గుండుగొలను వంతెన నిర్మాణం ప్రశ్నార్థకం
భీమడోలు: గోదావరి కాలువపై గుండుగొలను వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిపివేయాలని రాజమండ్రి కేంద్ర జల రవాణా శాఖ(ఇన్ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. దీంతో చివరి దశలో శ్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న వంతెన అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాలువపై వంతెన నిర్మాణం చేసే తరుణంలో కేంద్ర జలరవాణా శాఖ నుంచి నేషనల్ హైవే అథారిటీ సంస్థ కాంట్రాక్టర్ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే మూడేళ్లుగా ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన వివిధ శాఖల అనుమతులు తీసుకోకుండా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు కాలాయాపన చేశారు. తాజాగా వంతెన పనులు శ్లాబ్ దశకు రావడంతో కేంద్ర జలరవాణా శాఖ వంతెన పనులు ఆపాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.
ఎత్తు తగ్గడం వల్లే
వాస్తవానికి జాతీయ రహదారికి 11 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. కానీ కేవలం 5 మీటర్ల ఎత్తు ఉండడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్లో గోదావరి కాలువలో జల రవాణా శాఖ చేసే క్రమంలో వివిధ స్టీమర్లు, పడవలు, ఓడలు రవాణాకు ఈ వంతెన అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. తక్షణమే నిలిపివేయాలని ఆ శాఖ సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో సమస్య మొదటికొచ్చింది. దీనితో పలు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండున్నరేళ్ల క్రితం కూలిన వంతెన
బ్రిటిష్ హాయంలో గుండుగొలను వద్ద నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో రెండున్నరేళ్ల కితం కూలిపోయింది. నిత్యం రద్దీగా ఈ వంతెనపై వాహనాల రాకపోకలు స్థంభించాయి. నిత్యం భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, కై కలూరు మండలాల నుంచి రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు, భక్తుల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీనితో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నేషనల్ హైవే అథారిటి సంస్థ 2023 జూన్లో కూలిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. వైఎస్సార్ సీపీ హయాంలో 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయితే మిగిలిన 40 పనులును కూటమి సర్కార్ రాగానే పనులు చేపట్టగా అడుగుడుగునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం శ్లాబ్ వేయాల్సి ఉంది.
బెయిలీ వంతెనపై భయం భయంగా..
గుండుగొలను వద్ద శాశ్వత వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్మించిన బ్రెయిలీ వంతెనపై ప్రజలు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ వంతెన వ్యవధి రెండేళ్లు అని ఆర్అండ్బీ అధికారులు బెయిలీ వంతెన ప్రారంభోత్సవంలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్కు గడువు ముగుస్తుంది. అయితే ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
వంతెన శ్లాబ్ వేయవద్దని కేంద్ర జల రవాణా శాఖ ఆదేశాలు
అర్ధాంతరంగా నిలిచిన పనులు
గుండుగొలను వంతెన నిర్మాణం ప్రశ్నార్థకం
Comments
Please login to add a commentAdd a comment