
అదానీ గ్రూప్ రూ.6,000 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ముంబయి, అహ్మదాబాద్ల్లో రెండు అత్యాధునిక 1,000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం మాయో క్లినిక్ సహకారం తీసుకోబోతున్నట్లు చెప్పింది. అన్ని సామాజిక-ఆర్థిక నేపథ్యాలు కలిగిన ప్రజలకు సరసమైన, ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
అదానీ హెల్త్ సిటీస్గా పిలుస్తున్న ఈ రెండు ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్ల్లో 150 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 80 మందికి పైగా రెసిడెంట్ డాక్టర్లు, 40 మందికి పైగా ఫెలోషిప్ డాక్టర్లు పనిచేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్యాంపస్లో మెడికల్ కాలేజీలతో సహా అధునాతన వైద్య సదుపాయాలు అందిస్తారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, క్లినికల్ రీసెర్చ్ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి సారించే ట్రాన్సిషనల్ కేర్ యూనిట్లు, రీసెర్చ్ సెంటర్లు కూడా ఈ క్యాంపస్ల్లో ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: బాలెనో ధరల పెంపు
ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నొక్కి చెప్పారు. మాయో క్లినిక్తో తమ భాగస్వామ్యం దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను పెంచడానికి సహాయపడుతుందన్నారు. అదానీ హెల్త్ సిటీస్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడానికి రూపొందించబడుతుందని తెలిపారు. అధిక నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment