
న్యూఢిల్లీ: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా తగ్గిన ఆదాయంతో సతమతం అవుతున్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ సర్కారు ముందుకు వచ్చింది. కనీస వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అందరికీ కరువు భత్యం పెంచుతున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు. 2021 ఏప్రిల్ 21 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా కార్మిక లోకంలో సంతోషం వెల్లివిరుస్తోంది.
కేంద్రం సైతం
మరోవైపు కనీస వేతనాలపై కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు ఇటీవల ఆర్థిక వేత్త అజిత్ మిశ్రా నేతృత్వంలో కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు. అయితే కనీస వేతనాలపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. కేవలం కాలయాపన చేసేందుకే అజిత్ మిశ్రా కమిటీ వేశారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించింది. కమిటీ పేరుతో కాలయాపన చేయబోమని కనీస వేతనాలపై త్వరగానే నిర్ణయం తీసుకుంటామంటూ కేంద్ర కార్మిక శాఖ నుంచి ప్రకటన వచ్చింది.
జూన్ 29న
కనీస వేతనాలకు సంబంధించి జూన 14న అజిత్ మిశ్రా కమిటీ ఓసారి సమావేశమైంది. జూన్ 29న రెండో సారి సమావేశం కావాల్సి ఉంది. కోవిడ్ ఇబ్బందుల నేపథ్యంలో మిశ్రా కమిటీ నుంచి త్వరగానే నివేదిక తెప్పించుకుని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment