ఈఎఫ్‌టీఏతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం | Sakshi
Sakshi News home page

ఈఎఫ్‌టీఏతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Published Mon, Mar 11 2024 5:16 AM

EFTA and India sign Trade and Economic Partnership Agreement - Sakshi

15 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్‌ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్‌ కొంత చౌకగా లభించగలవు.

లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్‌టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్‌స్టెయిన్‌ దేశాలు ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్‌టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్‌ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్‌టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్‌ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి.

ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌–ఈఎఫ్‌టీఏ మధ్య 18.65 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది.   
 

Advertisement
Advertisement