
చిన్న రుణ గ్రహీతలను ఆదుకోవాలి
బ్యాంక్ అధికారుల సంఘం డిమాండ్
బ్యాంక్ విలీనాలతో నష్టమన్న ఆందోళన
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది.
బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది.
గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు.
ప్రైవేటీకరణ పరిష్కారం కాదు..
బ్యాంక్ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్లు మిగలడం తెలిసిందే.
దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది.