చైనాకు భారత్ మరో భారీ షాక్.. ఆ ఉత్పత్తులపై ఐదేళ్లపాటు..! | India imposes antidumping duty on 5 Chinese goods for 5 years | Sakshi
Sakshi News home page

చైనాకు భారత్ మరో భారీ షాక్.. ఆ ఉత్పత్తులపై ఐదేళ్లపాటు..!

Dec 26 2021 7:50 PM | Updated on Dec 26 2021 9:34 PM

India imposes antidumping duty on 5 Chinese goods for 5 years - Sakshi

చైనాకు భారత్ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్ సుంకాలను విధించింది. ఈ యాంటీడంపింగ్ సుంకాలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) ఒక ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సీబీఐసీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ వస్తువుల జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్‌(డై పరిశ్రమలో వినియోగిస్తారు), సిలికాన్‌ సీలెంట్‌(సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, థర్మల్ పవర్ అప్లికేషన్ తయారీ కోసం వాడుతారు), హైడ్రోఫ్లోరో కార్బన్‌, కాంపొనెంట్‌ ఆర్‌-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌మిశ్రమాలు ఈ సుంకాల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటిఆర్) సిఫార్సుల నేపథ్యంలో ఈ సుంకాలు విధించారు. ఈ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లలో సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి అవుతున్నాయని, దీని ఫలితంగా డంపింగ్ జరిగిందని డీజీటిఆర్ వేర్వేరు దర్యాప్తులలో నిర్ధారించింది. "ఈ నోటిఫికేషన్ కింద విధించిన యాంటీ డంపింగ్ సుంకం(సిలికాన్ సీలెంట్ పై) ప్రచురించిన తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ సుంకం భారతీయ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది" అని సీబీఐసీ తెలిపింది.

చౌకైన చైనా దిగుమతుల నుంచి దేశీయ తయారీదారులను రక్షించడానికి ట్రయిలర్స్ కోసం యాక్సిల్ - వాహన భాగంపై కూడా సీబీఐసీ సుంకాన్ని విధించింది. అదేవిధంగా ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) నుంచి దిగుమతి అవుతున్న కాల్సినేడ్ జిప్సమ్ పౌడర్ దిగుమతులపై కూడా ఐదేళ్లపాటు సుంకాన్ని విధించింది.  సాధారణంగా యాంటీ డంపింగ్‌ డ్యూటీలను ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే విధిస్తారు. చౌకరకం దిగుమతుల కారణంగా దేశీయ పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితుల్లో వీటిని వసూలు చేస్తారు. ఫలితంగా దేశీయ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవసరమైన మార్కెట్‌ పరిస్థితులు ఏర్పడతాయి. భారత్‌, చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ( (డబ్ల్యుటిఓ))లో రెండూ సభ్యులుగా ఉన్నాయి. ఏప్రిల్-సెప్టెంబర్ 2021 కాలంలో చైనాకు భారతదేశం  12.26 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఆదేకాలంలో 42.33 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. 

(చదవండి: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ.600కే డైలీ 5జీబీ డేటా!.. ఇంకా డైలీ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement