
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసులో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఇదంతా తమను అప్రతిష్టపాలు చేసేందుకు టీఆర్ఎస్ పన్నిన కుట్రగా అభివర్ణించింది. ఏం చేసైనా మునుగోడు ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది.
విచారణ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర విచారణ సంస్థ(సీబీఐ), తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.
కావాలనే బీజేపీపై నింద..
‘మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం నమోదైన ‘ఎమ్మెల్యేలకు ఎర’ (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) కేసులో రాష్ట్ర అధికారులు పక్షపాతంతో, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఈ కేసులో నిష్పక్షపాత, స్వేచ్ఛ విచారణ కోసం ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నాం. 2018లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 2022, ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
నవంబర్ 3న ఇక్కడ ఉప ఎన్నిక జరుగనుండగా, రాజగోపాల్రెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజా స్పందన అధికంగా వస్తోంది. దీన్ని అడ్డుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అయినా ఓటర్లు మాత్రం బీజేపీవైపే నిలుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దెత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకోవడం కోసం డబ్బు, కాంట్రాక్టులు ఎరవేసిందని బుధవారం కొన్ని న్యూస్ చానళ్లు ప్రచారం చేశాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌజ్ ఈ తతంగం జరుగుతోందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పలు చానళ్లు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రాథమిక దర్యాప్తు జరిపిన సైబరాబాద్ సీపీ ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎస్కార్ట్ వాహనాలతో ప్రగతిభవన్కు తరలించారు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు వచ్చారని చెప్పారు. రోహిత్రెడ్డి సమాచారం ఇవ్వడంతోనే తాము వచ్చి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిస్వామిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు’అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదంతా రాజకీయ కుట్ర మాత్రమే..
‘ఈ ముగ్గురు రోహిత్రెడ్డిని సెప్టెంబర్ 26న కలిశారని, బీజేపీలోకి వస్తే రూ.100 కోట్లు ఇస్తామని చెప్పినట్లు టీఆర్ఎస్ ఆరోపించింది. రోహిత్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇదంతా టీఆర్ఎస్ నడిపిన రాజకీయ కుట్ర మాత్రమే. బీజేపీ పరువుతీయడానికి, కార్యకర్తలను నిరుత్సాహపరిచి తద్వారా మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని ఈ కుట్రకు పాల్పడింది.
ఈ కేసు వెనుక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఇతర ముఖ్య నేతలు ఉండి నడిపిస్తున్నారు. పోలీసులు స్వేచ్ఛగా విచారణ చేసే అవకాశం లేనందున.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)తో విచారణ జరిపించాలని కోరుతున్నాం. లేకుంటే మునుగోడు ఎన్నికలో బీజేపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. విచారణ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని వెల్లడించారు.