
సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. చలవాదిపాళ్య వార్డు(138) బీజేపీకి చెందిన మాజీ మహిళా కార్పొరేటర్ రేఖాకదిరేశ్(40)పై గురువారం దుండగులు మరణాయుధాలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. రేఖాకదిరేశ్ ప్లవర్గార్డెన్లో నివాసం ఉంటుంది. పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం ఉండటంతో గురువారం ఉదయం 9.30 సమయంలో చలవాదిపాళ్యలో ఉన్న బీజేపీ కార్యాయానికి వెళ్లారు. 10.30 సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి బయటకు పిలిచి ఒక్కసారిగా ఆమెపై మారణాయుధాలతో దాడి చేసి ఉడాయించారు. చిక్కపేట ఏసీపీ, కాటన్పేట పోలీసులు వచ్చి బాధితురాలిని కెంపేగౌడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
మృతురాలికి కుమారడు, కుమార్తె ఉన్నారు. కాగా టెండర్ వివాదంలో 2018లో రేఖా భర్త కదిరేశ్ హత్యకు గురయ్యారు. ఆ కేసుకు సంబంధించి శోభన్ అతడి అనుచరులు కోర్టులో లొంగిపోయారు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా రేఖాకదిరేశ్ హత్యకు సంబంధించి పీటర్ అనే వ్యక్తితోపాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. టెండర్లు, పాతకక్షలే హత్యకు కారణమని చెబుతున్నారు. హంతకులు తమను గుర్తు పట్టకుండా రేఖాకదిరేష్ ఇంటి వద్ద సీసీకెమెరాలను పైకి తిప్పారు. అదనపు పోలీస్కమిషనర్ మురగన్తో కలిసి పశి్చమవిభాగ డీసీపీ సంజీవ్పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల ఆచూకీకోసం మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం: సీఎం
రేఖాకదిరేశ్ హంతకులను 24 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప తెలిపారు. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేఖాకదిరేశ్ హత్యకేసుకు సంబందించి ఇప్పటికే నగరపోలీస్కమిషనర్తో మాట్లాడినట్లు తెలిపారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment