
తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు.భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ చరిత్ర అజరామరమయ్యిందన్నారు..రాష్ట్ర అవతరణ తర్వాత మనకు తెలియని మన మహోన్నతమైన చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట ఉన్నత విద్యామండలిలో ‘‘తెలంగాణ చరిత్ర’’ బృహత్ గ్రంథాన్ని విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా డి. రవీంద్ర యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఇంటర్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గ్రంథం తప్పకుండా ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని తర్వాత తరాలకు అందజేయాలంటే మన చరిత్రను, మన సంస్కృతిని నిక్షిప్తం చేసి అందచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తొలుత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో, ఇప్పుడు తెలుగులో అందించడం వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒకే గ్రంథంలో సమగ్రంగా మొత్తం చరిత్రను ముద్రించిన తెలంగాణ పబ్లికేషన్స్ కృషిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment