న ఆయన ముదిగొండ–వల్లభి రహదారిలో ముదిగొండ నుంచి 5కి.మీ. మేర రూ.28కోట్ల వ్యయంతో నిర్మించే నాలుగు లేన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాక ఖమ్మం వస్తారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం వ్యక్తిగత సహాయకుడు టి.శ్రీనివాసరావు దశదినకర్మతో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరయ్యాక భట్టి హైదరాబాద్‌ బయలుదేరతారు. కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చే హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం ముదిగొండ శివారు యడవల్లి రహదారిలోని ఓ ఖాళీ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. అక్కడ హెలీప్యాడ్‌ఏర్పాటు, పోలీస్‌ బందోబస్తును ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి, ముదిగొండ సీఐ మురళి, తహసీల్దార్‌ సునీత ఎలిజబెత్‌ పరిశీలించగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

121 డిగ్రీ కళాశాలల ఫలితాలు నిలిపివేత

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను మంగళవారం రాత్రి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 304ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, ఇందులో 121 ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్‌ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు బకాయి పడ్డారు. దీంతో ఆయా కాలేజీల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు నిలిపివేశారు. డిగ్రీ మొద టి, మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యే సమయాన్ని ఫీజు చెల్లించాల్సి ఉన్నా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసి సమయం కోరారు. దీంతో 15 – 20 రోజుల గడువు ఇచ్చినా చెల్లించకపోగా జవాబుపత్రాల మూల్యాంకనం సమయంలో నోటీసులు పంపారు. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెల్లించినా ఇంకా 121 కళాశాలల బాధ్యులు స్పందించలేదు. ఈమేరకు ఆయా కళాశాలల్లో విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. ఈమేరకు విద్యార్థులు ఆందోళనకు గురవుతుండగా, యాజమాన్యాల బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్‌ రామచంద్రాన్ని కలిస్తే ఆయన వీసీ దృష్టికి తీసుకెళ్తానని బదులిచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ రాజేందర్‌ వివరణ కోరగా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement