
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా తన బ్యాంకింగ్ కరస్పాండెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి సమిత్ భగత్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పనిచేస్తున్న 11వేల మంది కరస్పాండెట్లకు మరో అదనంగా 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త ఖాతాను తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రొడెక్ట్లు, లోన్ క్లోజింగ్ లాంటి సదుపాయాలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆమె వివరించారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీసు సెంటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకునే యత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.