104, 108 వ్యవస్థల నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

104, 108 వ్యవస్థల నిర్వీర్యం

Published Thu, Feb 20 2025 12:13 AM | Last Updated on Thu, Feb 20 2025 12:11 AM

104, 108 వ్యవస్థల నిర్వీర్యం

104, 108 వ్యవస్థల నిర్వీర్యం

అత్యవసర వైద్య సేవలు అందించే 104, 108 వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది.

ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే 104, 108 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా మూగజీవాలపై ‘పచ్చ’పాతం చూపుతోంది. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది. ఉన్న పళంగా ఆరోగ్య సేవలు నిలిపివేసి వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 16 సంచార పశువైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్‌–1లో వాహనాలు తిరిగి ఆయా పశువైద్య శాఖ ఏడీ కార్యాలయంలో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పనిచేసే పైలట్‌, పారావిట్‌, డాక్టర్‌, పైలట్‌ రిలీవర్లు సుమారు 48 మంది విధులకు హాజరు కాకూడదని వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా సూచించారు. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా? లేక ఇంతటితో ఆగిపోవాలా? అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

అకస్మాత్తుగా తొలగింపు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2022 మే మాసంలో అంబులెన్స్‌ సేవలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒక వాహనం కేటాయించారు. అందులో డాక్టర్‌కు నెలకు రూ.37,000, పారావిట్స్‌కు రూ.13,400, డ్రైవర్‌కు రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారు.

ఉన్నపళంగా వెళ్లమని..

పశు అంబులెన్స్‌ సేవలను జీవీకేఈఎంఆర్‌ఐ సంస్థ నిర్వహిస్తోంది. ఈనెల 16వ తేదీ నాటికి సంస్థ కాంట్రాక్ట్‌ గడువు ముగిసిందని, విధుల నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు పంపింది. ఒక్క సారిగా చెప్పడంతో ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఉద్యోగాల తొలగింపు అంశంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని భావించిన తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. పశువైద్య శాఖ ఏడీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉద్దేశం ఇదీ..

పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు 108 అంబులెన్సుల తరహాలో.. అత్యాధునిక సౌకర్యాలతో పశువుల ఆంబులెన్సులు తీర్చిదిద్దారు. వీటి నిర్వహణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరించింది. అంబులెన్స్‌ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్‌ ఫ్రీ నంబరు సైతం ఏర్పాటు చేశారు. ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రాంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నపళంగా ఆపేయడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం పొందాలంటే కిలోమీటర్ల దూరంలోని పశువైద్య శాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.

అంబులెన్స్‌లో అధునాతన వసతులు

పశువుల అంబులెన్స్‌లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు.

ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌

అటెండర్‌ ఉంటారు.

20 రకాల పేడ సంబంధిత పరీక్షలు,

15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రో

స్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను

ఆ వాహనంలో ఏర్పాటు చేశారు.

అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో

పాటు పశువును వాహనంలోకి ఎక్కించేం

దుకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం ఉంది.

ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో

కల్పించారు.

పశువులకు అత్యవసర వైద్య సేవలకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట

ఆయా గ్రామాల్లో వైద్యం

అందించేందుకు ప్రత్యేకంగా వాహనాలు

కూటమి ప్రభుత్వం

వచ్చాక సేవల నిర్వీర్యం

సంచార వైద్య వాహనాలు

ఆపేయాలని నిర్ణయం

ఉన్నపళంగా ఉత్తర్వులు

జిల్లాలో 16 వాహనాల ద్వారా సేవలు

ఇప్పటికే 104, 108 వ్యవస్థల నిర్వీర్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement