కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌! | Overall electricity demand at 96-98 percent of pre-Covid level | Sakshi

కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌!

Sep 3 2020 6:32 AM | Updated on Sep 3 2020 6:32 AM

Overall electricity demand at 96-98 percent of pre-Covid level - Sakshi

ముంబై: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పుంజుకుని కరోనా ముందస్తు స్థాయికి చేరుతోంది. ఇండియా రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా బుధవారం ఈ మేరకు తన తాజా నివేదికను వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది. అయితే పారిశ్రామిక రంగంలో ఇంకా డిమాండ్‌ ధోరణులు కనిపించడం లేదని కూడా పేర్కొంది.  కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► అఖిల భారత స్థాయిలో చూస్తే, వార్షికంగా  2020 జూలైలో 6 నుంచి 13% విద్యుత్‌ డిమాండ్‌ రికవరీ నమోదయ్యింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్‌ మెరుగుదల దీనికి నేపథ్యం. దీనికితోడు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ కూడా క్రమంలో పుంజుకుంటోంది.  

► ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే, జూలైలో భారీ పారిశ్రామిక రాష్ట్రాల విద్యుత్‌ డిమాండ్‌ 6 నుంచి 15 శాతం తక్కువగానే ఉంది. పారిశ్రామిక రంగంలో క్రియాశీలత నెమ్మదిగా ఉండడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.  

► లాక్‌డౌన్‌ తరవాత మొదటి నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ 13.1 శాతం పడిపోయింది.  మార్చి 25 నుంచీ దేశంలో కఠిన లాక్‌డౌన్‌ అమలు సంగతి తెలిసిందే.

► నెలవారీగా చూస్తే, 2020 ఏప్రిల్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 85 బిలియన్‌ యూనిట్లగా ఉంటే, జూలైలో ఇది 112 బిలియన్‌ యూనిట్లకు చేరింది. అయితే వార్షికంగా చూస్తే మాత్రం డిమాండ్‌ ఇంకా మెరుగుపడాల్సి ఉంది.  

► 2020 ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్‌ 133 గిగావాట్లయితే జూలైలో ఇది 171 గిగావాట్లకు రికవరీ అయ్యింది. అయితే 2019 జూలైతో పోల్చితే ఇది ఇంకా 3.3 శాతం తక్కువే కావడం గమనార్హం.  

►  ఇక ఆగస్టు విషయానికి వస్తే, కోవిడ్‌–19 ముందస్తు స్థాయితో పోల్చితే 98 శాతానికి విద్యుత్‌ డిమాండ్‌ మెరుగుపడింది.  

డిస్కమ్‌లకు నష్టాలు!
2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 5% నుంచి 6% వరకూ క్షీణతలోనే ఉండే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇది విద్యుత్‌ పంపిణీ కంపెనీల (డిస్కమ్స్‌) ఆదాయాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించింది.  ముఖ్యం గా అధిక టారిఫ్‌లు చెల్లించే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బల్క్‌ వినియోగ డిమాండ్‌ పడిపోవడాన్ని  ఇక్రా ప్రస్తావించింది.  ఈ పరిస్థితు ల్లో 2020–21లో డిస్కమ్‌లకు ఆదాయ వ్యత్యాసం అఖిల భారత స్థాయిలో రూ.42,000–45,000 కోట్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement