
గ్రూప్ సంస్థకు అనుకూలంగా ఉన్న రూ.8,000 కోట్లు ఆర్బిట్రేషన్ అవార్డు కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment