
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు.
అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది.
ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు.
ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్మెన్గా పిలిచే ప్రొఫెషనల్స్కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు.
అతడి ద్వారానే బిహార్కు చెందిన సుభాష్కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు.
తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్తో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్తో స్పర్థలు ఏర్పడ్డాయి.
పటేల్ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్.
దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు.
ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్లో పట్టుకుంది. హైదరాబాద్లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్లూ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment