![SGX Nifty indicates Market may open flat today - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/18/Volatile%20flat.jpg.webp?itok=rrpb6jca)
నేడు(18న) దేశీ స్టాక్ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 17 పాయింట్లు పుంజుకుని 11,544 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,527 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో సింగపూర్ మినహా.. మిగిలిన మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
39,000 దిగువకు
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పతనమై 39,000 మార్క్ దిగువన 38,980 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 88 పాయింట్ల వెనకడుగుతో 11,516 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,235-38,926 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,587-11,499 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,481 పాయింట్ల వద్ద, తదుపరి 11,445 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,569 పాయింట్ల వద్ద, ఆపై 11,623 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,223 పాయింట్ల వద్ద, తదుపరి 22,127 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,461 పాయింట్ల వద్ద, తదుపరి 22,601 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment