
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచే యోచనలో ఉండగా.. తాజాగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ను భారీగా పెంచింది.
కొద్దిరోజుల క్రితం ఎయిర్టెల్ సీఈవో సునిల్ మిట్టల్ మాట్లాడుతూ ప్రతి యూజర్పై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్పీయూని నెలకు 300 రూపాయలకు పెంచినప్పటికీ, వినియోగదారులు తక్కువ ధరలోనే నెలకు 60జీబీ డేటాను వినియోగిస్తున్నందున ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా అన్లిమిటెడ్ ప్యాక్స్లో కనీస రీచార్జ్ ధరను రూ.155కు చేర్చింది. అంతకు మునుపు అదే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.99గా ఉంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్ కాలపరిమితి 24 రోజులు.1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం. రూ.99 రీచార్జ్ ప్లాన్ను ఎయిర్టెల్ నిలిపివేసింది.
ఎయిర్టెల్ బాటలో మరికొన్ని కంపెనీలు
పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం అర్ధం. ఇప్పుడు అదే ఆదాయం క్యూ2 నాటికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.190, రిలయన్స్ జియో సగటు ఆదాయం ఒక్కో వినియోగదారుకు రూ.177.2 అని చెబుతోంది. వొడాఫోన్-ఐడియా అత్యల్పంగా ఉంది. అదే త్రైమాసికంలో ఇది రూ. 131గా నివేదించబడింది. ఎయిర్టెల్తో పోల్చితే వీఐ, జియో ఏఆర్పీయూ రూ. 300కి చేరుకోవడం కొంచెం కష్టమే. ధరల పెంపు సాధారణంగా అదే శాతంలో ఉంటుంది కాబట్టి కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచితే ఎయిర్టెల్ ముందుగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్యాక్స్లో కనీస రీచార్జ్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment