మే 15 నుంచి ‘గూగుల్‌ ఫొటోస్‌’లో మార్పులు | Sakshi
Sakshi News home page

Google Photos: ఏఐ ఫీచర్లను తీసుకురానున్న గూగుల్‌

Published Thu, Apr 11 2024 3:17 PM

Google Photos Has A Major AI Upgrade With Editing Features - Sakshi

మొబైల్‌ కొనేముందు ర్యామ్‌, ఇంటర్నల్‌ మెమెరీ, స్క్రీన్‌ సైజ్‌తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు ఇంటర్నల్‌గా ఫోన్ కెమెరా టూల్‌లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్‌ ఫోటోస్‌’ యాప్‌లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్‌ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

గూగుల్‌ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్‌ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌తోపాటు ఫోటో బ్లర్‌, పోట్రైట్‌ లైట్‌ వంటి ఇతర ఏఐ టూల్స్‌ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్‌ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్‌ను కొన్ని మొబైల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్‌ టూల్స్‌ను గూగుల్‌ ఫొటోస్‌ వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’

యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం  ఆండ్రాయిడ్‌ 8.0, ఐఓఎస్‌ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్‌లనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్‌ ర్యామ్‌ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది.

Advertisement
Advertisement