● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 2,500 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా అధిక సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు.
ఘనంగా రథసేవ
ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం ఈఓ సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, రామారాయ కళా వేదిక మీద సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment