
ముంబై: బ్యాంకుల స్థానాన్ని ఫిన్టెక్ సంస్థలు భర్తీ చేస్తాయన్నది అపోహ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. అయితే, సాంకేతిక మార్పులను సత్వరం అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘బ్యాంకులు కొనసాగుతాయి. ఫిన్టెక్ సంస్థలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే, బ్యాంకింగ్ స్వరూపం చాలా వేగంగా మారిపోతోంది.
టెక్నాలజీల పురోగతితో వస్తున్న మార్పులను బ్యాంకులు కూడా వేగంగా అందిపుచ్చుకోవాలి‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవి శంకర్ చెప్పారు. ఏకీకృత చెల్లింపుల విధానానికి (యూపీఐ) సంబంధించి సింహ భాగం వాటా నాన్ బ్యాంకింగ్ సంస్థలదే ఉంటోందని, బ్యాంకులు ముందు నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ ప్రపంచంలోను, బైట వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి పెద్ద సంస్థలు కూడా ఇష్టపడకపోవడం ఆర్బీఐని ఆశ్చర్యపర్చిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment