
బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని అదానీ పవర్ స్పష్టం చేసింది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. అయినా గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ పవర్ సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలోని వివరాల ప్రకారం..బంగ్లాదేశ్లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్కు సరఫరా చేసే విద్యుత్ను దేశీయంగా విక్రయించాలనేది వాటి సారాంశం. కానీ గతంలో ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. బంగ్లాకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను పాటిస్తామని చెప్పింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్కు చెందిన 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లో తయారవుతున్న 100% పవర్ను పొరుగు దేశానికి ఎగుమతి చేసేలా ఒప్పందం జరిగింది.
ఇదీ చదవండి: ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!
బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరతలు, అల్లర్ల వల్ల భారత్ నుంచి విద్యుత్ సరఫరా చేసే కంపెనీల మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతోపాటు గ్రిడ్ నిర్వహణ క్లిష్టంగా మారవచ్చని భావించి ప్రభుత్వం ఎగుమతి నిబంధనల్లో మార్పులు చేసింది. తాత్కాలికంగా విద్యుత్ను స్థానికంగా సరఫరా చేసి, అక్కడి పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి ఒప్పందాలకు అనువుగా విద్యుత్ ఎగుమతి చేసేలా వెసులుబాటు కల్పించింది. అయితే అన్ని కంపెనీలు కచ్చితంగా దీన్ని పాటించాలనే నియమం లేదు.
Comments
Please login to add a commentAdd a comment