Funday
-
సరదాగా ఈ సండే చేప, చికెన్తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
Dog: ప్రేమకి, విశ్వాసానికి మారుపేరు..
కుక్క– ధర్మరాజుతో స్వర్గాన్ని, దేవదాసుతో దైన్యాన్ని సమానంగా పంచుకున్న ఈ జాతి విరోధాభాసకు చక్కటి ఉదాహరణ. కుక్కలు అరుచుకుంటాయి, అంతలోనే ఎంతకీ విడివడనంతగా కలుసుకుంటాయి. ప్రేమకి, విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి, అత్యంత నీచమైన తిట్టుగా వాడబడతాయి. వాటి గొడవలతో, అరుపులతో మిగతావాళ్లు పడే భయాన్ని పట్టించుకోనంత స్వార్థంతో ఉంటాయి. ఒక్కటీ అందిరాదని తెలిసినా, పుంజీడు పిల్లల్ని కని; తినీ తినకా, చచ్చీ చెడీ, నిస్వార్థంగా వాటిని పోషిస్తాయి.‘నా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల ఏం చేచ్చోంది లా’ అంది వందన అతని వతైన తల చెరిపేస్తూ,‘ఏయ్, ఏంటిది? లే, ఇది హాలు. కిటికీలోంచి కనబడతాం’ అన్నాడు మౌళి లాప్టాప్లో పనిచేసుకుంటూ.‘ఎదురింటివాళ్ళు లేరు లేరా. అయినా ‘చౌ చౌ’ బ్రీడ్ కుక్కపిల్లలా ఇంత జుట్టేంటిరా? నీ జుట్టు నాకుండి, హాయిగా నీకు బట్టతల వస్తే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నా’ అంది వందన అతని ఒళ్ళో కూర్చుని, ఒతైన జుట్టుని వేలితో తిప్పుతూ.లాభం లేదని, లాప్టాప్ పక్కన పెట్టి, ‘అయితే తలుపేయ్, జుట్లు పీక్కుందాం’ అన్నాడతను కొంటెగా ఆమెని దగ్గరకి లాక్కుంటూ.‘నోర్మూసుకుని పని చూసుకో! ఇంత పిసరు చనువిస్తే చాలు, రెచ్చిపోతావ్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏదో అప్పుడప్పుడూ ముద్దొస్తావు. అంతమాత్రాన బుద్ధిలేదూ?’ అంటూ అతని క్రాఫ్ సరిచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది వందన.అంతలో వందనకి ఫోన్ వచ్చింది. ‘ఆ వదినా చెప్పండి, అవునా వెరీ గుడ్. ఆ.. ఇదిగో మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి, అలాగే, మేము రేపు ఉదయమే బయల్దేరి వస్తాం’ అంటూ భర్తకేసి తిరిగి, ‘ఏమండీ, మీ అక్క ఫోన్, మీ మేనకోడలు హడావిడి చేసిందట, మాట్లాడండి’ అంటూ ఫోన్ మౌళికి ఇచ్చింది.ఆ రాత్రి. పాలమీగడలాంటి ఆమె వంటిపై పాము కుబుసంలాంటి నైటీ మెరిసిపోతోంది. విరబోసుకున్న కురుల్లో విరిసిన మల్లెలు కారుమబ్బుల్ని చీల్చుకొచ్చిన వెలుతురు చుక్కల్లా ఉన్నాయి.‘రేపు ఊరెళ్తే ఓ మూడురోజులు మళ్ళీ పస్తే. అయినా ఇంతందంగా ఉండే నీకు ఏంగర్ ఇష్యూస్ ఏంటిరా’ అన్నాడతను ఆమెకి చేరువౌతూ.‘అక్కడకి నువ్వేదో శాంతమూర్తివైనట్టు. అయినా సత్యభామ కోపం కూడా కృష్ణుడిపై ప్రేమలో భాగమే! సహిస్తేనే సౌఖ్యం, భరిస్తేనే భోగం’ అందామె కొంటెగా.ఒక్క ప్రథమకోపం తప్పిస్తే, అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటుంది వందన.అందుకే భర్తొదిలేసిన అక్కని, భార్యొదిలేసిన అన్నని, ఊళ్ళో అమ్మకొదిలేసి మరీ సిటీలో వందనకి వందనంగా ఉంటున్నాడు మౌళి.∙∙ ఆ మర్నాడు ఉదయమే కార్లో బయలుదేరి ఊరికి వెళ్లారు. పిల్లని చాప మీద కూర్చోపెట్టారు. నెమ్మదిగా పేరంటాళ్ళు రావటం మొదలుపెట్టారు.‘అక్కా అందరూ వచ్చారు కదా! ఇంకా దేనికి వెయిటింగ్?’ అడిగాడు మౌళి లోపలికి వస్తూ.‘అదే రా మీ ఆవిడ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళింది. అరగంటయింది, ఇంకా రాలేదు. తను లేకుండా మొదలుపెడితే ఏమనుకుంటుందో అని...’ అంటూ నసిగింది శ్యామల.‘వాళ్ళ వాళ్ళతో ఫోన్ మాట్లాడిందంటే ఓ పట్టాన వదలదు. ఉండక్కా, నేనెళ్ళి తీసుకొస్తా’ అంటూ మేడెక్కాడు మౌళి. అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వందనని కిందకి రమ్మని సైగ చేశాడు, అతన్ని ఆగమని, ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ‘హా అక్కా, వాళ్ళు పెళ్లి వైజాగ్లో చేయమంటున్నారు అంతేగా. నువ్వేం కంగారు పడకు. మీరు ఓకే అని చెప్పండి. నువ్వు, బావ, నీ కూతురు వచ్చేయండి. మొత్తం నేను చూసుకుంటా. అది నాకూ కూతురే. నేను దగ్గరుండి చేస్తా పెళ్లి. కల్యాణ మంటపం ఇప్పుడే బ్లాక్ చేస్తా’ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడుతోంది వందన.ఆ సంభాషణ విని మౌళికి చిరాకేసింది. అతనికి తోడల్లుడు అంటే పడదు. నక్కు నక్కుగా ఉండి అందర్నీ వాడుకుంటాడని. దానికి తోడు పెళ్లి హడావిడి అంతా వందన నెత్తి మీదేసుకుంటే ఇంక ఆమె తనకి కనీసం ఓ రెండు మూడు నెలలు దొరకదు.ఆమె ఎంతకీ ఫోన్ ఆపకపోవటంతో ‘హే, ఆపు నీ సోది. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత పెళ్ళి. సాయంత్రానికి మన ఊరెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాం కదా. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. రా కిందకి’ అన్నాడు విసుగ్గా. ఇంట్లో తనని ‘పెళ్ళాం కూచి’ అనుకోవటం మౌళికి తెలుసు. అది తప్పని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా అతనలా మాట్లాడ్డానికి ఓ కారణం.ఆ మాటలు అవతల ఫోన్లో ఉన్న వందన అక్కకి లీలగా వినబడ్డం వల్లనేమో,‘సరే వందనా, అత్తవారింట్లో బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చేస్తాలే’ అని ఫోన్ పెట్టేసింది.అప్పటికే శ్యామల కూడా మేడమీదకి రావటంతో తమ్ముడు మరదల్ని విసుక్కోవటం చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న సంతోషపు తెర వందన చూసింది. అంతే, భర్త చూపించిన విసుగు కంటే, అక్క విందన్న ఉక్రోషంతో, ఆడపడుచు ఉందన్న అవమానంతో, వందనకి కోపం నషాళానికి అంటింది.‘మా అక్క కూతురి పెళ్లంటే నా కూతురి పెళ్లిలాంటిది. శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సోది అంటావా? మాటలు మర్యాదగా రానీ’ అంది వందన విసురుగా కిందకి వెళుతూ.అతనూ తగ్గలేదు. ‘చూడూ, మనమా వాళ్ళకంటే చిన్నవాళ్ళం. వాళ్ళు ఎత్తిపెట్టుకుని మనదగ్గరకి వచ్చేస్తే, అన్నీ మనమెక్కడ చూడగలం? పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. పైగా మీ బావకి కనీసం బండి తొక్కడం కూడా రాదు. ఎక్కడికైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏం? మీ అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటున్నాడుగా! అతనితో మాట్లాడొచ్చుగా? మీ అక్క నీకే ఎందుకు చెబుతోంది. ఆ పిల్ల వాడికీ మేనకోడలే కదా?’అన్నాడు విసురుగా. అప్పటికే ఇద్దరూ కిందకి దిగారు. శ్యామల ముందే దిగిపోయింది.‘నోర్ముయ్. వాడూ, వీడు అంటున్నావేంటి రా’ వందన ఊగిపోతోంది కోపంతో.‘ఏయ్ మర్యాదగా మాట్లాడు’ అన్నాడు మౌళి. వాళ్లిద్దరూ చుట్టూ ఎవరున్నారో ఎప్పుడో మర్చిపోయారు. ఆ క్షణం వాళ్ళు వీధికుక్కల్ని తలపించారు.‘నీకు మర్యాదిచ్చేదేంటిరా. నోటికొచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా రాత్రికి నా పక్కలోకే చేరతావురా కుక్కా’అంతే. మౌళి చుట్టూ చూశాడు. అప్పటికే అక్కడికి చేరిన పేరంటాళ్ళు ఉండాలన్న ఉత్సుకతకీ, ఉంటే గొడవ ఆపేస్తారేమో అనే అనుమానానికి మధ్యలో ఊగిసలాడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గంటగంటకీ గడియారంలో పక్షి బైటకొచ్చినట్టు అడపాదడపా తలుపు సందుల్లోంచి ఓసారి మొహం బైటపెట్టి మళ్ళీతలుపుచాటుకి వెళ్లిపోతున్నారు. పిల్లలు ఒకప్పుడు చిత్రలహరి చూడ్డానికొచ్చినట్టు కిటికీల దగ్గరకి చేరారు. మౌళి స్పృహలోకొచ్చాడు. అమాంతం తనని లోపలికి తీసుకెళ్ళిపొమ్మని భూదేవిని వేడుకున్నాడు. భూదేవి పలక్కపోవటంతో, ఏం చెయ్యాలో తెలీని ఉక్రోషంతో వందన మీదకి వెళ్ళాడు.‘ఆగక్కడ. నా ఒంటిమీద చెయ్యి పడిందో ఇంటిల్లిపాదినీ జైల్లో తోయిస్తాను’ ఊగిపోతూ వేలు చూపిస్తోంది వందన.అంతే. ఒళ్ళో కూర్చున్న ‘చివావా’ కుక్కపిల్ల వృషణాలు కరిచినట్టు వణికిపోయాడు మౌళి.శ్యామల కారుతున్న చెమటని సైతం లెక్కచేయకుండా ఫ్యాన్ కూడా లేని కొట్టుగదిలోకి పరిగెత్తింది. అమ్మ వెనుకే ఉండి, చిమ్మిలి నలిగిందో లేదో, బెల్లం సరిపోయిందో లేదో ఆరారా రుచి చూస్తున్న విస్సుబాబు తల్లి వెనక్కి మరింతగా ఒదిగిపోయాడు.అందరికన్నా ముందు తేరుకున్నది రామలక్షే్మ! గబ గబా చెయ్యి కడుక్కుని, కోడలికి గ్లాస్తో మంచినీళ్ళిచ్చి, పక్కనే ఉన్న స్టూల్ జరిపి, ‘ముందు నువ్వు కూర్చో తల్లీ, వాడొట్టి మూర్ఖుడు, నేను మందలిస్తా’ అంది.‘చూడండి మీ కొడుకు బుద్ధి. ఏం? నేను మీ అందరితో కలివిడిగానే ఉంటున్నాను కదా. సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నకల్లా పరిగెత్తుకుని రాలేదా. నా వాళ్ళు అనుకోబట్టే కదా. అదే నీ కొడుక్కి మాత్రం మా వాళ్లంటే ఎరుసు. ఎప్పుడూ వాళ్ళని చులకనగానే మాట్లాడతాడు’ అంది వందన రొప్పుతూ.రామలక్ష్మి ఆమెని స్టూల్ మీద కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించి ఆమె పక్కనే కింద కూర్చుంది. మౌళిని బైటకి పొమ్మని హెచ్చరించింది. కాసేపాగి, వందన వణుకుతున్న గొంతుతో, ‘ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. వాడితో నేను వెళ్ళను. నా దగ్గర ఒక్క రూపాయి ఉంచడు నీ కొడుకు. బస్సెక్కి వెళ్ళిపోతా, నాక్కొంచెం డబ్బివ్వండి’ అంది.‘అమ్మా, నువ్వు మంచిదానివి. ఇంటికోడలు ఇలా కంటతడి పెట్టి వెళ్ళిపోతే ఆ చంటిదానికి మంచిది కాదు. ఈ ఒక్కపూట ఉండి సాయంత్రానికి వెళ్లిపోదురు. మీరిద్దరూ విడివిడిగా వెళితే వీధిలో పరువు పోతుంది. వాణ్ణి నేను మందలిస్తాను. నిన్ను ఒక్క మాట అనకుండా ఉండే పూచీ నాది’ అంటూ వందన కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది రామలక్ష్మి.నెమ్మదిగా పేరంటం అయిందనిపించారు. మౌళి, వందన మాట్లాడుకోలేదు.అతికష్టం మీద పిల్లతో ఫోటోకి మాత్రం నించున్నారు. ఆ రోజు సాయంత్రం. మౌళి కారు స్టార్ట్ చేశాడు. రామలక్ష్మి వందన చేతిలో రెండువేలు పెట్టి, ‘అమ్మా, వాడిమాటలేం పట్టించుకోకు. నా బిడ్డలాంటిదానివి. నీకు వాడితో ఎప్పుడు చికాకు అనిపించినా ఇక్కడకు వచ్చేయ్’ అంది.వందన అతని పక్క సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుని డోర్ బలంగా వేసింది.ఆ శబ్దానికి రామలక్ష్మి గుండెలు అదిరాయి. కారు కీచు శబ్దం చేసుకుంటూ దుమ్ము రేగ్గొట్టి వెళ్ళింది. రామలక్ష్మి వీధి అరుగుమీద కూలబడింది.రామలక్ష్మికి పదిహేనో ఏట పెళ్లయింది. పద్దెనిమిదికి ముగ్గురు పిల్లలు. భర్తని పిచ్చికుక్క కరవటంతో రేబిస్ వచ్చి ఆర్నెల్లు నరకయాతన పడి మరణించాడు. అతని ఉద్యోగం ఆమెకిచ్చారు. కుక్కపిల్లల్ని తల్లికుక్క పొదువుకుని కాపాడినట్టు పిల్లల్ని పెంచుకొచ్చింది. కూతురు శ్యామలకి చెమటెక్కువ. ‘ఓస్ అంతేనా’ అనుకునేంత కాదు.డాక్టర్కి చూపిస్తే ‘హైపర్ హైడ్రోసిస్’ అని చెప్పేంత. ‘బుల్ డాగ్’లా వాసన కొడుతోందనిపెళ్ళైన వారానికే ఓ పిల్లని కనడానికి సరిపడా ‘అనుభవం’ ఆమెకి వదిలేసి ‘పరియా’ బ్రీడ్వీధికుక్కలా పారిపోయాడు భర్త.రామలక్ష్మి రెండో సంతానం విస్సుబాబు. అమ్మ కూచి. ‘మాస్టిఫ్’ బ్రీడ్ లా ఇంట్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం తప్పిస్తే అతని వల్ల రామలక్ష్మికి మరే ఉపయోగం లేదు.పెళ్లయ్యే వరకు ఉద్యోగం ఉంది అనిపించాడు. అవగానే మానేశాడు. భార్య వేరు కాపురం పెట్టమంది. ‘అమ్మని, వదిలి ఎలా వెళ్తాం?’ అన్నాడు. ఎలా వెళ్లాలో ఆమె వెళ్లి చూపించింది. అప్పుడప్పుడూ స్వప్నస్ఖలనాలతో అతనికి భార్యలేని లోటు తెలియలేదు. వీళ్ళిద్దరినీ రామలకే‡్ష్మ పోషిస్తుంది.పిల్లల చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పించుకుంది రామలక్ష్మి. ‘పుంజు’లకి, ‘పెట్ట’కి కూడా పెళ్లి గండం ఉందని తెలిసింది. భయపడినట్టుగానే కూతురు, పెద్దకొడుకు పెళ్లిళ్లు పెటాకులైపోయాయి. రెండు డక్ అవుట్ల తర్వాత దిగే బాట్స్మెన్ని పెవిలియన్ నించి చూస్తున్న మేనేజర్లా రామలక్ష్మి దడదడలాడుతూ మూడోవాడైన మౌళికి పెళ్లి చేసింది. కొడుక్కి కోరికెక్కువ, కోడలికి కోపమెక్కువ. వాళ్ళు చిన్న మాట అనుకున్నా ఆమెకి కంగారెక్కువ. ఆ రోజు జరిగిన గొడవతో చిన్నప్పుడు జోస్యం చెప్పిన చిలక ఇప్పుడు ఆమె తల్లో రాబందులా తిరగసాగింది.మౌళి, వందన, వాళ్ళింటికి చేరేటప్పటికి రాత్రయింది. ఇంత తిన్నామనిపించి, బెడ్రూమ్లో ‘ఇగో’ అనే పాముని చెరోవైపు పట్టుకుని సాగదీసి వీసెలకొద్దీ విషాన్ని చిమ్మిన తర్వాత ఏ అర్ధరాత్రికో అమృతం చిలికారు.మరి అదేరాత్రి రామలక్ష్మికి ఎలా గడిచింది? ‘కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో’ అని ఆలోచించటానికి మౌళి మహాకవి కాదు.ఆ మర్నాడు వాళ్లిద్దరూ పన్నెండు రోజులుండటానికి సరిపడా బట్టలూ, గట్రా తెచ్చుకుని మళ్ళీ కార్లో ఊరొచ్చారు. బతికుండగా బువ్వెట్టకపోయినా చితిలో చక్కెర పోశాడు. ఈ పదకొండు రోజులూ పాటించవలసిన నియమాలు చెబుతూ బ్రహ్మచర్యం కూడా పాటించాలని బ్రహ్మగారు మౌళిని చాటుకి పిలిచి చెప్పారు. తలైతే ఊపాడు కానీ, అందరికీ కనబడే భూశయనం, ఏకభుక్తం వరకే పాటించగలిగాడు. మధ్యలో ఓ రోజు రాత్రి వందన అతన్ని ఓదార్చడానికి దగ్గరకి తీసుకున్నప్పుడు పాలమీగడ, పాముకుబుసం మళ్ళీ తెరమీదకొచ్చాయి. ‘చౌ చౌ’ బ్రీడు, ‘చివావా’ బ్రీడూ కలిసి ఆ రాత్రి చిత్తకార్తెని తలపించాయి. అది చూసి (?) రామలక్ష్మి అస్సలు బాధపడలేదు. పైగా వాళ్లిద్దరూ కలిసున్నందుకు ఎంతో సంతోషించడంచేత, ఆమెకి ప్రేతత్వ విముక్తి కలిగి, హాయిగా యమదూతల ఎస్కార్ట్లో వెళ్ళిపోయింది.మునిసిపాలిటీ వాళ్ళు వలతో వస్తే, వయసులో ఉన్న కుక్కలన్నీ తలో రకంగా తప్పించుకోగా, ఎటూ కదల్లేక దొరికిపోయి, ఆ కుక్కలబండిలో బిక్కు బిక్కు మంటూ, కంటనీరు కారుస్తూ, చావుకెదురు చూస్తూ, ఒంటరిగా మిగిలిపోయిన వీధి కుక్కలా గొడవ జరిగిన రోజు రాత్రంతా గడిపిన రామలక్ష్మి దుఃఖం ఎవరికి పట్టాలి? బతికుండగా నరకం చూపించి, చచ్చాక ‘పున్నామనరకం’ తప్పించే ‘కొడుకు’ విరోధాభాసకు మరో ఉదాహరణ. -
యువ కథ: ఎంత ధైర్యం నీకు?
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది. -
సోమదత్తుడి వృత్తాంతం
యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా, సుభిక్షంగా పరిపాలించేవాడు. సోమదత్తుడు సత్య ధర్మాలను పాటించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. సాధు సజ్జనులను సముచితంగా గౌరవించేవాడు. సోమదత్తుడి వైభవం నానాటికీ ద్విగుణం కాసాగింది. అతడి వైభవం శత్రువులకు కంటగింపుగా మారింది. ఎవరికి వారే అతడిపైకి యుద్ధానికి వెళితే ఎదిరించడం సాధ్యం కాదని తలచి, శత్రువులందరూ సోమదత్తుడికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అందరూ కలసి అతడిపై యుద్ధం చేసి, అతడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తీర్మానించుకున్నారు.శత్రువులందరూ అదను చూసుకుని, సోమదత్తుడి రాజధాని మహిష్మతీపురాన్ని నలువైపుల నుంచి ముట్టడించారు. శత్రువుల దురాక్రమణ సంగతి తెలియగానే, సోమదత్తుడు సైన్యాన్ని ఆయత్తం చేసి, యుద్ధానికి బయలుదేరాడు. వేలాది అక్షోహిణుల చతురంగ బలాల మధ్య భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా గజ తురగాలు నేలకొరిగాయి. వేలాది రథాలు విరిగిపోయాయి. యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.రాజ్యం శత్రువశం కావడంతో సోమదత్తుడు తన భార్య దేవికతో కలసి అడవుల్లోకి చేరుకున్నాడు. అడవులలో ప్రయాణిస్తుండగా, వారికి గర్గ మహాముని ఆశ్రమం కనిపించింది.మహర్షిని ప్రార్థిస్తే, తమ కష్టాలు తీరవచ్చని భావించింది దేవిక.ఆమె ఆశ్రమం వద్దకు చేరుకుని, గర్గ మహాముని ముందు మోకరిల్లింది.‘మహర్షీ! శరణు శరణు! శత్రువుల చేతిలో ఓటమి చెంది నా పతి రాజ్యభ్రష్టుడయ్యాడు. భర్తతో కలసి నేను అడవుల పాలయ్యాను. నా పతిని మీరే రక్షించాలి’ అని ప్రార్థించింది.గర్గ మహాముని ఆశ్రమం వెలుపలకు వచ్చాడు.ఆశ్రమం వెలుపల దీనవదనంతో నిలుచున్న సోమదత్తుడు కనిపించాడు.గర్గుడు రాజ దంపతులను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు.‘రాజా! ఇది గార్గ్యాశ్రమం. ఇక్కడ భయమేమీ లేదు. నీకొచ్చిన కష్టం దుస్సహమైనది. విజయ సిద్ధి కలిగించే మంత్రాన్ని నువ్వు అనుష్ఠించలేదు. అందువల్లనే నీకు ఈ దుస్థితి వాటిల్లింది. ఎలాంటి కష్టాలు వాటిల్లినా, ధైర్యం రాజ లక్షణం. ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డడమే క్షాత్రధర్మం. అందువల్ల ధైర్యంగా ఉండు. పరిస్థితులు చక్కబడతాయి’ అని సోమదత్తుడికి నచ్చజెప్పాడు గర్గ మహాముని.‘మునీశ్వరా! నా కష్టాలు గట్టెక్కే మార్గం బోధించండి. ఈ గడ్డుకాలాన్ని దాటడానికి నేను ఆచరించవలసిన వ్రతమైనా, జపించదగ్గ మంత్రమైనా సెలవీయండి. అందుకు పాటించవలసిన నియమాలను ఆదేశించండి’ అని వినయంగా అభ్యర్థించాడు సోమదత్తుడు.‘రాజా! సమస్త బాధలను తొలగించి, అఖండ విజయాలను అందించే అమోఘమైన విద్య ఒకటి ఉంది. అది పంచముఖ ఆంజనేయ విద్య. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను’ అని పలికి, గర్గుడు ఇలా చెప్పాడు:‘వైశాఖమాస కృష్ణపక్ష దశమి రోజున గాని, ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున గాని, మాఘం మొదలుగా మొదటి ఐదు మాసాలలో వచ్చే మొదటి శనివార దినాలలో గాని, మృగశిరా నక్షత్రం వచ్చే రోజున గాని, శ్రావణ పౌర్ణమి రోజున గాని, కార్తీక శుక్ల ద్వాదశి రోజున గాని, మార్గశిర శుక్ల త్రయోదశి రోజున గాని హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు పవిత్ర తోరాన్ని పదమూడు ముడులతో ధరించి, వ్రతదీక్ష చేపట్టాలి. బంగారం, వెండి, రాగి వంటి లోహపు రేకుల మీద చెక్కిన హనుమద్ యంత్రం గాని, భూర్జపత్రం లేదా తాళపత్రం మీద గీసిన యంత్రం గాని, లేదా పిండిలో గీసిన యంత్రం గాని, పూర్ణకుంభం లేదా హనుమద్ప్రతిమను గాని పూజామండపంలో నెలకొల్పి ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రతపూజ పరిసమాప్తం అయిన తర్వాత పదమూడు నేతి అప్పాలను వాయనంగా ఇవ్వాలి. గురువుకు ధనధాన్యాదులను కానుకగా ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు అన్న సమారా«ధన చేయాలి. గొప్ప సంకల్పసిద్ధి కోరేవారు పదమూడేళ్ల పాటు ఈ హనుమద్వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాలి. దీనివల్ల హనుమదనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఘనవిజయాలు దక్కుతాయి.’గర్గుడు చెప్పిన హనుమద్వ్రత విధానాన్ని సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. గర్గుని ఆధ్వర్యంలోనే భార్యా సమేతుడై, హనుమద్వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. హనుమదనుగ్రహంతో ఖడ్గసిద్ధి పొందినవాడై, శత్రువులను దునుమాడి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత సోమదత్తుడు గర్గుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయనకు ఘనంగా ధన ధాన్యాలను, గోవులను సమర్పించి, సత్కరించాడు. సాంఖ్యాయన -
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్మెన్గా పిలిచే ప్రొఫెషనల్స్కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్కు చెందిన సుభాష్కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్తో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్లో పట్టుకుంది. హైదరాబాద్లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్లూ జరిగాయి. -
ఆటగాళ్ల ఊరు.. ఆత్మకూరు
తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక అమ్మాయిని మహిళల ఫుట్బాల్ జట్టుకు అందించిన ఊరు అది. క్రీడలను ఎంతగానో ప్రేమించే ఆ ప్రాంతం ఎందరినో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పరిచయం చేసి, క్రీడాకారుల కర్మాగారంగా గుర్తింపు సాధించింది. ఆటగాళ్ల ఊరుగా పేరుపొందిన ఆత్మకూరుపై ఈ కథనం..తిరుమలరావు కరుకోల, సాక్షి విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గంలోని ఆత్మకూరు క్రీడాకారుల కర్మాగారంగా పేరుపొందింది. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు, మూడున్నర ఎకరాల మైదానంలో ఏదో ఒక మూల కొందరు విద్యార్థులు క్రీడల్లో సాధన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఫుట్బాల్, హాకీ, క్రికెట్తో పాటు పలు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. ఇక్కడి స్థానికులు కూడా చాలామంది ఏదో ఒక సమయంలో మైదానానికి వస్తుంటారు. వృద్ధులు నడక కోసం వస్తుంటారు. ఉద్యోగార్థులు శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2015–16 నుంచి క్రీడల్లో సత్తా చాటుకుంటోంది. ఈ పాఠశాలలో ఒక గది నిండా క్రీడా పోటీల్లో విద్యార్థులు సాధించిన జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, క్రీడా సామగ్రి కనిపిస్తాయి. ఫుట్బాల్, హాకీ, క్రికెట్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఏటా ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతూ వస్తున్నారు. క్రీడల పోటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభ చూపుతుండటం విశేషం. ఇక్కడే చదువుతున్న విష్ణు ప్రణవి, అస్మిత, శ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి ఫుట్బాల్లో రాణిస్తున్నారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ సహకారంతో వీరు శిక్షణలో రాటు దేరారు. నిరంతర సాధనతో ఈ ఐదుగురూ అండర్–13 జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. 2015–16 నుంచి క్రీడా పరంపరఈ పాఠశాలలో క్రీడా పరంపర 2015–16 నుంచి మొదలైంది. ఆ ఏడాది పాఠశాల నుంచి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ముగ్గురు, క్రికెట్కు ఒకరు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్కు పదిమంది, క్రికెట్కు ఒకరు ఎంపికయ్యారు. దాంతో విద్యార్థుల్లో క్రీడోత్సాహం పెరిగి, ఖాళీ వేళల్లో మైదానం బాటపట్టారు. వారి ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ పాఠశాల నుంచి 2023–24లో ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ముగ్గురు, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ముగ్గురు, అథ్లెటిక్స్లో ముగ్గురు ఆడారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.మాస్టర్ అథ్లెట్స్లోనూ మేటిఆత్మకూరులో విద్యార్థులు, యువతే కాదు, నలభై ఏళ్ల వయసుకు పైబడినవారు సైతం మాస్టర్ అథ్లెట్స్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడి నుంచి యాభయ్యేళ్లు దాటిన నలుగురు జాతీయస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. వీరిలో ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోలో జగన్మోహన్ రెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. లాంగ్ జంప్లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు. అలాగే 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో మహమ్మద్ షఫీ మొదటి స్థానంలో నిలిచారు. వీరిద్దరూ క్రీడల కోటాలోనే కొలువులు సాధించారు. ఇక్కడి నుంచి క్రీడల కోటాలో కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కొలువులు సాధించిన వారు దాదాపు ముప్పయి మంది వరకు ఉండటం విశేషం.ఫొటోలు: ముల్లా ఖాసింవలీ, ఆత్మకూరు, అనంతపురంజాతీయ ఫుట్బాల్కు ఏకైక తెలుగమ్మాయిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మందల అనూష జాతీయ స్థాయి ఫుట్బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన తొలి అమ్మాయిగా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురూ ఆడపిల్లలే! అనూష అందరికంటే చిన్నమ్మాయి. ఆమె అక్కలు చందన, రాజేశ్వరి కూడా ఫుట్బాల్ ఆడేవారు. వారికి పెళ్లిళ్లు కావడంతో ఆటకు దూరమయ్యారు. అనూష 2017లో జరిగిన మిక్స్డ్ జెండర్ ఫుట్బాల్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులోని రూట్ క్లబ్ తరఫున 2022లోను, కెంప్ ఫుట్బాల్ క్లబ్ తరఫున 2024లోను బెంగళూరు, ముంబై, హైదరాబాద్లలో జరిగిన టోర్నీలలో పాల్గొంది. అనంతపురంలో 2024 నవంబర్లో జరిగిన జాతీయ ఫుట్బాల్ టోర్నీలో సత్తా చాటి, అండర్–20 భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు ఎంపికైంది. బెంగళూరులో 2024 డిసెంబర్లో జరిగిన భారత్–మాల్దీవుల ఫుట్బాల్ మ్యాచ్లో సత్తా చాటుకుంది. -
నరనారాయణులతో ప్రహ్లాదుడి యుద్ధం
హిరణ్యకశ్యపుడి వధ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జనరంజకంగా పరిపాలన చేయసాగాడు. ప్రహ్లాదుడి పాలనలో పాతాళలోకంలో శాంతి సామరస్యాలు వర్ధిల్లసాగాయి.ఒకనాడు భృగుమహర్షి కొడుకు అయిన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. ఆయన స్నానం చేస్తుండగా, ఒక భీకరసర్పం ఆయనను కాటువేసి, ఆయన కాలిని చుట్టుకుంది. విష్ణుభక్తుడైన చ్యవన మహర్షి మనసులో విష్ణువును ధ్యానం చేశాడు. పాముకాటు ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అయితే, ఆయన కాలిని చుట్టుకున్న పాము, ఆయనను పాతాళలోకానికి లాక్కుని పోయింది. చ్యవనుడిని పాతాళంలో విడిచి, పాము తన దారిన తాను పోయింది.పాతాళంలో కనిపించిన చ్యవనుడిని ప్రహ్లాదుడు చూశాడు.బహుశా, ఇంద్రుడు పంపితే వచ్చి ఉంటాడని అనుకున్నాడు.చ్యవనుడి వద్దకు వెళ్లి పలకరించాడు. ‘మహర్షీ! తమరెవరు? ఇలా దయచేశారేమిటి? దేవతలు ఎవరైనా పంపితే వచ్చారా? వారి నుంచి ఏదైనా వర్తమానం తీసుకొచ్చారా?’ అని అడిగాడు.‘ప్రహ్లాదా! అలాంటిదేమీ లేదు. నర్మదా నదిలో స్నానం చేస్తుండగా, ఒక సర్పం నన్ను తీసుకొచ్చి, ఇక్కడ పడేసి పోయింది. నేను భృగుపుత్రుడిని. నన్ను చ్యవనుడు అంటారు’ అని బదులిచ్చాడు.ప్రహ్లాదుడు చ్యవనుడికి అతిథి మర్యాదలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. చ్యవనుడు కాస్త సేదతీరాక, అతడితో ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టాడు.‘మహర్షీ! భూలోకంలో తమరు ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించుకుని ఉంటారు కదా! వాటిలో గొప్ప పుణ్యాన్ని కలిగించే తీర్థాల గురించి చెప్పండి’ అని వినయంగా అభ్యర్థించాడు.‘నాయనా, ప్రహ్లాదా! భూలోకంలోని భరతఖండంలో నైమిశారణ్యం ఉంది. అది తాపసులకు ఆలవాలం. అక్కడ నైమిశతీర్థం ఉంది. భూలోకంలో ఇది ఉత్తమమైనది. పాతాళంలో చక్రతీర్థం, ఆకాశంలో పుష్కరతీర్థం ఉత్తమమైనవి. వీటిలో స్నానం ఆచరించిన వారికి ఇహపరాలలో సుఖసౌఖ్యాలకు లోటు ఉండదు’ అని చెప్పాడు చ్యవనుడు.కొన్నాళ్లు ప్రహ్లాదుడికి అతిథిగా ఉన్న తర్వాత చ్యవనుడు తిరిగి భూలోకానికి వెళ్లిపోయాడు.చ్యవనుడి మాటలతో ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆయన చెప్పిన తీర్థాలను సందర్శించుకోవాలని అనుకున్నాడు.ఒకనాడు సుముహూర్తం చూసుకుని, పరివారంతో సహా ప్రహ్లాదుడు తీర్థయాత్రకు బయలుదేరాడు.మొదటగా నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సరస్వతీ నదిని దర్శించుకున్నాడు. నదీస్నానం చేసి, అక్కడ పితృతర్పణాలు విడిచాడు. అక్కడ ఉన్న పురోహితులకు విరివిగా అనేక దానాలు చేశాడు.తర్వాత నైమిశారణ్యంలో సంచరిస్తూ, నైమిశ తీర్థంలో స్నానం చేశాడు. స్నానానంతరం వేటకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు మహర్షులు కనిపించారు. వారికి నీడ కల్పిస్తున్న చెట్టు కొమ్మలకు విల్లంబులు వేలాడుతూ కనిపించాయి. ఆ మహర్షులిద్దరూ నరనారాయణులు. ఆ చెట్టుకు వేలాడుతున్న ధనుస్సుల్లో ఒకటి: శారఙ్గం, మరొకటి: అజగవం. వాటికి తోడుగా రెండు అక్షయ తూణీరాలు. శారఙ్గం నారాయణుడి ధనుస్సు, అజగవం నరుడి ధనుస్సు.తాపసుల వద్ద ఆయుధాలను చూసి, ప్రహ్లాదుడు ఆగ్రహం చెందాడు. ‘మీరు కపట సన్యాసుల్లా ఉన్నారు. నిజంగా తపస్సు చేసుకునేవారే అయితే, మీకు ఆయుధాలెందుకు? మీరు ఆయుధాలనే నమ్ముకుంటే యుద్ధం చేయాలి. తపస్సు చేయదలచుకుంటే, ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవాలి’ అని నిలదీశాడు.యుద్ధానికి కవ్విస్తున్న ప్రహ్లాదుడితో పోరుకు ముందుగా నరుడు సిద్ధమయ్యాడు. తన అజగవం తీసుకుని, అతడిపైకి శర పరంపర కురిపించాడు. ప్రహ్లాదుడు కూడా వెనక్కు తగ్గకుండా యుధ్ధం చేశాడు. వందేళ్లు పోరు సాగింది. ప్రహ్లాదుడి ధాటికి నరుడు ఇబ్బంది పడుతుండటం చూసి, నారాయణుడు తన శారఙ్గాన్ని అందుకుని, యుద్ధంలోకి దిగాడు. మరో వందేళ్లు పోరు జరిగింది. ఎవరికి ఎవరూ తీసిపోలేదు. ప్రహ్లాదుడికి శక్తి సన్నగిల్లసాగింది. ఓటమి అంచుల్లోకి చేరుకున్నాడు.అంతలోనే అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.ప్రహ్లాదుడు విష్ణువు ముందు మోకరిల్లాడు. ‘స్వామీ! ఏ యుద్ధంలోనైనా గెలుపు నాదే! మరి ఇప్పుడేమిటి ఇలా జరిగింది?’ అని దీనంగా ప్రశ్నించాడు.‘వీరు నర నారాయణులు. నా అంశతో పుట్టినవారు. కారణజన్ములు. వీరివంటి తాపసులతో ఎన్నడూ తగవు పెట్టుకోకు’ అని హితవు పలికాడు శ్రీమహావిష్ణువు.ప్రహ్లాదుడు వారి ముందు మోకరిల్లి, క్షమాపణలు చెప్పి, తిరిగి పాతాళానికి వెళ్లిపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: మసాన్ హోలీ
బ్లూసీ కేఫ్లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్ వైపు చూస్తూ సిగరెట్ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్పాత్ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి చేరుకున్నాడు సత్యానంద్. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్ నెల చలికూడా రైల్వేస్టేషన్స్ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడవనెంబర్ ప్లాట్ఫామ్ మీద...’లోయర్బెర్త్ మీద కూర్చొని విండోతెరిచి సెల్ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర. మిడిల్బెర్త్ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్బెర్త్ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్ఫోన్స్ వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.ప్లాట్ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్బెర్త్ యువకుడు. బ్యాక్ప్యాక్ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్ విప్పుకుంటూ ‘నాది మిడిల్బెర్త్ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్.‘మాది వరంగల్. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్ స్టేషన్స్ పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్ప్యాక్ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’ కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్ రావు వ్యాపారంలో సత్యానంద్ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి. బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్.కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.సత్యానంద్కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్ అర్హతతో సత్యానంద్కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్కి.జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్. ఇసుకలో బ్యాగ్పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’..(2025).(1995) లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు . ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ .యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్ హోలీ’ వేడుక జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్ హోలీ’. మసాన్స్ అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్వైపు చూశాడు. మసాన్స్ హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.‘మోహన్స్ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్ హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు. అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్ చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్వద్దే కూర్చొని మసాన్స్ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్ వద్ద మసాన్స్ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.(2030)ఊరుచివరి శ్మశానం:చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..వాన కురుస్తోంది. కరెంట్ పోయినా ఇన్వర్టర్ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్లైట్ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది. -
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్ను పొజిషన్లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు. ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ ..నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ అర్జున్ తన టీమ్తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్కి సైగ చేశాడు అర్జున్. వారు తమతో పాటుగా స్నిఫర్ డాగ్ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.తక్షణమే అర్జున్ అతని టీమ్ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్ను కలవరపరిచింది. వెంటనే హోటల్ లోపలకు పరుగు తీశాడు. అర్జున్ టీమ్ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్ వాళ్లు స్నిఫర్ డాగ్స్తో హోటల్ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్స్పెక్టర్ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్ను పొజిషన్లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47 రైఫిల్ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.అర్జున్ గాలిలోకి డైవ్ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్ రైఫిల్ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్. కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్.. నేను మీ గులాం.. నసీర్ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్..మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్ మినిస్టర్ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్ మినిస్టర్ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్ .. నాకు రెండుగంటలు టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్ చేశాడు. పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్ వెయిట్ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్ సేవర్ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.‘కమాన్ .. అర్జున్ కమాన్.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్ వంక చూశాడు. అర్జున్ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్ కళ్ళు అక్కడ ఆన్ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అర్జున్ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్. ‘అర్జున్ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్’ అన్నప్పుడు కనురెప్పలు కదిలించాడు అర్జున్. ఎన్ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు. -
రైస్ ఫూలింగ్
రైస్ పుల్లింగ్ యంత్రం దగ్గర పెట్టుకుంటే వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయంటూ రియల్టర్ వెంకట రమణ నుంచి రూ.24 లక్షలు కాజేసిన పబ్బతి వెంకటేశ్వర్లుపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి ముఠాలు అనేకం ఉన్నాయి. కాయిన్, చెంబు, బిందె, యంత్రం... ఇలా వివిధ వస్తువులు చూపించే ఈ చీటర్స్ అవి బియ్యాన్ని తమవైపు ఆకర్షిస్తాయని, వాటిని దగ్గర పెట్టుకుంటే దశ తిరిగిపోతుందంటూ నమ్మబలుకుతారు. వీరి వలలో పడుతున్న అమాయకులు భారీ మొత్తాలు కోల్పోతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా రాణిపేట ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్కు కేరాఫ్ అడ్రస్గా ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అనేక మంది రైస్ పుల్లింగ్ పాత్రలు ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సంచరిస్తుంటారు. రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం అని అర్థం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటిని దక్కించుకుంటే అమోఘమైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. వీళ్లు కస్టమర్లకు రైస్ పుల్లింగ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ పాత్రలను కొనేవారికి తాము విక్రయిస్తున్న వాటిని చూసే అవకాశం కూడా ఇవ్వరు. ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమను ప్రత్యక్షంగా చూపించమని పట్టుబడితేనే చూపిస్తారు. ఈ మోసగాళ్ళు ఎన్ని చెప్పినా, కొందరు కస్టమర్లు నమ్మరు. ఇలాంటి వాళ్లు ఆయా గ్యాంగ్స్తో తమ ముందు రైస్ పుల్లింగ్ చేసి చూపించమని కోరుతూ ఉంటారు. ఇలాంటి వారిని బుట్టలో వేసుకోవడానికి నేరగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఈ చీటర్స్ సాధారణ నాణెం/చెంబు/బిందె తదితరాలను ‘రైస్పుల్లర్’గా మార్చడానికి ‘వంట’ చేస్తుంటారు. బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్ళీ బియ్యంలా కనిపించేలా చేస్తారు. ఇలా బియ్యంలా కనిపించే ఎండిన అన్నంలో ఇనుప రజను కలిసి ఉంటుంది. మోసగాళ్ళు రైస్ పుల్లర్గా చెప్తున్న పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన బియ్యం వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చేసి కస్టమర్లకు చూపించే ఈ మోసగాళ్ళు వారిని బుట్టలో వేసుకుంటుంటారు. ఇలాంటి ముఠాలలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే ఉంటున్నారని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పలు కేసులు స్పష్టం చేస్తున్నాయి. తాము నష్టపోయిన మొత్తాన్ని అదే మార్గంలో మళ్లీ సంపాదించాలనో, అసలు ఈ రైస్పుల్లర్లు ఉన్నాయా? లేవా? తేల్చుకోవడం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఈ రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అక్కడ రైస్పుల్లర్స్ను పరీక్షించినట్టు నటిస్తూ, వాటికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రయాన్–3లో వినియోగించడానికి ఉపకరించే లోహమని, రూ.కోట్ల ఖరీదు ఉంటుందని సర్టిఫికెట్లలో ప్రచురిస్తుంటారు. ఇదంతా దాన్ని కొనేవాళ్ళ ఎదురుగానే∙జరుగుతుంది. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుంది. బాధితుల్లో వ్యాపారులు, విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉంటారు. పరువు కోసం ఆలోచించే వీళ్ళు రైస్పుల్లర్స్ కొనడానికి ప్రయత్నించి మోసపోయినా, ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణంగానే ఓ నేరగాడు లేదా ముఠా పది నేరాలు చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతుంటాయి. ఇదే నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. ఓ ముఠా పోలీసులకు చిక్కినప్పుడు అనేక నేరాలు అంగీకరిస్తుంటుంది. అధికారులే స్వయంగా ఆయా బాధితులను సంప్రదించి, ఫిర్యాదు చేయాలని కోరిన సందర్భాలూ ఉంటున్నాయి. అయితే బయటపడటానికి ఇష్టపడని బాధితులే అత్యధికులు ఉంటున్నారు. కేవలం రైస్ పుల్లింగ్ పేరుతోనే కాదు, మరో పది రకాల వస్తువులు, పద్ధతుల పేర్లు చెప్పి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. వీటి బారినపడి మోసపోయిన వాళ్లు వందలు, వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటికీ అనేక మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆశతో ఇలాంటి మోసగాళ్ల వల్లో పడి భారీగా నష్టపోతున్నారు. ఇండియన్ శాండ్ బో జాతికి చెందిన పాము తల, తోక ఒకేలా ఉంటాయి. దీన్ని రెండు తలల పాము అని, డబుల్ ఇంజన్ పేరుతో అది దగ్గర ఉంటే దశ తిరిగిపోతుందని విక్రయిస్తుంటారు. ప్రత్యేకంగా తయారైన ఓ అద్దం ఉంటుందని, దాని ముందు నుంచి ఎవరైనా వెళ్తే అవతలి వారికి వివస్త్రులుగా కనిపిస్తారని నమ్మిస్తారు. వీటితో పాటు వందేళ్లకు పైగా బతికిన త్రాచుపాము తలపై ఏర్పడే నాగమణి, రెండు వైపులా కళ్లు కలిగి ఉండే నెమలి ఈక, నల్లపసుపు, ఎర్ర కలబంద, నల్ల వావిలాకు, లిల్లీపుట్స్, ఇరీడియం తదితరాల పేర్లు చెప్పి మోసం చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రైస్ పుల్లింగ్ కథలే నడుస్తుంటాయి. -
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.శరవేగంగా జ్యోతిష వ్యాపారంఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్సైట్లు, యాప్ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.ఆసియా దేశాల్లో..భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి. మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.జపాన్లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్ను రూపొందించుకుంటారు. జపాన్లో గ్రెగేరియన్ కేలండర్ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.మయాన్మార్లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్లో ఇప్పటికీ పాటిస్తారు.పాశ్చాత్య దేశాల్లో.. ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్సైట్లు, యాప్లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.ఆఫ్రికా దేశాల్లో.. ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు. ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు. -
ఈ వారం కథ: మెలకువలో చీడకల
‘‘రీచ్ అయ్యావా?’’, టింగ్మని వాట్సప్లో భర్త. అబ్బో! కేరింగ్ మెసేజే అనుకుంటూ ‘‘హా, ఇప్పుడే ఆఫీస్ లోపలికొచ్చాను’’ అని ఆమె రిప్లై.‘‘ఒకసారి లొకేషన్ పంపు’’మెసేజ్ని ముసుగు తీస్తే బయటపడ్డ అనుమానం.‘‘యే! నమ్మట్లేదా నన్ను? అయినా దించిన ఓలా డ్రైవర్ నుండి డ్రాప్ లొకేషన్ కూడా పంపించుకున్నావ్ కదా! మళ్లీ ఏంటీ? దున్నపోతులా పడుకునే బదులు పొద్దున్నే లేచి నన్ను డ్రాప్ చెయ్యొచ్చుగా?’’ అని ఫాస్ట్గా టైప్ చేసింది కోపం బాధ కలిపి, కానీ పంపలేదు. బ్యాక్ స్పేస్ బటన్ మీద ఒత్తిడి పెంచడంతో టైప్ చేసిందంతా క్లియర్ అయింది, స్క్రీన్ మీద పడిన కన్నీటి బొట్లు తప్ప!లొకేషన్ పంపించింది.వచ్చిన మెసేజ్లోని ఆమె కోపాన్ని పసిగట్టి, ‘‘ఆఫీస్ అయిపోతే నిన్ను పికప్ చేసుకోవడానికి అడిగాన్లే’’ మెసేజ్కు అతడి సమాధానం.ఆమె నమ్మినట్టుగా ఓ థంబ్సప్ ఎమోజీ పంపింది ఏడుపు ముఖం దాచుకుంటూ. ‘‘మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి, కాసేపు మీటింగ్ రూమ్లో కూర్చోండి’’ అనగానే ఆమె మూడ్ మారింది. సిస్టం కీబోర్డులతో కుస్తీ పడుతున్న ఎంప్లాయీస్ని గమనిస్తూ కూర్చుంది.‘‘హలో మేడమ్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మై సెల్ఫ్ యామిని’’ అంటూ ఓ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చింది.‘‘హలో, ఐయామ్ మధుమతి’’‘‘తెలుసు మేడమ్‘‘‘‘అయ్యో, మేడమ్ వద్దు. కాల్ మీ మధు’’‘‘అంటే, ఇక్కడికి రాక ముందు కూడా మీరు నాకు మేడమే కదానీ’’మధుమతి వెలిగిపోయింది, కానీ ఏదో గుర్తొచ్చి ఆ బ్లష్ అంతా ఒక్కసారిగా ఫ్లష్ అయిపోయింది.‘‘కూల్ మేడమ్, మీరు లెక్చరర్గా చేసిన కాలేజ్లోనే నేను చదువుకున్నాను’’ చెప్పింది యామిని.‘‘అది అర్థమైంది. కానీ, ఈ విషయం ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా?’’ అడిగింది మధుమతి.‘‘లేదు, ఇంకా ఎవరికీ చెప్పలే’’ పూర్తి చేయకముందే,‘‘చెప్పొద్దు కూడా ప్లీజ్. సారీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఏ ఇయర్ పాస్డ్ఔట్?’’ అడిగింది మధుమతి.‘‘2021 మేడమ్’’ చెప్పింది యామిని.‘‘నీకోటి చెప్పాలి యామిని, బట్ ప్లీజ్ కీపిట్ సీక్రెట్’’ అని కాస్త ముందుకు వంగి, ‘‘నేను ఆ కాలేజ్లో మానేసి, గ్యాప్ తీసుకుని, ఈ కంపెనీలో జూనియర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కాలేజ్లో వర్క్ చేసినట్టు ఏమీ చెప్పలేదు ఈ కంపెనీ వాళ్లకి. నో ఎక్స్పీరియ¯Œ ్స. సో నో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్’’ అంది మధుమతి.‘‘అచ్ఛా ఓ..కే’’ దీర్ఘంగా చూస్తూ తలూపింది యామిని.‘‘మేడమ్, నాకో డౌట్. టెక్నికల్లీ మీరు చాలా సౌండ్. కాలేజ్లో స్టూడెంట్స్కి మీరంటే క్రేజ్ కూడా! మీకు ప్రమోషన్ కూడా వచ్చిందని విన్నాను. అలాంటిది మీరు రిజైన్ చేయడానికి రీజన్ మీ పెళ్లా?’, మధుమతి తాళి చూస్తూ అడిగింది యామిని.‘‘హ్మ్...నో’’,‘‘మరి?’’‘‘చెప్తాను, కానీ అది చెప్పే కంటే ముందు ఒకటి అడగాలి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి సిటీలో బానే సెటిల్ అవుతున్నవ్ కదా ఇప్పుడు మన కాలేజ్ గురించి నీకేం అనిపిస్తుంది?’’ అడిగింది మధుమతి.మొదట బ్లాంక్ ఫేస్ పెట్టింది. ‘‘చెప్పాలంటే, ఇప్పుడనే కాదు ఎప్పుడడిగినా సేమ్ ఫీలింగ్ అలాంటి బేకార్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యానా అని’’ అంది యామినీ.మధుమతి తన ఫోన్ తీసి ‘ఇది చదువు’ అని ఇచ్చింది,‘ఇది అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీట్స్. మారుతున్న కాలంతో పాటు ఇంజనీరింగ్లో కూడా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలాంటి అధునాతన కోర్సులు ఫీజ్ రీయింబర్స్మెంట్తో అందిస్తున్నాం! రాష్ట్ర రాజధానికో మరో నగరానికో వెళ్లాల్సిన పనిలేదు, కాలేజీ మన ఊరికి దగ్గర్లోనే! హాస్టల్ ఫెసిలిటీ, స్కాలర్షిప్ కూడా కలదు’యామిని మొత్తం చదివి, అర్థమయ్యీ కానట్టుగా ఫోన్ ఆమెకిచ్చేసింది.‘‘ఇంటర్ కాలేజీల్లోంచి స్టూడెంట్స్ లిస్ట్ తీసుకుని, పేరెంట్స్కి ఒక్కో లెక్చరర్ నుండి ఒక్కో నంబర్ ద్వారా ఈ మెసేజ్లు పంపేది మేమే! మన ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ ఇలాంటి పనులు మాతో చేయిస్తుంటాడు. ఇంజినీరింగ్ తర్వాత మీ 35 సంవత్సరాల కెరీర్ వాళ్లకు అనవసరం, వాళ్లకు నువ్వు ఓ 35 వేల రూపాయిల రీయింబర్స్మెంట్ ఐటమ్వి మాత్రమే! లెక్చరర్గా నాకే చాలాసార్లు అనిపించింది, అలాంటిది స్టూడెంట్స్గా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అంది మధుమతి.‘నో నో, ఎలాగో అయిపోయి సంవత్సరాలు దాటాయి కదా మేడమ్. ఇప్పుడేం చేస్తాం. సో మీరు జాబ్ మారింది పెళ్లై కాదు కాలేజ్ వల్లేనా? అలా అయితే వేరే కాలేజీలు ఉన్నాయిగా!’ అంది యామిని.‘‘కాని, ఎక్కడికి వెళ్ళినా నా కోసమే కాలేజ్కొచ్చే స్టూడెంట్స్ ఉన్నారని నువ్వే అన్నావ్ కదా, అలాంటి విషయాలు అల్లరిగా పైకి కనబడినా లోపలి చిల్లరతనం ఏదో రోజు బయటపడుతుంది. లాస్ట్ ఇయర్, క్లాస్ రూముల్లో మందు తాగే బదులు పైన టెర్రస్ మీద తాగి పడిపోండంటూ రెండు రూములు కట్టించాడు ప్రిన్సిపాల్! అడిగితే ఏం చెప్పాడో తెలుసా? ‘చెప్తే వినే వాడు స్టూడెంటే కాదు అని సినిమా డైలాగులు కొట్టి వెళ్లిపోయారమ్మా స్టూడెంట్సు. పైగా ఏసీ ఉందనీ నా క్యాబిన్లోకి వచ్చి మందు సిట్టింగ్లు వేస్తామంటే టెర్రస్ మీద రూమ్లు కట్టించాను. మరేం చేయమంటావ్? మర్యాద కాపాడుకోవాలిగా’ అన్నాడు’’‘కాని అది మర్యాద కాదు సార్’ అని అంటే,దానికి ఆయన, ‘ఆపమ్మా తల్లీ, లెక్చర్లు స్టూడెంట్స్కివ్వు కాని, నాలాంటి ప్రిన్సిపాల్కి కాదు. ఏమైనా ఉంటే ప్రిన్సిపాల్ మీదికో కాలేజ్ మీదికో వచ్చి ఎగురుతారు గాని, స్టూడెంట్స్ వేషాలేమైనా తక్కువా! స్నానాలు చేయకుండానే, గడ్డాలు గీసుకోకుండానే కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండానే కాలేజీకి వస్తారు, రావడంతోనే అమ్మాయిలని, లేడీ స్టాఫ్ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఓ ముప్పైఐదు నలభై వయసున్న లెక్చరర్లతో ఫ్రెండ్షిప్లు చేయడం, వెనకేసుకొస్తారు కాబట్టి వాళ్లను కూడా కలుపుకొని పార్టీలు షికార్లకి తీసుకెళ్లి అటెండె మేనేజ్ చేయడం. చొక్కా పైబటన్ పెట్టుకోరు, అడిగితే ఉడుకపోస్తుంది అని మిగతా బట¯Œ ్స కూడా విప్పేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఫస్టియర్ క్లాస్ రూముల్లో కండోమ్స్ దొరకడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, పోలీసులు వచ్చి మరీ డ్రగ్స్ దొరకబట్టే దాకా తెలీలేదు కాలేజ్ హాస్టల్లో ఎన్ని దరిద్రాలున్నాయో... ఛీ...ఛీ... ఏమైనా మారుద్దామంటే ఎన్నిసార్లని కన్నేసి ఉంచుతాం? ఎంతమంది మీదేసి ఉంచుతాం చెప్పు!కనీసం అమ్మాయిలైనా బుద్ధిగా శ్రద్ధగా ఉంటారా అంటే కనబడితే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. గర్ల్స్ హాస్టల్ కదా నేనెలా వెళ్లి చెక్ చేస్తాను అని వార్డెన్లను చూడమంటే రూమ్స్ నిండా బీరుసీసాలే! చదివే ఓపికుండదు గాని పొద్దున్నుండి రాత్రి వరకు హెడ్సెట్లు పెట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. వాడెవడినో ప్రేమించిందే గాక వాడు పెట్టమన్నాడని సిగ్గులేకుండా వెళ్లి వాళ్ల హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది...చ్చీచ్చీఛీఛీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగో జాయిన్ అయిన కొద్ది రోజులకే తెలుస్తోంది కదా వాళ్ల పిల్లలు ఎలా తయారవుతున్నారో, పేరెంట్స్ వచ్చి మళ్లీ నా మీదనే పడి చస్తారు చెడగొడ్తున్నారనీ... వాళ్లేదో పద్ధతిగా పెంచారా?’మధుమతి ప్రిన్సిపాల్ మాటలు చెప్తుంటే యామినికి తన కాలేజీ రోజులు ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. ఇలాంటి రోజుల నుండి బయటపడ్డా అనే ఫీలింగ్ ఎంత రిలాక్స్డ్గా ఉందో తనకి!‘ఇవే కాదు అసలు దరిద్రాలు కాలేజీలో జరిగే యాన్యువల్ డేలు, ఫ్రెషర్–ఫేర్వెల్ పార్టీల్లో ఉంటాయి. దానికి గెస్టులుగా సినిమా హీరోలు, హీరోయిన్లు. అసలు వాళ్లే ఎందుకు? సరే ఆ ఏజ్లో సినిమా వాళ్లంటే ఓ క్రేజ్, ఓ ఇన్స్పిరేషన్ అని అనుకున్నా, అప్పటి వరకు కాలేజీ మొహం కూడా చూడని వాళ్లు ఇలాంటి ప్రోగ్రాంలకి తప్పక వస్తారు. స్టూడెంట్స్ చేసే గోలను చూసి సినిమా వాళ్లు ఇదే బాగుందని, ‘నెక్స్ట్ టైం నుండి సినిమా ప్రమోషన్ కూడా కాలేజీలోనే చేస్తే బాగుంటదని’ ఎవడో తొత్తు సలహా ఇస్తాడు. అలాంటి ప్రమోషన్కి పక్క కాలేజీ వాళ్లు కూడా ఈ కాలేజీకే వస్తారు. తాగేసి ఫ్యా అంటూ గొడవలు మొదలై, పాన్ పరాగ్ ఉమ్మిన ప్రహరీ గోడలకు రక్తంతో మెరుగులు దిద్దుతారు. సర్లే ఇదంతా ఒక్క రోజేగా అనుకుంటే ఆ హీరోను చూసి ఇంకో హీరో, అది చూసి మరో హీరో.ఇన్ని ప్రోగ్రాంల మధ్య సిలబస్ టైముకి అవదు, పైగా లైబ్రరీలో బుక్స్ సరిగ్గా ఉండవు, ఉండాల్సినంత మంది లెక్చరర్లు ఉండరు. ఖర్చుతో పని కాబట్టి ప్రిన్సిపాల్ పట్టించుకోడు. పైగా ‘అరవై ఉన్న క్లాసులో చదివేది పదిమందేగా! కనీసం కాలేజీకి సినిమా ఫంక్షన్తోనైనా పేరు వస్తుంది’ అని ఊరుకుంటాడు. వచ్చిన సినిమా వాళ్ళు ప్రమోషన్ మాటలు మాట్లాడుతారా అంటే, ‘ఏమీ చదవకుండానే నేనీ పొజిషన్లో ఉన్నాను. చదువు దేనికీ పనికిరాదు. కాలేజీ ఉన్నది కేవలం మిమ్మల్ని రోబోలుగా మార్చి పనిప్పించడానికే! ముందు ప్రపంచాన్ని చదవండి’ అని అంటుంటే ఆ వయసుకి ఆ మాటలు ఎంత వరకు అర్థమవుతాయి?ప్రపంచాన్ని ఎంత చదివినా, చదవాల్సిన టైమ్లో పుస్తకాలు చదవకపోతే స్టూడెంట్స్ ఏ ఎగ్జామైనా ఎలా పాసవుతారు? కానీ ఆ స్పీచ్లకు చప్పట్లు, విజిల్స్తో కాలేజీ దద్దరిల్లేది’’ గ్లాసులో నీళ్ళు అందుకుంటూ అంది మధుమతి.యామిని ఏమీ అనలేక, ఆ కంప్లయినింగ్ టోన్ వినలేక సఫొకేట్ అవుతోంది. మేడం లెక్చరర్గా మానేసినా, కూడా క్లాస్ పీకడం మాత్రం మానట్లేదని అనుకుంటూ,‘‘సర్లేండి మేడమ్. మనం మాత్రం ఏం చేస్తాం. కాఫీ?’’ అడిగింది‘‘ఇదంతా తప్పు కదమ్మా. అందుకే’’ ఆపేసింది నీళ్లు తాగుతూ.‘ఏం చేశారనీ’ కుతుహలంతో అడిగింది యామిని.‘‘ల్యాబ్స్, లైబ్రరీ, టాయిలెట్స్, హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలతో సహా కలిపి యూజీసీకి కంప్లైంట్ రాశాను’’ చెప్పింది.‘‘యూజీసీకా! వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే, ఈ పాటికి చాలా కాలేజీలు’’ యామిని ఏదో చెప్పేలోపే మధుమతి ఫోన్ రింగ్ అయ్యింది.సైలెంట్లో పెట్టి కాల్ కట్ చేసింది.‘‘అయ్యో లిఫ్ట్ చేయండి’’ అంది యామిని ‘‘ఇట్స్ ఓకే. ఇతని గురించే చెప్పాలి. కాలేజీలో నాకు ప్రమోషన్ వచ్చాక, ఇతని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. బాగున్నాడు. నచ్చి పెళ్లి చేసుకున్నాను. అతను అదే టౌన్ కాబట్టి జాబ్ కంటిన్యూ చేశాను. అంతా బాగుండేది. కొత్తలో ఇబ్బందులున్నా కూడా లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉండేది’’ అని ఆమె మెల్లిగా తల దించుకుంది. దుఃఖం ఆగట్లేదు, గొంతు తడబడుతోంది. వణుకుతున్న చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. యామిని అయోమయంగా, ‘‘అయ్యో మేడమ్, ఏమైంది, ప్లీజ్ ఏడ్వకండి’’ అంది దగ్గరికి తీసుకుంటూ.‘‘అలాంటి టైంలో ఒక మగ లెక్చరర్తో నాకు అఫైర్ ఉన్నట్టు నా హస్బెండ్కి పదేపదే కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు, మెసేజ్లు పెట్టారు. కాలేజీలో ఏ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా తెలీకుండా ఫొటోలు తీసి పంపేవారు’’ ఏడ్చుకుంటూ చెప్పింది మధుమతి. యామిని ఇంకా దగ్గరికి తీస్కోగానే, ‘‘నేను ఏ అఫైర్ పెట్టుకోలేదమ్మా నిజంగా. అదే నా భర్త నమ్మాడో లేదో తెలీదు. నేను ఏ తప్పు చేయలేదని నమ్మినట్టే మాట్లాడతాడు కాని, మళ్లీ డౌట్ పడతాడు. జీతాలు పెంచమని అడిగినందుకు బౌన్సర్లతో కొట్టించారని ఓ లెక్చరర్ నాతో చెప్పుకుంటే, అతనికి నాకు అఫైర్ ఉందని కాలేజీలో స్ప్రెడ్ చేశారు. విషయం తెలుసుకున్న మా నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నానా మాటలంది. నా భర్త మాత్రం కనీసం ఓ మాటైనా అనలేదు కాని, నా ఫోన్ లాక్కున్నాడు. నంబర్ మార్చాడు. పాత నంబర్ బ్లాక్ చేసి, సిమ్ కాల్చేశాడు. ఇంట్లో వాళ్ల ఫోన్ నంబర్లు తప్ప ఇంకెవరి నంబర్లు నా ఫోన్లో ఉండకుండా చేశాడు. ఎవరికి కాల్ చేస్తున్నాను, ఎవరికి మెసేజ్లు పెడ్తున్నానో చూసేవాడు. ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వద్దన్నాడు. మెల్లగా జాబ్ మానేయమని ప్రెజర్ పెట్టాడు! సడన్గా జాబ్ మానేస్తే, ‘తప్పు చేసింది కాబట్టే మానేసింది’ అనుకుంటారని నేను చెప్పినా వినలేదు. సిటీకి తీసుకొచ్చాడు. ఎప్పుడన్నా కాలేజీ ప్రస్తావన తెస్తే చిరాకుపడుతూ అరిచేవాడు. అతనే సర్వస్వం అనుకున్నాక జాబ్ వదిలేయడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. మూడు నెలల తర్వాత, ఇంటి నుంచే వర్క్ చేసుకునే సౌకర్యం సాఫ్ట్వేర్లో ఉంది కాబట్టి గట్టిగా అడిగాను. ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలా వచ్చి ఈ కంపెనీలో!’’ మధ్య మధ్యలో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మధుమతి.‘‘రిలాక్స్ మేడమ్. అప్పుటి నుండి ఏదేదో చెప్తున్నారు అనుకున్నాను గాని, మీకు ఇంత జరిగిందని, ఇంత బాధ దాచుకున్నారని అనుకోలేదు. షేమ్ ఆన్ దోస్ పీపుల్. అలాంటి కాలేజీలో చేయకపోవడమే బెటర్ లెండి. టైమ్ తీసుకుని మంచి ప్లేస్కే వచ్చారు. డోంట్ వర్రీ, ఈ కంపెనీ, మా టీమ్ చాలా బెటర్. ట్రస్ట్ మీ’’ అంటూ మధుమతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అభయమిచ్చింది యామిని.ఈ గ్యాప్లో మధుమతి ఫోన్లో భర్త నుండి మిస్డ్ కాల్స్, మెసేజ్లు.‘‘సిగ్నల్స్ లేవనీ, ఫోన్ సైలెంట్లో ఉందని చెప్పకు. వాటర్ కూడా సరిగ్గా తాగలేదని నీ స్మార్ట్ వాచ్ చెప్తోంది. ఫోన్ మర్చిపోయి బాత్రూమ్కి కూడా వెళ్లవు అని నాకు తెలుసు. నా మెసేజ్లు, కాల్స్ అన్నీ చూస్తావు కాని, కావాలనే రిప్లై ఇవ్వవని కూడా తెలుసు. నీ కోపమంతా ఇంట్లో చూపించు మధు, ప్లీజ్ నేను ఆల్రెడీ నీ ఆఫీస్ దగ్గరున్నాను. కిందికి రా ప్లీజ్’’ వాట్సాప్లో భర్త.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి ల్యాప్టాప్, యాక్ససరీస్ ఇచ్చారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేస్తామని చెప్పారు. యామినికి ‘బై’ చెప్పి ఆఫీస్ బిల్డింగ్ కిందకి వచ్చింది మధుమతి.‘‘ఒక్కరోజు, అది కూడా రెండు మూడు గంటలు బయటికి వస్తే ఇన్ని కాల్స్ మెసేజెస్సా! ఛీ’’ అతన్ని తిడుతూనే బైక్ ఎక్కి కూర్చుందామె. వెనక నుండి ఓ రెండుసార్లు అతని హెల్మెట్ మీద కొట్టింది కూడా. అతను ఏం మాట్లాడకుండా బండి ముందుకు పోనిచ్చాడు. ‘ఎందుకంత స్పీడు, మెల్లిగా’ అంటూ ఇంకా తిడుతోంది.‘‘ఐయామ్ సారీ’’ అన్నాడతను.ఆమె కాసేపు మౌనంగా ఉంది. చౌరస్తా దాటి ఓ ఖాళీ రోడ్డు రాగానే, వెనక నుండే అతన్ని మెల్లగా కౌగిలించుకుంటూ వాలిపోయింది. అతను ఇంకాస్త స్లో అయ్యి, చిన్నగా బ్లష్ అవుతూనే సిగ్గుగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. ‘కొత్తగా ఉందిరా అంతా, కాని, బానే ఉండేలావుంది. నేను సెట్ అవగలను అనిపిస్తోంది. నువ్వు కూడా సెట్ అవ్వొచ్చుగా! మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ప్రేమగా పిలుస్తూ దగ్గరికి తీస్కోవటం, ప్రతి సాయంత్రం బయటకెళ్తూ కబుర్లు చెప్పుకోవటం, ఇంటి పనిలో నాకు హెల్ప్ చేస్తూ..’ ఆమె చెప్తూ పోతుంటే మళ్లీ మెయిన్ రోడ్ వచ్చిందని బండాపాడు సిగ్నల్ చూసి. హెల్మెట్ తీయడు, ఎక్స్ప్రెషన్ కనబడదు.అయినా అతనంత పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదులే, కోపం తప్ప మిగతా అన్ని ఫీలింగ్స్ దాచుకుంటాడనీ ఆమె కంప్లైంట్ కూడా!ముగింపు నిజానికి అతను అంతగా ఏం దాచుకున్నాడంటే, కాలేజ్ బాత్రూంలో లేడీ లెక్చరర్ల వీడియోలు కూడా తీశారనీ, అలా ఆమె వీడియో కూడా తీసి అతనికే పంపారనీ ఆమెకి చెప్పకుండా దాచాడు!అఫైర్ అలిగేషనే తట్టకోలేని ఆమె ఈ విషయం తెలిస్తే మానానికి పోయి సూసైడ్ చేసుకుని చస్తుందేమోననే భయంతో ఆమె దగ్గరి నుండి ఫోన్తో సహా లాక్కొని, సిమ్ కాల్చి, విషయం ఆమెకి చేరకుండా చేశాడు!ఇక మనుషుల్ని నమ్మడం మానేసిన అతను కాలేజీకే కాదు, ఎక్కడకి వెళ్ళినా అక్కడి బాత్రూంకి వెళ్తుందని, ఎక్కడికీ పంపించకుండా ఆమెని కాపాడే ప్రయత్నం బయటపడకుండా దాచాడు.ఇప్పుడూ అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి బాత్రూం మాత్రమే వాడుకోవచ్చని ఈ జాబ్కి రిఫర్ చేయించి మరీ ఇప్పించాడని ఆమె దగ్గర దాచాడు.ఉపసంహారం 1సడన్గా ఇంజనీరింగ్ బుక్సో, బస్సో కనబడినా, ‘మేడమ్’ అనే పిలుపు వినబడినా ఆమెలో ఓ అలజడి! ఆ రోజంతా డల్లైపోతుంది. రాత్రవగానే ఓ దిక్కు పడుకొని దిండు తడుపుకుంటుంది. నిద్ర పట్టక భర్త వైపు తిరిగే సరికి అతను మాత్రం గాఢనిద్రలో ఉంటాడు. ఆమె దిండు ఇంకా ఎక్కువ తడుస్తుంది.ఉపసంహారం 2ఎక్కడికి వెళ్లినా ఆమెకి బాత్రూం వస్తుందేమోనని, త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బైక్ నడుపుతుంటాడు. ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా, ఏం చూడాల్సి వస్తుందోనని భయంతో రోజు గడుపుతుంటాడు. ఇలా మెలకువలో పీడకలలా వెంటాడే అతనికి, రాత్రులు నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర పట్టదు. అతనికి నిద్రే ఓ ఉపశమనం మరి!సంహారంఏదో పోగొట్టుకున్నట్టు రోజు గడిపే ఇద్దరూ తెల్లారేసరికి మాత్రం ఒకరినొకరు హత్తుకొని నిద్రలోనే కలిసిపోయినట్టు కనబడతారు, ఒకే దుప్పటిలో. అలా ఓ రోజు లేచేసరికి మధుమతి ఇన్బాక్స్లో‘ఏఐ’ ద్వారా స్పై కెమెరాలను కనిపెట్టే మొబైల్ యాప్, ఇప్పటి వరకు తీసినవి లింక్ పెడితే వాటిని సైబర్ సెక్యురిటీతో బ్లాక్ చేయించగల యాప్ తయారు చేసే ప్రాజెక్ట్లోకి డెవలపర్గా తీసుకుంటున్నట్టు యామినికి మెయిల్ వచ్చింది. అదే ఇక నుండి ఆమెను రోజంతా యాక్టివ్గా ఉంచే మాత్ర, అతనికి రాత్రులు మాత్రలు అక్కర్లేకుండా పట్టే నిద్ర. -
సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే!
‘ఏంటమ్మా.. నేను ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు తెలుçసమ్మా.. నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది’.. అరిచేశా కాస్త గట్టిగానే!‘అలా ఏం కాదు నాన్నా! నాకు కొంచెం బెంగగా ఉంటుంది. అందుకే ఇలా’ అమ్మ సంజాయిషీ.ఏంటో అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. రేపో మాపో పదో తరగతి పూర్తవుతుంది. ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను. నేనూ పెద్దాడిని అయిపోయాను. అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది. నేను స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుంచి 20 నుంచి 30 అడుగులు వేస్తే సరిపోతుంది. పొద్దున్నే లేచి, కావాల్సిన బుక్స్ అన్నీ బ్యాగులో పెట్టుకుని, హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా. సరిగ్గా ఉదయం ఎనిమిదికల్లా స్కూలు బస్సు వచ్చేస్తుంది. ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యే లోపు అమ్మ నాకు కావాల్సిన క్యారేజీ కట్టే పనిలో ఉంటుంది. నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు, టిఫిన్లు. హడావిడిగా అన్నీ ఒక్క చేత్తో చేసేస్తుంది. నేనేమో రెడీ అయిపోయి బ్యాగు వేసుకోగానే, చేతికి లంచ్ క్యారేజీ ఇచ్చేస్తుంది. అక్కడితో అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది. స్కూలు బస్సు ఎక్కి, అది కదిలే వరకు అక్కడే ఉంటుంది. నాతో పాటు బస్సులో వచ్చే మిగతా ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కాని, మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావుడి చేసేస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అదో రకంగా చూస్తారు నా వంక, కొన్నిసార్లు నవ్వుతారు కూడా! ఇదంతా రోజూ అనుభవిస్తుంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది.ఇలా ఆలోచిస్తున్న నేను బస్సు హారన్ సౌండ్తో ఒక్కసారిగా గతం నుంచి తేరుకున్నాను. దూరం నుంచి బస్సు నా వైపు వస్తోంది. అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పెట్టిన బ్యాగు లాక్కుని ముందుకు పరుగెత్తింది. తెలియకుండానే ‘జాగ్రత్త..’ అని నా నోటి నుంచి వచ్చిన మాట పూర్తి కాకుండానే, ‘నాకు తెలుసు డాడీ’ అంటూ పరుగులు పెట్టింది. ఆ మాట వినగానే మళ్లీ ఎక్కడో తడిమినట్లు అనిపించింది. బస్సు ఆగింది. చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు. వాళ్లతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీటులో కూర్చుని, బయటికి చేయి చూపిస్తూ ‘టాటా డాడీ’ అని నవ్వుతూ చెబుతోంది. బస్సు అటు వెళ్లగానే, నేను నా కారు పార్క్ చేసిన వైపు వెళ్లాను. కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాను. దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు. ఏంటీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది. అమ్మ నన్ను చాలా ప్రేమించింది. అందరి కన్నా ఎక్కువే ప్రేమించింది. కాని, ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా? అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా? తండ్రయ్యాక తెలిసింది.. పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుంది అని. వాళ్లు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని. ఆరేళ్లుగా నా కూతుర్ని చూస్తున్నా– స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది. ఎంచక్కా రెడీ అయిపోతుంది. కానీ నాకెందుకు? తను జాగ్రత్తగా స్కూలు బస్సు ఎక్కేవరకు ఒక తెలియని బెరుకు. ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకం. ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది.ముభావంగానే లోపలికి వెళ్లిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది. అది అందుకుని ఏమీ మాట్లాడకుండానే, బెడ్ రూంలోకి వెళ్లిపోయా. నేను అలా వెళ్లడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి, వంటగదిలోకి వెళ్లిపోయింది. రూంలోకి వచ్చిన నేను, చేతిలో ఉన్న కాఫీని టేబుల్పై పెట్టేసి పైన చొక్కా తీసేసి, అలా బెడ్పై వాలిపోయా. వంటింట్లో నుంచి కమ్మటి వాసన, తాలింపు చప్పుళ్లు. నా భార్య మధ్యాహ్నానికి కావాల్సిన వంటలో నిమగ్నమైపోయింది. కాసేపు అలా కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చేయి పెట్టి నా జుట్టు నిమిరినట్టు అనిపించింది. చెప్పాలంటే చాలా హాయిగా, తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది. కాస్త తేరుకున్న నాకు ఒక మాట వినపడింది. ‘ఏంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో బాగానే ఉందా?’ కళ్లు తెరిచిన నాకు ఎదురుగా అప్పటివరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్న నా భార్య. తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను. ఎదురుగా కప్బోర్డులో పెట్టిన అమ్మ ఫొటోపై నా దృష్టి పడింది. ఆ ఫొటో వంకే చూస్తూ.., ‘మనం ఊరికి వెళ్లి ఒకసారి అమ్మని కలవాలి’ అన్నా. అది విని లలిత కూడా ఆ ఫొటో వైపు చూసి చిన్నగా నవ్వింది.ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతున్న నాకు.. హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. లలిత ఫోన్లో మాట్లాడుతోంది. ఇంకెవరితో, మా అమ్మతోనే! మేము పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని, తను చెప్పడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది. ఈ ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడం, మళ్లీ పాపని చూసుకోవడం వల్ల ఎప్పుడోగాని అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు. ఎప్పుడైనా అమ్మే నా సెల్ నంబర్కి కాల్ చేసినా ఆఫీసు పనుల్లో తలమునకలై ఉన్న నేను.. తర్వాత చేస్తాలే అమ్మా అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్లే ఎప్పుడూ మాట్లాడుకునేది. ఒకసారి మొదలెడితే వాళ్ల లోకంలోకి వాళ్లు వెళ్లిపోయి, పక్కన వాళ్లను పట్టించుకోనంతగా మునిగిపోతారు. అలా అనుకుంటూనే హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద నా కోసం పెట్టిన క్యారేజీ తీసుకుని, ఆఫీసుకు వెళ్లొస్తా అన్నట్లు లలిత వంక సైగ చేస్తూ వెళ్లిపోయా. గుమ్మం వరకూ వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత కూడా నావైపు చేయి ఊపింది.కారు వేగంగా వెళుతోంది. పాపతో కలిసి లలిత, నేను ఊరికి వెళ్తున్నాం. వాతావరణం చక్కగా ఉంది. ఊరికి దగ్గర్లో పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కమ్మటి మట్టి వాసన. నా కూతురు కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ‘ఇంకా ఎంత దూరం నాన్నా! నాన్నమ్మని ఎప్పుడు కలుస్తాం’ అని ఒకటే ప్రశ్నలు. ‘వచ్చేశాంలేమ్మా! దగ్గర్లోనే ఉన్నాం’ అంటూ లలిత బయటికి పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెబుతోంది. డ్రైవింగ్ చేస్తున్న నాకు కూడా లోలోపల అదే ఆరాటం ఉన్నా బయట పడలేనేమో కదా! అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంతో నాకు కూడా చిన్న పిల్లాడినై గెంతాలని ఉంది. ఇలా అనుకుంటుండగానే కారు పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది. దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. పుట్టి పెరిగిన ఊరు కదా మరి!కారు ఇంటి ముందు ఆగిందో లేదో, తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది. కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది. ఎదురుగా వస్తున్న మనవరాలిని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది. ‘నాన్నమ్మా!’ అని గట్టిగా హత్తుకోగానే, అమ్మ తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం. ’ఎలా ఉన్నావు నాన్నా’ అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే, లలిత వంక కూడా చూసింది. ’నువ్వు ఎలా ఉన్నావమ్మా’ అని అడుగుతూనే, తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. నా తలని తన ఒడిలోకి అదుముకుని ప్రేమగా నా వీపు తడుతూ, ‘ఎప్పుడు తిన్నారో ఏమో! పదండి వెళ్లి భోజనం చేద్దాం’ అంది. ‘సరే అమ్మా, తిందాంలే!’ అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. అమ్మతో చాలా చెప్పాలి అనిపించింది. అమ్మని చూడగానే గుండెలో భారం దిగినట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ చూపించే అపురూపమైన ప్రేమను ఇబ్బందిలా ఫీలయ్యే నా తెలియనితనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది. సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టి, కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదికి చేరింది. ఎన్నో చెప్పాలనుకున్నా, క్షమించమని అడగాలి అనుకున్నా కానీ ఏమీ చెప్పలేక మాటలు పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన ప్రాయశ్చిత్తంలా అనిపించింది. కాలిని తాకిన నా చేయి వంక చూస్తూ అమ్మ కళ్లల్లో చిన్నగా తడిని చూశా. అమ్మ వెనక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నాన్నమ్మ చెంపలపై ముద్దులు పెడుతోంది. -
రాజవర్ధనుడి కథ
పూర్వం దమనుడు అనే రాజుకు రాజవర్ధనుడు అనే కొడుకు ఉండేవాడు. తండ్రి తదనంతరం రాజవర్ధనుడు పట్టాభిషిక్తుడై, రాజ్యభారాన్ని చేపట్టాడు. ప్రజలకు చోరభయం, దుష్టమృగ భయం, శత్రుభయం, క్షామం, దారిద్య్రం లేకుండా రాజ్యాన్ని ధర్మమార్గంలో సుభిక్షంగా పాలించసాగాడు. పొరుగు రాజ్యాన్ని పాలించే విధూరథుడికి రాజవర్ధనుడి పాలనాదక్షత గురించి తెలిసింది. విధూరథుడికి మానిని అనే కుమార్తె ఉంది. రాజవర్ధనుడు తన కుమార్తెకు తగిన వరుడని తలచి, అతడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. మానిని ద్వారా రాజవర్ధనుడికి అనేకమంది కుమారులు కలిగారు. భార్యతో హాయిగా సంసారయాత్ర సాగిస్తూ, రాజవర్ధనుడు రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా పాలించసాగాడు. అలా ఏడువేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఒకనాడు రాజవర్ధనుడికి భార్య మానిని స్వయంగా తలంటు పోయసాగింది. తలంటు పోస్తుండగా, ఆమె కన్నీటి బిందువులు వెచ్చగా రాజవర్ధనుడి నుదుటిపై పడ్డాయి. ఈ పరిణామానికి రాజవర్ధనుడు ఆందోళన చెందాడు. ‘మహారాణీ! ఏమైంది? ఎందుకు దుఃఖిస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.‘మహారాజా! మీ తలవెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అందువల్లనే నాకు తీరని విచారంగా ఉంది’ అని ఆమె బదులిచ్చింది.‘మహారాణీ! ప్రకృతి సహజమైన పరిణామానికి విచారిస్తావెందుకు? ఏడువేల సంవత్సరాలు సుఖాలను అనుభవించాం. సద్గుణ సంపన్నులు, పాలనాదక్షులు అయిన సుపుత్రులను పొందాం. మానవులకు జరామరణాలు తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వార్ధక్యం మరింతగా మీద పడకముందే, రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, మనం తపోవనాలకు వెళ్లిపోదాం’ అని చెప్పాడు రాజవర్ధనుడు.రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, రాజవర్ధనుడు భార్యాసమేతంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నట్లు తెలిసి, మంత్రి పురోహితులు విచారించారు. ఈ సంగతి తెలిసి పౌరులు మరింతగా ఆందోళన చెందారు. ‘ఇన్నాళ్లూ మనల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన రాజు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతే, ఇక బతకడం దండగ’ అనుకుని, ప్రజలు బాధపడసాగారు. రాజుకు మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగించాలని భావించిన మంత్రులు, ఇందుకు సమర్థులైన పురోహితులను తపోవనాలకు పంపారు. ఇదంతా రాజుకు తెలియకుండానే చేశారు.పురోహితులు సూర్యభగవానుడి గురించి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి కోరిక మేరకు రాజవర్ధనుడికి మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని వరంగా ప్రసాదించాడు. వారు సంతోషంగా రాజధానికి చేరుకుని, మంత్రులకు సూర్యుడు వరమిచ్చిన సంగతి చెప్పి, ఇళ్లకు వెళ్లిపోయారు. సూర్యభగవానుడి వరప్రభావం వల్ల రాజు మరో పదివేల ఏళ్లు తమను పరిపాలించబోతున్నాడని తెలిసి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఒకవైపు రాజ్యంలో ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు రాజవర్ధనుడు అంతఃపురంలో విచారగ్రస్తుడై కూర్చుండిపోయాడు. అతడి తీరును గమనించిన మహారాణి మానిని, ‘మహారాజా! ప్రజలంతా సంతోషంగా ఉంటే, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు?’ అని అడిగింది. ‘మహారాణీ! మీరంతా ఉండగా, నాకొక్కడికే పదివేల ఏళ్ల ఆయుర్దాయం కలగడం మంచిది కాదు. మంత్రి పురోహితాదులు, ఆప్తులు అందరూ మరణించిన తర్వాత నేను బతికి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అన్నాడు రాజవర్ధనుడు.‘మహారాజా! మీరు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నాయి. దీనికి తరుణోపాయం ఏమిటి?’ అని అడిగింది మానిని. ‘రేపటి వేకువనే మనం తపోవనాలకు బయలుదేరుతున్నాం’ అన్నాడు రాజవర్ధనుడు.మర్నాటి వేకువనే రాజదంపతులు తపోవనాలకు చేరుకున్నారు. రాజవర్ధనుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాత్మా! నాకొక్కడికే పదివేల సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వడం న్యాయమేనా? నా భార్యా పుత్రులకు, మంత్రి పురోహితులకు, నా రాజ్య పౌరులకు కూడా అంతే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు’ అని వరం కోరుకున్నాడు రాజవర్ధనుడు.సూర్యభగవానుడు అతడి ప్రజానురాగానికి సంతోషించి, ‘తథాస్తు’ అని అనుగ్రహించాడు.రాజవర్ధనుడు భార్యాసమేతంగా తిరిగి రాజధానిలోకి అడుగుపెట్టాడు.పురజనులను సమావేశపరచి, సూర్యభగవానుడు అనుగ్రహించిన వరం గురించి చెప్పాడు. ప్రజలందరూ రాజవర్ధనుడికి జయజయధ్వానాలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు.∙సాంఖ్యాయన -
ఆటోనే ఆధారమైంది!
హైదరాబాద్లోని హిమాయత్నగర్లో కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ.40 కోట్ల సొత్తు, నగదు దోచుకుపోయారు. ఒక ఆటో ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. సంఘటన జరిగిన ఇరవై గంటల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకుని, సొత్తు రికవరీ చేశారు. రోహిత్ కేడియా తన ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సంస్థ కేడియా ఆయిల్స్ కంపెనీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవైమంది పని చేస్తున్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలోని తమ ఇంటి ప్రాంగణంలోనే పనివారి కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు.రోహిత్ ఇంట్లో బిహార్లోని బీరుల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పనిచేసి, ఏడాది కిందట మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. దుబాయ్లో డెస్టిన్షన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో సహాయంగా ఉండటానికి సుశీల్ను రోహిత్ 15 రోజుల కిందట పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి సుశీల్తో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. సుశీల్, బసంతి మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ కుటుంబం మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో దుబాయ్ వెళ్లారు. దీన్ని అదనుగా భావించిన సుశీల్ ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను పిలిపించాడు. ఫిబ్రవరి 10న వచ్చిన మోల్హు అదే రోజు అర్ధరాత్రి దాటాక సుశీల్తో కలిసి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాభరణాలు, 1.4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, రూ.19.63 లక్షల నగదు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి తస్కరించారు. ఈ సొత్తుతో పాటు బసంతిని తీసుకుని ఉడాయించారు. ఫిబ్రవరి 11న ఉదయం రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని మిగిలిన పనివాళ్లు గుర్తించి దుబాయ్లో ఉన్న యజమానికి చెప్పారు. ఈ కేసు ఛేదించడానికి నారాయణగూడ పోలీసులు, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నా, మానిటర్ లేదు. రోహిత్ కుటుంబ సభ్యులు తమ సెల్ఫోన్లలోనే ఈ దృశ్యాలు చూస్తుంటారు. సెల్ఫోన్లో రికార్డయిన అనుమానితుల వీడియోలు తమకు పంపాలని పోలీసులు రోహిత్ను కోరారు. వీటిని పంపిన రోహిత్, ఆ ముగ్గురిలో ఇద్దరిని సుశీల్, బసంతిగా గుర్తించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగితే, ఉదయం 9 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా నిందితులు చిక్కరని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోహిత్ ఇంటి సమీపంలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పోలీసులు పరిశీలించి, నిందితులు చోరీ చేసిన ఇంటి నుంచి తెలుగు అకాడమీ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఆటో ఎక్కినట్లు గుర్తించారు. అయితే ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో వాహనం వెళ్లిన దిశను ఆధారంగా చేసుకున్నారు. నిందితులతో ఉన్న ఆటో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ కమిషనరేట్, ట్రాఫిక్ కమిషనరేట్ మీదుగా ప్రయాణించినట్లు గుర్తించారు. సుశీల్ బిహార్కు, బసంతి పశ్చిమ బెంగాల్కు చెందిన వారని రోహిత్ ద్వారా తెలుసుకున్న పోలీసులు– నిందితులు ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటుకు వెళ్లి ఉంటారని అంచనా వేశారు. అంత సొత్తుతో విమానం ఎక్కే అవకాశం ఉండదని, నాంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి ఉంటారని భావించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఫ్లాట్ఫామ్స్పై ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్ను పరిశీలించి, ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారని, అది ఉదయం 6.45 గంటలకు బయలుదేరిందని గుర్తించారు. వెంటనే ఈస్ట్జోన్ డీసీపీ బి.బాలస్వామి రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల ఫొటోలు పంపారు. అధికారులు తెలంగాణ ఎక్స్ప్రెస్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులకు జనరల్ బోగీలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ ముగ్గురూ తారసపడ్డారు. వీరిని పట్టుకుని, రైల్వే పోలీసులు సొత్తు రికవరీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగపూర్ రైల్వేస్టేషన్కు చేరుకున్న హైదరాబాద్ పోలీసులకు వీరిని అప్పగించారు. మరోవైపు, రోహిత్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు సుశీల్తో పాటు మోల్హు వేలిముద్రలను సేకరించారు. వీటిని తమ డేటాబేస్లో సెర్చ్ చేయగా, 2023 జనవరి 31న దోమలగూడలో జరిగిన స్నేహలతాదేవి హత్యకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది. అప్పట్లో ఆమెకు కేర్ టేకర్గా పని చేసిన బిహారీ మహేష్కుమార్ ముఖియా, మోల్హు ముఖియాతో కలిసి ఆ వృద్ధురాలిని చంపి, రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. గత ఏడాది అక్టోబర్లో మహేష్ చిక్కినా, మోల్హు పరారీలోనే ఉన్నాడు. కేడియా ఇంట్లో దొరికిన వేలిముద్రల ఆధారంగా నాటి కేసులోనూ మోల్హు నిందితుడని గుర్తించారు. దీంతో ఇతడిని తొలుత నారాయణగూడ, ఆపై దోమలగూడ కేసుల్లో అరెస్టు చేశారు. నిందితులు చిక్కడం ఆలస్యం కావడంతో స్నేహలతాదేవిని చంపి ఎత్తుకుపోయిన సొత్తులో కనీసం ఒక్క రూపాయి కూడా రివకరీ కాలేదు. ∙శ్రీరంగం కామేష్ -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్తో బ్రెస్ట్ పంప్తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్టైమ్కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్టైమ్తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్డెల్ టెస్ట్లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్లకు ఎక్కువ రన్టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్గా విభజిస్తే థియేట్రికల్కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్కిట్ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
ఫ్యాషన్ మోజా? ఉందిగా శ్రీజా!
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.కొన్ని నెలల్లోనే బొటిక్తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్గా పనిచేసింది.⇒ జెట్ స్పీడ్తో పరుగెట్టే ఫ్యాషన్తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్గోపాల్ -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్వర్క్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్వెల్ట్తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్వర్క్ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
యాప్రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్ఫోన్– స్మార్ట్ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్గా నిలిచాయి. యాప్స్లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్లో లాస్ట్ వార్, వైట్ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్తోపాటు నాన్ –గేమ్స్లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్స్టైల్, టేబుల్టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్లో భారత్లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్లోడ్స్లో భారత్ వాటా 17.91 శాతం -
అల్లుడు యముడు!
అజిత్కుమార్ లండన్లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్లో ఉంటారు. అతడు లండన్లో ఉంటూనే, హైదరాబాద్లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మియాపూర్ గోకుల్ప్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్కుమార్తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్కుమార్కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు రమేష్కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్లో ఉండే పూర్ణచందర్ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది. శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్మన్ కొడుకు రమేష్ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్ను మళ్లీ హైదరాబాద్కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్పై అరెస్టు వారంట్ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ∙శ్రీరంగం కామేష్ -
పన్నుపోటుండదు దేనికీ లోటుండదు
ఆ దేశాలలో ప్రజలకు ఆదాయపు ‘పన్ను’పోటు ఉండదు.అయినా అభివృద్ధికి, సంక్షేమానికి లోటు ఉండదు.పన్నులు లేకున్నా, ఖజానా నిండుగానే ఉంటుంది.అన్ని వర్గాల పౌరులకు సామాజిక భద్రత ఉంటుంది.పన్యాల జగన్నాథదాసుమన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది. విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది. శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది.ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు. అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది.ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.ఉత్తర కొరియా రూటే సెపరేటు!పౌరులపై కొన్ని దేశాలు ఆదాయపు పన్ను విధించకపోయినా, ఇతరేతర పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తయితే, ఉత్తర కొరియా రూటే సెపరేటు! ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదాయపు పన్నునే కాదు, అన్ని రకాల పన్నులనూ 1974లోనే రద్దు చేసింది. నరకానికి నకలుగా పేరుమోసిన ఉత్తర కొరియాలో పౌరులకు ‘పన్ను’పోటు లేదు గాని, ప్రభుత్వం కోరుకున్నప్పుడు పౌరులు ఉచితంగా సేవలందించాల్సి ఉంటుంది. అణ్వాయుధాల తయారీలోను, క్షిపణి ప్రయోగాల్లోను తలమునకలుగా ఉంటూ తరచు వార్తలకెక్కే ఉత్తర కొరియాలో ప్రజాసంక్షేమం మృగ్యం.మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది.విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది.శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది. ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు.అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.\యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.‘పన్ను’పోటు లేని గల్ఫ్ దేశాలు⇒ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్⇒ ఖతర్⇒బహ్రెయిన్⇒సౌదీ అరేబియా⇒ కువైట్⇒ ఒమన్‘పన్ను’పోటు లేని చిన్న దేశాలుచమురు ఎగుమతుల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే గల్ఫ్ దేశాలు పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లోని మొదటి మూడు దేశాలైన వాటికన్ సిటీ, మొనాకో, నౌరు కూడా పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకుండానే మనుగడ సాగిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆదాయపు పన్ను ద్వారా ఖజానాకు రాబడి లేకపోయినా, ఈ దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో చూద్దాం.వాటికన్ సిటీ: పోప్ పాలనలో ఉండే వాటికన్ సిటీ క్రైస్తవులకు ప్రధాన కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ పౌరులెవరూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికన్ సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉండే రోమన్ కేథలిక్ క్రైస్తవుల ద్వారా వచ్చే స్వచ్ఛంద విరాళాలు, నగరంలో ప్రవేశానికి విదేశీయులకు విక్రయించే టికెట్లు, స్టాంపులు, నాణేలు, జ్ఞాపికల విక్రయాలు, పెట్టుబడులపై వడ్డీల ద్వారా భారీగా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. వాటికన్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా జరిపే ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది.మొనాకో: ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచే దేశం మొనాకో. ఇక్కడి పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకం, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల ద్వారా మొనాకోకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమ తమ దేశాల్లోని ‘పన్ను’పోటు తప్పించుకోవడానికి చాలామంది విదేశీయులు ఇక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటుంటారు.ఇక్కడి క్యాసినోలు భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వివిధ మార్గాల్లో గణనీయంగా ఆదాయం వస్తుండటంతో ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, మొనాకో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించగలుగుతోంది. మొనాకో ప్రభుత్వం తన పౌరులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు మాతృత్వ, పితృత్వ భృతి, పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పింఛన్ల చెల్లింపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.నౌరు: ఓషియానా ప్రాంతంలోని నౌరు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తుంది. నౌరు ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. చుట్టూ సముద్రం తప్ప మరే సహజ వనరులు లేకపోయినా, నౌరు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.చేపల వేటకు లైసెన్సులు, ఆశ్రయం కోరి వచ్చే శరణార్థుల నుంచి వీసా రుసుములు, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, విదేశాలలో నిర్వహించే బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా నౌరుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఏటా ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. నౌరు ప్రభుత్వం వార్ధక్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, జనన మరణాల భృతి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించని పలు చిన్నా చితకా దేశాలు ప్రధానంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పౌరసత్వం కోరుకునే విదేశీయుల నుంచి పెట్టుబడుల సేకరణ, రియల్ ఎస్టేట్, మత్స్యసంపద తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా సంపద సృష్టించుకుంటూ, ఇవి తమ పౌరులపై పన్నుభారం మోపకుండా మనుగడ సాగిస్తున్నాయి. -
స్టార్స్ లక్కీ చార్మ్
ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారిన ఆమె విశేషాలు..నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్లో ‘ఐ మేడ్ ఇట్’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్లో ఫ్యాషన్ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్ స్టార్ చేసింది. తొలి అవకాశమే అమితాభ్ బచ్చన్ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ సినిమాకు లీపాక్షి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. బ్లాక్ అండ్ వైట్తో పాటు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మ్యాజిక్ చేసి, అమితాభ్ను సూపర్ చార్మింగ్గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారింది.ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్ గేమ్ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్ ఫార్ములాను వివరించింది లీపాక్షి.అందుకే, లీపాక్షితో స్టయిలింగ్ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడతారు. అమితాభ్తోపాటు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్కు లీపాక్షీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. -
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
నేషనల్ క్రష్మికా
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు అందుకుంది.⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది. ⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న. -
యువ కథ: మలిసంధ్య
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్ఫోన్ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
నిర్మలాను ఎవరు చంపారు?
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్లోని కాంచన్పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్పూర్లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. -
నాన్సీ త్యాగీ
లైఫ్స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్లోని తన అనుభవాలను, లైఫ్స్టయిల్ థింగ్స్ని, ఫ్యాషన్ టిప్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్సెట్టర్ స్టయిలిస్ట్గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్గా చేరి, ఫ్యాషన్పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్ను గమనించింది. డిజైనింగ్పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్ను తీర్చిదిద్దే చాన్స్నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్కి కొంతకాలం స్టయిలిస్ట్గా పనిచేసింది. -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. -
ప్రక్షాళన
‘ఆర్య బావ ఫోన్ చేశాడు నాన్నా, ఈవేళ మధ్యాహ్నం రెండుగంటల బస్సుకి వస్తున్నాడట!’బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది. మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపూ, జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది.పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారంలాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త! పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషప్పురుగు కుట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్య దారిలోనే ప్రాణాలు పోయాయని! నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది. అమ్మ శోకాలు మొదలెట్టింది. విషయం తెలిసి పరామర్శకి వచ్చిన చుట్టపక్కాలంతా ‘పుడుతూనే తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు’ అంటూ నా మేనల్లుడిని దూషిస్తుంటే వినలేకపోయాను. పసివాడిని హత్తుకుంటూ ‘ఆపండి! పసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తోంది’ అంటూ వాళ్ళందరి నోర్లూ మూయించింది నా భార్య సుజాత. ఆ తర్వాత నాతో ‘మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి’ అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకి కదిలేను. టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము.భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క. తనతో పాటే అమ్మ కూడా! అది చూసి, వయసులో చిన్నదైనా తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని, బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత. దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని, బాబుని తీసుకొని తిరిగొచ్చేశాము.బావ చనిపోయిన ఆరుమాసాలకి ‘రామం, ఒక్కమారు ఊరికి వెళ్లి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా! ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనల్లుడి పేరున రిజిస్టర్ చేయించుకునిరా’ అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా!‘అమ్మా! బావ వాళ్లకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు, పంపకాల గురించి మాట్లాడ్డానికి!’ అన్న నా మాటలకి, వెంటనే ‘అదేం మాటరా? ఇల్లూ, రెండెకరాల పొలమూ లేవూ! మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆ ఆస్తి మొత్తానికీ హక్కుదారు వీడేగా! మనం వెళ్లి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది’ అంది అక్క.‘అది చెప్పేదీ నిజమేరా, దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయమాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు’ ఆర్డర్ వేసింది అమ్మ. మరుసటి రోజే బావ వాళ్లూరికి ప్రయాణమయ్యాను.వాళ్ళింట్లో నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కూర్చున్న మూడుగంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులని అంచనా వేస్తూనే వుంది. పెచ్చులూడుతున్న గోడలూ, పై పెంకుల మధ్యనుండి తొంగి చూస్తున్న మబ్బుతునకలూ, వాటిగుండా కిందకి జారుతున్న వానచినుకులూ, ఇంకా ఆ అక్కాచెల్లెళ్ళ చిరుగుల బట్టలూ.. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కళ్ళెదుట నిలిచినట్టనిపించింది. ఉన్న ఆ రెండు ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకీ, ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికే అరకొరగా సరిపోతోందేమో!భోజనాల అనంతరం ఆ పెద్దావిడ ‘కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతురిని పుట్టింటికి పంపించేస్తే, రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు’ అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు. పాతికేళ్లు నిండిన చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నేను బతికుండగా దీని పెళ్లి చూస్తానో, లేనో’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ మాటలకి ‘అధైర్యపడకండి. మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి’ అంటూ ఓదార్చాను. బావ బాధ్యతలను పంచుకోని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను. ఒట్టి చేతులతో నేనలా వెనక్కొచ్చేయడం అమ్మకి, అక్కకి బొత్తిగా నచ్చలేదు. సుజాత మాత్రం ‘మంచి పని చేశారు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని బాధపెట్టడం మనకి శ్రేయస్కరం కాదు’ అంది.రెండేళ్ళ తర్వాత మాకూ బాబు పుట్టాడు. అంతదాకా ‘బాబూ’ అని పిలుస్తున్న నా మేనల్లుడికి ‘ఆర్య’ అనీ, నా కొడుక్కి ‘అంకిత్ ’ అనీ నామకరణం చేసి, ఇద్దరినీ రెండు కళ్ళలా చూసుకోసాగాం. వాళ్ళిద్దరూ బావామరుదులే అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండడంతో కుట్టుపనులు చేస్తూ, చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత. ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున, అక్కయ్య ‘లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజినీరింగు చేస్తే లక్షల్లో సంపాదన వుంటుంది. జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు’ అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది. ‘పిల్లలకి ఆసక్తిలేని చదువులని వాళ్ళపై రుద్దడం మంచిది కాదు అక్కయ్యా! వాడికిష్టమైన కామర్సు చదివి, ఆపైన బ్యాంకు పరీక్షలు రాసి, పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడులెద్దూ’ అంటూ నచ్చజెప్పి వాడిని కామర్సు గ్రూపులో చేర్పించాను.ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది. నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూర్లోని బడికి బదిలీ అయింది. పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి, నేనొక్కడినే వెళ్లాను. ఆర్యని డిగ్రీ కాలేజీతోపాటు బ్యాంకు పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను. అలాగే అంకిత్ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్సు గ్రూపులో చేర్పించి, ఎంసెట్ కోచింగులో పెట్టాను. ఏడాదిన్నర కాలం ఏ సమస్యలూ లేకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్! దానికి మించిన దుర్వార్తని మరో ఆరునెలల్లో వినాల్సి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.ఆ దుర్దినాన.. అల్మారా అంతా కిందా మీదా చేస్తున్న నన్ను చూసి ‘దేనికోసమండీ, అంతలా వెతుకుతున్నారు?’ అడిగింది సుజాత.‘అంకిత్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. అవసరాలకెప్పుడూ ఆదుకునే షావుకారు, ఈమారు పెద్దమొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు. వాటి కోసం వెతుకుతున్నాను’ అన్నాను.‘ఆ మధ్యెప్పుడో అత్తయ్యగారు, వదినగారు ఆ పత్రాలని తీసుకున్నారండీ. మళ్లీ ఇక్కడ పెట్టారో, లేదో! ఉండండి, వదినగారిని అడుగుతాను’ అని సుజాత అంటుండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ‘ఏమిటిరా, ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరానా పడుతున్నారు?’ అడిగింది.‘ఇంటిపత్రాల కోసం అక్కయ్యా ..’ అని చెబుతుండగానే ‘అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని, వాటితో నీకేం పనిరా ఇప్పుడు?’ అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది.‘హమ్మయ్య, ఇంటి దస్తావేజులు ఎక్కడికీ పోలేదన్నమాట. అవి కనబడకపోయేసరికి కంగారేసింది అక్కా. నీ మేనల్లుడి ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టక తప్పడం లేదక్కా’ అన్నాను.నా మాటలకి అక్కయ్య కళ్ళలో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపైన కొద్దిసేపు అక్కయ్య ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత మెల్లగా ‘అది కాదురా తమ్ముడూ, అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది. తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరమొస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా’ అన్న అక్కయ్య మాటలకి నేను, సుజాత దిగ్భ్రాంతి చెందాము.‘అమ్మ అలా చేసిందా? ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా..’ నా మాట పూర్తి కాకుండానే ‘ఏమోరా, అవన్నీ నాకు తెలియదు’ అనేసి అక్కయ్య వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేనూ, సుజాతా చేష్టలుడిగిపోయాము. ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి! నా మేనల్లుడిని నా కొడుకుతో సమానంగానే కదా చూశాను. వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా? నేను గానీ, సుజాతగానీ ఎన్నడైనా అక్కని, ఆర్యని పరాయివాళ్ళుగా చూశామా? నా జీతమంతా ఈ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసమే కదా వెచ్చించాను. అమ్మకివన్నీ తెలియవా? పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా.. అక్కయినా అమ్మని వారించి ఉండాల్సింది కదా! సర్లే , జరిగిందేదో జరిగిందనుకుని సర్దిచెప్పుకుందామనుకున్నా, కనీసం ఇప్పుడైనా ఇంటిపత్రాలని తెచ్చిచ్చి ‘ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా, వెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకురా’ అనాలి కదా అక్కయ్య! మరిదేమిటి, అలా వెళ్ళిపోయింది? మనసంతా భారమవగా నిస్సత్తువగా మంచంపై కూర్చుండిపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే, మెట్టినింట్లో ‘అందరూ నా వాళ్లే’ అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో! ఆ ఆలోచనతో గభాల్న తలెత్తగా.. కళ్ళనీళ్ళతో కనిపించిన సుజాతని చూసి చలించిపోయాను. లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోపెట్టాను. ‘బెంగపెట్టుకోవద్దు సుజా.. నా పీఎఫ్లో కొంత డబ్బుంది. అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వేం దిగులు పెట్టుకోకు’ అంటూ భరోసా ఇచ్చాను.నా మాటలు వింటూనే సుజాత భోరున ఏడ్చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా చలించకుండా, దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరకి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. దుఃఖభారం ఉపశమించే దాకా తనని అలాగే ఏడవనిచ్చాను. కొంతసేపటికి తేరుకున్న సుజాత ‘నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండీ! అదేమంత పెద్దవిషయమని? నా నగలను కుదువపెట్టినా, లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది. కాని, ఇన్నేళ్లుగా మనతోనే మసలుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తోంది. మన అనుకున్నవాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండీ! మనది కాని ఈ ఇంట్లో ఉండేందుకు నాకెంత మాత్రం మనస్కరించడం లేదు. మీతో పాటు వచ్చేస్తానండీ’ అంది దీనంగా.‘అలాగే సుజా, ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తిచేసి వాడ్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. కాకపోతే నాదొక విన్నపం.. ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కల్మషమైన వారి మనసుల్ని పాడు చేయొద్దు. దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం, ప్లీజ్’ అన్నాను తన రెండుచేతులూ పట్టుకుని. సరే అన్నట్టుగా తలూపింది సుజాత. ఆ తర్వాత అక్కకీ, నాకూ మధ్య మాటలూ, రాకపోకలూ ఆగిపోయాయి. పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆర్యని చూసేందుకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది.‘మావయ్యా..’ అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పర్శకి ఆలోచనల నుండి బైటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ‘ఇన్నాళ్ళకి ఈ మావయ్యని చూడాలనిపించిందటరా’ అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా.‘అదేం మాట మావయ్యా? ఎన్నోసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది, కాని ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది. అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకి నేను సెలెక్టయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్యా. మరో నెలలో ట్రైనింగ్కి వెళ్ళాలి’ అంటూ నా నోట్లో మైసూరుపాకు కుక్కాడు ఆర్య.అదే ఊపులో వంటింట్లోకి వెళ్లి ‘అత్తయ్యా’ అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు. వాడి పట్ల సుజాతదీ మాతృవాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరికి తీసుకుంది.‘ట్రైనింగ్ పూర్తయాక పోస్టింగు విజయవాడలోనే ఇస్తారనుకుంటా. అప్పటికి మావయ్యక్కూడా విజయవాడకి బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒక్కచోటే ఉండొచ్చు కదత్తయ్యా’కల్లాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది.ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదరువులే ఉండడం చూసి ‘అత్తా, ఈ రుచి ఇంకెక్కడా దొరకదు’ అంటూ ఆవురావురని ఆరగించాడు. ఆ తర్వాత అంకిత్తో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ ‘మావయ్యా , ఇది మీకివ్వమని ఇచ్చింది అమ్మ’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవరుని నా చేతిలో పెట్టాడు. నేనూ, సుజాతా ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము. తెరిచి చూస్తే అందులో సీల్ చేసిన పెద్ద ఎన్వలప్, ఒక ఉత్తరం కనిపించాయి. ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలెట్టాను..‘తమ్ముడూ! ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటాని ఆశ్చర్యపోతున్నావు కదూ! నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ. తండ్రిలేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థంలేని శంకతో, అంతకు మించిన ధనాశతో అమ్మని ప్రేరేపించి, చేయకూడని తప్పే చేశాను. బావ చనిపోయిన నాటినుండి నన్నూ, నీ మేనల్లుడినీ ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకూ, సుజాతకూ ఆజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను. ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించేస్తోంది.’‘క్యాన్సర్’ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను. అది చూసి సుజాత గభాల్న నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది..‘నమ్మకద్రోహం చేసిన నన్ను, తోబుట్టువే కదాని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా, పైనున్న ఆ భగవంతుడు శిక్షించక మానడుగా! బ్లడ్ క్యాన్సర్తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. అందుకు బాధ లేదు. కాని, నీ మేనల్లుడిని ఒంటరిని చేసి వెళ్తున్నానే దిగులు మాత్రం తొలిచేస్తోంది. ఇన్నాళ్ళూ తండ్రిలేని లోటు తెలీకుండా పెంచిన నువ్వూ , సుజాతా ఇకపై వాడికి తల్లి లేని లోటూ తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట! ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి. ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞురాలిని. చిన్న కోరిక తమ్ముడూ! నా చివరి రోజులని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా! నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయల్దేరుతున్నాను. కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్తున్నాను. మిమ్మల్ని చూడాలని, మీ నీడన చేరాలని మనసు ఆరాటపడుతోంది. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ! ఇట్లు మీ అక్కయ్య!’ ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటున వేణుగోపాలస్వామి ఆలయం వైపు వెళ్ళాను, నాతోపాటే సుజాత కూడా! అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను. చిక్కిశల్యమైంది. మాకు కన్నీళ్లాగలేదు. మమ్మల్ని చూసి భోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం. ‘మహాపరాధం చేశాను. ఫలితంగా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతున్నాను’ అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సుజాత.‘మీకేం కాదు. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. అన్ని జబ్బులనూ నయం చేయలేకపోయినా, తీవ్రతను తగ్గించి, ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కనిపెడుతూనే వున్నారు. ధైర్యంగా వుండండి. పదండి ఇంటికి వెళ్దాం’ అంది సుజాత.‘అవును అక్కయ్యా! నీకేం కాదు’ అని నేనంటూండగానే అక్కయ్య సెల్ మోగింది. ఫోన్ తీసిన అక్కయ్య.. నిలబడే ఓపిక లేక అక్కడే మెట్లపై కూర్చుంది. ఫోన్ తెరపై‘డాక్టర్ సునీల్’ అన్న పేరు కనబడగానే ఆత్రంగా ఆ ఫోన్ అందుకుని ‘డాక్టర్ గారూ! మా అక్కయ్య ఆరోగ్యం ఎలా వుందో వివరంగా చెప్పండి ప్లీజ్, నాకు చాలా కంగారుగా వుంది’ అన్నాను.‘మీ అక్కయ్య టెస్టు రిపోర్టులని నిన్ననే మరో స్పెషలిస్ట్కి చూపించాం. ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదనీ, కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని కచ్చితంగా చెబుతున్నారు. అయినా చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి, మరోమారు బోన్ మ్యారో టెస్ట్ చేయిస్తే మంచిది’ చెప్పాడు డాక్టర్. ఆ మాట వింటూనే ‘మా చెవుల్లో్ల పాలు పోశారు డాక్టర్ గారూ! రేపే ముంబైకి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తాను. థాంక్యూ’ అని ఫోన్ పెట్టేసి, ‘చూశావా అక్కయ్యా! నీకే జబ్బూ లేదు. అనవసరంగా భయపడిపోయి మమ్మల్నీ భయపెట్టావు’ అన్నాను హాయిగా నవ్వేస్తూ.‘పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బహుశా, ఇదంతా నా మనసుని ప్రక్షాళనచేసి, నన్ను మీ వద్దకి చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో!’ అంటూ రెండు చేతులూ ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య. ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది. ‘శుభం! సాక్షాత్తూ ఆ వేణుగోపాలస్వామే అభయమిచ్చాడు, ఇంకేం భయం లేదు’ అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళనా మటుమాయమవగా ఆనందంగా ఇంటికి బయల్దేరాం! -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
పెద్దయ్య
మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు. ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి. రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు. అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట. వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు. పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు. మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు. టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య. -
మదరాసు మెరుపుతీగ
నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి ఫ్లస్ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్ సమంతగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్ను కాపాడుకుంటూనే, తన ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే.. ⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.⇒చదువు అయ్యాక, మోడల్గా మారి, కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘మిస్ మద్రాస్’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్ ఆఫ్ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్గా నిలిచింది.⇒దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్ విత్ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.⇒ తొలిసారి ‘నాయిం శేఖర్’ చిత్రంతో హీరోయిన్గా మారింది. తర్వాత ‘టైమ్ ఎన్న బాస్!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.⇒ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, ‘ఇన్నమ్ ఒరు మురాయ్’, ‘కనవు’ అనే తన పోయెటిక్ వ్యూ వీడియోస్లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్’ ఆహోలో స్ట్రీమ్ అవుతోంది.ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి. -
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
రావణుడి పరాజయం
కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. పదితలలు గల రావణుడు దశకంఠుడని ప్రసిద్ధి పొందాడు. అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తవీర్యార్జునుణ్ణి జయించాలని తలచి, సైన్యాన్ని వెంటబెట్టుకుని, కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతీపురానికి బయలుదేరాడు.మహిష్మతీ నగరానికి చేరువలో, నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడిది చేసింది. ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీస్నానం చేసి, శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు. నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి, స్తోత్రాలు పాడుతూ, నర్తిస్తూ శివార్చన చేయసాగాడు. ఇంతలో నర్మదా నది ఉప్పొంగి, నదీజలాలు ఎదుటికి ప్రవహించసాగాయి. నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. ఈ పరిణామానికి రావణుడు చకితుడయ్యాడు.‘వానా వరదా లేకున్నా, నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తోంది? నదిలో ఏం జరుగుతోంది? చూసి, తెలుసుకుని రండి’ అంటూ రావణుడు తన భటులను పంపాడు.నదిలో కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుటికి ప్రవహిస్తోంది. రావణుడి అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి, రావణుడికి చెప్పారు.రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని, నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ కాపలాగా కార్తవీర్యార్జునుడి మంత్రులు కనిపించారు. ‘రణరంగ శూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి’ అని వాళ్లతో అన్నాడు.‘యుద్ధానికి మంచి సమయాన్నే ఎంచుకున్నావే! రాజు జలక్రీడలాడుతుండగా, ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా? నీ చేతులకు అంత తీటగా ఉంటే, రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రస్తుతానికి దయచెయ్యి’ అని వాళ్లు ఎకసెక్కంగా బదులిచ్చారు.‘ధైర్యం ఉంటే మీ రాజును ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనండి. లేకపోతే, పారిపోవడానికే రేపటి వరకు గడువు కోరుతున్నారనుకుంటా’ అన్నాడు.వీడు మరీ మొండిఘటంలా ఉన్నాడనుకున్న మంత్రులు, కార్యవీర్యార్జునుడికి రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు. ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడని కూడా చెప్పారు.కార్తవీర్యార్జునుడు జలక్రీడలను చాలించి, వెనువెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు. భయపడవద్దని భార్యలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు. తన ఐదువందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు. మిగిలిన ఐదువందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని, దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగుపెట్టాడు. రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతడికి ఎదురు వెళ్లి, ఒక ముసలాన్ని విసిరాడు. కార్తవీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే తుక్కుకింద ముక్కలు చేసి, గదతో చాచిపెట్టి ప్రహస్తుణ్ణి కొట్టాడు. ప్రహస్తుడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలికి బుద్ధి చెప్పి, వెనక్కు పరుగు తీశారు.ప్రహస్తుడు పడిపోవడం, మంత్రులు పలాయనం చిత్తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చాడు. ఒక భారీ గద పట్టుకుని అతడితో తలపడ్డాడు. ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. ఇద్దరిలోనూ ఒక్కరూ వెనక్కు తగ్గలేదు. గదాఘాతాలతో ఇద్దరి ఒళ్లూ రక్తసిక్తంగా మారినా, కొండల్లా చలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు. వాళ్ల గదా ఘాతాల ధ్వనులకు, వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది. కార్తవీర్యార్జునుడు అదను చూసుకుని, రావణుడి ఛాతీపై గదతో బలంగా మోదాడు. ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది. రావణుడు నేల కూలిపోయాడు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తాళ్లతో కట్టేసి, బందీగా తన నగరానికి తీసుకుపోయాడు.రావణుడు బందీగా పట్టుబడిపోవడంతో ధైర్యం సడలిన అతడి మంత్రులు, సేనానులు, సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. వారు నేరుగా రావణుడి తాత పులస్త్యబ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.పులస్త్యుడు మహిష్మతీ నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎదురేగి పులస్త్యుడికి ఘనస్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తన మనవడైన రావణుడికి బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుణ్ణి మెచ్చుకున్నాడు పులస్త్యుడు. ‘నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటింది. ఇక వాడిని విడిచిపెట్టు’ అని కోరాడు. పులస్త్యుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు. పులస్త్యుడు అక్కడికక్కడే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశాడు.∙సాంఖ్యాయన -
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్గ్రేడ్స్ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
Clout అపూర్వ ముఖీజా
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్. ద రెబల్ కిడ్గా పాపులర్. కామిక్ వీడియోస్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వ్లోగ్స్కి ప్రసిద్ధి. టిక్టాక్లో లిప్ సింక్ వీడియోస్తో సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసింది. మన దేశంలో టిక్టాక్ బ్యాన్ అవడంతో ఇన్స్టాలో కామిక్ వీడియోస్కి స్విచ్ ఓవర్ అయింది. ముంబైలో పుట్టి పెరిగింది. మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది. కొన్నాళ్లు డెల్లో పని చేసింది. వెబ్స్టార్గా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో వెబ్ దునియానే ఫుల్టైమ్ వర్క్ ప్లాట్ఫామ్గా మలచుకుంది. యాక్టింగ్ ఫీల్డ్లోకీ ఎంట్రీ ఇచ్చింది.. 'Who is your gynac' అనే సిరీస్తో! ‘నా చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించడం నాకు సరదా! అదే నా స్కిల్ అని లేట్గా అర్థమైంది. దాన్నే కెరీర్గా మార్చుకున్నాను. నిజానికి నేనో స్టోరీ టెల్లర్ని’ అంటుంది అపూర్వ ముఖీజా. -
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
సిల్వర్ స్క్రీన్ శిల్పం
‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.ఏ క్యారెక్టర్నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్. -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం
‘ఓబ్బీ! లేయ్ నాయన.. నా తండ్రివి గదూ! నా రత్నం గాదూ! మన ఇంటికి రాక రాక ఇన్ని దినాలకు అబ్బొచ్చినాడు. పాపం.. మనం బాగా మర్యాద జేసి పంపొల కదా? కోడ్ని అలల జేయించుకుని రావాల, మీ నాయన జూస్తే టైంకి ఊర్లో లేకపాయ. కిస్టపాడు పోవాలా.. లెయ్ నాయనా.’మాయమ్మ చెవిలో జోరీగ మాదిరి నస పెట్టేది వింటా తట్టుకోలేక దుప్పటి కాళ్ళ కిందునుంటి ఇరికిచ్చి తలవెనక్కి బిర్రుగా తోసి ముదరజుట్టుకుని పడుకున్నా.అహా! అసలుకి ఈ రగ్గు మా నాయన నెల్లూరు పోయినపుడు తెచ్చివుండాడు. నాతో అబద్ధం జెప్పి వుంటాడు. మా ఇటుకల బట్టి అంటించినాక ఆకాశంకేసి పై పైకి లేస్తాపోయే పొగతోబాటు గాల్లోకి ఎగిరి అట్టనేబోయ్ మబ్బులు తెంపి ఇట్టా తెచ్చినట్టు ఎంత హాయిగా, ఎంత మెత్తగా వుంటాదో ఈ దుప్పటి.దీన్ని తెచ్చిన పొద్దు జూడాల మాయమ్మ బేసిన భరతనాటికం, ఈ లేత నీలం రంగు చూసి మా నాయన మీదకి పూనకమొచ్చిన మాదిరి వూగింది. ఈ రంగు బేన్నే మాసిపోద్దనీ, ఇంత లావు రగ్గుని ఉతికేటాలకు నడుము, చేతులు పడి పోతాయని వాపసు ఇచ్చి రమ్మనింది. నేనే నాకు నచ్చిందని మాయమ్మని కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలి వున్నించుకున్నా. ఉతికేతపుడు నేను సాయంగూడా జేస్తానన్నా. అట్టా దీన్ని దక్కించుకున్న.ఇది కప్పుకుంటే పానం గాల్లో తేలుతాపోతాన్నెట్టు ఉంటాది.కాకుంటే ఒకటే .. మా అమ్మ నా తాలాపు దిక్కున మంచంకోడుకు ఆనుకుని కుచ్చిని నన్ను లేపుతావుంటే సూసే అమ్మలక్కలు తోడై, రాగాలు పెడతారేమోనన్న ఆలోచన మనసులోకి రాంగానే భయమేసి గబుక్కుని లేస్తి.‘మా! ఏంది మా? సంకురాత్రి సెలవులిచ్చినాక, ఈ మాద్దిరి ఎండపొద్దు దాకా పొండుకోవాలని కలలుగంటి. తలాపున కుచ్చోని ఈమైన ‘ఓ..’ అని రాగాలు పెడతావుండావు. ఏం? కిట్టపాడు దాకా ఏంటికి? నాలుగీదులవుతలనే ‘ఈసోబు’ మామ వుండ్లా్య. ఎప్పుడూ ఆయనే సేసిస్తాడుగదా అలల’ అంటి విసుగ్గా. ‘ఏంటికి నాయన ఇంత చిరాకు నీకు? పొద్దున్నే పాలకోసం ఈసోబు మామ చిన్న బిడ్డవుండ్లా? అదే ఆయమ్మి గౌసియా వచ్చింటే నేను ముందే ఎచ్చరిస్తి. మీ నాయన వుండాడా అమ్ములు? కోడిని తెస్తా అలల జేపిచ్చాడేమో’ అని అడిగితి. దానికి ఆయమ్మి..‘లేడత్తోవ్! నిన్ననే మా మున్ని అక్కను అత్తగారింటి నుండి మనింటికి కాన్పు కోసమని తోడకరావాలని ఊరికి పోయినాడు’ అని చెప్పింది రా’ అంది మాయమ్మ.‘గౌసియా వచ్చిందా?’ అంటి టక్కున ఆత్రం ఆపుకోలేక. మళ్ళా మాయమ్మ ఏమనుకుంటుందో అని ఉత్తుత్తి ఆవలింతలు దీస్తా మెరిసిన ఆనందపు కళ్లను నులుపుకుంటానట్లు అరచేతులను అడ్డుబెట్టుకుని ‘చా! భలే ఛాన్సు పాయ’ అని మనసులో అనుకున్నా. ఆయమ్మి నాదిక్కు జూసినపుడు నవ్వే నవ్వంటే నాకు శానా శానా ఇష్టం. కానీ ఆయమ్మి ఇంత పొద్దన్నే వచ్చుద్దని అసలు అనుకోలా నేను.‘బిరాన పోయిరాపో నాయనా! నెను పప్పు నానబెట్టిన, నువ్వచ్చేలోపు గారెల పిండి రుబ్బేసి. తెల్లబాయలు వొలిసి మసాలా నూరి పెడతా! నువ్వొచ్చినాక కోడి కూర పులుసుజేసి వేడి వేడిగా నాలుగు గారెలు జేసిపెడతాను. మా నాయన కదూ! పోయ్రాపో బంగారూ’ అంటా మాటలతో ఊరిచ్చే మాయమ్మ.సరేని ఉదరాబదరా పండ్లు తోమి, మాయమ్మ ఇచ్చిన పెద్ద గలసానిండాకు ఉడుకుడుకు పాలు తాగినాక.. నేను, మాయమ్మ ఇద్దరం కలిసి కోళ్ల గూటిలో తారాడి తారాడీ గుడ్లకు వచ్చిన నల్ల కోడిని ఒకదాన్ని చూసి ఒడుపుగా పట్టుకుంటిమి. మాయమ్మ దాని కాళ్ళు రెండు పురికొసతో ముడేసిస్తే చెయ్ సంచిలో కుక్కి, జేబులో రూపాయి పెట్టుకొని దావ పట్టిన.మా ఊరికి కిస్టపాడు రెండు కిలోమీటర్ల దూరం. బస్సులు ఎపుడో ఒకటి తప్ప రావు. అందుకే అందరూ సైకిళ్ల మీదనో, నడుచుకునో పొయ్యేవాళ్లు. పొయ్యేటపుడు డబుల్స్ లేని సైకిల్ జూసి చెయ్ చాపి ఎక్కి, సరాసరి మా నాయన దగ్గర పనిజేసే మస్తానోళ్ళ ఇంటికి బోతి. ఈడకు ఎప్పుడు వచ్చినా యజమాని కొడుకు హోదా ఇస్తారు వీళ్లు. ఒకదిక్కు మస్తాన్ మామ కోడిని అలాల్ జేసేదానికి తీసుకొనిబోతే, నేను ఆయప్ప భార్య ఇచ్చిన కారం చుట్టలు తింటా కూసున్న.‘నాయన లేడు కదా అబ్బయ్యా! నేనే కోడిని కాల్చి కొట్టిస్తాగానీ రోసేపు అట్ట మంచంలోనే కూకో’ అనే. సరే అని కుచ్చుంటి నేను. అంతలోనే ఆయమ్మ లోటాతో బానలోని చల్లటి నీళ్లు తెచ్చిచ్చే. తాగి చొక్కాతో మూతి తుడుచుకుని లేచేతరికి, ముక్కలుగా కొట్టిన కోడి మాంసంను స్టీల్ టిఫను డబ్బాలో బెట్టిస్తా ‘టిపను డబ్బా రేప్పొద్దున వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే గానీ నువ్ భద్రంగా పోయిరా చిన్నోడ’ అనే.నేను టిఫను డబ్బా పట్టుకుని ఊపుకుంటా, గారెల రుచి ఊహించుకుంటా పాటలు పాడుకుంటా, ఎవురన్న సైకిల్ మీద వస్తాండారేమో అని యనకమాలకి తిరిగి తిరిగి సూసుకుంటా నడుస్తావుండా. మా ఊరినింటి కిష్టపాడు మధ్యలో ఒక లోతువంక దారి ఉంటాది. వంకకు ఒక పక్క చింతమానుల కిందున్న సమాధులు నన్ను ఎప్పుడూ భయపెట్టేదానికే జూస్తాయి. పొయ్యేతపుడు సైకిల్ మీద ఆ దిక్కు తిరిగి కూర్చుని పోయినా కాబట్టి కనపడలేదేమో గాని ఈ మధ్య కొత్తగా కట్టినట్టువుండారు ఓ సమాధిని. కట్టింది చాలదని దాని మీద సిమెంట్తో ఒక మనిషి ఆకారం కూర్చున్నట్టుగా కూడా చెక్కినారు. ఎర్రంచు పంచా, తెల్లటి చొక్కా, నల్లంగా గుబురు మీసాలు, చేతికర్రా.. అచ్చం మనిషి కూర్చున్నట్టే వుంది. నాకు గుండె దడ దడ మనే. అంతలో ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది. ఇంగ నా భయం జూడాల. అప్పటిదంకా పాడిన శిరంజీవి పాట ఆపేసి ‘అనుమంతుడి’ దండకం ఎత్తుకుంటి నేను. అయినా కూడా గుండెలో దడకేమో ఎండ ఎక్కువ లేకున్నా చెమటపడతానే వుంది. పొద్దున తాగిన పాలు ఆవిరైపాయ, తిన్న కారం సుట్టలు అరిగిపాయ, గబ గబా నడిసి వంకపైకి వచ్చేసి ఊపిరి తీసుకున్నాను. ఎదురుమల్లె దూరంగా మా ఊరు కనపడి హమ్మయ్య అని ఇంగ ధైర్యం తెచ్చుకుంటి. రోన్ని నీళ్లు తాగితే బాగుండు అని నాలిక పిడసగట్టినట్టు అనిపిస్తంది.అంతలో ‘ఓఓ..బ్బీ’ అని ఎవరో పిలిసిన పిలుపు మళ్ళా వినపడి యనక్కి తిరిగి జూస్తి. వంక లోతట్టులో తెల్లగుడ్డ కదులుతున్నట్టు, నడుస్తాన్నట్టు కనపడి వెన్నులో పదురు లేసింది. ‘ఓఓబ్బీ.. నువ్ రత్నం గాదూ.. ఆడనే వుండు నే వస్తన్న’ అంటా మల్లోసారి కేకేసింది ఆ ఆకారం. ఆమెను ఇంతకు ముందు చూసిన గాపకం లేదు. అసలు తలంతా తెల్ల గుడ్డలాంటిది చుట్టుకుంది మొహం కానరాకుండా. దానికి తోడు తెల్ల చీర కట్టుకుంది.నాకు కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ‘ఒరా! దయ్యాలకు మన గురించి తెలుసుకోవడం శానా వీజీ అంటరా. అవిగాన తలచుకుంటే మన పేరే గాదు, తరగతిలో మనం యా సెక్షనో గూడా తెలిసిపోతాయంటరా. వాటికీ.. తెల్లచీరలన్నా, నల్ల కోళ్లన్నా, చింత మానులన్నా శానా ఇష్టమంటా మా అబ్బ జెప్పినాడ’ని కళ్ళు గోళికాయలంత జేసుకుని చెప్పిన మా రమణగాడు గుర్తొచ్చాడు.అంతలో ఆ ఆకారం నవ్వుతా ‘ఏందో టిపన్ డబ్బాలో కొండబోతండవే. సియ్యలేనా? అయితే బువ్వదినేకి నేనూ వస్తా వుండు నీతోబాటు మీ ఇంటికి’ అని తుపుక్కున నేల మీద ఉమ్మింది తార్రోడ్డు మీద ఎర్రగా నెత్తురు మాదిరి.. ‘ఉండబ్బీ’ అంటా తలెత్తి నా దిక్కు జూస్తా ముందుకు నడుస్తా వస్తంది. నాకు ఏం జేయాలో తెలియక చేతులు, కాళ్ళు ఆడట్లేదు. ఆమె ఆగి నెత్తిమీద నుండి∙జారిపోతున్న తెల్లగుడ్డ సరి జేసుకుంటా ఉంటే, నేను ఇదే ఛాన్సని ఇంగ దొమ్మల నిండాకు ఊపిరి దీసుకొని పరుగు అందుకున్నా.అట్టా పరిగెత్తిన నాకు వాకిట్లో వాల్చిన నులకమంచంలో బడి మా యమ్మను వాటేసుకున్నది మాత్రమే గ్యాపకం. ఇంగ ఆ పడుకోడం పడుకోడమే పట్టుకుంది అల్లుజ్వరం. వారమయినా తగ్గలేదు.ఓనాడు నేను పొద్దున్నే పాలు, బన్ను తిని జొరం మాత్తరేసుకుని ముదరజుట్టుకుని ముడుసుకుని పడుకునివున్నా. మా అమ్మ నా ఎదురుగా కుచ్చుని రాగులు ఇసురుకుంటా వున్నపుడు వచ్చింది గౌసియా వాళ్ళమ్మ.‘వదినా సేమిరికి రొంత పెరుగు కావాలా’ అంటా అడుగుతా మంచంలో పొడుకున్న నన్ను జుసిందేమో ‘ఏం పిల్లకాయ వదినా! మీ రత్నమయ్య? ఆ మధ్య ఊరినింటి మా అమ్మ వస్తా వుంటే ఈ యబ్బి కనపడినాడంటా. ఎదో మాట్లాడతా తోడుగా పోవచ్చులే అని పిలిస్తే ఉలుకూపలుకూ లేదంటా, ఆకేసుకుంటా నిలబడి ‘ఏంది టిపనులో సియ్యలా నేనూ వస్తా’ అని నవ్వాతా అనిందో లేదో ఆ మయిన ఒకటే పరుగులెత్తి పోయినాడంట. నిజంగానే సియ్యలు లాక్కుంటాదనుకున్నాడా ఏమి?’ ఒకటేమయిన నవ్వుతా వుంది.మాయమ్మ నా దిక్కుజూస్తా ‘లేదులే వదినా! శానాళ్ళయ్యింది కదా మీ అమ్మ మనూరు రాక, అత్తని వాడు గుర్తుపట్టి వుండడులే, ల్యాకుంటే మర్యాదకైనా ఎచ్చరిచ్చే పిలకాయేగాదు మావాడు? వాడి గురించి నీకు తెలీదా!’ అంటా నన్ను ఎనకేసుకోస్తా వున్నింది. ఇద్దరూ అట్లా మాట్లాడతానే నిలబడుకోనుండారు.అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటి. ఆమె దయ్యం కాదనీ, ఉమ్మింది రక్తం కాదనీ.. గౌసియా వాళ్ల అవ్వకోసం ఆకులు, వక్కలు కొనక్కపోయేదీ, ఆ జేజి ఎప్పుడూ ఆకొక్క నములతాంటాదని అప్పటికి జ్ఞాపకం వచ్చింది. తెల్ల గుడ్డ కప్పుకుంటే మట్టికీ అందరూ దయ్యం కాదని అర్థమై లోలోపల నవ్వుకుంటి నేను.గౌసియా వాళ్లమ్మ రోసేపు మాటాడి పోతా పోతా నా మనసులోని భయం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పొద్దు గట్టిగా అనుకుంటి. ఇంగెప్పుడూ భయం అన్న మాట లేకుండా తిరగాలని.మా కానుగచెట్టు నుండి చల్లని గాలి నా మొహాన్ని తాకుతా వుంది. మా అమ్మ నుదురు మీద అరచెయ్యేసి జూసి ‘హమ్మయ్య! చెమట పోస్తంది లే. ఇంగ జ్వరం ఇడిసినట్టే రత్నమా’ అంది ప్రేమగా నా నుదురు ముద్దాడి. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
యువ కథ: చందమామ రావే!
రోజులాగే ఆ రోజూ సెల్లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్ లేదు. లైట్ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. ఆ మహీధర్ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. ఎంట్రన్స్లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్లోనే ఉన్నాయి. టైమ్ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్ మేనేజర్గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్ నుండి తెప్పించుకున్న సూట్కి ఉన్న ట్యాగ్ కట్ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్ అవ్వచ్చు, ఆఫీస్ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్కి రాను. నువ్ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా అని!’ కార్ తీసుకుని ఆఫీస్ బ్యాగ్తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్ చూసుకుంటూ కార్ ఎక్కి ఆఫీస్కి బయల్దేరాడు. దారిలోనే మహీధర్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్కి డయల్ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్ భార్య ‘20 మినిట్స్లో ఆఫీస్లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్ చేసి రకరకాల బోన్సాయ్ మొక్కలు తెప్పించాడు. కార్పెట్ క్లీనింగ్ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేశాడు. కారిడార్ మొత్తం తిరిగి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్ వచ్చారు. ‘పాత ఫైల్స్ అన్నీ సెపరేట్ షెల్ఫ్లోకి షిఫ్ట్ చేయించావా?’ ‘లాస్ట్ వర్కింగ్ డేనే చేశాం సర్’ మహీధర్ వెనకే నడుస్తూ చెప్పాడు. ‘అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటేల్స్?’ ‘డేటా రెడీగా ఉంది సర్’ అభిరామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్ ఫోన్లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్ ఫిక్స్ చేయించలేదా.. బాస్ ఇంకా చెక్ చేయాల్సింది వాష్రూమ్స్ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు. అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్ ఫిక్సింగ్ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్.. మహీధర్ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్ ఎన్నైనా చెప్తావ్, బాస్ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్ అని నీ హెల్ప్ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్ వాష్రూమ్లోకి వెళ్లాడు.ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్గా ఫ్లోర్ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్గా ఉంది. ‘టప్..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్ మీద. మహీధర్ టీమ్లోని సంజన రాసిన ప్రోగ్రామ్లో మిస్టేక్స్ రిపీట్ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్ లీడ్ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! ‘టప్! టప్!’ ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్ వాష్రూమ్ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. వెంటనే తేరుకుని ‘వాష్రూమ్ నుండే వస్తున్నట్టుంది సర్’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్ బేసిన్ అవుట్ లెట్ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్ పోవడానికి ఉండే మెటల్ ప్లేట్ మీద పడుతున్నాయి. మెటల్ ప్లేట్ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ‘వాటర్ లీక్ ఔతుంది సర్’ డోర్ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్ చేయిస్తాను సర్’ అన్నాడు మహీధర్. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్ రవి ఆరోజు కొన్ని అరెంజ్మెంట్స్కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్ విషయం చెప్పమని అభిరామ్కి చెప్పి వీకెండ్ పార్టీ ఉందని ఆఫీస్ టైమ్ అవ్వకముందే బాస్ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్. ఈరోజు– మూర్తి స్టాఫ్ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్కి పిలిచాడు. వాష్రూమ్ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్ లీక్ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్ ప్రమోషన్. జోనల్ వైజ్గా బ్రాంచెస్ టేక్ కేర్ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్గా వస్తున్నారని మూర్తి ఎక్స్పెక్టేషన్. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్ కూడా సెలెక్ట్ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్గా వాష్రూమ్లోకి పంపించాడు. ప్లంబర్కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్ రూమ్కి వెళ్ళాడు రవి. అతను వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్ పెట్టేసి, బొకే టేబుల్ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్ ద వే. ప్రయర్గా ఫినిష్ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్ రీచ్ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్. మహీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్రూమ్ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. వాష్రూమ్ నుండి బయటకొచ్చిన స్టాఫ్ మెంబర్ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్.. సడన్గా లోపల మనిషిని చూసేసరికి’‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్ ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్తో మనిషి నీట్గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ‘నా పేరు రాజు, ట్యాప్ రిపేర్ చేయనీకి ఒచ్చిన సార్‘‘రిపేర్ అయిందా?’‘అయింది సార్’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్?’‘రొండు గంటలైంది’‘వాట్?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్’‘మరి లోపల ఎందుకున్నావ్ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’‘అంటే ఇతను ప్లంబర్ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్రౌండర్ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. ‘సర్’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్ వేస్తుంటే చూశా. ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. ‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. ‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్కి పోయి మహేష్ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్ అందరికీ సీఈవో స్పీచ్ కంటే రాజు స్పీచ్ బావుందనిపించింది. మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. -
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్తో వారిని గ్లోబల్ స్టార్స్లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్గా ‘ఫిల్మ్ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్ను నమ్మి చేసిన ‘కృష్ణన్కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్గుడ్ మూవీస్గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్ -
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్తో కలిసి బర్కత్పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
మిస్టరీగానే నాదిరా హత్య కేసు
అది 6 ఆగస్టు 1995, సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీథి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.రెస్టరెంట్లో భోజనం ముగించుకుని, నాదిరా దంపతులు ఇంటికి వెళుతున్నారు.తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి, కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్ను గద్దించారు.దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు.దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి, కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగులకు, ఇజాజ్కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.ఈ సంఘటన పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్యవార్త పత్రికల్లోని పతాక శీర్షికలకెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నాదిరా తన పద్దెనిమిదేళ్ల వయసులో 1986లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టిన ఆమెను అభిమానులు ‘వైట్ రోజ్’గా పిలుచుకునేవారు. సినీరంగంలో ఒకవైపు వెలుగుతుండగానే, సంపన్నుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ముజ్రా కార్యక్రమాల్లో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే రూ.52 లక్షలు పారితోషికంగా తీసుకునేది.సినీరంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదేకాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోను, ఇతరుల వాహనాల్లోను, ఇంకొందరు రిక్షాల్లోను స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో పాతిక సినిమాలు సిల్వర్జూబ్లీలు చేసుకున్నాయి. సినీరంగంలో వైభవం కొడిగట్టక ముందే పెళ్లి చేసుకుని, కెరీర్కు స్వస్తి పలికింది.సినీరంగంలో నాదిరా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగలేదు. అనతికాలంలోనే ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతణ్ణి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు.పెళ్లయిన కొన్నాళ్లకు భర్త ఇజాజ్తో కలసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ, తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయసాగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగువారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచు కీచులాటలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్లు చెప్పారు.ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ కనుక్కోలేకపోయారు. దీంతో అతణ్ణి విడిచిపెట్టారు. పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే, ఆమెను భర్తే హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతణ్ణి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచినా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉదంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
సృజనకు పెన్నిధి
క్రియేటివ్ జీల్కి నిలువెత్తు నిదర్శనం స్టయిలిస్ట్ నిధి జెస్వానీ! అవుట్ డేటెడ్ అనే మాటను దరిదాపుల్లోకి కూడా రానీయదు. డిజైన్స్లో కానీ.. స్టయిలింగ్లో కానీ కాలమే ఆమెతో పోటీ పడాలి!నిధి జెస్వానీ.. పుట్టి, పెరిగింది ముంబైలో! మాస్ మీడియాలో డిగ్రీ, అడ్వర్టయిజింగ్లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ తాన్యా ఘావ్రీ దగ్గర ఇంటర్న్గా చేరింది. ఎన్నో ఫ్యాషన్ షోలకు అసిస్టెంట్ స్టయిలిస్ట్గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాల్లో వారి కుటుంబ సభ్యులకు స్టయిలింగ్ చేసింది. తను స్టయిల్ చేసే ప్రతివ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే లేటెస్ట్ ఫ్యాషన్ను అనుసరిస్తూ వాళ్లను అందంగా, ఎలిగెంట్గా ప్రెజెంట్ చేసి, అతిథుల ఫేవరిట్ స్టయిలిస్ట్గా మారింది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉండే తన డిజైన్స్తో బాలీవుడ్ అటెన్షన్ను గ్రాబ్ చేసింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టుకున్నారు. ఆధునిక డిజైన్స్కు సంప్రదాయ టచ్నిచ్చి, చాలా త్వరగా నిధి బాలీవుడ్లో తన ప్రత్యేకతను చాటింది. అది సెలబ్రిటీలే ఆమెను సంప్రదించేలా చేసింది. మీరా కపూర్, నుస్రత్ భరూచా, శ్రద్ధా శ్రీకాంత్, భూమి పెడ్నేకర్, కృతి శెట్టి, రకుల్ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్లకు స్టయిలిస్ట్గా పనిచేసింది. -
పాజిటివ్ ఎనర్జీనిచ్చే డెకరేషన్
శ్రావ్యమైన సవ్వడి.. గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్ బెల్స్ ఇంటికి పాజిటివ్ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సువాసనల కాంతిడెకరేటివ్ వస్తువుల్లో క్యాండిల్స్కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.ధూపం కూడా..ధూపం వేయడమూ పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటి పరిమళాల ధూప్ స్టిక్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రేయస్సుకు..శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్లో ఉన్నాయి. నెమలి ఈకలునెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. – ఎన్.ఆర్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూ. -
దోస్తీకి దొన్ను చెక్కీ
భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!ఆ స్వీట్ స్టోరీ ..మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం. ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి. నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం -
ఈవారం కథ: సుధీరన్న
నిద్రరాని ఈ రాత్రి పూట, ఈ నగరంలో, ఆకాశహర్మ్యంలో నా వెడల్పాటి కిటికీలో కనిపిస్తున్న చంద్రుడిని, ఆ పక్కనే వున్న దీటైన చుక్కను చూస్తూ ఉంటే హఠాత్తుగా సుధీరన్న జ్ఞాపకం వచ్చాడు. ఎన్నిరోజులై ఉంటుంది అన్న చనిపోయి, కాదు ఆత్మహత్య చేసుకుని? అసలు మనల్ని మనం చంపుకోవడాన్ని స్వంత హత్యా అనో మరొకటనో అనకుండా ఆత్మహత్య అని ఎందుకు పేరు పెట్టారు. ఎవరు ఆ పేరు పెట్టారో కానీ విషయాలు చాలా లోతుగా తెలిసిన వాళ్ళే పెట్టి వుంటారు.ఆత్మహత్యకి ఒక నెల ముందు ఫోన్ చేసి ‘అన్నా! నీ కథ రాయాలనుకుంటున్నా, చెప్తావా?’ అంటే ‘ఎందుకు చెప్పను బుజ్జమ్మా? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుండ్ల నీకు’ అన్నాడు.నేను ‘చెప్పేవులే గానీ, చాలా సంవత్సరాలు అయిపోలా, ఇంకా గుర్తుంటదా అన్నా? మళ్లీ మొదటనుండి చెప్పాల్సిందే’ అన్నాను. అందుకు బదులుగా ‘చెప్తా గాని బుజ్జమ్మ, నేనే నీకు ఫోన్ చెయ్యాలనుకుంటా ఉండా, నువ్వే చేశావు! ఈ సంగతి చెప్పు, పాప, అదే నా బిడ్డ నన్ను కలవాలనుకుంటా ఉందంట, ఏం చేయమంటావు చెప్పమ్మా’ అన్నాడు.నేను అది విని ఆశ్చర్యపడి, ఎప్పుడో నాలుగు సంవత్సరాల బిడ్డని కదా అన్న వదిలొచ్చేవు ఇప్పుడేం చదవతావుంది’ అంటే, ‘ఇంజినీరింగ్ బుజ్జమ్మ’ అన్నాడు. ఆరోజే చివరి మాటలు, ఆ తరవాత మాట్లాడింది లేదు, సుధీరన్న ఆయన కథ చెప్పకుండానే తన ఆత్మను తానే హత్య చేసేసి, తన శరీరాన్ని ప్రపంచం మొహాన పారేసి వెళ్లిపోయాడు.సుధీరన్న అందగాడు. నల్లగా ఉంటాడు, కళ్ళు పెద్దవిగా దేవుడికి పెట్టిన కళ్ళలాగా తెల్లగా వెడల్పుగా ఉంటాయి. ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తుతో, వెడల్పయిన భుజాలతో, చెక్కినట్లు వుండే ముక్కుతో పోత పోసిన విగ్రహంలా ఉంటాడు. ఎంతమందిలో వున్నా అందరికంటే భిన్నంగా, తిరిగి చూసేట్టు ఉంటాడు. ఆయన బలమైన శరీరం మనల్ని ఒక వైపు భయపెడుతుంటే, ఆయన పసికందులాటి నవ్వు మనల్ని దగ్గరకి పిలుస్తుంది. ఆయన శరీరము, నవ్వు.. రెండూ ఒకదానికి ఇంకోటి విరోధాభాసం. కానీ వూర్లో ఏమన్నా గొడవలు జరిగితే ఆయనొక్కడే పదిమందిని ఒంటి చేత్తో కొట్టేవాడని అందరూ అంటారు.సుధీరన్న తల్లి, మా పెద్దమ్మ, ఆమె బావను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆమె అయినింటి ఆడపడచు. ఆమె బావ, ఆమె మాటల్లో చెప్పాలంటే ‘రంగు నలుపే కానీ అన్నిందాల ఆమెకి సరయిన జోడీ’. ఆస్తీ పాస్తీ దండిగానే ఉండేవి.అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సుధీరన్న తల్లి దేవసేనకు ఒక అలవాటు వుండేది, అదేమిటంటే అతిగా ఖర్చు పెట్టడం. ఎంత డబ్బునయినాసులువుగా ఖర్చు పెట్టగల మార్గాలు ఆమెకు అనేకం తెలుసు. అలాగే సుధీరన్న తండ్రికి కూడా ఒక బలహీనత ఉండేది, అదేంటంటే భార్య తానా అంటే తందానా అనడం.దేవసేనకు బంధు మిత్రులంటే తగని ప్రీతి. మనుషులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఆమెకు మహా ఇష్టం. అందుకు అనువయిన ప్రతి సందర్భాన్ని ఆమె వాడుకునేది. అదృష్టవశాత్తు ఆమెకు సుధీరన్న ఒక్కడితోనే సంతాన సౌభాగ్యం అడుగంటి పోయింది. అందుకని సుధీరన్నని ఆమె అల్లారు ముద్దుగా పెంచింది. సుధీరన్న ఆడుకోవడానికి పది బొమ్మలు అవసరమయిన చోట ముప్పయ్యారు బొమ్మలు కొనేది.వాటిని కొద్ది రోజులకే వాళ్ళకీ వీళ్లకీ దానం చేసేసి తిరిగి కొత్త బొమ్మలు కొనేది. తన చీరలయినా అంతే, పెళ్ళికో పబ్బానికో ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టుకునేది కాదు. అది వాళ్ళ కులంలో, పెట్టి పుట్టిన వాళ్ళు ఎవరూ చేయరని ఆమె నిశ్చితాభిప్రాయం. అంచేత ఆమె ప్రతినిత్యం చీరలు కొంటూ ఉండేది. ఆమె చీరలు కొనడానికి వాళ్ళ వూరు, వాళ్ళ పట్టణం, వాళ్ళ నగరం, చివరికి వాళ్ళ రాష్ట్రం కూడా దాటి, పక్క రాష్ట్రానికి చీరలు కొనడానికి వెళ్ళేది. ఆ రాష్ట్రంలో ఒకపెద్ద వస్త్ర దుకాణం చెట్టియారు, తెల్లటి ఛాయతో, రింగుల రింగుల తలతో దర్జాగా వచ్చే ఆమె కోసం గావురు గావురుమని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ చెట్టియారు ఆమెకి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పి, ఒక చీర కొనాల్సిన చోట పది కొనిపించేవాడు. ఆమె అలా కొన్నవాటిని బంధు మిత్రులకు ప్రీతిగా పంచి బంధువులు ‘దేవసేన మనసు వెన్న’ అంటే మురిసి కరిగి పోయేది.కొడుకు సుధీర్కి సరిగ్గా పదేళ్లు వచ్చేసరికి దేవసేన వాళ్ళ యాబయ్ ఎకరాల మాగాణి ఏడెకరాలయింది. కారణం నువ్వని నోరు తెరిచి ఏనాడు అనని భర్తను పట్టుకుని చేతకాని వాడని, అతని వల్లే తాను, తన బిడ్డ పడరాని కష్టాలు పడుతున్నామని వేధించడం మొదలు పెట్టింది దేవసేన. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె భర్త ఒకరోజు చుక్క పొద్దుకాడ లేచి కట్టు బట్టలతో ఇల్లు విడిచివెళ్ళిపోయాడు. భర్త కొడుకుని, తనను అనాథలను చేసి వెళ్లి పోయాక వున్న ఏడెకరాలను, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెమని అమ్ముకుంటూ కొడుకును పెంచి పెద్ద చేసింది దేవసేన.సుధీరు ఇరవైలలో పడ్డాక అందగాడైన తన కొడుకుకి అయినింటి సంబంధాలు ఎదురు కట్నమిచ్చి చేసుకోవడానికి వెదుక్కుంటూ వస్తాయని దేవసేన కలలు కనడం మొదలు పెట్టింది. కలలు నిజం కాకుండా సుధీరన్న ఇరవైతొమ్మిదేళ్ళ వాడయ్యాడు.ఒక్క సంబంధం కూడా వారి గడప తొక్కలేదు. దేవసేనకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మహిళా ప్రపంచం ఆస్తికి ఇచ్చిన విలువ మనిషికి అతని సౌందర్యానికి ఇవ్వదని గుర్తించింది. కానీ ఆమెకు ఇప్పుడున్న ఆస్తి కేవలం కొడుకు మాత్రమే. ఆ కొడుకును ఎరవేసి ఆమె తిరిగి తన మునుపటి వైభవానికి చేరుకోవాలి. అందుకే ఆమె పెళ్లిళ్ల బ్రోకరుకు ఈసారి సిగ్గు విడిచి గట్టిగా, ఎవరైనా పర్వాలేదు కానీ కాస్త గట్టిగా ఆస్తిపాస్తులు వుండేవాళ్ళను చూడమని చెప్పింది.సుధీరన్నది అతని తండ్రి లాటి స్వభావమే, పదేళ్ల బిడ్డగా తండ్రి వదిలేసి వెళితే తనని పెంచి ఇంత వాడిని చేసిందని తల్లి అంటే అతనికి అపారమైన ప్రేమ, గౌరవమూ. అందుకే తన పెళ్లి విషయంలో తల్లి ఏవేవో ఎత్తుగడలు వేస్తున్నా తనతో చదివిన వనజ తనను ఇష్టపడుతోందని, కులం వేరయినా చక్కగా చదువుకుని టీచరుగా పనిచేస్తుందని తల్లికి చెప్పే సాహసం అతను చేయలేదు.సుధీరన్నకు, మాధురికి ఒక మాఘమాసంలో పెళ్లి జరిగింది. మాధురి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సు. ఒక్కటే కూతురు, ఆస్తిపాస్తులు దండిగా వున్నాయి. సుధీరన్నకంటే కొంచెం పెద్దది. మొదటి భర్త అవమానించి, అనుమానంతో హింసించి విడాకులిచ్చేశాడు. వయసు వచ్చేస్తుంది, ఒకవైపు సమాజం పనీపాటా లేకుండా కూర్చుని ఏదోకటి అంటూ ఉంది. అందుకని మాధురి పెళ్లి చేసుకోవాలనుకుంది. దేవసేనకి కావలసింది మాధురి దగ్గర, మాధురికి కావాల్సింది దేవసేన దగ్గర ఉండడంతో పెళ్లి ఘనంగా జరిగి పోయింది.దేవసేన ప్రపంచమంతా తన భర్త, కొడుకు లాగా తన కనుసన్నలలో మెసులుతుందనే భ్రమలో హాయిగా బతుకుతూ వస్తుంది ఇన్ని రోజులు. మాధురి వచ్చీరావడంతోనే ఆ భ్రమను కాళ్లతో కసపిసా తొక్కి వేసింది. అత్తగారి ఇంటికి దగ్గరగా ఉద్యోగాన్ని బదిలీ చేయించుకోమని అత్త అంటే, నువ్వు నీ ఇంటిలో వుండు నా భర్త నా దగ్గర ఉంటాడని కోడలు అంది. ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద రిజిస్టరు చేయించాలని అత్త అంటే, తన ఆస్తి తను కనబోయే పిల్లలకి చెందుతుందని ఇంకెవరికీ దాని మీద హక్కు లేదని కోడలు అంది. కోడలి మగరాయుడి తనానికి, జమాజెట్టి మాటలకు, కయ్యానికి కాలు దువ్వే తరహాకు దేవసేనకు మూర్ఛ వచ్చినంత పని అయింది. కోడలు తనకు అలివయ్యే ఘటం కాదని తెలుసుకున్నాక, అటునుండి నరుక్కు రావాలని కొడుకును సాధించడం మొదలు పెట్టింది దేవసేన.స్వతహాగా మృదుస్వభావి అయిన సుధీర్కి, తల్లి ప్రణాళిక.. ఆశ మొదటి నుండి అర్థం చేసుకున్న సుధీర్కి.. మాధురి తరహా ఏమాత్రం నచ్చలేదు. ఆస్తి కోసమే కదా అమ్మ తనని రెండో పెళ్లి అమ్మాయికి ఇచ్చింది.. మరి ఇదేమిటని అతని ధర్మబుద్ధికి తోచింది. అదే అతను భార్యను అడిగాడు. దేవసేనకంటే పదహారాకులు ఎక్కువ చదివిన మాధురికి సుధీర్ ‘చూపుల గుర్రమ’ని, బాగా మెతక అని తెలిసిపోయింది. అందుకే గొడవ చిలికి చిలికి గాలీ వానా అవుతుండగా‘నువ్వు పైన పటారం లోన లొటారం గాడివి’ అనేసింది. అమ్మ కొంగు పట్టుకుని తిరగక నీకు పెళ్ళెందుకు కావాల్సి వచ్చిందని సుధీర్ ముఖాన ఉమ్మింది. ఆ మాట విని, చీమ పైన కూడా చెయ్యి ఎత్తని సుధీర్.. మాధురిపై చెయ్యెత్తాడు. చెయ్యెత్తాడే కానీ చెయ్యి చేసుకోలేదు. కానీ ఆ రాత్రి గడిచి, వేకువయ్యీ అవగానే మాధురి తల్లి, మేనత్త,పెద్దమ్మ మూకుమ్మడిగా బస్సు దిగారు. అలా దిగిన వాళ్ళకి, దేవసేనకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తల్లికి వత్తాసుగా వెళ్లిన సుధీరును భార్య ఆమె తరపున ఆడవాళ్లు అందరూ కలిపి చితక కొట్టారు. సుధీర్ తల్లి ముందరే మాధురి అతనిని పడదోసి, అతని మీద కూర్చుని అతని వృషణాలని గట్టిగా వత్తేసింది. సుధీర్ ఆ నొప్పితో విలవిలలాడుతూండగా, దేవసేన నిర్ఘాంతపోయి చూస్తూండగా.. మాధురిని తీసుకుని ఆమె బంధుబలగం వెళ్లి పోయింది. వెళ్లిన మాధురి వెళ్లినట్లు వుండలేదు. సుధీర్పై, దేవసేనపై వరకట్నం కోసం తనను వేధించారని కేసు పెట్టింది.ఒకరోజు ఉదయం పదిగంటలకి దేవసేన, సుధీర్.. వాళ్లకున్న చిన్న జామతోటలో పని చేసుకుంటూ వున్నారు. హఠాత్తుగా చెమటలు కక్కుకుంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు తోటలోకి వచ్చారు ‘సుధీరంటే ఎవరూ?’ అంటూ.సుధీర్.. పోలీసులని చూసి నిర్ఘాంతపోయాడు. కొద్దోగొప్పో చదువుకున్నా అతనికి ఈ పోలీసులు, కేసులు వంటి వాటి గురించి అవగాహన లేదు. తనని వెదుక్కుంటూ పోలీసులు రావడమేమిటో అతనికి అర్థం కాలేదు. పోలీసులను చూడగానే పైకెత్తి కట్టుకున్న పంచె కిందికి దించి నమస్కారం చేసి రెండు కుర్చీలు తెచ్చి వేసి, రెండు నీళ్ల టెంకాయలు కొట్టి వాళ్లకి ఇచ్చి వివరం అడిగాడు. అతని భారీ శరీరాన్ని అతని మృదువయిన గొంతును చూసి వాళ్ళు కొంచెం వివరం బోధపడినట్టు దేవసేన వైపుకి తిరిగి ‘నువ్వేనా దేవసేన అంటే’అని ప్రశ్నించారు. అలా వాళ్ళు తనని బొడ్డుకోసి పేరు పెట్టినట్టు అడగడం నచ్చలేదు దేవసేనకు. అయినా పోలీసులతో మనకెందుకు అని తల ఊపి వూరుకున్నది. వచ్చిన వాళ్ళు టెంకాయ నీళ్లు తాగి తెరిపిన పడ్డాక నిదానంగా మాధురి పెట్టిన కేసు వివరం చెప్పి.. తల్లీ కోడుకులిద్దరూ ఇప్పుడు తమతో రావాల్సి ఉంటుందని అన్నారు. ఆ మాట విని దేవసేన దడుచుకుని ఏడవడం మొదలుపెట్టింది.సుధీర్కి నెమ్మదిగా బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. వచ్చిన కానిస్టేబుళ్ళతో చాలా దీనంగా తన తల్లిని వదిలేయమని, తాను వాళ్ళతో వస్తానని, వాళ్ళేం చేయమంటే అది చేస్తానని అన్నాడు. వచ్చిన కానిస్టేబుళ్లలో ఒకావిడకి సుధీర్ని చూసి మనసు కరిగిపోయింది. తోటి కానిస్టేబుల్ని పక్కకి తీసుకుని వెళ్లి ‘సరేలే ఈ పిల్లాడు ముఖ్యం కదా మనకి, ఆవిడ కథ తరవాత చూద్దాంలే! ఎక్కడికి పోతుంది!’ అని చెప్పింది. అలా వాళ్ళు సుధీర్ని వున్నపళంగా తీసుకెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘తెలిసిన వాళ్ళని పిలిచి సహాయం తీసుకో అమ్మ, రేపో మాపో మేము కాకపోతే ఇంకో పోలీసులు నీ కోసం వస్తారు. ఏం చేద్దాం పాపం చెట్టంత కొడుకుకి కష్టం వచ్చింది. చూస్తే బిడ్డ మంచివాడిలా వున్నాడు’ అని మరో నీళ్ల టెంకాయ తాగి, దేవసేన ఇచ్చిన కవర్లనిండా జామకాయలు కోసుకుని వెళ్లిపోయారు.సినిమాలు చాలా తక్కువ చూసే సుధీర్కి పోలీసులు పట్టుకెళుతున్నపుడు జైలు ఎలా ఉంటుందో అనే ఆలోచన చప్పున మనసులోకి వచ్చింది. జైలు జీవితాన్ని చూపించిన సినిమా తాను ఒక్కటి కూడా చూడలేదని అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. భద్రంగా, తల్లిచాటు బిడ్డగా పెరిగిన అతనికి జైలులో వున్న కొన్ని నెలలలో డిప్రెషన్ తారస్థాయికి చేరుకున్నది. పడుకున్నా లేచినా మాధురిని తాను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అతనికి జ్ఞాపకం వస్తూ ఉండేది. తన ఛాతీ మీద పడుకుని ‘ఇక్కడ తల పెట్టుకుని పడుకుని చచ్చిపోతే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు’ అన్న ఆమె మాటలు జ్ఞాపకం వచ్చేవి. తనని ఒకరోజు సాయంత్రం స్నానాల గదిలో వున్నప్పుడు బయట నుండి మాధురి గడియ పెట్టెయ్యడం జ్ఞాపకం వచ్చేది. ఆ రోజు తాను తలుపు కొట్టి, కొట్టి అలిసిపోయి ఒక లక్ష దోమలు తన మీద దాడి చేసి రక్తం పీక్కుతినేయడం జ్ఞాపకం వచ్చేది. ఎందుకలా చేశావని అడిగితే మాధురి చాలా అనాయాసంగా తమాషాకి గడి పెట్టానని, స్నేహితురాలితో మాట్లాడుతూ ఆ విషయం మరచిపోయానని చెప్పడం జ్ఞాపకం వచ్చేది. తను కొట్టే వాడో తిట్టే వాడో అయితే ఆ రోజు మాధురిని ఏదో ఒకటి అనేవాడు కదా? తనసలు నోరు తెరిచి ఒకమాట అనలేదు. మాధురికి ఇవన్నీ గుర్తు లేవా? తన తల్లి ఆస్తి అడిగిందే అనుకో దాన్ని తన పేరు మీదే కదా రాయమంది. రాస్తే ఏంపోయింది? తానే మాధురి సొంతం కదా? ఇంత చిన్న విషయం ఆమెకెందుకు అర్థం కాలేదు?.. ఇలా సుధీర్ ఆలోచనలు సాగిపోయేవి. ఏవేవో తలచుకుని, ఏవేవో గుర్తొచ్చి అతనికి ధారాపాతంగా కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉండేవి. మొదట అతని శరీరం చూసి భయపడ్డ జైలు సహచరులు అతని కళ్ళ నీళ్లు చూసి అతనికి ఆత్మీయులయ్యారు. అలా అనువుగాని చోట కూడా సుధీరన్న బోలెడు స్నేహితులను మూటకట్టుకున్నాడు కానీ, ఏడడుగులు నడిచి గుండెల మీద పడుకోబెట్టుకున్న భార్యకి మాత్రం అతను ఆత్మీయుడు, నమ్మకస్థుడు కాలేకపోయాడు. సుధీరన్న జీవితమనే బుల్లెట్టు బండి అక్కడ సడన్ బ్రేక్ వేసి లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఆయన జైలు నుండి బయటకి వచ్చినా ఆయన జీవితం విషాదమనే కాలబిలం నుండి బయటకు రాలేదు. మొదటి నుండి తండ్రిలేని బిడ్డగా బాగా బతికి చెడిన తల్లి కొడుకుగా అతని చుట్టూ విషాదం గూడు కట్టుకుని ఉండేది. దానిని మోసుకుంటూ ఆయన జీవితాన్ని లాక్కొచ్చేవాడు. నిజానికి తాను ఒక విషాద వలయంలో బతుకుతున్నానని అతనికి గుర్తింపు కూడా లేదు. చాలా ఉత్సాహంగా ఉరుకులు పెట్టే పదేళ్ల అబ్బాయి, తండ్రి అదృశ్యం తరువాత ఎందుకు ముభావం అయిపోయాడో తనలోకి తాను తరచి చూసుకునే శక్తి, జ్ఞానము అతనికి లేకపోయింది. అలా అతను మోసుకుంటూ, పెంచి పెద్దచేసుకుంటూ వచ్చిన విషాదం ఈసారి మాధురి ఘట్టంతో అతనిని పూర్తిగా లోబరుచుకుంది. సుధీరన్న అప్పుడు మొదలుపెట్టాడు తాగడం. మొదట బాధ మరచిపోవడానికి తాగేవాడు. ఆ తరువాత తాగకుండా ఉండలేక తాగేవాడు.కాలక్రమంలో అతనికి విడాకులు వచ్చాయి. మాధురి పిల్లని కూడా అతను చూడకుండా జీవితాన్ని కట్టుదిట్టం చేసుకుంది. తన కొడుకు జీవితం తన కళ్ళ ముందే చిందరవందరగా మారడం చూసిన దేవసేన వైరాగ్యం పేరుతో సుధీర్ని ఒంటరిగా వదిలేసి ఎప్పటిలాగే తన స్వార్థం తాను చూసుకుని పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో చేరిపోయింది.మరి విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తరువాత ఏం జరిగిందని సుధీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఎవరూ చెప్పలేక పోయారు.సుధీరన్న చనిపోవడానికి కొంతకాలం ముందు కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలని కొడుకు దగ్గరకి వచ్చిందట దేవసేన. తల్లి వచ్చినప్పటి నుండి కనిపించిన బంధువులకి ‘మా అమ్మ నస భరించలేకుండా ఉండాన’ని చెప్పుకునేవాడట. మళ్ళీ తనే ‘మా అమ్మ నన్ను సాకినట్టు ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డను సాకి ఉండదు’ అనే వాడట. ఏమయిందో ఎవరికీ తెలీదు, ఏం జరిగిందో దేవసేన ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు తల్లి పక్కగదిలో ఉండగానే తల్లికి అన్నము, కూర అన్నీ వండి గిన్నెలో వేసి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్లి వురి వేసుకున్నాడు. దగ్గరి బంధువుతో అంతకు కొన్నిరోజుల ముందు ‘మావా, సస్తే పోతది అనిపిస్తా వుంది. నావల్ల ఎవరికేమి ప్రయోజనం? సస్తే నాకన్నా శాంతి దొరకతది కదా?’ అన్నాడట. ఆ మాటలు విని బంధువు ‘అబ్బయ్య! బలవంతంగా సస్తే నరకానికి పోతామంట. అక్కడ కూడా నీకు మనశ్శాంతి దొరకదు’ అన్నాడట. ఆ మాట విని ‘అంతేనంటావా? అయితే సరేలే!’ అన్నాడట.శవం దగ్గర పొర్లి పొర్లి ఏడుస్తున్న దేవసేనను చూసి ఎవరూ జాలిపడలేదు.మొదటి నుండి దేవసేన తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేదని అందరూ చెప్పుకున్నారు. బిడ్డ.. తల్లి మాట జవదాటేవాడు కాదని, అందుకే అతని జీవితం ఇట్లా నాశనమైందని అనుకున్నారు. పెళ్లయిన తరువాత భార్యాభర్తల మధ్యకి ఎవరూ పోగూడదని, ఈ దేవసేన.. సుధీర్ కాపురంలో చొరబడి నిప్పులు పోసిందని వచ్చిన వాళ్లలో విజ్ఞులు అన్నారు. కానీ శవానికి ఒకవైపు నిలబడి చేతులు కట్టుకుని ఇదంతా వింటున్న సుధీర్ స్నేహితుడు మాత్రం ‘ఏదంటే అది మాట్లాడబాకండి.. వాడికి అమ్మంటే ప్రాణం. ఇప్పుడు లేపి అడిగినా మా అమ్మ దేవత అంటాడు’ అన్నాడు.చంద్రుడిని చూస్తుంటే సుధీరన్న ఎందుకు జ్ఞాపకం వచ్చాడో చెప్పాలి. మేము చిన్న పిల్లలుగా వున్నప్పటి సంగతి.. ఒక రోజు అందరం వెన్నెట్లో ఆటలాడుతూ వున్నాం సుధీరన్న హఠాత్తుగా ఆకాశంలోకి చూసి పక్కనున్న నాతో ‘బుజ్జమ్మ! ఆ చంద్రుడు, దాని పక్కనే వున్న ఆ చుక్కను చూశావా.. వాటిని చూస్తే నాకు మా అమ్మ, నాయన అనిపిస్తారు. చంద్రుడేమో మా అమ్మ. ఆ చుక్కేమో మా నాన్న. మా అమ్మని వదిలేసి నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎలా వెళిపోతున్నాడో చూడు మా నాయన, అందుకే అలా మసక మసకగా వున్నాడు’ అన్నాడు. -
యువ కథ: అడవి
వసంతం తెచ్చిన చివురులతో అడవిలోని చెట్లు రకరకాల వర్ణాలతో పురుడు పోసుకుని వున్నాయి. పూలు పరిమళాలతో తేనెలూరుతూ వున్నాయి. ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ వున్న మేఘనా«థుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞపకాలను మోసుకొనిపోతూ వున్నాడు. ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంత వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ వుంది. అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది. ఇంతలో బాగా ఆకలిగా వున్న ఓ పెద్దపులి వేట కోసం వెదుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది. పులి అలికిడి విన్న ఆవు పులి కళ్లలోని ఆకలిని చూసి వెనువెంటనే ‘ఆగు పులిరాజా ఆగు.. ఒక్కమారు నా మాట ఆలకించు’ అంది. ‘నీ మాటలు ఆలకించే స్థితిలో లేను. ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను’ అంటూ పులి తన పంజా విసిరింది. పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు ‘అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది. ‘ఏమిటా కోరిక?’ ‘ఓ పులిరాజా.. నాకు ఓ యజమాని ఉన్నాడు. అతడు లోకం తెలియని వట్టి అమాయకుడు. కడు బీదవాడు. అతనికి నేనే జీవనాధారం. ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని యెడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు. కావున నేను ఇంటికి వెళ్లి నా యజమానికి ౖధైర్యం చెప్పి మరోవిధంగా జీవనాన్ని వెతుక్కోమని చెప్పి తిరిగి వస్తాను.’ ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ‘నేనేమన్నా వెర్రిదాన్ననుకున్నావా.. నీ కల్లబొల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి?’ అంది. ‘అయ్యో రాజా.. ఇవి మాటలు కావు.. పరమ సత్యాలు. పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికి రాని కడలి వంటిది. నీ ఆకలిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే. కాని ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత’ అంది.ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి ‘శిశిరం చేసిన గాయాలకు ఓర్చి వసంతం కోసం ఎదురు చూసే వనంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళి త్వరగా తిరిగి రా’ అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలు చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది.ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ వున్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూవున్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆవు అడవిలో జరిగినదంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా వుంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి ‘నువ్వు వెళ్ళి రా నీకు ఏమీ కాదు!’ అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు. ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది.ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ వున్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి ‘నీకేమన్నా మతిగాని పోయిందా? ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా సావడానికి! అసలే దానికి పుట్టిన లేగదూడ సచ్చిపోయె. ఇపుడు దాని పాలే మనకు జీవనాధారం’ అంటూ భర్తను కోప్పడింది. ‘ఓసి పిచ్చిదానా! నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా? వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఓ ఆవు ఉండేది. అయితే దానికి లేగదూడ కూడా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది. అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని, అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమిలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. అయితే వేళకాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసిన మా తాత ‘ఏమయి ఉంటుందా?’ అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు. అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనవరాలుకు జరుగుతుంది. అదే తిరిగి వచ్చేస్తుందిలే’ అంటూ నులక తాడు పేనే పనిలో నిమగ్నమయ్యాడు. యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకుని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ వుంది ఆవు. ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంలో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది. ‘ఓ అందగాడా.. నడిజాములో ఆ దివి నుండి ఈ భువిపై దిగిన జాబిల్లిలా ఉన్నావు. నన్ను ప్రేమించవూ?!’ అంటూ పలికింది. కోయిల మాటలు విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది.కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ వుంది. అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి. అప్పుడే ఓ నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళ్తూ వుండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి అ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకుని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామరలను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ వుండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకులుగా ఆవు పై పడుతూ వుండగా ‘నింగీ నేలా సాక్షి.. నన్ను ప్రేమించవూ?!’ అంది కోయిల. ఆవు మారుమాటలాడక కోయిల వంక కనురెప్పయినా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది. కోయిల ఎగరటం మరచి ఆవుతోపాటు పక్కనే నడుస్తూ వుంది. ఆ అడవిలో అవి రెండూ వేటికవే ఆలోచనల ప్రవాహంలో ఒంటరిగా సాగిపోతూ వున్నాయి. ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ వుంది. దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ వున్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ వుంది. అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదలిపోతూ వున్న యేటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ ‘అలలనేం చూస్తావోయీ.. అలల మాటున దాగిన మనసు ఊసును చూడు. ఆకాశమంతా చినుకయి పోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు. నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవూ!?’ అంది కోయిల.సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో వున్నాడు. ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టు పై వాలి చుట్టూ చూస్తూ ఉంది. కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ వున్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ‘ఏమయి ఉంటుంది?!’ అని ఆవు కోయిలకు తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది.రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ వున్నాయి ఆవూ కోయిలా. చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి ‘నేను నల్లగా వున్నాననా నన్ను ప్రేమించడంలేదు!?’అంది.‘లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం. తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను. తిరిగి రాలేను. నీవు అందమైన దానవు. కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు. ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు’ అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి, కోయిల నుండి సెలవు తీసుకుని ఒంటరిగా ముందుకు పయనమైంది. కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చెట్టు పై నుండి గమనిస్తూ వున్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగౌతూ వున్న ఆవును చూస్తూ ‘ప్రేమ అందంగా ఉంటుంది కదూ’ అంటూ పలికింది. కోయిల చిలుక వైపు చూసి ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాని ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది’ అంది. తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు, మోహించే కోరికలను దాటుకుని ఆవు.. పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ వుంది. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకుని ముందుకు పరుగులు తీయసాగాయి. ఆవు వెళ్ళే దారిలో అడవి అంతా అలజడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తూ, ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ వున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చగానూ దట్టమైన పొగతోనూ నిండి ఉంది. ఏమి జరుగుతున్నదో ఆవుకు ఏమీ అర్థం కాలేదు. అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకొస్తూ వున్న అగ్నిని చూపుతూ ‘తప్పించుకొని పారిపోండి... తప్పించుకొని పారిపోండి’ అంటూ అరుస్తూ ఉన్నాయి.సరిగ్గా ఆ సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది. పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది. ‘పులిరాజా! ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో’ అంది ఆవు.‘ఇచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది. మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు’ చెప్పింది పులి. అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి. పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసిన ఆవు ‘రాజా ఏమిటిది? ఎవరు చేశారు ఇదంతా?’ అడిగింది.‘మిత్రమా.. మనిషి! మనిషి చేశాడిదంతా! ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట. అందుకే అగ్గి రాజేశాడు. ఈ అందమైన అడవి.. మన అడవి... ఆకలికి తప్ప అత్యాశకు చోటులేని అడవి.. ప్రేమను కోరే అడవి.. పరవశాల అడవి.. ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చుగాని పెత్తనం ఉంటుందా? అడవికి రాజైనా నేను పెత్తనం చేయనే! ఈ మనిషెంత పతనశీలి? మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పు పెట్టాడు. త్వరపడు మిత్రమా త్వరపడు! ఇక్కడి నుండి బయటపడు’ అంటూ ఆవును త్వరపెడుతూ చుట్టూతా చూసింది పులి.మంటలు కమ్ముకున్నాయి. ‘అయ్యో.. మంటలు మనల్ని చుట్టుముట్టాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. క్షమించు మిత్రమా.. నీ దుస్థితికి కారణం అయినందుకు!’ అంటూ ఆవుని క్షమాపణలు కోరింది పులి. తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి ‘నీలాంటి మంచి మిత్రుడిని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది’ అంది ఆవు పులితో. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది!’ అంది పులి ఆవుతో. మనిషి రాజేసిన అగ్ని అడవిని, అడవిలోని జంతువులతోపాటు ఆ ఇరువురినీ బూడిద చేసింది.ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి వున్న నల్లని పొగ మాటున చావు దుప్పటి కప్పుకుని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు. -
ధౌమ్యుడు అతడి శిష్యులు
ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరుణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ముగ్గురూ చాలా తెలివైన వారు. అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులలో ఆరుణిని పిలిచాడు. ‘మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి, వరిచేనును ముంచేస్తోంది. నువ్వు వెళ్లి, ఆ కాలువకు అడ్డుకట్ట వేసి రా’ అని ఆజ్ఞాపించాడు. ఆరుణి పొలానికి వెళ్లి, గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెచ్చి, గట్టుకు అడ్డుగా వేశాడు. అయినా అది నిలువలేదు. ఇక ఏం చేయాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రి అయినా ఆరుణి ఆశ్రమానికి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. పొలంలో వెదుకుంతుండగా, కాలువ గట్టుకు అడ్డంగా పడుకుని ఉన్న ఆరుణి కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, ‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుడిని పిలిచి, ‘పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజూ ఆవులను మేపి వస్తూండు’ అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు.ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ, చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని చేస్తున్నా ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ‘ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చుని తింటున్నా నేను నీ అంత పుష్టిగా లేను సుమా’ అన్నాడు.‘ఆచార్యా! నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజూ ఎన్నో వంటకాలు దొరుకుతుంటాయి. వాటిని ఆరగిస్తుండటం వల్లనే పుష్టిగా ఉన్నాను’ అని చెప్పాడు ఉపమన్యుడు.‘అలాగైతే, నువ్వు రోజూ సంపాదించే భిక్షను తీసుకొచ్చి నాకు ఇస్తూండు’ ఆదేశించాడు ధౌమ్యుడు.ఉపమన్యుడు ప్రతిరోజూ తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా, ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగా ఉండేవాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు, ‘నువ్వు తెచ్చినదంతా నాకే ఇచ్చేస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు. అదెలా సాధ్యమవుతోంది?’ అని అడిగాడు. ‘ఆచార్యా! పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు ఇచ్చి, రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను’ బదులిచ్చాడు ఉపమన్యుడు. ‘ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే ఇస్తూండు’ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచినా, ఉపమన్యుడు యథాప్రకారమే కనిపించసాగాడు. ‘రెండు పూటల భిక్ష నాకే తెచ్చి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు?’ అడిగాడు ధౌమ్యుడు.‘ఆవుల పాలు తాగుతున్నాను ఆచార్యా!’ అని బదులిచ్చాడు ఉపమన్యుడు.‘పాలు లేక లేగదూడలు బక్కచిక్కిపోతున్నాయి. ఇకపై నువ్వు ఆవుపాలు తాగడం మనుకో’ ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవుపాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచేకొద్ది కృశించసాగాడు.ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని, జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకు వస్తుండగా, దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవులు అలవాటు కొద్ది ఆశ్రమానికి చేరుకున్నాయి గాని, వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు.రాత్రి ఎంతసేపటికీ ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెదుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక, బావిలోంచి ఆర్తనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్లి చూడగా, ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి, ఆశ్వనీ దేవతల మంత్రం ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలనూ నేర్పించి, తనంతటి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో మూడోవాడైన బైదుడికి కూడా ఇలాగే కఠిన పరీక్షలు పెట్టి, వాటిని నెగ్గిన తర్వాత అతడికి కూడా అన్ని విద్యలనూ ఉపదేశించాడు.‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. ∙సాంఖ్యాయన -
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్లోని బికనీర్లో జరిగే కేమెల్ ఫెస్టివల్కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
Mystery: నేరాన్ని దాచే నేరం!
అది అమెరికా, మిషిగన్ రాష్ట్రంలోని సీడర్ స్ప్రింగ్స్ ప్రాంతం. 1996 ఆగస్ట్ 7, అర్ధరాత్రి 12 దాటింది. రేచల్ టిమెర్మన్ (18) అనే అమ్మాయి, మార్విన్ గేబ్రియల్ (43) అనే ఫ్యామిలీ ఫ్రెండ్ కారులో బర్త్డే పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ కారులో మరో ఇద్దరు సుపరిచితులున్నారు. అయితే మార్విన్ ఉన్నట్టుండి కారు ఆపి, మిగిలిన ఇద్దరితో గొడవపడి, కారు దింపేశాడు. రేచల్ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తీవ్రంగా హింసించి, అత్యాచారం చేశాడు. ‘ఎవరికైనా చెబితే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని ఆమెను బెదిరించి వదిలిపెట్టాడు. రేచల్కి రెండేళ్ల షానన్ అనే కూతురుంది. ఓ రెస్టరెంట్లో పని చేసుకుంటూ, తల్లిదండ్రులైన వెల్డా, టిమ్లకు సమీపంలోనే నివాసముండేది. టిమ్ దంపతులకు తమ కూతురు, మనవరాలంటే ప్రాణం.మార్విన్ చేసిన పనికి రేచల్ మానసికంగా కుంగిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంది. తెలిసినవారిని చూసినా భయపడేది. కొన్ని వారాలు గడిచాయి. ఆమె తీరు గమనించి ఆరా తీస్తూ వస్తున్న తల్లి వెల్డాకు– ఒకరోజు తట్టుకోలేక ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది రేచల్. వెంటనే వెల్డా ధైర్యం చెప్పింది. టిమ్ను తోడుగా పంపించి, రేచల్తో మార్విన్ పై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించింది. వెంటనే పోలీసులు మార్విన్ ను అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. తిరిగి రేచల్ను మామూలు మనిషిని చేయడానికి టిమ్, వెల్డాలు తీవ్రంగా శ్రమించారు. ‘వాడికి శిక్షపడేలా చేద్దాం. నువ్వు భయపడొద్దు. మనుషులంతా ఒకేలా ఉండరు’ అని ధైర్యం చెబుతూ, సాధారణ జీవితానికి అలవాటు చేశారు.అయితే, విచారణ తేదీ వచ్చిన ప్రతిసారీ మార్విన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని భయపడేది. సుమారు ఆరు నెలల విచారణ తర్వాత మార్విన్ ను జైలుకు పంపారు. తర్వాత రెండు వారాలకే బెయిల్పై బయటికి వచ్చిన మార్విన్ – ‘కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని రేచల్ను బెదిరించాడు. అయినా భయపడొద్దని టిమ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. మరో ఐదు నెలలు గడిచేసరికి రేచల్ పూర్తిగా మామూలు మనిషయింది. ఒకరోజు సంబరంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నాతో డేటింగ్కి ఇష్టపడుతున్నాడు. నా కూతురు షానన్ ని కూడా నాతోనే తీసుకుని రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అని కూతుర్ని తీసుకుని వెళ్లింది.మరుసటి రోజు రేచల్ నుంచి టిమ్కు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘నేను సెలవుపై వెళ్తున్నాను’ అని రాసింది. కొన్ని రోజుల ముందే కొత్త ఉద్యోగంలో చేరిన రేచల్ సెలవు పెట్టడం ఏంటనే అనుమానంతో పాటు మార్విన్ కోర్టు వాయిదా దగ్గర పడుతుండటంతో టిమ్కు భయం మొదలైంది. వాయిదా రోజుకు కూడా రేచల్ రాలేదు. షానన్ ఏమైందో తెలియలేదు. వాయిదా రోజున రేచల్ రాకపోయేసరికి మరో 11 రోజులకు కేసు వాయిదాపడింది. ఆ 11 రోజులు గడిచాక, వాయిదా నాటికి రేచల్ నుంచి మరో లేఖ కోర్టుకు వచ్చింది. ‘నా అంతట నేనే మార్విన్ తో సంబంధాన్ని కోరుకున్నాను. అతడు నిరాకరించేసరికి ఆ కోపంతోనే అతడిపై అత్యాచారం కేసు పెట్టాను’ అని అందులో రాసింది. దాంతో టిమ్తో పాటు అధికారులకు రేచల్ కిడ్నాప్ అయ్యి ఉంటుందనే అనుమానం మొదలైంది. దాంతో ఆమె కోసం గాలింపు మొదలైంది. సరిగ్గా రెండు వారాలకు సమీపంలోనే ఆక్స్ఫర్డ్ సరస్సులో రేచల్ శవమై తేలింది. నోటికి, కళ్లకు పెద్దపెద్ద ప్లాస్టర్స్ చుట్టి, చేతులు, కాళ్లకు రెండు సిమెంట్ దిమ్మలు కట్టి సరస్సులో ముంచేశారు. అంటే ఆ లేఖలు బలవంతంగా రాయించారని అధికారులు నమ్మారు. వెంటనే మార్విన్ ఇంటిని తనిఖీ చేయగా పసిపిల్లల పాలసీసా దొరికింది. అది షానన్ ది కావచ్చని నమ్మారు. పైగా రేచల్ కాళ్లు, చేతులకు కట్టిన సిమెంట్ దిమ్మల్లాంటి దిమ్మలు మార్విన్ ఇంటి ముందున్నాయి. అయితే, అప్పటికే మార్విన్ తప్పించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మార్విన్, షానన్ తో పాటుగా మరో ఇద్దరు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. మొదటి వ్యక్తి వేన్ డేవిస్. అతడు మార్విన్ స్నేహితుడు. అలాగే రేచల్పై అత్యాచారం జరిగిన రాత్రి కారులో ఉన్న ఇద్దరిలో ఒకడైన రెండవ వ్యక్తి జాన్ వీక్స్. అతడు మార్విన్కు పరిచయస్థుడు, రేచల్కు స్నేహితుడు. ఆమెను డేట్కి పిలిచింది అతడేనని తర్వాత విచారణలో తేలింది. రేచల్ అతడ్ని నమ్మే షానన్ తో పాటు అతడితో వెళ్లిందట! వీళ్లందరినీ మార్విన్నే మాయం చేసి ఉంటాడనే క్లారిటీకి వచ్చారు పోలీసులు.కొన్ని నెలలకు న్యూయార్క్ పోలీసులు– రాబర్ట్ అలెన్ అని చెప్పుకుని తిరిగే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాబర్ట్ అలెన్ అనే వ్యక్తి అప్పటికే కనిపించడం లేదని అతడి ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చిందట! అయితే అతడి కార్డ్స్ అన్నీ వాడుకలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు రాబర్ట్ కోసం నిఘా పెట్టారు. చివరికి న్యూయార్క్లో పట్టుకున్నారు. అయితే, అతడు రాబర్ట్ అలెన్ పేరుతో చలామణీ అవుతున్న మార్విన్ అని గుర్తించి, పోలీసులు షాక్ అయ్యారు. ‘రాబర్ట్ ఎక్కడ?’ అని మార్విన్ ని నిలదీస్తే తెలియదన్నాడు. ఇక అరెస్ట్ చేసి, తీసుకొచ్చి రాబర్ట్ మిస్సింగ్ కేసుతో పాటు రేచల్ మర్డర్ కేసులో కూడా మార్విన్ ను విచారించడం మొదలుపెట్టారు. రేచల్ హత్యకు తనకు సంబంధం లేదని మార్విన్ వాదించాడు. రాబర్ట్ మిస్సింగ్ కేసులో కొన్ని కీలక ఆధారాలతో కేసు బిగుసుకుంది. మార్విన్ కు మరణశిక్ష పడింది. తర్వాత మార్విన్ అప్పీలు చేసుకోవడంతో మరణశిక్ష రద్దయి, విచారణ మళ్లీ మొదలైంది. ఆ క్రమంలోనే మార్విన్ తన పక్క ఖైదీకి ఆక్స్ఫర్డ్ సరస్సు మ్యాప్ ఇవ్వగా దానిపై ఒక క్లూ ఉంది. ‘3+ 1, ఒక మృతదేహం దొరికింది’ అని రాసుకున్నాడు మార్విన్ . అతడి దృష్టిలో 3 అంటే పాప షానన్, జాన్ వీక్స్, వేన్ డేవిస్ కాగా, 1 అంటే రేచల్ కావచ్చు అని అధికారులు అంచనా వేశారు. సరిగ్గా రేచల్ మృతదేహం దొరికిన ఐదేళ్లకు అదే సరస్సులో వేన్ డేవిస్ మృతదేహం దొరికింది. రేచల్ చనిపోయినట్లే డేవిస్ కూడా చనిపోయాడని రిపోర్ట్స్ తేల్చాయి. డేవిస్ని కూడా రేచల్ను కట్టినట్లే సిమెంట్ దిమ్మలతో కట్టి, కళ్లకు, నోటికి ప్లాస్టర్స్ వేసి సరస్సులో పడేశారు. మరోవైపు మార్విన్ తన తోటి ఖైదీలతో బిడ్డ (షానన్ )ను ఎక్కడ దాచాలో తెలియక చంపేశాను’ అని చెప్పాడట! అయితే, ఈ కేసులో మిస్ అయిన పాప షానన్, జాన్ వీక్స్, రాబర్ట్ అలెన్ వీరంతా ఏమయ్యారో తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్లతో ఇంద్రజిత్కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్దేవ్పల్లికి చెందిన షేక్ షబ్బీర్కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్దేవ్పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
సెంచరీకి చేరువలో సైన్స్ ప్రయోగం
సైన్స్ ప్రయోగం ఒకటి ఒకసారి విఫలమైతే రెండోసారి చేస్తారు. అది విఫలమైతే మరోసారి.. ఇలా ఎన్నోసార్లు ఎన్నో పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కాని, ఒకే ప్రయోగాన్ని దాదాపు వందేళ్లుగా చేయటాన్ని చూశారా? ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో, ప్రొఫెసర్ థామస్ పార్నెల్ 1927లో ప్రారంభించిన ‘పిచ్ డ్రాప్’ ప్రయోగం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇటీవల దీనిని ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా సాగుతున్న ప్రయోగశాల ప్రయోగంగా గిన్నిస్ బుక్లో చేర్చారు. ప్రొఫెసర్ పార్నెల్, విద్యార్థులకు ఘనపదార్థాలుగా కనిపించేవన్నీ, నిజానికి ఘన పదార్థాలు కావని నిరూపించడానికి ఈ ప్రయోగాన్ని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం, పడవల్లో సీల్ చేయడానికి ఉపయోగించే మందపాటి తారు ద్రవాన్ని ఎంచుకున్నాడు. ముందుగా తారు పదార్థాన్ని వేడి చేసి, ఒక గాజు గరాటులో పోసి, సుమారు మూడు సంవత్సరాలపాటు అలాగే ఉంచాడు. గరాటులో ఆ ద్రవం ఘన స్థితికి వచ్చిన తర్వాత, 1930లో, గరాటు కింద గొట్టాన్ని కత్తిరించాడు. అప్పటి నుంచి పిచ్ పదార్థం దశాబ్దానికి ఒక చుక్క కిందకు పడుతోంది. ఇప్పటివరకు, ప్రయోగం ప్రారంభించిన ఇన్నేళ్లలోనూ కేవలం తొమ్మిది చుక్కలే కిందకు పడ్డాయి. చివరిగా ఏప్రిల్ 2014లో పడింది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ప్రకారం, ఈ ప్రయోగం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఏర్పాటు చేశారు. తారును ఉంచడానికి నిర్దిష్ట పరిస్థితులేవీ లేవు. వేర్వేరు సమయాల్లో వచ్చే ఉష్ణోగ్రత మార్పులే దీనిని ప్రభావితం చేస్తూన్నాయని కొంతమంది వాదన. ప్రస్తుతం మళ్లీ మరో దశాబ్దం ముగుస్తుండటంతో ఈ ప్రయోగంపై మరోసారి ఆసక్తి చెలరేగింది. చూడాలి మరి మరో చుక్క గరాటు నుంచి కిందకు ఎప్పుడు పడుతుందో! -
Mystery: రక్తబంధం
‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను. బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్కి తెలియదు. ప్రస్తుతం చెట్కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది! ∙సంహిత నిమ్మన -
స్టయిలింగ్ క్వీన్ మాలినీ కార్తికేయన్
సినిమా కథల్లోని పాత్రలకు జీవం పోసేది నటీనటులే! అయితే ఆహార్యం, తీరుతెన్నులతో ఆ ప్రాతకు ఒక గ్రామర్, గ్లామర్ను క్రియేట్ చేసి, నటీనటుల పనిని తేలిక చేసేది మాత్రం స్టయిలిస్ట్లే! అలా తెర వెనుక ఆ పాత్రను అద్భుతంగా పోషిస్తున్న స్టయిలిస్ట్.. మాలినీ కార్తికేయన్.మాలినీ కార్తికేయన్కు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పుడు తనే సినిమా చూసినా.. అందులోని క్యారెక్టర్స్ని ఫలానా పాత్ర ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు.. అంటూ విశ్లేషించేది. ఆ అలవాటే ఆమెకు ఫ్యాషన్పై మక్కువ కలిగేలా చేసింది. 2018లో ఎన్ఐఎఫ్టీ చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ఫ్యాషన్ డిజైనర్ ఏకా లఖానీ దగ్గర అసిస్టెంట్గా చేరింది. మొదట ‘చెక్క చీవంద వానం’ సినిమాకు పనిచేసింది. కాని టైటిల్ కార్డ్ పడింది మాత్రం ‘వానం కొండాడట్టుం’ చిత్రంతో! నటీనటులను అందంగా తీర్చిదిద్దే మాలిని నైపుణ్యాన్ని మెచ్చిన సినీ ఇండస్ట్రీ అనతికాలంలోనే ఆమె చేతినిండా ప్రాజెక్ట్స్ను పెట్టింది. ‘ఆదిత్య వర్మ’, ‘99 సాంగ్స్’, ‘డిమోంటి కాలని 2’ సినిమాలకు, ‘క్వీన్’, ‘జెస్టినేషన్ అన్నోన్’ సిరీస్లకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కావటమే కాదు, అతిచిన్న వయసులోనే పెద్దపెద్ద స్టార్స్తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. అదే ‘పొన్నియిన్ సెల్వన్ ’ సినిమా. దానికి ఆమె వార్డ్రోబ్ సూపర్వైజర్గా పనిచేసింది. ఆ సినిమా సెట్స్ మీదున్నప్పుడే కరోనా వ్యాపించింది. సంప్రదింపులు, నటీనటుల లుక్ టెస్ట్లు.. ఇలా ప్రతిదీ జూమ్లోనే! తన అసైన్మెంట్స్ అన్నిటినీ అలాగే షెడ్యూల్ చేసుకుంది మాలిని. కావలసిన కాస్ట్యూమ్స్ని కొరియర్ చేసింది. షూటింగ్ స్పాట్లోకి కొంతమందినే అనుమతించడంతో ఆ పనిభారాన్నీ మోసింది. అయితే దాన్నో కష్టంగా కాక.. ఒక అనుభవ జ్ఞానంగా మలచుకున్నానంటుంది మాలిని. ఆ సినిమాకు పనిచేయడం వల్లే ఆమెకు త్రిష, శోభితా ధూళిపాళకు స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. అంతేకాదు రమ్యకృష్ణ, ఐశ్వర్యా అర్జున్, ప్రియా భవానీ శంకర్ లాంటి సెలబ్రిటీలు కూడా ఆమెను స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకునే స్థాయికి వెళ్లింది. విజయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, సిద్ధార్థ్ వంటి మేల్ సెలబ్రిటీ స్ కూడా మాలిని స్టయిలింగ్లో మ్యాన్లీ లుక్తో అభిమానులను అలరించారు. ‘లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. వేసుకున్న కాస్ట్యూమ్స్ కంఫర్ట్గా ఉంటేనే అందం.. ఆత్మవిశ్వాసం! – మాలినీ కార్తికేయన్. -
బభ్రువాహన ప్రేత సంవాదం
పూర్వకాలం బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. మహోదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని, అతడు జనరంజక పాలన కొనసాగించేవాడు. ఒకనాడు ఆయన పరివారంతో కలసి వేట కోసం కీకారణ్యానికి వెళ్లాడు. అడవిలో ఒక లేడి కనిపించింది. బభ్రువాహనుడు ఆ లేడిని వేటాడాలనుకుని, దానిపై బాణం వేశాడు. అది బాణం నుంచి తప్పించుకుని, పరుగు తీసింది. దాన్ని ఎలాగైనా వేటాడి తీరాలనుకుని, బభ్రువాహనుడు ఆ లేడిని వెంటాడుతూ, తన పరివారానికి దూరంగా సాగిపోయి, ప్రేతాలు సంచరించే తావుకు చేరుకున్నాడు.అదే సమయానికి అక్కడ ఉండే ఒక ప్రేతం బభ్రువాహనుడి ముందు ప్రత్యక్షమైంది.‘మహారాజా! చాలా ఏళ్లుగా నేను ప్రేతరూపంలో ఉన్నాను. ఇన్నాళ్లకు రాజువైన నిన్ను చూడటంతో నా పాపాన్ని కొంత పోగొట్టుకున్నాను. నేను మరణించాక, నాకు ఉత్తరక్రియలు జరిపేవారు ఎవరూ లేక నేనిలా ప్రేతంగా మారాను. నువ్వు రాజువు. రాజు అంటే ప్రజలను రంజింపజేసేవాడు. కాబట్టి, నువ్వు నగరానికి వెళ్లిన తర్వాత నాకు ఉత్తరక్రియలు జరిపించు. బాగా బతికిన వాణ్ణి. అనాథలా ఇతరుల సొమ్ముతో ఉత్తరక్రియలు జరిపించుకోలేను. నా దగ్గర ఒక అతిలోకమణి ఉంది. ఇదిగో! ఆ మణి. దీనిని తీసుకో! ఇది చాలా విలువైనది. ఖర్చు నిమిత్తం ఇచ్చాననుకున్నా సరే, లేదా ఈ మణికి నువ్వు వారసుడివి అనుకున్నా సరే, నాకు అభ్యంతరం లేదు. ఇది తీసుకుని, నాకు ఉత్తరక్రియలు జరిపించడం మాత్రం మరువకు’ అని వేడుకుంది.తన ఎదుట ప్రేతం ప్రత్యక్షమవడంతోనే బభ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రేతం కోరిన కోరిక విన్న తర్వాత మరింతగా విస్మయం చెందాడు. రాజు కాబట్టి తన భావోద్వేగాలను బయటపడనివ్వకుండా, తొణకకుండా ఇలా అడిగాడు:‘ఓ ప్రేతమా! నువ్వు కోరిన కోరిక సబబుగానే ఉంది. నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు, గోత్ర ప్రవరలు తెలియకుండా ఉత్తరక్రియలు జరిపించడం, కర్మకాండలు ఆచరించడం సాధ్యం కాదు కదా! అందువల్ల నువ్వు పార్థివదేహంతో జీవించి ఉన్ననాటి వివరాలు చెప్పు!’ అన్నాడు.బభ్రువాహనుడు అడిగిన దానికి ప్రేతం బదులిస్తూ, ‘మహారాజా! పార్థివదేహంతో నేను జీవించిన నాటి వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను! వైదేశమనే నగరంలో వైశ్యుడిగా జన్మించాను నేను. నా పేరు దేవగుప్తుడు. జ్ఞానం తెలిసినది మొదలు నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు. జీవించిన కాలమంతా నిత్య దేవతారాధనలు చేశాను. పేదసాదలకు దాన ధర్మాలు చేశాను. ఎన్నో శిథిలాలయాలకు జీర్ణోద్ధరణ చేశాను. నిర్మితాలైన శూన్యాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసి, వాటిలో పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశాను. విప్రులకు అగ్రహారాలు ఇచ్చాను. సత్యాన్ని గౌరవించాను, ధర్మాన్ని ఆచరించాను. అయినా ఏంలాభం? మరణానంతరం ఇదిగో! ఇలా ప్రేతంలా మారిపోయాను’ అని చెప్పింది. ‘జీవించినంత కాలం ధర్మాచార పరాయణుడివైనా, ఎందుకిలా ప్రేతంగా మారిపోయావు?’ ఆశ్చర్యంగా అడిగాడు బభ్రువాహనుడు. ‘ఎందుకంటే, ఏం చెప్పను మహారాజా! నేను కన్నుమూసే వేళకు చెవిలో నారాయణ నామాన్ని పలికేవారు ఎవరూ లేరు. అవసాన క్షణాల్లో గొంతులో ఉద్ధరిణెడు తులసితీర్థం పోసేవారు లేరు. ప్రాణాలు విడిచిన తర్వాత నా దేహాన్ని దహనం చేసే వారసులు లేరు. కనీసం కన్నీరు కార్చే సోదరులు, దాయాదులు లేరు. ఉత్తరక్రియలకు నోచుకోని కారణంగానే నేనిలా ప్రేతంగా మిగిలిపోయాను. ఇదిగో! ఈ మణిని తీసుకో! నాకు ఉత్తరక్రియలు ఆచరించు’ అంటూ మణిని బభ్రువాహనుడి చేతిలో ఉంచిందా ప్రేతం.‘తప్పకుండా నీకు ఉత్తరక్రియలు ఆచరిస్తాను’ మాట ఇచ్చాడు బభ్రువాహనుడు.‘అయితే, నాదొక సందేహం. ఉత్తరక్రియలకు నోచుకోనివారికేనా, ఇతరులు ఎవరికైనా కూడా ఇలా ప్రేతత్వం సిద్ధిస్తుందా?’ అని అడిగాడు.‘ఇతరులకు కూడా సిద్ధిస్తుంది’ అని చెప్పసాగింది ప్రేతం.‘దేవతలు, బ్రాహ్మణులు, స్త్రీలు, బాల బాలికలు, వికలాంగులకు చెందిన ద్రవ్యాన్ని అపహరించిన వారికి ప్రేతత్వం సిద్ధిస్తుంది. పరస్త్రీలను బలవంతంగా చెరబట్టిన వారికి, బంగారాన్ని, నవరత్నాలను, తామర పువ్వులను దొంగిలించిన వారికి, యుద్ధంలో శత్రువుకు వెన్నుచూపి పారిపోయిన వారికి, తమకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టిన వారికి తప్పనిసరిగా ప్రేతత్వం సిద్ధిస్తుంది’‘ప్రేతత్వ విముక్తి మార్గమేమిటో చెప్పు’ అడిగాడు బభ్రువాహనుడు.‘నియమబద్ధంగా ఉత్తరక్రియలు జరిపించడం, నారాయణ నామ పారాయణం, పూజ జరిపించడం ద్వారా ప్రేతత్వ విముక్తి కలుగుతుంది. ఉత్తరక్రియలలో బ్రాహ్మణులకు షడ్రసోపేతంగా సంతర్పణ చేయాలి. షోడశ దానాలు చేయాలి. ప్రేతత్వం పొందిన వారి విముక్తి కోసం ఎవరైనా పూనుకొని ఉత్తరక్రియలను నియమబద్ధంగా ఆచరించినట్లయితే, తక్షణమే ప్రేతత్వం తొలగిపోతుంది’ అని చెప్పింది ప్రేతం.ఈలోగా బభ్రువాహనుడి భటులు ఆయనను వెదుకుతూ అక్కడకు చేరుకున్నారు. వారి అలికిడికి ప్రేతం అదృశ్యమైపోయింది. నగరానికి చేరుకున్నాక, బభ్రువాహనుడు ఆ ప్రేతానికి ఉత్తరక్రియలు జరిపించాడు. ప్రేతత్వం నుంచి విడుదల పొందిన దేవగుప్తుడు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
యువ కథ : పారిజాతం
తెల్లవారుజాము పావు తక్కువ నాలుగవుతోంది. ఎంతసేపు పక్క మీద దొర్లినా నిద్ర పట్టడం లేదు. చోటు మారడం వల్లనేమో. పుట్టి, పెరిగి, పాతికేళ్లు గడిపిన ఇల్లే అయినా ఎందుకో నిద్ర పట్టడం లేదు. వీథి చివర టీ కొట్టు వరకు నడిచి వెళ్లొస్తే బావుండనిపించి బయటకొచ్చేశాను.ధనుర్మాసం.. చలి.. పారిజాతాలు!దారి మొత్తాన్ని ఆక్రమించేసిన పారిజాతాల్ని చూసి ఎన్నేళ్లు గడిచిపోయాయో సరిగ్గా గుర్తు లేదు. లెక్కపెట్టుకోవడం మానేసి కూడా చాలా సంవత్సరాలయ్యింది. ఈ మధ్య అసలేం గుర్తుండటం లేదు. నిమిషం క్రితం తీసి పెట్టిన కళ్లజోడు, నోట్లోనే నానుతూ ఉండే ఫోన్ నంబర్లు, అలవాటుపడిన దారులు కూడా మర్చిపోతున్నా. డాక్టర్ దగ్గరకు వెళితే ‘రోజుకు పదిమంది వస్తున్నారు సార్ మీవంటి పెద్దలు. అందరికీ అలై్జమర్స్ ఛాయలే.. ఎక్కువో తక్కువో! వృద్ధాప్య దశలో ఇవన్నీ మాములే’ అని డాక్టర్ కూడా సులువుగా చెప్పేశాడు. కాని జీర్ణించుకోవడం కష్టంగా మారింది.ఏవో రోజువారి పనులు, ఏటీఎమ్ పిన్ నంబర్లు లాంటివి మర్చిపోతే దిగుల్లేదు.. అవి మర్చిపోతున్నానన్న బాధ కంటే ఎక్కడ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతాయోనన్న భయమే ఎక్కువౌతూ ఉంది. ఈ వయసులో అందరూ వాళ్ల జీవితాల్లో నచ్చిన కొన్ని క్షణాల్ని జ్ఞాపకాలుగా పదిలంగా దాచుకుని, గతాన్ని నెమరు వేసుకోవడం వల్ల సాంత్వన పొందుతారు. పెరుగుతూ వచ్చిన వయస్సుతో పాటే ఎన్నో జ్ఞాపకాలు నా లోపలే జీవిస్తూ ఉన్నాయి. అవి నా నుంచి జారిపోతే? అందుకే గతాన్ని తవ్వుకుంటూ ఊరికొచ్చాను. జీవం ఉన్నంత వరకు నాలోని జ్ఞాపకాలు నాతోనే ఉంటే బావుండనిపించి పెనుగులాడుతున్నాను. లేకుంటే ఇంత చలిలో లేవచ్చా? ఇలా మంచుకురిసే వీథుల్లో నడవొచ్చా? ఇదీ మంచికేనేమో. ఈ రాలి పడిన పారిజాత పూలు నన్ను చుట్టేసి వెనక్కి లాక్కెళ్తున్నాయి. జ్ఞాపకాలను తట్టి లేపుతున్నాయి.ఆ రోజు గుర్తుంది..‘ముంబై మెయిలొచ్చే టైమ్ అయ్యిందిరా.. మీ నాన్న దిగిపోయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడ్రా’ అని దుప్పటి లాగేస్తూనే చెప్తూ ఉంది అమ్మ. వారాంతాల్లో నాన్న మద్రాసు నుండి వస్తే ఆయన్ని తీసుకురావడానికి సైకిల్ వేసుకుని వెళ్లాలి.. అది నా డ్యూటీ. ఎప్పుడూ సరే.. కాని ఈ చలికాలంలో కూడా! ముడుక్కుని పడుకుని గాఢ నిద్రలో ఉన్నాను. అమ్మకు కనికరం లేదు. ఆయన రాలేడా?గడియారం వైపు చూస్తే నాలుగవుతోంది. చెడ్డ కోపం వచ్చింది. విసురుగా లేచి గోడకి ఆన్చి పెట్టిన సైకిల్ని బయటకి తోస్తూ ఉంటే ‘మొహమైనా కడుక్కుని వెళ్లరా’ అంది అమ్మ మళ్లీ.‘ఈ చలికి జనాలు సస్తుంటే’ అని కసురుకుంటూ వచ్చేశాను.చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది సైకిల్. ఎక్కి తొక్కగానే కిర్రుమని ఆగిపోయింది. చలికి కాళ్ల మీదున్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచు కున్నాయి. నోట్లోంచి ముక్కులోంచి సన్నటి పొగ గాల్లో కలిసిపోయింది. జనసంచారం లేక వీథి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ పసిడి వర్ణంలో వెలుగుతున్న వీథి దీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.‘ఈ టైమ్లో మనుషులందరూ హాయిగా ఎంత బాగా నిద్ర పోతుంటారు. నాకేంటి ఈ బాధ’ అని గొణుక్కుంటూ వెళ్తూంటే ఎవరో దూరంగా నేల మీద ఉన్న వాటిని ఏరుకుంటూ బుట్టలో వేసుకుంటున్నారు. కొరుక్కుతినే చలిలో నేల మీద ఏరుకోడానికి ఏముంటాయి? పైగా అక్కడ చింతచెట్లు కూడా లేవు అనుకున్నాను మనస్సులో. దగ్గరికి వెళ్లే కొద్ది ఏదో సువాసన ఎటు వైపు నుండి వస్తుందో అర్థం కాలేదు. దగ్గరగా వెళ్లా. ఎవరో అమ్మాయి బుట్ట చేత్తో పట్టుకుని కిందపడిన పారిజాత పువ్వుల్ని ఏరి అందులో వేసుకుంటూ ఉంది. పారిజాతాలకి పరిమళం ఉంటుందా? అది పూలదా.. అమ్మాయి ఒంటిదా? ఇంకాస్త దగ్గరగా వెళ్లా. ఆ అమ్మాయి ముడివేసిన జుట్టులోంచి నీటి బొట్లు పరికిణీ మీదుగా జారిపోతున్నాయి. మొహం సరిగ్గా గమనించలేదు కాని ఎర్రటి ముక్కుపుడక మాత్రం స్పష్టంగా కనిపించింది. అచ్చం పారిజాత పువ్వుకాడ లాగా.ఆ ఇల్లు దాటగానే సైకిల్ ఎక్కి తొక్కడం మొదలు పెట్టి రైల్వేస్టేషన్ దగ్గర ఆగి నిలబడ్డాను. నాన్న అప్పటికే ఎప్పటిలాగే బ్రౌన్ కలర్ షోల్డర్ బ్యాగ్తో నిలబడి ఉన్నారు. చలికి మఫ్లర్ బిగించి ఉన్నారు. తిరిగొచ్చేటప్పుడు ఎప్పటిలానే నాన్న సైకిల్ తొక్కుతుంటే వెనుక క్యారేజ్ మీద చలిగాలికి ముడుచుకుని కూర్చున్నాను బ్యాగ్తో. ఆ పువ్వులున్న చెట్టు దాటుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఎప్పుడూ చూడలేదు కాని చూడాలనిపించింది ఎందుకో మరి!ఆ రోజు తర్వాత అటు వైపుగా ఎప్పుడు వెళ్లినా నా కళ్లు ఆమె కోసం వెతికేవి. ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు తిరిగా.. కనిపించనే లేదు. మళ్లీ తెల్లవారుజాము నాన్నని తీసుకుని రావడానికి సైకిల్ని తోసుకుంటూ వెళ్తూ ఉంటే పువ్వులు ఏరుకుంటూ కనిపించింది. తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో మెదులుతుంది తన రూపం. ఎరుపు రంగు వోణీ బంగారపు అంచు, తడి ఆరని జుట్టులో చిక్కుకున్న కుంకుడు పలుకులతో మెడ దగ్గర వరకూ వేలాడుతున్న కురులు. కళ్ల దగ్గర చెదిరిన కాటుక. కనుబొమ్మల మధ్య ఎర్రటి సింధూరం.మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు ఎప్పటిలాగానే !పరమ బద్ధకస్తుడిని నేను. కాని ఆ రోజు నుండి అమ్మాయిని చూడ్డం కోసమే గంట కొట్టినట్టు పొద్దున్నే నాల్గింటికి లేవడం నా దినచర్యలో భాగమైంది. అటు వైపుగా చూస్తూ వెళ్లి వీథి చివర టీ కొట్టు దగ్గర కూర్చోవడం. ఆ అమ్మాయి నన్ను చూసిందో లేదో నా గురించి తెలుసో లేదో కూడా నాకిప్పటికీ తెలీదు. కాని నేనైతే రోజూ చూసేవాడ్ని. ఏ పరిచయం లేని ఆ అమ్మాయి సొంత మనిషిలా అనిపించేది. ఆ అనుభూతి నచ్చింది. అది ప్రేమో కాదో కూడా తెలీదు. ఆ అమ్మాయి గురించిన తలపులతో మనస్సంతా హాయిగా ఉండేది.పొద్దున్నే గుడిలో తిరుప్పావై మొదలయ్యేది. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే భర్తగా తలచి పెంచుకున్న అపారమైన భక్తి ప్రేమ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు శ్రీరంగనాథుడే గోదాదేవి ప్రేమకి లొంగిపోయాడు. సాధారణ మానవులం మనమెంత! కొత్తగా ప్రేమ పుట్టుకు రావడంతో రెక్కలు మొలిచినట్టు అనిపించింది.ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ ఇంటిని చూసినా చాలనిపించి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాని అప్పుడు ఉన్న పరిస్థితులకి కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయా. నా వరకు మాత్రం తన పేరు పారిజాతం అనుకున్నా. పారిజాతం.. ఎంత బాగుంది! అసలు పేరు ఏమైనాగానీ ఆ తర్వాత మేము కలిస్తే ప్రేమ ఫలిస్తే ఒక్కటిగా బతికితే ఆజన్మాంతం పారిజాతం అనే పిలుద్దామనుకున్నా. ఈ ఊహలు ఇంకా ఎన్ని సాగేవోకాని ఆ సమయంలో నాన్న మరణం ఒక్కసారిగా కుదిపేసింది. ఇల్లంతా చీకటితో నిండుకుంది. నాన్న భుజాల వరకు ఉండేవాణ్ణి.. ఆ వయస్సులోనే బాధ్యతలన్నీ మోయాల్సి వచ్చింది. నా ప్రేమ చెప్పే అవకాశం లేక నాలోనే దాచేశాను. ఊరొదిలి వచ్చేసి పై చదువులు, ఉద్యోగాలు పూర్తయ్యేసరికి ఆ అమ్మాయికిపెళ్లై పోయిందని తెలిసింది. ఒంటరితనం దరి చేరింది. కొన్నాళ్లకి నేనూ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఆడవాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని నా భార్యని చూశాకే అర్థమయ్యింది. సుఖదుఃఖాల్లో నాతోనే ఉంటూ ముందుకు నడిపించింది. కాని నా తొలిరోజుల పారిజాతాన్ని మాత్రం మర్చిపోలేదు. నా ప్రేమ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలు, వాళ్ల చదువులు పెళ్లిళ్లు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. వాటితో పాటే భార్య మరణం కూడా. భార్య మరణానంతరం కోలుకోడానికి చాలా సమయం పట్టింది.మళ్లీ ఏదో తెలియని ఒంటరితనం.. దాంతో పాటుగా చెదిరిపోతున్న జ్ఞాపకాలు.. ఎన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయినా పారిజాతం జ్ఞాపకం పోకూడదు. జివ్వుమని మరో వరుస చల్లగాలి వీచింది. వర్తమానంలోకి వచ్చిపడ్డాను. అప్పటిలాగే ఇప్పుడూ టీకొట్టు తెరిచి ఉంది.టీ కొట్టు దగ్గరకి వెళ్లాను. పెద్ద బెంచీ ఉండాల్సిన చోట కుర్చీలున్నాయి. పెద్దాయన మనవడు కాబోలు టీ కొట్టు నడిపిస్తున్నాడు. టీతో పాటు ఊరి విషయాలన్నీ చెప్పాడు. దూరంగా గుడిలోంచి తిరుప్పావై పఠనం వినిపిస్తూ ఉంది.‘ఈ వీథిలో అన్నీ మారిపోయాయి, ఆ పారిజాత చెట్టు’ తప్ప అన్నాను టీకొట్టు అతని వైపు చూస్తూ.‘ఆ ఇంట్లో ఉన్న ముసలావిడ చెట్టుని ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తుంది సార్’ అన్నాడు నవ్వుతూ.మాటల్లోనే ఆ ఇంటి గేట్ తెరుచుకుని ఆమె బయటకి వచ్చింది. నెరిసిన జుట్టు, వంగిన శరీరంతో మెల్లగా వచ్చింది. నేల మీద రాలిన పువ్వుల్ని ఏరుకుంటూ ఉంటే నా గుండె గడగడ అదిరిపోయింది. అదే మనిషి. అదే చెట్టు. అవే పూలు. చెదిరిపోతున్న జ్ఞాపకం రివ్వున తిరిగి వచ్చి బలపడి పూర్తిగా స్పష్టమైనట్టు ఉంది నా స్థితి. ఎంతగా అంటే ఇక అలై్జమర్స్ నన్ను ఎంత మింగినా ఈ జ్ఞాపకం మాత్రం పోదు.‘పాపం.. భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. పిల్లలు రమ్మన్నా ఈవిడ ఇల్లు విడిచి వెళ్లదు. ఎవరో పని మనిషి తోడుంది అంతే’ అన్నాడు టీ కొట్టతను.‘ఆవిడ పేరు?’ అడిగాను పూలు ఏరుతున్న ఆమెను చూస్తూ ఉద్వేగంగా.టీకొట్టు అతను కొంచెం సిగ్గు పడుతున్నట్టు తల గోక్కున్నాడు.‘అరే.. ఎప్పుడూ తెలుసుకోలేదు సార్’ అన్నాడు.‘పర్లేదు.. నేను కనుక్కుంటాను’ అన్నాను, ఆమెను పలకరించడానికి నిశ్చయించుకుని లేస్తూ. ‘లాభం లేదు సార్’ అన్నాడు టీ అతను.‘ఏం?’‘ఆమెకేం గుర్తు లేవు.. ఆ పారిజాతం చెట్టు పారిజాత పూలు తప్ప’అలాగే కుర్చీలో కూచున్నాను.రాలిన పారిజాతాలను ఒక్కొక్కటిగా ఏరుకుని ఆమె మెల్లగా గేటు వేసుకొని లోపలికి వెళ్లిపోయింది. -
ఈవారం కథ: గుండ్లకమ్మ నీడలు
మేం నలుగురం ఊరి చివర నల్లవాగు మీద కట్టిన ఆ పాత కల్వర్టు దగ్గరకు చేరుకునేసరికి దూరంగా శ్మశానంలో అరగంట ముందు మాకు సెంటరులో కనపడిన శవయాత్ర తాలూకు మనుషుల గుంపు కనపడింది. కల్వర్టుకి, శ్మశానానికి సుమారు కిలోమీటరు దూరం. అప్పటివరకు లీలగా మా చెవుల్లో వినిపించిన చావు డప్పు అక్కడితో ఆగిపోయింది. శ్మశానంలో మనుషులని చూడగానే మామధ్య నిశ్శబ్దం అలముకుంది. అప్పటికి పడమటి సూర్యుడు పూర్తిగా వాలిపోయాడు. అందరం పాతకాలంనాటి పెచ్చులూడిపోయిన కల్వర్టు సిమెంటు గట్టుమీద కూర్చున్నాం. మా మధ్యలో రామబ్రహ్మం మేష్టారు.అసలీ సాయంత్రపు నడక ఎవరు మొదలుపెట్టారో తెలీదు. రామబ్రహ్మంగారే మొదలుపెట్టారంటారు. తరవాత చాలామంది సరదాగా వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. నేనొచ్చి సంవత్సరమైంది. ప్రతిరోజూ సాయంత్రంకల్లా సెంటరుకు చేరుకుంటాం. ఒక్కోసారి బ్రహ్మంగారు మాకంటే ముందే వెళ్ళిపోతారు. అందరం స్కూలు టీచర్లమే. దూరంగా కనపడుతున్న మనుషుల్ని చూస్తూ ‘మీరెప్పుడైనా శ్మశానానికి వెళ్ళారా?’ అడిగేరు బ్రహ్మంగారు.‘వెళ్ళకపోవడమేంటి.. చాలాసార్లు వెళ్ళాం. చుట్టాలెవరో చనిపోతే’ అన్నాడు రామప్ప. అతను మా స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్సు టీచరు. పత్రికలలో కథలు, కవిత్వం రాస్తూంటాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. ‘మీవాళ్ళెవరో చనిపోతేనో కాదు రామప్ప. చిన్నప్పుడు స్నేహితులతోనో.. ఒంటరిగానో..’మాలో ఎవరూ మాట్లాడలేదు.‘మీరు రచయితలు కదా.. ఆ వయసులో మీకెప్పుడూ శ్మశానం చూడాలని కుతూహలం కలగలేదా?’ అన్నారు మేష్టారు మళ్లీ రామప్పని ఉద్దేశించి.‘రచయితలైతే మాత్రం.. శ్మశానం చూడాలని ఎందుకుంటుంది చెప్పండి?’ అన్నాడు లెక్కల టీచరు కృష్ణారెడ్డి.‘ఎందుకుండదు? జీవితానికి అర్థం తెలుసుకోవాలనే ఆలోచన అక్కడే మొదలవచ్చు. చావుపుట్టుకలకి అర్థం ఏమిటి? చనిపోయాక మనిషి ఎక్కడికి వెళతాడు? బాల్యం, యవ్వనం, ప్రేమ, ముసలితనం అలా అనేక ఆలోచనలు అక్కడే పుడతాయి. మీరు అలా అంటున్నారు గానీ గోర్కీ చాలా చిన్నవయసులో తోటి స్నేహితులతో పందెంకట్టి ఒక రూబుల్ కోసం రాత్రంతా శ్మశానంలో గడిపాడు. ఆ శ్మశానంలో అతడి తల్లి సమాధి కూడా ఉంది.’ ‘ఆయన రూబుల్ కోసం శ్మశానంలో కూర్చున్నాడు సార్, కుతూహలంతో కాదేమో’ అన్నాను నేను.‘అయితేమాత్రం.. అది ఆయనకు గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిపోయింది కదా!’బ్రహ్మం మేష్టారు తెల్లచొక్కా, పంచెతో చూట్టానికి తెలుగు పంతుల్లా కనపడతారు గాని ఆయన స్కూల్లో ఇంగ్లీషు టీచరుగా పనిచేసి రిటైరయ్యారు. ఆ ఇంగ్లీషు టీచరు కూడా తీరికవేళల్లో బొమ్మలు గీస్తుంటారు. ఆయన చెప్పుకుపోయారు.‘శరత్ రాసిన శ్రీకాంత్ నవలలో కూడా శ్రీకాంత్ తన స్నేహితులతో పందెం కట్టి ఒక రాత్రంతా శ్మశానంలో గడుపుతాడు. అక్కడ అతనికి భయంగొలిపే అనుభవాలు ఎదురౌతాయి. విచిత్రం ఏమంటే మర్నాడు మళ్ళీ ఎవరో పిలుచుకెళ్ళినట్లు తనకు తెలీకుండానే ఆ శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్తాడు శ్రీకాంత్. ఇది ఇంకోరకమైన అనుభవం.’‘మనలో ఎవరికైనా చిన్నతనంలో దయ్యాలు, భూతాలు మంత్రాలని భయం ఉంటుంది. ఆ భయం మనలోకి ఎలా వస్తుందో తెలీదు. అది ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. వయసుతోపాటు పెరిగే ఎరుక చాలా భయాల్ని పోగొడుతుంది. లేదా ఇంకేదైనా కారణంచేత కూడా మనలో ఆ భయం పోవచ్చు. ఏదైనా సంఘటన జరిగి..’చుట్టూ చీకట్లు ముసురుకుంటుండగా శ్మశానంలో ఎర్రటి మంట వెలిగి తెల్లటి పొగ చెట్ల మధ్య నుంచి పైకి లేచింది. బ్రహ్మంగారు మననం చేసుకున్నట్టుగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ నిదానంగా చెప్పడం ప్రారంభించారు. ‘నేనూ చిన్నతనంలో అంటే పదిహేనేళ్ళ వయసులో మా ఊరి శ్మశానంలో అడుగుపెట్టాను. చాలా సంవత్సరాల పాటు ప్రతిరోజూ సాయంత్రం దాని పక్కనుంచే గుండ్లకమ్మ నదికి నడిచివెళ్ళేవాడిని. ఆ వయసులో నాకూ అందరిలానే దయ్యాలు, భూతాల భయాలుండేవి. కానీ ఒకరోజు శ్మశానంలో జరిగిన సంఘటనతో అవన్నీ పక్కకి జరిగిపోయాయి. నేను వయసుతో పాటు వచ్చే ఎరుక సంగతి చెప్పడం లేదు.’ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. దూరంగా శ్మశానంలోని చెట్ల నుండి నల్లటి చుక్కలు ఎగిరినట్లు కాకుల గుంపు పైకి లేచింది. ఆయన చెప్పడం మొదలెడితే ఎవరైనాసరే చెవులొగ్గి వినాల్సిందే! ఏది చెప్పినా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.‘నేను హైస్కూలు చదివేరోజుల్లో శ్రీనివాసరావు అనే స్నేహితుడు ఉండేవాడు. వాడిని ‘శీనాయ్’ అని పిలిచేవాడిని. చదువులో మేమంత తోపులం కాదుగాని మిగతా పిల్లలకీ మాకు మధ్య కొంత తేడా ఉండేది. తేడా అంటే అది చందమామ, బాలమిత్రలాంటి పుస్తకాలు చదవడం వలన వచ్చింది. ఈ పుస్తకాలు చదవడానికి తోడు మేము ఖాళీ దొరికినప్పుడల్లా అటు శింగరకొండకో, ఇటు మేదరమెట్లవైపో ఈత పండ్లనీ రేక్కాయలకనీ ఊరవతల పోరంబోకు భూముల్లో తిరుగుతా ఉండేవాళ్ళం. ఇక ప్రతిరోజూ పొద్దుగూకే టయానికి గుండ్లకమ్మ ఒడ్డుకి పోతావుండేవాళ్ళం. వచ్చేటప్పుడు శీనాయి మంచినీళ్ళ కోసరమని ఖాళీ ఇత్తడి బిందె తీసుకొచ్చేవాడు. అద్దంకి నుంచి గుండ్లకమ్మ వెళ్ళడానికి మూడుదారులు ఉన్నాయి. మొదటిది ఊరి బయట చిన్న కాలవ ఒకటి దాటాక పొలాల మధ్య వేసిన రోడ్డు దాటుకుని ఎర్రమట్టి డొంకలోంచి గుండ్లకమ్మకి నడుచుకుంటూ పోవడం. అటువైపు పొరుగూర్ల నుంచి ఎవరైనా ఇటువైపు అద్దంకి రావాలంటే ఇది తప్ప మరో దారి లేదు. రావాలంటే నీళ్ళలోంచి నడుచుకుంటూ రావాల్సిందే. దాటేటప్పుడు మధ్యలో మెడలోతు నీళ్ళు. నీళ్ళలో నడవకూడదనుకుంటే ఏదైనా ఎడ్లబండి వచ్చేదాకా ఆగాలి. ఆడవాళ్ళు ఎడ్లబండి వచ్చేదాకా ఒడ్డునే కూర్చునేవారు. ఆదారి కాక, చాలా కాలానికి ఊరు దాటాక అద్దంకి నుంచి దర్శి వైపు వెళ్ళే రోడ్డుమీద వంతెన కట్టారు. ఈ రెండూ కాక మూడో దారి ఒకటి ఉంది. ఊరికి దక్షిణం వైపున దూరంగా ఉంటుందది. ఆ కాలిబాట గుండ్లకమ్మ దగ్గర కలిసేచోట నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ పక్కనే శ్మశానం. ఎప్పుడన్నా అక్కడ శవాలని పూడ్చిపెట్టడమో, కాల్చడమో చేస్తారుగాని మేమెప్పుడూ చూసింది లేదు. చీకటి పడ్డాక ఆ దారిలో ఎవరూ పోరు. లోపలవైపు చిల్లచెట్ల మధ్య సున్నం వెలిసిపోయిన పాతకాలంనాటి సమాధులు కనపడతాయి. గుండ్లకమ్మ వెళ్ళేటప్పుడు మేమెప్పుడైనా ఆ శ్మశానంలోకి నడిచేవాళ్ళం. ముళ్ళ కంపలు, జిల్లేడు చెట్లు, పగిలిపోయిన కుండ పెంకులూ, ఎముకలూ కనిపించేవి. వాటిని చూసి మాకు అనేక ఆలోచనలు కలిగేవి. చందమామ కథల్లాంటి రకరకాల దయ్యాల కథలు, మాంత్రికుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. మాకు భయమైతే లేదుగాని దయ్యాలూ మా్రంతికులూ ఉంటారని నమ్మేవాళ్ళం. మేము ఒడ్డున కూర్చుని చూస్తావుండగానే మనుషులు పంచెలు పైకి ఎగలాక్కుని నది దాటి అవతలవైపు పడమట దిక్కున ఉండే తిమ్మాయిపాలెం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు రైతుల ఎడ్లబండ్లు నీళ్ళలోంచి అవతలికి వెళ్ళేవి. మధ్యలో లోతు దాటేటప్పుడు ఎద్దుల తలలు, బండి ముందువైపు కూర్చున్న మనిషి మాత్రం కనిపించేవాడు. మేము ‘తిమ్మాయిపాలెం’ పేరు వినడమేగాని గుండ్లకమ్మ అవతలి ఒడ్డుకు ఐదారు మైళ్ళుండే ఆ ఊరికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇటువైపు నిలబడి అవతలికి చూస్తే ఒడ్డు నుండి ఒక అరమైలుదాకా అంతా ఒండ్రుమట్టి, ఇసక. ఆ పైన రెల్లు దుబ్బు, చిల్లచెట్లు ఆపైనంతా ఎటుచూసినా పోరంబోకు భూమి. రకరకాల వరుసల్లో దట్టంగా సరివిచెట్లు కనపడేవి. ఎక్కడపడితే అక్కడ పొడవాటి తాటిచెట్లు. ఆ తరవాత దూ..రం..గా.. భూమీ ఆకాశం కలిసే ఆకుపచ్చ అడవి మధ్య ఒకచోట గుండ్రంగా ఎవరో నిలబెట్టినట్లుగా నల్లగా ఎత్తైన తాటిచెట్లు. ఆ తాటి చెట్ల తలల మధ్య ఆకుపచ్చ, నీలం కలగలిసి బూదరబూదరగా కనపడేది. అక్కడేముందో తెలిసేదికాదు. శీనాయికీ నాకూ ఒక్కసారన్నా అవతలి ఒడ్డుకు వెళ్ళి ఏముందో చూడాలని అనిపించేది. మేం ఎప్పుడు వెళ్ళినా ఈతపండ్ల కోసం అద్దంకికి ఉత్తరాన ఉండే శింగరకొండకో, దక్షిణంవైపు మేదరమెట్లకో నడిచి వెళ్ళేవాళ్ళమే కానీ గుండ్లకమ్మ దాటుకుని అవతలి ఒడ్డుకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడన్నా పారే నీళ్ళలో మునకలేస్తున్నప్పుడు శీనాయ్గాడితో ‘ఒరేయ్.. తిమ్మాయిపాలెం దాకా కాకపోయినా కనీసం ఆ తాటితోపు వరకయినా వెళ్ళొద్దాంరా’ అనేవాడిని.ఒక అదివారంనాడు గుండ్లకమ్మ ఒడ్డుకెళ్ళి ఒక్కణ్ణే కూర్చున్నాను. అప్పటికి సూర్యుడు ఏటవాలుకి దిగినా ఎండ ఇంకా నులివెచ్చగా ఒంటికి గుచ్చుకుంటూ ఉంది. నేను చూస్తుండగానే ఎద్దులబండి ఒకటి నీళ్ళలోకి దిగింది. రైతు ఎవరో అద్దంకిలో పని ముగించుకుని తిమ్మాయిపాలెం వెళుతున్నాడు. బండి కాస్తంత ముందుకు పోగానే వెనకవైపు కూర్చున్న మనిషిని చూసి అదిరిపడ్డాను. వెనకాల చెక్కమీద కాళ్ళు కిందకేసి కూర్చున్న శీనాయి! వాడు నన్ను చూడగానే ‘రేయ్.. రారా.. బండెక్కు’ అన్నాడు.అప్పటిదాకా తీరుబాటుగా కూర్చున్న నేను వాడి పిలుపు వినగానే ఉలిక్కిపడి ఒక్కసారిగా నీళ్ళలోకి పరుగెత్తి ఎద్దులబండి వెనకాల ఎగిరి కూర్చున్నాను. బండి కుదుపుకి రైతు వెనక్కితిరిగి చూశాడు. బళ్ళు నీళ్ళలోంచి వెళ్ళేటప్పుడు మనుషులు వెనకాల ఎక్కడం వాళ్ళకి అలవాటే. శీనాయి వచ్చే దారిలోనే ఎక్కడో ఎక్కి కూర్చున్నట్లున్నాడు. బండి లోతుకు దిగేకొద్దీ మా అరికాళ్ళకు చల్లగా నీళ్ళు తగలసాగాయి. మొదట పాదాలు.. ఆ తరవాత నిదానంగా నీటిమట్టం పెరుగుతూ మోకాళ్ళు.. చివరికి నేను కూర్చున్న చెక్కమీదికి నీళ్ళు వచ్చి నా నిక్కరు కిందవైపు తడిసిపోయింది. మందువైపు చూస్తే ఎద్దుల మూతుల దాకా వచ్చాయి నీళ్ళు. పంచె తడవకుండా రైతు ముందువైపు నిటారుగా నిలబడి ఉన్నాడు. కొంచెం దూరంపోయాక నీటిమట్టం మళ్ళీ తగ్గసాగింది. ఒడ్డు దగ్గర పడ్డాక బండి నీళ్ళలో ఉండగానే ఇద్దరం కిందకి దూకేశాం. అక్కడ ఒడ్డున నిలబడి చూస్తే ఇరువైపులా తాటిచెట్లున్న ఎత్తైన రోడ్డు కనపడింది. అక్కడికి దగ్గరలోనే ఉంటుందనుకున్న ఊరు పొలిమేర కనుచూపులో కూడా లేదు. ఆ కనపడే రోడ్డువైపు కాకుండా మరోవైపు నడవడం మొదలుపెట్టాం. అది దుక్కిదున్ని సేద్యం చేసే నేల కాదు. ఎటుచూసినా అడ్డదిడ్డంగా పెరిగిన చిల్ల చెట్లు, పల్లేరు కాయలతో ముళ్ళ పొదలు, మట్టిదిబ్బలతో ఎగుడుదిగుడు నేల. దారిపొడుగునా పచ్చగా పెరిగిన పసిరిక గడ్డిలో రాలి ఎండిపోయిన తాటి ఆకులు, జిల్లేడు మొక్కలు, కొన్నిచోట్ల మనిషెత్తు పెరిగిన జపా¯Œ తుమ్మచెట్లు తప్పితే మరింకేంలేదు. చివరికి తాటివనంలా కనిపిస్తున్న చోటు చేరేసరికి అదంతా పోరంబోకు భూమిలో చెదురుమదురుగా పెరిగిన తాటిచెట్లు. విసుగుపుట్టి ఒకచోట మొదలు నరికి ఒరిగిపోయిన తాటిచెట్టు మీద కూర్చున్నాం.తలెత్తి చూస్తే మళ్ళీ మా చుట్టూ తలలెత్తుకుని నిలబడిన తాటిచెట్లు. మా వెనక ఏటవాలుకు దిగిన సూర్యుడి పసుపురంగు ఎండ. అప్పటిదాకా ఎండలో ఆవిర్లు గక్కిన గాలి నెమ్మదిగా చల్లబడుతూ ఉంది. మాముందు నల్లటి పికిలిపిట్ట కొత్తవారిని చూసి ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఊరికూరికే హైరానా పడతావుంది. మాకు కొద్ది దూరంలో మందనుంచి తప్పిపోయిన గేదె మోర వంచి తదేకంగా గడ్డి పెరుక్కుంటావుంది. శీనాయి దిగ్గున లేచి ‘ఒరేయ్ అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తున్నార్రా’ అన్నాడు.లేచి నిలబడి చూశాను. అక్కడినుండి చూస్తే దూరంగా అద్దంకివైపు గుండ్లకమ్మ అవతలి ఒడ్డు కనబడతావుంది. ఎండ పొడకు మెరుస్తున్న నీటి ప్రవాహం .. ఆ తరువాత తీరపుగట్టు, ఆపైన ఎత్తుగా ఎర్రటి మట్టి.. అక్కడ ఆకుపచ్చచెట్లలో లీలగా అక్కడక్కడా పైకి లేచిన తెల్లటి గోరీలు.. వాటి మధ్య నలకల్లా మనుషులు కనబడ్డారు. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుండిపోయాం. ఉన్నట్టుండి శీనాయి..‘ఒరే.. ఎవరో చనిపోయార్రా.. అందుకే ఆ జనం’ అన్నాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. అవతల వాళ్ళని చూడగానే ఎలాగైనా అక్కడ జరిగేది చూడాలని అక్కడనుంచి లేచి గబగబా నడవడం మొదలుపెట్టాం. పరుగులాంటి నడక. నేలపై పిచ్చి మొక్కలు కాళ్ళకి గీరుకుంటున్నాయి. అడుగులు చిన్నపాటి గుంతలు, రాళ్ళురప్పలు, తుమ్మ ముళ్ళు ఎదురైనప్పుడల్లా తడబడుతున్నాయి. వేటినీ లెక్క చేయకుండా పరుగులాంటి నడక.. తాటివనం నుంచి గుండ్లకమ్మ ఒడ్డుకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు. నీళ్ళలోకి దిగి గబగబ అడుగులు వేస్తుంటే తపతపమని నీళ్ళు పైకి చిమ్మి మొహాల మీద పడ్డాయి. మోకాళ్ళదాకా వచ్చాక నీళ్ళు కాళ్ళకి ఎదురీదుతున్నాయి. ఇంకాస్త లోపలికి నీళ్ళలో సంకలదాకా వచ్చాక అడుగులు ముందుకు వెళుతుంటే ప్రవాహం పక్కకి నెడతావుంది. మరింత ముందుకు వెళ్ళాక నీటిమట్టం తగ్గినచోట గబగబా అడుగులు వేస్తుంటే అడుగున పాచిపట్టిన రాళ్ళు పాదాలకు తగులుతున్నాయి. బొటనవేళ్ళు రాళ్ళల్లో గుదిగుచ్చి ఒక్కొక్క అడుగు బలంగా వేసుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళాం. అప్పటికి బట్టలు పైదాకా పూర్తిగా తడిసిపోయాయి.ఒక్క ఉదుటున శ్మశానంలో వచ్చిపడ్డాం. ఒక గోతి చుట్టూ నిలబడిన నల్లటి మనుషులు కనపడ్డారు. అస్తమించే సూర్యుడి లేత పసుపురంగు ఎండ ఆచ్ఛాదనలేని నల్లటి మనుషుల శరీరాల మీద పడతావుంది. వాళ్ళకి కొంత దూరంలో నేల మీద చాపలో చుట్టిన శవం. తల బయటికి కనిపిస్తా ఉంది. ఎవరో యువకుడు. పాతికేళ్ళుండొచ్చు. జుట్టంతా చెదిరి, తల ఒక పక్కకి ఒరిగి ఉంది. ఉండీ లేనట్లు మొలిచిన లేలేత గడ్డం వెంట్రుకలు. ఆ మసిబారిన గాజు కళ్ళు కలలు కంటున్నట్లుగా సగం తెరుచుకుని నిశ్చలంగా ఉన్నాయి. శవానికి రెండడుగుల దూరంలో ఒంటికి చుట్టుకున్న ముతక చీర కొంగునే భుజాల చుట్టూ శాలువాలాగా చుట్టుకుని ఒక నడివయసు ఆడ మనిషి నిలబడి ఉంది.మరోపక్క భూమిలో గసగసమని మనుషులు గొయ్యి తవ్వుతున్న చప్పుడు. లోపలనుంచి దోకుడు పారతో పైకి ఎగదోసిన మెత్తటి మట్టి గోతి చుట్టూ పేరుకుంటోంది. గొయ్యి తవ్వడం పూర్తయ్యాక ఇద్దరు మనుషులు గోతిలోంచి పైకి వచ్చారు.చివరికి అందరూ చూస్తుండగా చాపలో శవాన్ని బయటికి తీశారు. తల, కాళ్ళు ఏ దిక్కులో ఉండాలనే మంతనాలయ్యాక తలవైపు ఇద్దరు పాదాల వైపు ఇద్దరు పట్టుకుని శవాన్ని గోతిలో బోర్లా పడేశారు. లోపల నేల మీద దబ్బున శబ్దం వచ్చింది. నేను రెండడుగులు ముందుకు వెళ్ళి గోతిలోకి చూశాను. ఉత్త నేల మీద, బొక్క బోర్లా పడిన శవం, ఒక పక్కకి తిరిగిన తల.. అవే గాజుకళ్ళు. అక్కడ నిలబడిన వాళ్ళలో ఒక మనిషి ‘ఏంది గుడ్డతో కప్పెడతావా? అట్టా కుదర్దు. ఆ లుంగీ తీయాలి’ అన్నాడు. పొడవాటి కర్ర పట్టుకున్న మనిషి గోతిలోకి కర్రని పోనిచ్చి ఆ శరీరం మీద ఉన్న మాసిన లుంగీని పక్కకి జరిపాడు. అలా జరపడంతోటి నల్లటి అతడి వీపు కింద, సరిగ్గా నడుము మీద ఎర్రగా ఉన్న అరచేతి మందం ఎర్రటి పుండు కనిపించింది. పైనుండి పడిన అదురుపాటుకి నడుముకి కట్టిన గాజుగుడ్డ రక్తపు మరకల దూదితోపాటు చెదిరి నల్లటి ఒంటి మీద ఎర్రటి పుండు బయటపడింది. ‘ఎన్నాళ్ళబట్టి ఓర్చుకున్నాడో నా బిడ్డ. యియ్యాల్టికి నెల దినాలు. సివరికి ఈ మాయదారి పుండు పొట్టనబెట్టుకుంది’ అన్నది అక్కడ నుంచున్న ముసలమ్మ.‘ప్రార్థన చేసే వాళ్ళెవురూ లేరా ఇక్కడ?’ అన్నాడు అక్కడున్న నడివయసు మనిషి.‘ఊరుగాని ఊళ్ళో పేస్టరుని ఎక్కడనుంచి తెచ్చేది’ అన్నది ఆ ముసలి తల్లి.‘అయితే కడసారి కొడుకుని చూసుకో’ అన్నారెవరో ఆ గుంపులో వెనక నుంచి.ఆ ముసలామె ఒకడుగు ముందుకు వేసి గోతిలో బోర్లా పడిన శవాన్ని తేరిపార చూసింది. అలా చూడటంతోటే ఆమె కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా కారాయి. ఆమె కొంగుతో చెంపల మీద నీళ్ళను తుడుచుకుంటూ వెనక్కి జరిగింది. అక్కడ నిలబడ్డ నలుగురు మనుషులు దోకుడు పారతో మట్టిని గోతిలోకి ఎగదోయసాగారు. నేను చూస్తుండగానే ఆ మనిషి మీద కాస్తకాస్త మట్టి పడుతూ చివరికి కనుమరుగయింది.అలా పైనుంచి మట్టి పడుతున్నంతసేపూ ఆ మనిషికి ఊపిరి ఆడటం ఎలా? అతడు ఎలా లేవగలుగుతాడు. అయ్యో కాళ్ళు చేతులు కదిలించలేడు కదా. చనిపోయిన తరవాత మనుషులు చివరికి ఎక్కడికి వెళతారు? చివరికి ఏమవుతుంది? కొంత కాలానికి ఆ శరీరం అస్థిపంజరంలా మారిపోతుందేమో అన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. పక్కన జిల్లేడు పొదలో కపాలం దవడలు విప్పి నావైపే తదేకంగా చూస్తావుంది.గొయ్యిని పూర్తిగా మట్టితో పూడ్చాక ఇద్దరు మనుషులు మట్టిని దట్టంగా ఎగదొక్కి చివరికి గుర్తుగా ఎత్తైన నిలువుపాటి గుట్టను గోరీలాగా పారలతో చదును చేశారు. వాళ్ళంతా తమ పనిలో నిమగ్నమయి ఉండగా ఆ ఆడామె ఉన్నచోటునే నిలబడి శూన్యంలోకి చూస్తావుంది. ఆమె చెంపల మీద చారికలు ఇంకా తడారి పోలేదు.చివరికి అందరూ అక్కడ్నుంచి కదలబోతున్నంతలో ఆ ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. వాడ్ని సూడ్డానికి ఎంత దూరం నుంచి వచ్చుండారు. మా మీద ఎంత ప్రేమ మీకు’ అని అంటా ముందుకు నడిచింది.ఆవిడ మాటలు మొదట నాకు అర్థం కాలేదు. ఆవిడ కొడుకు మీద మాకు ప్రేమ ఏమిటి? వాళ్ళెవురో మాకు తెలీదు. మేము ఆవిడ కొడుకుని చూట్టానికి రాలేదనీ, ఆ శ్మశానంలో కర్మకాండలు చూట్టానికి మాత్రమే వచ్చామనీ, అంతకు మించి మరేమీ కాదని ఆవిడ దగ్గరకెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాను. ఎందుకో సిగ్గనిపించింది. అది కూడా చెప్పడానికి మనసురాక ‘ఆవిడ ఎలాగనుకుంటే అలాగ అనుకోనిమ్మని.. ఆవిడ అలా అనుకుంటేనే బాగుందనుకున్నాను.మేమంతా శ్మశానం నుంచి బయటకు వస్తావుంటే ఆమె మాత్రం కొంచెం ఇవతలికి వచ్చాక ఒక జిల్లేడు చెట్టు మొదల్లో కూలబడింది. ఒక మేస్త్రీలాంటి మనిషెవరో కూలీలకు డబ్బు లెక్కచేసి వెళ్ళబోతా ‘ఇంకేవిటికి ఇక్కడ పెద్దమ్మా.. కొడుకు లేచొస్తాడని కూకుండావా? దబ్బునెళ్ళి మీవూరి బొస్సు పట్టుకో. చీకటి పడిపోతావుంది’ అని కాలిబాట పట్టాడు. ఆవిడ ఆయన చెప్పిన మాటలు వినిపించుకోకుండా అక్కడే కూర్చుని గుడ్ల నీరు కుక్కుకుంటా కుళ్ళికుళ్ళి ఏడుస్తావుంది. మేమిద్దరం ఆమెను దూరం నుంచి చూస్తా, అటు ఇటు తారట్లాడతా ఏం చేయలేక ఊరకుండిపోయాం. చీకటి పడ్డాక ఎవురి దారిన వాళ్ళు ఇళ్ళకు పోయాక ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు. కండ్లు మూసుకుంటే ‘నాయనలారా నా బిడ్డ మీద మీకెంత ప్రేమ..’ అంటూ చింకిచీర కట్టుకుని ఆ శ్మశానంలో గోరీల మధ్య నిలబడిన ఆ నల్లటి ఆడమనిషి మాటలే చెవుల్లో వినిపించాయి. చాలాకాలం ఆమెని మర్చిపోలేకపోయాను. ఆ తరవాత ఎప్పుడు గుండ్లకమ్మ వెళ్ళినా ఆ పక్కనే ఉండే ఆ శ్మశానంలోకి అడుగుపెట్టలేదు. అంతకుముందు భయపెట్టే శ్మశానం ఆ రోజు నుంచి మామూలుగా కనపడసాగింది. నా మనసులో ఏదో మాయపొర తొలగినట్లైంది. ఒక అనుభవం అలా అనేక ఆలోచనలని చెరిపేసింది.ఈడు పెరిగేకొద్దీ చావంటే దుఖమనీ అంతులేనివిషాదమనీ తెలిసొచ్చింది.బ్రహ్మం మేష్టారు చెప్పడం ముగించి మౌనంగా ఉండిపోయారు. మేము ఎన్నో సంవత్సరాల కిత్రం గుండ్లకమ్మ ఒడ్డున ఒక సాయంత్రంలోంచి ఇప్పటి దట్టమైన ఈ చీకటి లోకంలోకి వచ్చి పడ్డాం. మేష్టారి తెల్లటి జుట్టు చీకట్లో వెండి జరీలా మెరుస్తా ఉంది. మీసం లేని ఆయన నల్లటి మొహంలోని గీతలు అస్పష్టంగా కనబడుతున్నాయి.‘అయితే మేష్టారూ, మరణం అనేది ఒక రహస్యం కాదంటారా?’ అన్నారు కృష్ణారెడ్డిగారు ఉన్నట్లుండి తన మౌనంలోంచి బయటపడి.‘కాదని ఎవరన్నారు.. అది ఎవరూ తెలుసుకోలేని ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే..’ ‘అదిసరే.. ఆరోజు నుంచి మీకు దేవుడంటే నమ్మకం పోయిందన్నమాట’ అన్నాడు రామప్ప మధ్యలో కల్పించుకుని. ‘ఆ మాట నేను అనలేదే? దయ్యాలూ, భూతాలు అంటే భయం పోయిందని అన్నాను. దేవుడి మీద నమ్మకం పోయిందని చెప్పానా?’‘మరయితే అది కూడా మూఢనమ్మకమేగా మేష్టారూ?’ఆ మాటకి ఆయన గట్టిగా నవ్వి ‘నాది మూఢ నమ్మకమే. దాన్నలాగే ఉండనీ..’ అని కొంచెం సేపు ఆగి ‘మనిషి లోపల దయ్యం ఉంటుందన్నది నిజం. పాపాలు అందరిలోనూ ఉన్నాయి. అసలు ఉన్నదల్లా సైతానే. దానిని పోగొట్టడానికి మనం చేయాల్సిందల్లా దేవుడిని కనుక్కోవడమే. అంటాడు దోస్తయేవ్స్కీ’ అని ఇక చెప్పాల్సింది ఏదీ లేదన్నట్లు మేష్టారు లేచి నిలబడి పంచెకు అంటుకున్న దుమ్ము దులుపుకున్నారు.అందరం లేచి ఇంటిదారి పట్టాం. దూరంగా నల్లటి చీకటి మధ్య ఎర్రటి కాష్ఠంలో రగులుతున్న మంటలు చీకట్లోకి నాలుకలు చాపుతున్నాయి. -
భారత హాకీ హీరో
హాకీలో.. జట్టు విజయంలో డ్రాగ్ఫ్లికర్ పాత్ర ఎంతో కీలకం. పెనాల్టీలను గోల్స్గా మలచడానికి ఉండాల్సిన అసాధారణ నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుదీర్ఘ కాలం హాకీని శాసించిన యూరోపియన్ టీమ్లు అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లతో ఫలితాలు సాధించాయి. మన జట్టు కూడా ఒక దశలో జుగ్రాజ్ సింగ్, సందీప్ సింగ్లాంటి ఆటగాళ్లతో దూసుకుపోయింది. అయితే వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత మన టీమ్లో ఒకరకమైన స్తబ్దత ఆవరించింది. కొందరు ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో.. భారత్ విజయాల్లో వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిన ఆటగాడు హర్మన్ప్రీత్ సింగ్. జూనియర్ స్థాయి పోటీల్లో సత్తా చాటి తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించిన అతను ఆ తర్వాత సీనియర్ టీమ్లోకి వచ్చి డ్రాగ్ఫ్లికర్గా తన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నాడు. గత కొన్నేళ్లలో హర్మన్ ఆటతోనే భారత్ పలు కీలక విజయాలు సాధించింది. ఇందులో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉండటం విశేషం. ఆటగాడిగానే కాదు గత రెండేళ్లుగా భారత జట్టు కెప్టెన్గా కూడా హర్మన్ తనదైన ముద్రతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్గా మిశ్రమ ఫలితాలతో..రెండేళ్ల క్రితం హర్మన్ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో హర్మన్ప్రీత్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణపతకం గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్కూ అర్హత సాధించింది. దాంతో హర్మన్కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే కొద్ది రోజులకే వరల్డ్ కప్ రూపంలో మరో సవాలు వచ్చిపడింది. పరిస్థితి ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో జట్టు క్వార్టర్ ఫైనల్కు ముందే నిష్క్రమించింది. 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో హర్మన్ నాయకత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ పతకాన్ని అందించి..వరల్డ్ కప్లో జట్టు ఓడినా నిజానికి ఆ ఏడాదంతా హర్మన్ ప్రదర్శన చాలా బాగుంది. 33 మ్యాచ్లలో అతను 42 గోల్స్తో సత్తా చాటాడు. ఇదే ప్రేరణగా అతను పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఒక పెద్ద విజయం సాధిస్తేనే జట్టు స్థాయి నిలబడుతుందని, అందుకు కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని హర్మన్ గట్టిగా నమ్మాడు. అతని కెప్టెన్సీలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో అతను చెలరేగాడు. సహచరులూ హర్మన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దాంతో పారిస్ క్రీడల్లో భారత్ కాంస్య పతకాన్ని అందుకొని సగర్వంగా నిలిచింది. 10 గోల్స్తో హర్మన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వాటిల్లో ఆస్ట్రేలియాపై 1972 తర్వాత ఒలింపిక్స్లో గెలిచేందుకు ఉపకరించిన రెండు గోల్స్తో పాటు కాంస్య పతక పోరులో స్పెయిన్పై అతను సాధించిన రెండు కీలక గోల్స్ కూడా ఉండటం విశేషం. ఇదే ఫామ్ను ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించి భారత్ను విజేతగా నిలిపాడు. అప్పుడు కూడా 7 గోల్స్తో అతను టాప్స్కోరర్గా నిలవడం విశేషం. సంగీతం నుంచి హాకీ వైపు..హర్మన్ప్రీత్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని టిమ్మోవాల్. వ్యవసాయ కుటుంబం. హర్మన్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. ఊర్లో జాతర మొదలు ఎక్కడికి వెళ్లినా హార్మోనియం లేదా మరేదైనా సంగీత పరికరాన్ని కొనిపెట్టమని పోరు పెట్టేవాడట. హర్మన్ వాళ్ల నాన్న సరబ్జిత్ సింగ్ కూడా కొడుకు కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఆ సంగీతపరికరాలను వాయిస్తూ తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ మైమరచిపోయేవాడు. అయితే స్కూల్లో పీఈటీ టీచర్ హర్మన్ను మార్చాడు. పాటలు గీటలు జీవితంలో పనికొచ్చేవి కావు.. ఏదైనా ఆటలోకి ప్రవేశించు, భవిష్యత్తు బాగుంటుందంటూ సూచించాడు. అంతేకాదు అప్పటికే భారత హాకీలో దిగ్గజాలుగా నిలిచిపోయిన పలువురు పంజాబ్ ఆటగాళ్ల గురించి వివరించి అతనిలో స్ఫూర్తి నింపాడు. దాంతో పదేళ్ల వయసులో హర్మన్ చేతిలోంచి హార్మోనియం పెట్టె పోయి హాకీ స్టిక్ వచ్చింది. స్కూల్లో సాధనతోనే సరిపెట్టకుండా హర్మన్ను పూర్తిస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు తండ్రీ సిద్ధమైపోయాడు. ఫలితంగా పంజాబ్లోని ప్రముఖ శిక్షణా కేంద్రం సుర్జీత్ సింగ్ అకాడమీలో అతడిని చేర్పించాడు. అక్కడే హర్మన్ ఆటగాడిగా రాటుదేలాడు. హర్మన్ డ్రాగ్ఫ్లికర్గా రాణించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. చిన్న వయసులోనే పొలాల్లో అతను ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నప్పుడు బలమైన గేర్ రాడ్ను పదేపదే వాడాల్సి వచ్చేది. దాంతో అతని భుజాలు మరింత బలంగా మారాయి. అదే డ్రాగ్ఫ్లికింగ్లో ఉపయోగపడిందని కోచ్లు చెబుతారు. సాధన సమయంలోనూ సాధారణ బంతి కంటే బరువైన బంతులతో హర్మన్ ప్రాక్టీస్ చేయడం కూడా అతని సాఫల్యానికి మరో కారణం. తిరుగులేని కెరీర్..భారత జూనియర్ జట్టులో 15 ఏళ్ల వయసులో మొదటిసారి స్థానం దక్కిన తర్వాత హర్మన్ప్రీత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ టోర్నీ సుల్తాన్ జౌహర్ కప్లోనే 2014లో 9 గోల్స్ కొట్టి భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జూనియర్ జట్టు ఆసియా కప్ను, వరల్డ్ కప్ను గెలుచుకోవడంలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించాడు. సహజంగానే ఈ ప్రదర్శనలు అతడిని సీనియర్ టీమ్లోకి ఎంపికయ్యేలా చేశాయి. 2015లో 19 ఏళ్ల వయసులో హర్మన్ మొదటిసారి జపాన్పై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గత తొమ్మిదేళ్లుగా ఇంతింతై వటుడింతై అంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడు టీమ్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్లో హర్మన్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. టీమ్ సభ్యుడిగా అతను 2 ఒలింపిక్స్ పతకాలు, 2 చాంపియన్స్ ట్రోఫీ పతకాలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, జూనియర్ వరల్డ్ కప్లలో అతను భాగస్వామి కావడం విశేషం. మూడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డునూ అందుకున్నాడు. -
తరతరాల చరిత్రకు ఆలవాలం
టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్ను టాటా సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు. ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకుటాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా నాగపూర్లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్ మిల్స్గా పేరుపొందాయి. టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.మహాత్మాగాంధీకి తొలి విరాళంటాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు. గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్షెడ్పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్మహల్ పాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభంమన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్రజె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భావితరాల కోసం భద్రపరచారు. వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్మెంట్ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే! -
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్లినా, ఔటింగ్కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్కేర్కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
మేకలకు కటకటాలు!
చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో? -
Social Media Star: మీథికా ద్వివేది
సింగర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మీథికా పుట్టింది, పెరిగింది లక్నోలో. సంగీతం, భరతనాట్యంలో శిక్షణ పొందింది. స్కూల్ స్థాయి నుంచి పాటల పోటీల్లో పాల్గొని ప్రైజులు, అవార్డులు గెలుచుకుంది. 2021లో The Sound Blaze పేరుతో యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది. ఆ ఏడే ఆమె పాడిన ‘కహో నా కహో’ ఎక్స్టెండెడ్ వర్షన్ వీడియో సాంగ్ 1.76 లక్షల వ్యూస్తో పెద్ద హిట్ అయింది. ఆ టాలెంట్ని మెచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో మీథికాతో షార్ట్ వీడియోస్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని ఇన్స్టాలో, యూట్యూబ్లో అమెజానే పోస్ట్ చేస్తుంటుంది. తన కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యంగ్య ధోరణిలో రీల్స్గా, షాట్స్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూపిస్తుంటుంది మీథికా. ఆమె ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ అకౌంట్స్కి పెద్దవాళ్ల నుంచి జెనరేషన్ ఆల్ఫా వరకు అందరూ అభిమానులే! అర్బాజ్ఖాన్, అనురాగ్ కశ్యప్, ప్రియంకా చోప్రా లాంటి సెలబ్రిటీలూ ఫాలోవర్సే! -
కంకాళాల కలకలం
అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్బుకర్కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్బుకర్కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది. వారంతా సెక్స్వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.2010 డిసెంబర్ 9న అల్బుకర్కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్బుకర్కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది. ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు. -
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్కి తగ్గ డిజైన్స్తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్లో కూడా కూల్గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
ఈవారం కథ: కుట్ట
‘అలివర్! రేపు పార్టీ.. గుర్తుంది కదా? ఈవినింగ్ త్వరగా వచ్చేయ్. పార్టీకి ఒక్కణ్ణే అన్ని ఏర్పాట్లు చెయ్యలేను’ అన్నాడు ఆస్కార్. ‘గాబరాపడకు.. అన్ని ఏర్పాట్లూ చేసేశాను..’ అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు అలివర్.కారు వెళ్ళిపోతుంటే అలా చూస్తుండిపోయాడు ఆస్కార్. అంతా తను అనుకున్నట్లే జరిగితే అలివర్ని ప్రాణాలతో చూడటం ఇదే ఆఖరు అనుకున్నాడు ఆస్కార్. ఆ ఆలోచన రాగానే అతని కాళ్ళు చేతులు వణకసాగాయి.ఆరేళ్ళ క్రితం ఆస్కార్కి అలివర్ ఒక బస్సులో పరిచయం అయ్యాడు. అప్పటికే అలివర్ ఒక కంపెనీలో మేనేజర్గా ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆస్కార్ మాత్రం ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. అప్పటికే అతను ఐదు ఉద్యోగాలు మారాడు. ఏ కంపెనీలోనూ స్థిరంగా ఉండేవాడు కాదు. కారణం ఆస్కార్ సోమరిపోతు. కష్టపడే మనస్తత్వం కాదు. దాంతో ఏ కంపెనీలోనూ ఆరునెలల కన్నా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే అలివర్ పరిచయమయ్యాడో ఆస్కార్ జాతకం మారిపోయింది. అతను ఆస్కార్ని చేరదీసి తన ఇంట్లో స్థానమిచ్చాడు. స్వంత తమ్ముడిలా ఆదరించాడు. అతని బాగోగులన్నీ అలివరే చూసుకోవడంతో ఆస్కార్ ఉద్యోగం మానేసి ఇంటి పనులు చేసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు.అలివర్ తల్లితండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించడంతో అమ్మమ్మ ఎస్టెల్లానే అలివర్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. వృద్ధాప్యం వల్ల ఆమె ఏడాది కిందట చనిపోయింది. దాంతో ఆమెకున్న ఐదుకోట్ల ఆస్తి ఇటీవలే అలివర్ పేరు మీదకు బదిలీ అయింది. ఆ వార్తను ఆస్కార్కి చెప్పి, అతన్ని తన ఆస్తికి నామినీగా పెట్టాడు అలివర్. అంటే తన తదనంతరం ఆ ఆస్తి ఆస్కార్దే అన్నమాట. దాంతో ఆస్కార్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అలివర్కి ఇదివరకే మార్గరెట్ అనే అమ్మాయితో పెళ్ళైనా, ఆమెతో పొసగక విడాకులు తీసుకున్నాడు. అయితే అలివర్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ ఆస్తి అతని భార్యకు చెందుతుంది.ఈమధ్యనే అలివర్ మేరీ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆస్కార్కి తెలిసింది. ఆ విషయమే ఆస్కార్కి నిద్రలేకుండా చేస్తోంది.ఒక ఆదివారం మద్యం తాగుతున్న సమయంలో మేరీతో తన పెళ్ళి విషయాన్ని అలివర్.. ఆస్కార్కి చెప్పడంతో అతని గుండెలో పిడుగు పడ్డట్లయింది. అలివర్ పెళ్ళి చేసుకుంటే ఐదుకోట్ల ఆస్తికి మేరీ వారసురాలౌతుంది. తన బతుకు అధోగతే! ఆస్తి దక్కకుండా పోతుండటంతో అతనికి బాధగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.పెళ్ళికి ముందే అలివర్ను చంపేస్తే..? అవును! అలివర్ ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే ఆ ఐదుకోట్ల ఆస్తికి తను వారసుడవుతాడు. ఆ తరువాత జీవితమంతా హాయిగా గడిపెయ్యవచ్చు. ఎలా చంపడం? ఏ మాత్రం అనుమానం వచ్చినా జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే! కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపాలి. కానీ అదంత సులభం కాదు. అసలే స్కాట్లండ్ పోలీసులు.. ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు.ఆ సమయంలో అతనికి కీత్ గుర్తుకొచ్చాడు. కీత్.. అలివర్ ఇంట్లో తోటపనివాడు. పాతికేళ్ళ పొడవైన యువకుడు. ఏవో చిన్న చిన్న గొడవల్లో రెండుసార్లు జైలుక్కూడా వెళ్ళొచ్చాడు.కీత్ గుర్తుకురాగానే ఆస్కార్ మెదడులో ఒక పథకం రూపుదిద్దుకుంది. వెంటనే కీత్ని పిలిచి విషయం చెప్పాడు. వినగానే కీత్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ పని చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆస్కార్ చెప్పడంతో కీత్ మెత్తబడ్డాడు. ‘ఎలా ఇవ్వగలవ్?’ సందేహం వెలిబుచ్చాడు కీత్.‘అలివర్ చనిపోతే నాకు ఐదుకోట్ల ఆస్తి వస్తుంది. అందులోంచి నీకు కోటిస్తాను’ చెప్పాడు ఆస్కార్. ఒప్పుకున్నాడు కీత్. పథకాన్ని ఎలా అమలు చెయ్యాలో వివరించాడు ఆస్కార్. అలివర్ రోజూ ఉదయం ఏడు గంటలకు ఆఫీస్కి బయలుదేరుతాడు. అతను వెళ్ళే దార్లో అడవి ఉంటుంది. విగ్గు, మీసాలు పెట్టుకొని కీత్ అడవిలో అలివర్ని లిఫ్ట్ అడగాలి. ఎవరు లిఫ్ట్ అడిగినా అలివర్ కాదనడు. అతనలా కారు ఆపగానే కీత్ అందులోకి ఎక్కుతాడు. కొంతదూరం వెళ్ళాక బహిర్భూమి కోసమని కారు ఆపమంటాడు కీత్. అప్పుడు కీత్ తన వెంట తెచ్చుకున్న సుత్తితో అలివర్ తల మీద కొట్టి చంపేసి, అతని శవాన్ని దగ్గర్లోని ఒక లోతైన చెరువులో పడేసి, ఆ కారునేమో కొద్ది దూరంలో ఉన్న లోయలోకి తోసేస్తాడు. తరువాత తను ఆస్కార్ దగ్గరికి వచ్చి ‘ఆపరేషన్ సక్సెస్’ అని చెబుతాడు. ఇదీ ప్లాన్. అందుకే ఈరోజు అలివర్ కార్లో బయలుదేరగానే అతన్ని సజీవంగా చూడటం అదే ఆఖరుసారి అనుకున్నాడు ఆస్కార్. ∙∙ అలివర్ వెళ్ళి అప్పుడే నాలుగు గంటలయింది. ఈపాటికి అలివర్ని చంపేసి, కీత్ ఇంటి ముఖం పట్టుండాలి. అలా అనుకోగానే ఆస్కార్లో వణుకు మొదలైంది. అతని మస్తిష్కం మొద్దుబారిపోసాగింది. వెంటనే సిగరెట్ తీసి వెలిగించాడు. కీత్ కోసం వాకిలి కాస్తున్నాడు.టైమ్ పదయింది.. కీత్ ఇంకా రాలేదు. టీ తాగి వరండాలో కూర్చున్నాడు ఆస్కార్. ఏమైంది? కీత్ ఇంకా రాలేదు ఎందుకు? కాలం గడుస్తున్నా కొద్ది అతనిలో ఆందోళన పెరగసాగింది. సిగరెట్ మీద సిగరెట్తో వరండా అంతా పొగ వ్యాపించింది. టైమ్ పదకొండు అయింది. కీత్ జాడ లేదు. గడియారం ముల్లు శబ్దం మినహా వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే లేచి అలివర్ ఆఫీసుకి ఫోన్ చేశాడు ఆస్కార్. ఆ సమయంలో అలివర్ అక్కడ ఉండడని అతనికి తెలుసు. ఆ ఫోన్ ద్వారా అతను ఆఫీసుకి చేరలేదన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు ఫోన్ చెయ్యడం వల్ల తన ఆందోళన ఆఫీసు వాళ్ళకి తెలిసి, అది రేప్పొద్దున పోలీసు ఎంక్వైరీలో ఎలిబీగా ఉపయోగపడుతుందని అతని ఆలోచన.అవతలి వైపు నుంచి అలివర్ సెక్రటరీ రూత్ ‘హలో! ఎవరు కావాలి?’ అడిగింది.‘రూత్! నేను ఆస్కార్ని. అర్జెంట్గా అలివర్తో మాట్లాడాలి’ చెప్పాడు. ‘అలివర్ ఆఫీసులో లేరు సార్’ అంది రూత్. ఆ మాట వినగానే ఆస్కార్ ముఖంలో చిన్నగా నవ్వు మెరిసింది. ‘ఓకే! ట్రాఫిక్లో ఇరుక్కొని ఉంటాడు. రాగానే ఫోన్ చెయ్యమను’ చెప్పాడు ఆస్కార్.. తనకేమీ తెలియనట్లు నటిస్తూ. ‘క్రితం మంగళవారం నుంచి అతను ఆఫీసుకి రావటం లేదు. వచ్చే సోమవారం వరకూ రాడు’ చెప్పింది రూత్.ఆ మాటలు వినగానే ఆస్కార్ మెదడు కొద్ది క్షణాలు మొద్దుబారిపోయింది. ఏమీ అర్థంకాక కుర్చీలో కూలబడిపోయాడు.క్రితం మంగళవారం నుంచి అలివర్ ఆఫీసుకి వెళ్ళటం లేదా? ఉదయం 7 గంటలకి ఆఫీసుకి బయలుదేరి సాయంత్రం ఇంటికి రావడం అతని దినచర్య. అలాగే ప్రతిరోజూ ఇంటి నుంచి ఏడు గంటలకు ఆఫీసుకి అని చెప్పి బయలుదేరుతున్నాడు. మరి మంగళవారం నుంచి ఆఫీసుకి రావటం లేదని చెబుతోందేంటి రూత్? వారం నుంచి అతనెక్కడికి వెళుతున్నట్లు? రూత్ చెప్పిందే నిజమైతే అడవిలో కీత్కి అలివర్ కారు ఎదురుపడి ఉండదు. మరి కీత్ అక్కడ ఏం చేస్తున్నట్లు? ఇంకా అలివర్ వస్తాడని ఎదురు చూస్తున్నాడా? ఇప్పటి వరకూ అలివర్ రాకపోతే కీత్ తనకి ఫోన్చేసి ఆ విషయం చెప్పి ఉండేవాడు. ఏం జరిగింది? కొంపదీసి తన ప్లాన్ అలివర్కి తెలిసిపోయిందా? కీత్ ఏమైనా చెప్పి ఉంటాడా? అందుకే అలివర్ ఆఫీసుకి వెళ్ళటం లేదా? రకరకాల ఆలోచనలు ఆస్కార్లో. ఆందోళనతో సిగరెట్లు ఊదేస్తున్నాడు. మళ్ళీ రూత్కి ఫోన్ చెయ్యాలనుకున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని, కీత్ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు.సమయం రెండయింది. కీత్ రాలేదు. ఆలోచనలు మళ్ళీ ఆస్కార్ని చుట్టుముట్టాయి. ఒకవేళ అలివరే కీత్ని చంపేసుంటే? ఆస్కార్ ముఖం నిండా చెమటలు. ఇంతలో కారు హారన్ వినిపించింది. ఆస్కార్ ముఖంలో ఒక వెలుగు. పరుగున వెళ్ళి తలుపు తీశాడు. అప్పుడే కారు దిగుతూ కనిపించాడు కీత్. ‘అన్నీ సవ్యంగా జరిగాయా?’ కంగారుగా ఆస్కార్.‘అంతా సవ్యమే’ అన్నట్లు బొటనవేలిని ఎత్తి చూపాడు కీత్.‘మరింత ఆలస్యం అయిందేంటి?’ ఇంకా ఆందోళన తగ్గలేదు ఆస్కార్లో. ‘అన్నీ పూర్తిచేసుకొని వచ్చేసరికి ఈ టైమ్ అయింది’ కీత్.‘మనం అనుకున్నట్లే అతను కారు ఆపి నీకు లిఫ్ట్ ఇచ్చాడా?’ అడిగాడు ఆస్కార్.‘నేను చెయ్యెత్తగానే కారు ఆపాడు. ఎక్కడ నుంచి వస్తున్నావ్? ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. చెప్పాను. ప్లాన్ ప్రకారమే కొంత దూరం వెళ్ళాక చిటికెన వేలు చూపించి, కారు ఆపమన్నాను..’ అని ఆగాడు కీత్.‘ఆ తరువాత?’ ఆస్కార్లో కుతూహలం. ‘సుత్తితో తల మీద కొట్టి, చంపేసి, శవాన్ని చెరువులో పడేసి, కారుని లోయలోకి తోసేశాను’ చెప్పాడు కీత్. ప్రశ్నల వర్షం ఆగిపోవడంతో కాఫీ తాగి వెళ్ళిపోయాడు కీత్. అప్పుడు రూత్కి ఫోన్చేసి ‘అలివర్ గురించి ఆందోళనగా ఉంది. అతను వారం నుంచీ ఆఫీసుకి వెళుతున్నాడు. ఈరోజు కూడా వెళ్ళాడు’ చెప్పాడు ఆస్కార్. ‘లేదు సార్. రావట్లేదు..ఈరోజు కూడా రాలేదు.. మంగళవారం వరకు రాననే చెప్పాడు. కాబట్టి నేనేమీ గాబరా పడట్లేదు’ స్పష్టం చేసింది రూత్.‘మరి ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా?’ ఆస్కార్. ‘లేదు సర్.. ఏదో పనుందంటూ వారం సెలవు మాత్రం తీసుకున్నాడు’ రూత్.‘రేపు మేము ఓ పార్టీ ఇస్తున్నాం. చాలామంది స్నేహితులను పిలిచాం. అతనికేదో జరిగి ఉంటుందనిపిస్తోంది నాకు. అతని స్నేహితుల్ని కనుక్కొని ఏం జరిగిందో చెప్పు’ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆస్కార్. అరగంట తరువాత రూత్ ఫోన్ చేసి ‘సార్! అతని స్నేహితులు పార్కర్, మిస్ సాషెల్తో మాట్లాడేను. అతను వాళ్ళకు తనెక్కడికి వెళుతున్నాడో చెప్పలేదుట. ఒకరోజు వేచి చూసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యమని చెప్పారు. మీరేం గాబరా పడకండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పింది.ఆరోజు సాయంత్రం.. అలివర్ కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆస్కార్. వాళ్ళు అలివర్ కారు నంబరు, మిగతా వివరాలు అడిగి అతని ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు. ∙∙ పోలీస్ డిటెక్టివ్ సార్జెంట్ క్లేమోర్ నుంచి ఆస్కార్కి ఫోన్ వచ్చింది. అలివర్ ఆచూకీ గురించి వాకబు చేశాడు ఆస్కార్. ఇంకా తెలియలేదు, ఆ పనిలోనే ఉన్నామని చెప్పాడు క్లేమోర్. ‘అలివర్కి ఏదో జరిగుంటుందనిపిస్తోంది. ఏదో అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని నా అనుమానం’ అన్నాడు ఆస్కార్.‘అంటే ఆత్మహత్య చేసుకున్నాడనా?’ క్లేమోర్. ‘కావొచ్చని భయడుతున్నాను’ ఆస్కార్. ‘ఆత్మహత్యకు పాస్పోర్ట్ ఎందుకతనికి?’ అన్నాడు క్లేమోర్.‘పాస్పోర్టా?’ అర్థంకాలేదు ఆస్కార్కి. ‘వారం క్రితం ఆఫీసుకి వెళ్ళినప్పుడు అలివర్ అక్కడున్న పాస్పోర్టును తీసుకెళ్ళాడని వాళ్ళ డైరెక్టర్ చెప్పాడు నాతో. ఎటైనా టూర్కెళ్ళి ఉంటాడు. మీరేం గాబరా పడకండి. అతను ప్రాణాలతోనే ఉండుంటాడు. నిన్న అతని లాయర్తో మాట్లాడేను. అలివర్ ఈమధ్య తన ఆస్తి విల్లును మార్చి రాశాడని చెప్పాడతను. ఆత్మహత్య చేసుకోబోయేవాడు అవన్నీ చెయ్యడు కదా! బహుశా ఇవేమీ తెలియక మీరు కంగారుపడుతున్నారు’ అన్నాడు క్లేమోర్.‘నాకవేమీ తెలియవు’ ఆస్కార్. మర్నాడు ఉదయమే 9 గంటల వేళ ఆస్కార్ ఇంటికి వచ్చాడు క్లేమోర్. పెద్ద పెద్ద మీసాలతో పొడవుగా తెల్లగా సన్నగా ఉన్నాడతను. వస్తూనే ‘మిస్టర్ ఆస్కార్! అలివర్ చనిపోయాడని ఎందుకనుకుంటున్నారు మీరు?’ అడిగాడు.‘ఆరేళ్లుగా అతని దగ్గరే ఉంటున్నాను. నాకు చెప్పకుండా అతనెప్పుడూ ఎక్కడికీ వెళ్ళడు. అందుకే అనుమానం’ చెప్పాడు ఆస్కార్.‘అతని అదృశ్యం వెనక మీ పాత్ర ఉందనుకోవచ్చా?’ సందేహపడ్డాడు క్లేమోర్. అతని మాటలకు ఆశ్చర్యపోతూ ఆస్కార్ ‘ఏం మాట్లాడుతున్నారు?’ అన్నాడు. ‘అతన్ని చంపడానికి మీరు ప్రయత్నించి ఉంటారని నా అనుమానం’ సార్జెంట్ క్లేమోర్.‘చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అలివర్ నా ప్రాణస్నేహితుడు. నేనెందుకు అతన్ని చంపాలనుకుంటాను?’ బాధను ఒలికిస్తూ ఆస్కార్.‘మీ ప్రాణస్నేహితుడు చనిపోయుంటాడని నిన్నట్నుంచి మీరే అంటున్నారు పదేపదే!’ అన్నాడు క్లేమోర్.‘నాకెందుకో అలా అనిపించిందన్నాను తప్ప, అదే నా భావన కాదు’ ఆస్కార్.‘మీ ఇద్దరిలో అతనే ఆస్తిపరుడు. అందుకే మీ మీద నాకు అనుమానం’ క్లేమోర్.‘అలివర్ భార్య మార్గరెట్తో విడాకులు తీసుకున్న దగ్గర్నుంచీ నిస్పృహకు లోనయ్యాడు. నాతో ఆ బాధను పంచుకుంటూ చనిపోవాలనుందన్నాడు ఎన్నోసార్లు. అందుకే అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అనుమానం వచ్చింది. కానీ దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకోలేదనిపిస్తోంది’ ఆస్కార్. ‘అలివర్ కేసుని సీరియస్గానే తీసుకున్నాం ఆస్కార్! ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేమి జరిగుండొచ్చని మీ అనుమానం?’ అడిగాడు క్లేమోర్.‘అతన్నెవరైనా హత్య చేసి ఉండొచ్చు’ ఆస్కార్.‘అదెలా సాధ్యం?’ అడిగాడు క్లేమోర్.‘అలివర్ అడిగిన వాళ్ళందరికీ కారులో లిఫ్ట్ ఇస్తూంటాడు. అలా ఇవ్వొద్దని ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదు. అలా లిఫ్ట్ అడిగిన వ్యక్తెవరైనా అలివర్ని హత్య చేసుండొచ్చని నాకనిపిస్తోంది’ ఆస్కార్.‘అంటే అతన్ని ఎవరో ఆగంతుకుడు హత్య చేసి ఉండొచ్చంటున్నారు?’ ఆశ్చర్యంగా క్లేమోర్.‘అనే నమ్ముతున్నాను..’‘అంటే ఆత్మహత్య కన్నా హత్యే జరిగుండొచ్చనా?’ ‘బహుశా’ ఆస్కార్. ‘అంటే ఆగంతుకుడెవరో అలివర్ని లిఫ్ట్ అడిగి, అతని కారెక్కి, అతన్ని చంపి.. శవాన్ని ఎందులోనైనా పడేసి, అతని దగ్గరున్న డబ్బుతో పరారైపోయుంటాడని మీ అనుమానం.. అంతేనా?’ క్లేమోర్.‘అదే జరిగుండొచ్చు. ఎందుకంటే అలివర్ దగ్గర పదిలక్షలకు తక్కువ కాకుండా డబ్బుంటుంది ఎప్పుడూ! బహుశా ఆ డబ్బు కోసమే అలివర్ని చంపేసి ఉండొచ్చు’ అన్నాడు ఆస్కార్. ‘మీరు చెప్పింది కాకుండా ఇంకోటి జరిగి ఉండొచ్చనిపిస్తోంది నాకు’ క్లేమోర్. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ఆస్కార్.‘అతని అదృశ్యంలో మీ హస్తం ఉండొచ్చని, హత్యలో మీరూ భాగస్వాములవొచ్చని నా అనుమానం’ క్లేమోర్. అతని మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఆస్కార్. ఏం చెప్పాలో అర్థంకాక క్లేమోర్ వైపు కోపంగా చూశాడు. ‘మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?’ అన్నాడు. ‘మిస్టర్ ఆస్కార్.. మీరేం చెబితే అది నమ్మడానికి మేమంత అమాయకులం కాము. అంతా పరిశోధించే ఒక నిర్ణయానికి వస్తాం’ అన్నాడు క్లేమోర్.‘అలివర్ని చంపేటంతటి అవసరం నాకేం ఉంది చెప్పండి?’ అమాయకత్వం ధ్వనింపజేస్తూ ఆస్కార్.‘అతని ఆస్తి.. అలివర్ చనిపోతే అతని ఐదుకోట్ల ఆస్తి మీకు చెందుతుంది. ఎందుకంటే ఆ ఆస్తికి మీరే నామినీ కాబట్టి’ క్లేమోర్.‘నిన్నంతా ఈ ఇంట్లోనే ఉన్నాను. అతన్ని నేనెలా చంపగలను?’ ఆస్కార్.‘మీరే హత్య చేశారని అనటం లేదు. చేయించారు అంటున్నాను. అతని హత్యకు కుట్ర పన్నారు’ ఆస్కార్ ముఖంలోకి చూస్తూ క్లేమోర్.‘కుట్రా! నేనా?’ ఆస్కార్ ఆశ్చర్యం నటిస్తూ!‘నిన్న కీత్ని పట్టుకొని విచారిస్తే జరిగినదంతా చెప్పాడు’ క్లేమోర్.‘అతను మీకన్నీ అబద్ధాలు చెప్పి ఉంటాడు. అతని మాటలు నమ్మవద్దు’ ఆస్కార్.‘నువ్వు అలివర్ని చంపడానికి పన్నిన కుట్రనంతా కళ్ళకు కట్టినట్లు కీత్ చెప్పాడు. రూఢి చేసుకున్న తరువాతే ఇక్కడికి వచ్చాను. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి’ అంటూ ఆస్కార్ని అరెస్ట్ చేశాడు క్లేమోర్. ఓ వారం తరువాత ఆస్కార్ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. జైల్లో ఉన్న అతనికి ఆ ఉత్తరాన్నిచ్చారు పోలీసులు. ‘డియర్ ఆస్కార్!నీ పథకం ప్రకారం కీత్ నన్ను చంపాలని ఆ రోజు నన్ను లిఫ్ట్ అడిగాడు. తీరా కారులోకి ఎక్కిన తరువాత ఆ పని చెయ్యలేక భయపడిపోయి నిజం చెప్పేశాడు. అప్పుడు నేను కొన్నాళ్ళు అదృశ్యం అవుతాననీ, నీకు మాత్రం నన్ను హత్యచేసినట్లే చెప్పమనడంతో కీత్ నీకలా చెప్పాడు. నువ్వు దాన్ని నమ్మావు. నా చేతికి ఐదుకోట్ల ఆస్తి వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తనలో మార్పు గమనించాను. అందుకే రెండు నెలల క్రితం లండన్లో మేరీని పెళ్ళి చేసుకొని, ఆస్తికి ఆమెను నామినీగా పెట్టి విల్లు మార్చాను. ఆస్కార్! నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి తప్పుడు దారిని ఎంచుకున్నావ్. ఇప్పుడు నేను, మేరీ లండన్ లో హనీమూన్లో ఉన్నాం. కోర్టులో నీ కేసు వాదనలు మొదలయ్యేలోపే స్కాట్లండ్ వస్తాను.ఇంకా బతికే ఉన్న నీ స్నేహితుడు..అలివర్!’ఆ ఉత్తరం చదివి చేష్టలుడిగిపోయాడు ఆస్కార్. ∙గన్నవరపు నరసింహ మూర్తి(మైఖేల్ అండర్వుడ్ ఓకే ఫర్ మర్డర్ కథ ఆధారంగా) -
రుక్మాంగద చరిత్ర
సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణుభక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాలా అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి, అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణుభక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణుభక్తుడయ్యాడు.విష్ణుభక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశీ నియమం మాదిరిగానే, రుక్మాంగదుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ, ఏకాదశి తిథినాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా, తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తు.చ. తప్పకుండా ఏకాదశి వ్రత నియమాన్ని నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశీ వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లసాగారు. రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండాపోయింది. యముడికి పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు. ‘కమలసంభవా! విదిశారాజ్యంలో నాకు పనిలేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవరూ లేరు. ఎలాగైనా, వారి ఏకాదశీ వ్రతానికి భంగం కలిగించు’ అని కోరాడు.యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రతదీక్షను, అతడి ప్రజల భక్తితత్పరతలను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రతదీక్షను పరీక్షించదలచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు. ‘మోహినీ! నువ్వు భూలోకానికి వెళ్లు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు’ అని ఆదేశించాడు.బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది.విదిశా రాజధాని వెలుపల అరణ్యప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని, వీణ వాయించసాగింది.అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు.కీకారణ్యంలో సంచరిస్తూ, ఎన్నో క్రూరమృగాలను వేటాడాడు. వేట ముగించుకుని, రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక, శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ, శివాలయం వద్దకు వెళ్లాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే, ఆలయ మండపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధమోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూపలావణ్యాలను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు.‘సుందరాంగీ! నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను’ అన్నాడు.‘రాజా! అనుదిన సుఖభోగాలను అందించగలవంటే, నేను నీకు భార్యను కాగలను’ అందామె.ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని, ఆమెను వెంటపెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు.కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమినాడు ఏకభుక్తుడై, ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు.‘నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి, ఉపవాసాలు, వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి, నాతో విహరించు, పద’ అంది మోహిని. ‘సూర్యుడు పడమరన ఉదయించినా, మేరు మంధర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడిపోయినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను’ అని బదులిచ్చాడు రుక్మాంగదుడు.అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని, అతడిని నానా దుర్భాషలాడింది. ‘ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమయినది ఇంకేం చేయమన్నా చేస్తాను, చెప్పు’ అనునయంగా అన్నాడు రుక్మాంగదుడు.‘అలాగైతే, నీ కొడుకు తల నరికి ఇవ్వు’ అందామె.రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రతనియమానికి భంగం కలగకుండా ఉండటమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకుని, మోహిని ఎదుట నిలిచి, తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు.ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు.‘రుక్మాంగదా! నీ వ్రతనియమం సాటిలేనిది. ఇహపరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నాం’ అని పలికి, ధర్మాంగదుడిని బతికించి, అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్లిపోయింది. ∙సాంఖ్యాయన -
Christmas 2024: జగద్రక్షకుని జన్మదినం
చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు తన లేత వెచ్చని కిరణాలతో ఆ గ్రామాన్ని నిద్ర లేపాడు. పక్షుల కిలకిలరావాలతో, పట్టణానికి బయలుదేరుతున్న ఎడ్లబండ్ల చప్పుళ్ళతో, గేదెలను తోలుకుంటూ వెళ్తున్న పల్లె పిల్లగాళ్ళ అరుపులతో, నీళ్ళ కోసం బయలుదేరిన అమ్మలక్కల బిందెల చప్పుళ్ళతో దినచర్య ప్రారంభించే ఆ అందమైన గ్రామం ఆరోజు మరింత సందడిగా మారింది.రాత్రంతా తాగుబోతు నాన్న కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయి జ్వరంతో మత్తుగా నిద్ర పట్టేసిన సూరి ఈ హడావిడికి ఒక్కసారిగా లేచాడు. ‘అమ్మో! చాలా ఆలస్యమైందే! పండుగ రోజులు కదా, చాలా తొందరగా రావాలి అని నిన్న అమ్మగారు చెప్పారు. ఈరోజు నా పని అయిపోయిందిలే’ అని అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ ‘ఒరేయ్ చద్దన్నమన్నా తిని వెళ్ళరా!’ అని అరుస్తున్న అమ్మ కేకలు కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయలుదేరాడు. అప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది ఆ ఇంటి యజమానురాలు. భయం భయంగా లోపలికి వస్తుండగా, ‘ఆగు!’ అనే మాట విని నిలబడిపోయాడు. అమ్మగారి వంకే చూస్తున్నాడు. ‘అమ్మగారూ! రాత్రంతా జ్వరం..’ అని పరిస్థితిని చెబుదామనే లోపులో దబదబమని బాదింది. ‘పండుగ రోజులు కదా, త్వరగా రావాలి అని చెప్తే లేటుగా వస్తావా?’ అని నోటికొచ్చినట్టు తిట్టింది. అసలే రాత్రి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బల మీద ఈ దెబ్బలు తగలడంతో మరింత బాధపడుతూ పని దగ్గరకు పరుగెత్తాడు. దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ఓదార్చేవారెవ్వరూ లేరక్కడ.సూరి వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడు. సాయంత్రం తాగివచ్చి వాళ్ళమ్మను, చెల్లెళ్ళను, సూరిని చితకబాదుతాడు. ప్రతిరాత్రి పస్తే! వాళ్ళమ్మ జబ్బు చేసి నీరసంగా ఉంటుంది. అందుకని సూరిని ఆ ఊళ్ళో డబ్బున్న కాంతారావు ఇంట్లో పనికి పెట్టింది. సూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళు పెట్టే మిగిలిపోయిన అన్నం, కూరలు తింటూ జీవిస్తున్నాడు. చాకిరి చెయ్యడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆ యజమానురాలు కొట్టే దెబ్బలు, తిట్లు భరిస్తున్నాడు. ఇవన్నీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇల్లు చక్కబెడుతున్నాడు. ‘ఒరేయ్ సూరీ ఎంతసేపురా! ఇటురా!’ అనే కేకతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని వెళ్లాడు. కంటకురాలైన యజమానురాలి హెచ్చరికతో బండెడు గిన్నెలు తోమడం మొదలు పెట్టాడు.అవి క్రిస్మస్ పండుగ రోజులు. కాంతారావుగారి ఇల్లంతా సందడే సందడి. ఇల్లంతా పువ్వులతో, కరెంటు దీపాలతో అలంకరించారు. అమ్మగారు, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టలు, నగలు ధరించారు. పిండివంటల ఘుమఘుమలతో, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. సూరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఈ సందడంతా గమనిస్తూనే ఉన్నాడు. భోజనాల సమయమైంది. అందరూ భోంచేశారు. సూరి ఒక్కడే మిగిలి పోయాడు.పెరట్లో కూర్చుని అమ్మగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మగారి కేక వినిపించింది. ‘రారా సూరీ అన్నం తిందువు గాని’.. వెంటనే ఆత్రంగా వెళ్ళాడు. రాత్రి భోజనం లేదు. ఉదయం లేదు గదా ఇప్పుడు పెట్టే పిండి వంటలు ఆరగిద్దామంటూ తనకు పెట్టిన భోజనం వైపు చూశాడు. ఎంత ఆశతో వెళ్లాడో అంత నిరుత్సాహానికి గురయ్యాడు. మాడు అన్నం, వూడ్చి వూడ్చి వేసిన కూర చూసి తినలేక దుఃఖం పొంగుకు వచ్చింది. ఆకలంతా చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగి వెళ్ళి, వారంతా తిన్న గిన్నెలన్నీ తోమి, మిగతా పనులన్నీ చక్కబెట్టి ఇంటికి బయలుదేరాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇంటిలోకి అడుగు పెట్టాడు. అప్పటికే వాళ్ళ నాన్న బీభత్సం సృష్టించాడేమో! చెల్లెళ్ళంతా ఏడుస్తూ చలికి దుప్పట్లు లేక కాళ్ళు ముడుచుకొని వణుకుతూ పడుకున్నారు. తల్లి మంచం మీద మూలుగుతోంది. గుడిసె అంతా చిందరవందర. సర్దిపెట్టే ఓపిక లేక తల్లి వద్ద తాను చిన్న గుడ్డ ముక్క పరచుకుని పడుకున్నాడు. పండగపూట కదా! కొడుకు ఏదైనా తెస్తాడని ఆశించిన తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సూరి పడుకున్నాడు గాని నిద్ర పట్టడం లేదు. ఏడుపొస్తోంది. అమ్మకు కనబడకుండా ఏడ్వాలనుకున్నాడు కాని, అదిమి పట్టేకొద్ది ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సూరి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ‘ఏంట్రా? నీ బాధేమిటో చెప్పమ్మా’ అమ్మ అడుగుతోంది. ఆ రోజు జరిగినదంతా అమ్మకు చెప్పాడు. తల్లి నచ్చచెప్ప ప్రయత్నించింది. తన్ను తాను తమాయించుకొని, ‘అమ్మా! క్రిస్మస్ అంటే ఏంటమ్మా?’ అని అడిగాడు. వాళ్ళమ్మ చెప్పింది. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’.. ‘లేదు నాయనా! దేవుడు అందరికీ దేవుడే! ఈ లోకంలోని ప్రజలందరి కోసం ఆయన పుట్టాడు. మనలాంటి పేదోళ్ళ బతుకులు బాగుపరచడానికి, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చేసి తన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు!’.. ‘అలా అయితే మనకేంటి ఈ పేద బతుకు?’ దుఃఖంతో అన్నాడు సూరి. ‘లేదు నాయనా! అసలైన పేదరికం భౌతికమైనది కాదు. మనలోని ఆత్మకు సంబంధించినది. పాపంలో బందీయైన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దరిద్రుడే! ప్రేమ హీనత, క్షమించలేకపోవడం, అహంభావం, ఇతరులను అవమానించడం లాంటివి ఆధ్యాత్మిక పేదరికానికి నిదర్శనాలు. అలాంటి స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చడానికి యేసయ్య కూడా అందరికీ దగ్గరవ్వడానికి పేదవానిగానే వచ్చాడు. బెత్లేహేము గ్రామంలో పశువుల తొట్టెలో పుట్టాడు. ‘అయ్యో! పశువుల తొట్టా? దేవుడు పశువుల తొట్టెలో పుట్టడమేంటమ్మా?’.. ‘ఆయన పశులతొట్టెలో పుట్టాడు కాబట్టే, సామాన్యులైన గొర్రెల కాపరులు ఆయనను మొదట దర్శించుకున్నారు. దేవుడు వారికి ఇంత దగ్గరగా వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాక అనేకమంది రోగులను బాగుచేశాడు, బీదవాళ్ళను, కుష్ఠు రోగులను అక్కున చేర్చుకున్నాడు. కన్నీరు తుడిచి, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాదు! మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. తలలో ముళ్ళు, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. కడుపులో బల్లెపు పోట్లు, శరీరమంతా మాంసపు ముద్దగా మారి రక్తాన్ని చిందించాడు. దుర్మార్గులు పొందాల్సినవన్నీ ఆ ప్రేమమయుడు తనపై వేసుకున్నాడు. ఈ ప్రాణత్యాగం చేయడానికి పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మరో గొప్ప సంగతి. చనిపోయి మూడవరోజు తిరిగి లేచాడు’ అని తల్లి అనేక విషయాలు సూరికి తెలిపింది. ‘అయితే ఇకనుండి నేను ఏడ్వను. మా అమ్మగారిని తిట్టను, నాన్నమీద కోపపడను. వీళ్ళందరినీ ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా ఫర్వాలేదు. యేసయ్య నాతో ఉన్నారుగా’ అంటూ ఆ చిన్ని హృదయంలోకి ప్రభువును చేర్చుకున్నాడు. తిట్లకు, తన్నులకు, పస్తులకు సూరి భయపడట్లేదు, ఏడ్వట్లేదు. కొన్ని రోజులు గడిచాయి. తాను పనిచేసే ఇంటి అమ్మగారికి జబ్బు చేసింది. ఆమె పిల్లలంతా ఆమెకు సేవ చేయలేక వెళ్ళిపోయారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో సూరి ఆమెకు ఎంతో శ్రద్ధతో çసపర్యలు చేయడం మొదలుపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న ఆమెను బతికించాడు. ఆమె కోసం నిద్రాహారాలు లేకుండా ప్రార్థించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోలుకుంది. ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సూరిని దగ్గరకు పిలిపించింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది. ‘ఒరేయ్ సూరీ! నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ? నిన్ను ఇంతగా బాధలు పెట్టిన నన్ను ఎంత ఆదరించావురా! నా పిల్లలు కూడా నా పరిస్థితిని చూసి నన్ను విడిచి వెళ్ళిపోయారే! నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాచి మనిషిని చేశావురా’ అని మెచ్చుకుంటుంటే సూరి ‘మా అమ్మగారేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడెంత గొప్పవాడు’ అనుకుంటూ దేవున్ని స్తుతించాడు. ‘క్రీస్తు ప్రభువు నాలోకి వచ్చి ఉండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాణ్ణి కాదు. ఆ యేసయ్య ప్రేమతో పోల్చుకుంటే నేను చూపిన ప్రేమ సముద్రంలో నీటి చుక్క.. మంచినీళ్ళు తెమ్మంటారా?’ అని పైకి లేచాడు. సూరి మాటలకు నిశ్చేష్టురాలైంది. ఔను! బుద్ధిహీనులకు తెలివి కలిగించేది దేవుని వాక్యం. ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి. దేవుని ప్రేమను ఎంతగా దుర్వినియోగపరచాను. కొంచెం కూడా దేవుని ధ్యాస లేకుండా ఆడంబరాల మీదే మనసు పెట్టి, అసలు ఆశీర్వాదాన్ని కోల్పోయానే! ఈ చిన్న పిల్లవాని ద్వారా దేవుడు నిజంగా నా కన్నులు తెరిచాడు అని దేవునికి తనను తాను అర్పించుకున్నది. ఇంటికి వెళ్ళిన సూరి అమ్మగారిలో వచ్చిన మార్పును తన కుటుంబంతో పంచుకున్నాడు. తెల్లారింది. అమ్మగారింటికి బయలుదేరాడు. ఆమె సాదరంగా సూరిని ఆహ్వానించి కేకు కోయించి, కొత్త బట్టలు ధరింపజేసి, ప్రార్థన చేసింది. ‘అమ్మగారూ! క్రిస్మస్ పండుగ అయిపోయింది కదండీ. మళ్ళీ ఇవన్నీ ఏంటండీ’ అడిగాడు. ‘లేదురా సూరీ! అసలు పండుగ నా జీవితంలో ఇదే! నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నేను ద్వేషించిన వారు నాకు సహాయం చేసి నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు’.. ఈ మాటలకు సూరి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన బంధువులు, స్నేహితులు అందరిముందు ‘సూరిని నా కొడుకుగా చేసుకొంటున్నాను. నా తదనంతరం ఈ యావదాస్తికి అతడే వారసుడు. క్రిస్మస్ బహుమానంగా దేవుడు సూరిని నాకు అనుగ్రహించాడు’ అని చెమ్మగిల్లిన కళ్ళతో సూరిని వాటేసుకుంది. ఒక మనిషికి కనువిప్పు కలగడమే నిజమైన పండుగ. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాల కలయిక క్రిస్మస్. దీని అర్థం క్రీస్తును ఆరాధించడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మన్ జరుపుకుంటారు. క్రీస్తు జననం చరిత్రాత్మకమైనది. సుప్రసిద్ధ చరిత్రకారులు క్రీస్తు చరిత్రను అద్భుతంగా వివరించారు. వారిలో రోమా చరిత్రకారుడు గాయిస్ ప్లినియస్ ఒకడు. ఇతడు రోమా చక్రవర్తి ట్రాజన్ దగ్గర మేజిస్ట్రేట్గా క్రీ.శ 98 నుండి 117 వరకు పనిచేశాడు. చక్రవర్తియైన ట్రాజన్కు ఇతనికి జరిగిన ఓ సంభాషణ ఆ కాలంలోని క్రైస్తవుల నిబద్ధతలను వెల్లడిచేసింది. ‘క్రైస్తవులు చీకటి పడకముందే ఒక నియమిత సమయానికి కలుసుకొనేవారు. క్రీస్తును దేవునిగా సంబోధిస్తూ పాటలు పాడేవారు. తాము ఎప్పుడూ ఏ దోషము, దొంగతనమును చేయమని, తాము కట్టుబడియున్న పవిత్ర ప్రమాణమును గౌరవిస్తామని తీర్మానించుకున్నారు. తమ మాటను ఎన్నడు అబద్ధముగా మార్చమని, తప్పుడు ప్రమాణము చేయమని చెప్పుకొనేవారు’. పైమాటలను గమనిస్తే యేసుక్రీస్తును అంగీకరించి మారుమనస్సు పొందిన పిదప వారు నమ్మిన వాక్యమునకు దేవుని బిడ్డలు ఏవిధంగా కట్టుబడియున్నారో విశదమవుతుంది.అపొస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో ఒకసారి గ్రీసు దేశమునకు వెళ్ళాడు. గ్రీసు రాజధాని ఏథెన్సు మహానగరం. విశ్వ విజేతగా పేరుపొందిన అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వజ్ఞానులు సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఈ దేశానికి చెందినవారే! అక్కడి ప్రజలు తత్త్వజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదకుచున్నారు’ అని పౌలు ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏథెన్సులో అరీయొపెగు అనే ప్రాంతం ఉన్నది. దానిని అరీసు కొండయని పిలుస్తారు. ఏథెన్సు మహాసభ వారు అక్కడ కూర్చుండేవారు. ఆ పట్టణంలోని ఘనులు, ధనికులు, అధికారులలోని ముఖ్యులు దీనిలో సభ్యులుగా ఉండేవారు. మొదట్లో దేశంలో జరిగే నేరములను ఈ ప్రాంతంలోనే విచారించి, నేరస్థులకు శిక్షలు విధించేవారు. తరువాతి కాలంలో దేశపాలన విషయాలను, రాజనీతి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను కూడా తర్కిస్తుండేవారు. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటే, ఆ సభకు వెళ్ళి చెప్పాలి. వారు చెప్పిన వాటిలో సత్యం లేకపోతే, తేలు విషాన్ని వారికిచ్చి అక్కడే వారిని చంపేస్తారు. అక్కడ పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని చెప్పడానికి అరీయొపెగు మధ్యన నిలిచి, నిర్భయంగా ప్రకటించాడు. అనేకమందిని ఆలోచింపచేసిన ప్రసంగమది: ‘‘ఏథెన్సు వారలారా! మీరు సమస్త విషయములలో విశేష భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది. నేను మీ పట్టణములో సంచరించుచుండగా నాకొక బలిపీఠము కనబడింది. దానిమీద ‘మాకు తెలియబడని దేవుడు’ అని వ్రాసియుంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను’’.. తెలియబడని దేవునికి నిర్మించిన బలిపీఠాన్ని గ్రీకు భాషలో ‘అగ్నోస్టిక్ థియోస్’ అంటారు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏథెన్సులో ఒక తెగులు వ్యాపించింది. భయంకరమైన తెగులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు. ఎన్నో పూజలు, ప్రయత్నాలు చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆ సమయంలో అక్కడ ప్రజాదరణ పొందిన ఎపిమెనిడెస్, అరాటస్ అను ఇద్దరు తత్త్వజ్ఞానులు ఉండేవారు. ప్రజలు వారి యొద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళగక్కారు. వచ్చిన తెగులు తొలగిపోవడానికి పరిష్కార మార్గాన్ని చూపాలని అడిగారు.అప్పుడు వారు ఈ విచిత్రమైన సలహాను ఇచ్చారు: ‘మీ శక్తి కొలది కొంతమంది దేవుళ్ళను ఆరాధించుచున్నారు. మీకు తెలియని దేవుళ్ళు కూడా ఉండవచ్చు. బహుశా వారు మీ మీద ఆగ్రహించి ఈ తెగులును పంపియుండవచ్చు. ఈ తెగులు అరికట్టాలంటే మీరు ఒక బలిపీఠమును కట్టి దానికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టండి. ఆ దేవుడు శాంతించి తెగులును నిలిపివేయవచ్చు’.. ఆ మాటలను లక్ష్యపెట్టిన ప్రజలు తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు. అక్కడ వారు చేసే ప్రార్థనలు తెలియబడని దేవుని దగ్గరకు వెళ్తున్నాయని భ్రమపడేవారు. సరిగ్గా ఆ ప్రజల ప్రశ్నలకు పౌలు చక్కని సమాధానాలను ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశిష్ట లక్షణాలను కలిగియుంటాడు. వాటిలో మొదటిది: ‘ఆయన సృష్టికర్త’. తన మహిమ కోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే! రెండవది: దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉండువాడు కాదు. గ్రీకులలో కొందరు జ్ఞానులు దేవుడున్నాడు గాని, ఆయన మనుషులను పట్టించుకోడు అని బోధించేవారు. ఆ ఆలోచనను పౌలు ఖండించాడు. దేవుడు మానవుని పట్ల శ్రద్ధ కలిగియుంటాడు. మనిషికి దగ్గరగా ఉండాలనే మనుష్య రూపంలో ఈ లోకానికి ఏతెంచాడు. మూడవది: దేవుడు మనిషి నుండి మార్పును ఆంకాక్షిస్తున్నాడు. ఆ మార్పు హృదయానికి సంబంధించినది. ఇత్యాది విషయాలను తెలియచేయడం ద్వారా పౌలు అనేకులను సత్యం వైపు నడిపించాడు. క్రీస్తు రాక పుడమిని పులకింపచేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరువేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పాలనలో ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సీయా రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి రాలేదు. అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్య్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఇలా ఉంటుంది. పాతనిబంధన గ్రంథంలో అబ్రాహాముకు దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రాహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దీయ దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కనాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురినీ మూలపురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది నలభై సంవత్సరాల అరణ్యయాత్ర తదుపరి యెషువా నాయకత్వంలో కనాను దేశాన్ని చేరుకున్నారు. నాలుగు శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోను జన్మించి పాతనిబంధన లేఖనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు. అది ప్రవచనానుసారం. క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తాడని ఎన్నో యేండ్ల క్రితం ఝెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టెలో జన్మిస్తాడని యోబు గ్రంథంలోను, బెత్లేహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోను, నీతి చిగురుగా వస్తాడని జెకర్యా గ్రంథంలోను స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయన్ను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా యోహాను అనే భక్తుడు వస్తాడనే ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన్ను దర్శించుకున్నారు. ‘మీరు భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు పుట్టిన చోట ఇప్పుడు ఓ గొప్ప దేవాలయాన్ని చూస్తాం. బెత్లేహేము సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టినచోట ఉన్న నక్షత్రాన్ని చూసి వస్తారు. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. బేత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా చిన్నది. కాని, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టిన్ మార్టర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా, 3వ శతాబ్దికి చెందిన చరిత్రకారులు ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. బైబిల్ను లాటిన్ బాషలోనికి అనువదించిన చరిత్రకారుడు సెయింట్ జెరోమ్ కూడా క్రీ.శ 384 సంవత్సరంలో ఇక్కడే సమాధి చేయబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. క్రీ.శ 614లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలును ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు. వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే, ఆ చర్చ్లో యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చిని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చిలో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అనే అక్షరాలు చెక్కబడియున్నవి. యేసుక్రీస్తు జన్మించిన తదుపరి ఆయన్ను వెదకుచూ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలుకు వచ్చారు. యూదుల రాజు అంతఃపురంలో జన్మిస్తాడని భావించి హేరోదు రాజునొద్దకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆరాధించడానికి వచ్చామని తెలియచేశారు. వారి మాటలు హేరోదు రాజును కలవరపరచాయి. శాస్త్రులను పిలిచి క్రీస్తు జన్మించే స్థలం ఏమిటని ప్రశ్నించాడు. వారు లేఖనాలను పరిశీలించి ఆయన బ్లెత్లేహేములో జన్మిస్తాడని తెలియచేశారు. మీరు వెళ్ళి ఆయన్ను ఆరాధించి తిరిగి నా యొద్దకు రండి అని హేరోదు జ్ఞానులను పంపివేశాడు. వారు వెళ్ళి బాలుడైన యేసును కనుగొని, ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు దేవుని చేత బోధించబడినవారై మరియొక మార్గమున తమ దేశములకు వెళ్ళారు. బంగారము క్రీస్తు దైవత్వమునకు, రాజరికమునకు, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడని, బోళము ఆయన మానవుల నిమిత్తం పొందబోయే శ్రమలకు సాదృశ్యమని బైబిల్ పండితులు వివరించారు. క్రిస్మస్ ప్రేమ పండుగ. నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకొనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను ఆత్మానుసారంగా పాటిస్తారు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’– (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ‘ప్రేమ’. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరముగా మారిపోయింది. శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది. ఆ ప్రేమ ‘ప్రేమాస్వరూపియైన’ దేవుని నుంచి మాత్రమే రావాలి. క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను సిలువలో మరణించుట ద్వారా ఋజువుపరచాడని పౌలు రోమాలో సంఘానికి వ్రాసిన ఉత్తరంలో తెలియచేశాడు. మనమింకను పాపులమై ఉండగానే, శత్రువులమై యుండగానే, బలహీనులమై యుండగానే క్రీస్తు యుక్తకాలమున మనకొరకు మరణించెను. దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరచి సమసమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు. ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే జీవనసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు. ప్రతియేటా డిసెంబర్ 26వ తేదీని ‘బాక్సింగ్ డే’ అని పిలుస్తారు. క్రిస్మస్ తర్వాతి రోజున అవసరతలో ఉన్నవారికి బహుమతులు పంచుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు వారికి తెలిసిన వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి కానుకలు పంపి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను’ అని క్రీస్తు పలికిన మాటను క్రైస్తవులు అత్యధికంగా విశ్వసిస్తారు. పాపపు అంధకారంలో చిక్కి, నిత్యశిక్షను మూటకట్టుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయన రక్షకుడు అని బైబిల్ తెలియచేస్తున్న విషయం. మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమై యుంటాడు. ‘ఓ దేవా! నన్ను అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు’ అని మానవుడు ప్రార్థిస్తే.. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు సత్యమై, వెలుగై, జీవమై, పరిశుద్ధుడుగా తన ఉనికిని వెల్లడిచేశాడు. వెలిగింపబడిన హృదయం నుండి జాలువారిన ఓ మధురమైన పాట ఇది. ‘కొనియాడ తరమే నిను.. కోమల హృదయ.. కొనియాడ తరమే నిను. తనరారు దినకరు బెను తారలను మించు... ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ నీవు’.. సర్వలోకంబుల బర్వు దేవుడువయ్యు.. నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితి నీవు.. కొనియాడ తరమే నిను’సాక్షి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’‘ఆయన సృష్టికర్త’. తన మహిమకోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే!సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. -
మారడోనా టు పారషూట్
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి అన్నట్టు.. నటి శరణ్య రామచంద్రన్ నాయర్ కూడా ఎక్కడైతే తన నటనపై విమర్శలను ఎదుర్కొందో అక్కడే ప్రశంసలను అందుకోవాలని నిశ్చయించుకుంది. సినిమాలు, సిరీస్లలో అభినయిస్తూ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె గురించి కొన్ని విషయాలు..శరణ్య పుట్టి, పెరిగిందంతా కేరళలోని తిరువనంతపురంలో. ఎమ్బీఏ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం మోడలింగ్లోకి అడుగుపెట్టింది. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎమ్బీఏ పూర్తయిన తర్వాత సొంత బిజినెస్ మొదలుపెట్టాలనుకుంది. వరుస మోడలింగ్ అవకాశాలతో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మరెన్నో ఫొటో షూట్స్తో బిజీగా మారింది. అలా ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ వచ్చింది.ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుంది. కానీ, ఆ చిత్రం ‘మారడోనా’ పెద్దగా ఆడలేదు. శరణ్య యాక్టింగ్పై కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో, నటిగా తనేంటో నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది.తను నటించిన ‘టూ స్టేట్స్’, ‘మై నేమ్ ఈజ్ అళగన్’, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. ‘ఝాన్సీ’ సిరీస్తో వెబ్ దునియాలోకీ అడుగు పెట్టి తెలుగు వీక్షకులకూ పరిచయమైంది.ప్రస్తుతం తను నటించిన ‘పారషూట్ ’ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. వీక్షకాదరణ పొందుతోంది.ఆనందం అనేది ఎవరో ఇస్తే రాదు. మనలోనే ఉంటుంది. అందుకే నేనెప్పుడూ నా మనసు చెప్పిందే వింటాను.– శరణ్య రామచంద్రన్ నాయర్. -
చిట్టి గుండెకు గట్టి భరోసా
చిట్టి గుండె కూడా లయ తప్పుతోంది.. గట్టిపడేలోపే గండాల్లో చిక్కుకుంటోంది!గట్టెక్కించి ఆ బుజ్జి గుండెకు నూరేళ్ల భరోసానిస్తోందిశ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్!ఎక్కడో కాదు.. తెలంగాణ, సిద్దిపేటలో!ఇక్కడ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మందులు సహా చికిత్స అంతా ఉచితమే! చిన్నారితో పాటు తల్లితండ్రులకూ ఉచిత భోజన, వసతి సౌకర్యాలున్నాయి.∙గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఏటా ప్రపంచవ్యాప్తంగా 13. 5 లక్షల మంది పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు అంచనా. ఇందులో మన దేశంలోనే 2.4 లక్షల మంది ఉండగా.. వాళ్లలో 60వేల మందికి హార్ట్ సర్జరీ అనివార్యమవుతోంది. కానీ 10వేల మంది చిన్నారులకు మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొందరు పిల్లలు అనారోగ్య సమస్యలతోనే జీవనపోరాటం చేయాల్సి వస్తోంది. ఇలాంటి చిన్ని హృదయాలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2012లో శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ప్రారంభించింది. అందులో భాగంగా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), పల్వాల్ (హరియాణ), ముంబై (మహారాష్ట్ర), ముద్దహళ్లి(కర్ణాటక)లో చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. ఆ వరుసలోనిదే సిద్దిపేటలోని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కూడా! ఇవికాకుండా మరో అయిదు ప్రాంతాల్లో మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లనూ ఏర్పాటుచేసి వైద్యసేవలతో పేదలకు అండగా నిలుస్తోందీ ట్రస్ట్. ఐదు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లలో ఇప్పటి వరకు 5,86,366 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. అందులో 33,772 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న పిల్లలకూ అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. సిద్దిపేటలో..శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్.. ఐదెకరాల విస్తీర్ణంలోని వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం సేవలను అందిస్తోంది. మాజీ క్రికెటర్, శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు సునీల్ గావస్కర్ కూడా ఈ సెంటర్ను సందర్శించారు.ఫొటోలుః కె సతీష్ఓన్లీ దిల్ .. నో బిల్ శ్రీ సత్యసాయి సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుంది. బిల్ ఉండదు. ఇక్కడ ట్రీట్మెంట్ పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భరోసా కనిపిస్తోంది. ∙సునీల్ గావస్కర్, ఇండియన్ మాజీ క్రికెటర్, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడున్యాయం చేస్తున్నాం.. మేము చదివిన చదువుకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హార్ట్ సర్జరీలు చేశాం. హార్ట్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే డాక్టర్స్కి చూపించాలి.∙డాక్టర్ అమితా శర్మ, అనఘా తులసి, భూషణ్ఫ్రీగా చేస్తారని తెలిసి..మా పాపకు తరచు అనారోగ్యం చేస్తుండటంతో హాస్పిటల్లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. సర్జరీ చేయాలన్నారు. సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో ఫ్రీగా చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. పాపకు సర్జరీ అయింది.∙శాలిని యాదవ్, ఉత్తర్ప్రదేశ్ బరువు పెరగట్లేదని.. మా బాబు బరువు పెరగట్లేదని డాక్టర్కి చూపిస్తే హార్ట్లో హోల్ ఉందని తేల్చారు. తెలిసినవాళ్ల ద్వారా సత్యసాయి హాస్పిటల్కి వచ్చాం. పైసా తీసుకోకుండా బాబుకు సర్జరీ చేశారు. ∙బోలేశ్వర్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్సేవే లక్ష్యంగా.. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రులన్నిట్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సేవే లక్ష్యంగా కొనసాగుతున్నాం.∙సి. శ్రీనివాస్, చైర్మన్, శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ -
ప్రేమకూ భాషలున్నాయి!
రాధ, రవికి పెళ్లయి ఏడాదవుతోంది. రవికి రాధ అంటే చాలా ప్రేమ. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచీలు, ఆభరణాలు, దుస్తులు ఇచ్చి ఆశ్చర్యపరచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాగానే తెచ్చి ఇచ్చాడు. ఆమె పుట్టినరోజునాడు డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. అయినా రాధకు అసంతృప్తిగానే ఉంది. కారణం రవికి అర్థం కావడంలేదు. ఒకరోజు రాధనే అడిగాడు. ‘నువ్వు నాకు టైమ్ ఇవ్వడం లేదు’ అని సమాధానం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థంకాక రవి తల పట్టుకున్నాడు. అభి, స్వాతిది మరో రకమైన సమస్య. ఆఫీస్ పనితో ఎంత బిజీగా ఉన్నా సరే అభికి ఇష్టమైంది చేసి పెట్టేందుకు స్వాతి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు అతనితో గడిపేందుకే ప్రాధాన్యమిస్తుంది. అయినా అభికి సంతృప్తి లేదు. ఎందుకని అడిగితే.. ‘ఎప్పుడూ నేను హగ్ చేసుకోవడమే తప్ప, ఒక్కరోజైనా నీకు నువ్వుగా హగ్ ఇచ్చావా?’ అని అడిగాడు. ‘అదేంటీ.. మనం బానే ఉన్నాం కదా?’ అని అడిగింది. ‘సంసారమంటే అదొక్కటే కాదు, మామూలప్పుడు కూడా హగ్ చేసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటి సమస్య మీకూ ఎదురైందా? ఏం చేస్తే భాగస్వామి సంతోషపడతారో తెలియక తలపట్టుకుంటున్నారా? డోంట్ వర్రీ. మీకోసమే ఈ వ్యాసం. ప్రేమభాషను గుర్తించండి..మీరు ప్రేమిస్తే సరిపోదు, మీ ప్రేమను వ్యక్తపరచే విధానం మీ భాగస్వామి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే మీ భాగస్వామి ప్రేమభాష మీకు తెలిసి ఉండాలి. ప్రేమభాషలను నేర్చుకోవడం వల్ల.. 1 జంటలు ఒకరి భావాలను ఒకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భావోద్వేగాలను అందంగా వ్యక్తపరచడం ద్వారా అనుబంధం బలపడుతుంది. 2. వైవాహిక జీవితంలో అనేక సందర్భాలలో అపార్థాలు తలెత్తవచ్చు. ప్రేమభాషలను అవగాహన చేసుకుంటే, మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అపార్థాలు దూరమవుతాయి. 3. ప్రేమభాషలను పట్టించుకోవడం, పాటించడం జంటల మధ్య సాన్నిహిత్యాన్ని, సంతృప్తిని పెంచుతుంది. ఐదు ప్రేమభాషలుగ్యారీ చాప్మన్ ప్రేమ భాషల సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి ప్రేమను అనుభవించే, వ్యక్తపరచే విధానం భిన్నంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. అవి మాటలు, సేవలు, బహుమతులు, సమయం, స్పర్శ. జంటలు ఒకరి ప్రేమ భాషను ఒకరు అర్థం చేసుకోకపోతే అది అపార్థాలకు, విభేదాలకు దారితీస్తుంది. అందుకే ప్రేమభాషల గురించి తెలుసుకుందాం, ప్రేమను సరైన రీతిలో పంచుకుందాం, భాగస్వామి ప్రేమను గెలుచుకుందాం.ప్రశంసలుకొందరికి ప్రేమంటే ప్రశంసలే. లక్ష రూపాయల డైమండ్ రింగ్ కంటే కూడా ‘ఐ లవ్ యూ’ అనే మూడు పదాలే వారికి ముఖ్యం. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’, ‘నీతో ఉంటే నాకు టైమ్ తెలియదబ్బా’, ‘నీకంటే ముఖ్యమైనది మరేదీ లేదు’ అనే మాటలు వారి మనసును కట్టిపడేస్తాయి.సేవ ద్వారా ప్రేమమరికొందరికి మాటల కన్నా చేతలు, సేవలు ముఖ్యం. ‘ఐ లవ్ యూ’ అని కబుర్లు చెప్తే సంతోషించరు. ఇంటిపనిలో సహాయం చేయడం, తలనొప్పి వచ్చినప్పుడు మర్దన చేయడం, తన పనులు చేసిపెట్టడం లాంటివి చేస్తేనే ప్రేమ ఉన్నట్లు భావిస్తారు.బహుమతులు అందించడంకొన్ని జంటలు ప్రేమను బహుమతుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇక్కడ మాటలు, చేతల కన్నా కూడా బహుమతులే ముఖ్యం. రెండ్రూపాయల గులాబీ పువ్వు కావచ్చు, ఒక మంచి డ్రెస్ కావచ్చు, బంగారపు ఉంగరం కావచ్చు.. ఏదో ఒక బహుమతి ఇవ్వడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.సమయం గడపడంమరికొందరికి ప్రేమంటే ఇద్దరూ కలిసి కూర్చుని సమయం గడపడమే. రాధా రవిల సమస్య ఇదే. ఖరీదైన బహుమతులివ్వడమే ప్రేమను ప్రదర్శించడమని రవి అనుకుంటుంటే, తనతో సమయాన్ని గడపాలని రాధ కోరుకుంటోంది. స్పర్శఈ భాషలో ఉన్నవారు ప్రేమను ముద్దు, కౌగిలి, అందమైన స్పర్శల ద్వారా వ్యక్తం చేస్తారు. అలా చేయడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. భాగస్వామి అలా చేయనప్పుడు తనపై ప్రేమ లేదని బాధపడుతుంటారు. అభి సమస్య ఇదే. -
క్రిస్మస్ నవరాత్రులు
క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతటా జరుగుతాయి. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను దేశ దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో మాత్రం క్రిస్మస్ సందడి ముందుగానే మొదలవుతుంది. క్రిస్మస్ పండుగకు ముందుగా తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఒకరకంగా క్రిస్మస్ నవరాత్రులుగా చెప్పుకోవచ్చు. ‘లాస్ పొసాడాస్’ అనే ఈ వేడుకలు ఏటా డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి. ఏసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్లు నజరేత్ నుంచి బేత్లహామ్కు సాగించిన ప్రయాణం, పర్ణశాలలో క్రీస్తు జననం వంటి ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను జరుపుకొంటారు. మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఈ సంప్రదాయం 1586 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా జనాలు రాత్రివేళల్లో కొవ్వొత్తులు చేతపట్టి ఊరేగింపులు జరుపుతారు. చర్చిల్లో సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తారు. కొందరు పిల్లలు, పెద్దలు వేషాలు కట్టి మేరీ, జోసెఫ్ల ప్రయాణం, క్రీస్తు జననం ఘట్టాలను అభినయిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ కొన్ని వేడుకలు పురాతన ‘అజ్టెక్’ సంప్రదాయాల ప్రకారం కూడా జరుగుతాయి. ‘అజ్టెక్’ పురాణాల ప్రకారం దేవతల తల్లి అయిన టోంజాంట్జిన్కు శీతకాల ఆయానాంత దినమైన డిసెంబర్ 22న హుయిట్జిలోపోష్ట్లి (సూర్య భగవనాడు) పుట్టాడని దక్షిణ అమెరికాలో అజ్టెక్ సంప్రదాయాలను అనుసరించే వారు నమ్ముతారు. ‘లాస్ పొసాడాస్’ వేడుకల్లో భాగంగా వీరు సూర్య జయంతి వేడుకలను కూడా జరుపుకొంటారు. క్రీస్తు జననాన్ని పండుగలా జరుపుకోవడానికి ఆయన జన్మించిన పర్ణశాల వంటి పర్ణశాలలను కూడళ్లలో ఏర్పాటు చేసి, వాటి ఎదుట ప్రార్థన గీతాలను ఆలపిస్తారు. ఈ తొమ్మిది రోజులూ విందు వినోదాలతోను, ఆధ్యాత్మిక ప్రార్థనలతోను గడుపుతారు. -
యువ కథ: కావడి
ఆడిమాసం పెట్టినాది. ఇది చిత్తూరు జిల్లాకే యిశేషం. యీ మాసంలోనే మురగడుకి వూరంతా కలిసి కావడి ఎత్తుతారు. రెండు మూడు దినాల పండగిది. పయనిగాడు కాలేజీ నుంచి వస్తా ‘పల్లె సింగారించుకుందో లేదో? వాళ్ళమ్మ వాకిలి కడిగిందో లేదో? నాయన నాన్నారం పోయి సరుకులు తెచ్చాడో లేదో?’ అని యోసన చేస్తూన్నాడు. వచ్చీరాగానే ‘రేయ్.. పయనిగా రేపు మర్శటి దినం ఆడి కిర్తిక కదా! రామగిరి మురగడుకి గుండు కొట్టి రా.. పన్నెండో తర్గతి పాసయ్యిపూడస్తావు’ అన్నాడు నాయన. ‘నాయనా అక్కడేముండాది? మనూరోళ్ళతో కల్సి తిర్తినికి పోతా’ మనస్సులో యింకేదో దాస్తూ.‘రామగిరి మురగడు గుళ్ళో నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి. కార్వేటినగరం గుడి కోనేటిలో నీళ్ళు అన్ని వైపులా సమానంగా ఉంటాయి. అందుకే దాన్ని స్కంద పుష్కరిణి అంటారు. అంతేగాదబ్బాయా.. ఆ కోనేరు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి కోనేరు తెల్సునా?’ ‘అవునా! ఇదంతా నీ కాడ కొత్తగా యింటున్నా’ అని నోరెళ్ళబెట్టాడు పయని.‘నిజిమేరా! నువ్వు పుడితే నీకు పయని మురగడు దగ్గిర గుండు కొట్టిస్తామని మొక్కుకున్నాం. పయనికి పోయే బయిసు లేదు. కనీసం రామగిరి కన్నా పోయి మొక్కు చెల్లించుకురారా’ అన్నాడు దిగులు పడుతూ పయని నాయన. ‘నేనొంటరిగా యట్ల పోయేది? నేను పోనుబో’ అని మొండికేసినాడు.‘నా మాటిను అబ్బాయా.. మొక్కొని పోకపోతే మనకు చేటు జరగతాది.. నీ యిష్టం మళ్ళా..’ అని భయపెడుతున్నాడు పయని నాయన.‘నిజింగానే మురగడు చేటు చేస్తాడా? అయితే పోతాలే! కానీ వొగ కండిషన్.. రాణి అత్తోల్లతోనే పోతా..’‘వాళ్ళు పోయేది తిర్తినికి కదరా?’‘అవును. నేను కూడా తిర్తినికే పోతా. అక్కడ వుండేది కూడా మురగడే కదా!’ అన్నాడు పయని. ‘సరే! పొయిరాపోరా అతి నాకొడకా. కానీ గుండు కొట్టించుకొని రా.. కొట్టకపోతే మురగడే కొట్టిస్తాడు సూస్కో’ అని ఆర్డరు వేశాడు పయని నాయన.‘పన్నెండు పాసుకాక మునుపే గుండెందుకు కొట్టించాలి? సరే అత్త కూతురు జయలచ్చిమితో పోవాలంటే సరేని జెప్పాలి కాబట్టి ఊ.. కొడదాం’ అని గంగెద్ది మాదిరి తలూపాడు పయని.∙∙ భరణి కిర్తిక దినం పొద్దు మొల్సినాది. అత్తిల్లు చేరినాడు పయని. ‘మురగడుకి యిట్టమైన ఎరిక్కా పూలు (జిల్లేడు పూలు, పాల పూలు) కావాల’ అన్నది రాణత్త. ‘వొకే నిమిషంలో అటు పోయి యిటు వచ్చేస్తా’ అని వుసారుగా వురకపోయాడు పయని. ‘రేయ్.. ఆగురా! జయలచ్చిమిని కూడా తీస్కుబో’ అనింది రాణత్త. లచ్చిమి పయని ఇద్దరు కల్సి జోడేసుకొని పాల సెట్టుకాడికి యలబారినారు. ఒక్కోపువ్వే కోస్తూ లచ్చిమి పైనున్న పేమని ఎలాగైనా తెలియజెప్పాలి అనుకున్నాడు పయని. ‘ఎరిక్కా పువ్వా.. ఎరిక్కా పువ్వా.. నువ్వు నాకిస్టమే ఎరిక్కా పువ్వా.. నేను నీకిస్టమా ఎరిక్కాపువ్వా’ అని పాటందుకున్నాడు పయని. ‘పాల మొగ్గా.. పాల మొగ్గా.. పువ్వు ముదరాల పాల మొగ్గా.. వేచుంటావా పాల మొగ్గా.. వేచి సుస్తా పాల మొగ్గా’ అని పయని పాటకు ఎదురు పాట విసిరింది లచ్చిమి. ఖాళీ కడుపులోకి పాయసం పోసినట్టు కుశాలు పడి అరమైలు దూరం యట్టబోయిందో తెలీకుండా గిల్లుకుంటూ గిచ్చుకుంటూ కొంపకొచ్చారిద్దరు. ఎరిక్కా మాల కట్టారు. వొగరికొకరు మెడల దగ్గిర ఎరిక్కా మాలను పెట్టి చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అబ్బుటికే సూరీడు నడుచ్చికెక్కాడు. వంటకాలు వొక్కోయింటి సుట్టూరం గుమగుమ లాడుతున్నాయి. రాతిరికి వడలు, పులుసన్నం పొట్లాలు చుట్టుకున్నారు. ఒక్కోకింట్లో వొక్కోబ్బుడు నడింట్లో ఆకేసి ‘హరోం హర.. హరోం హర’ అని మొక్కిన శబ్దాలు వినిపిస్తున్నాయి. కావిడెత్తని కిరుస్తూ యిళ్ళకు, హిందూ యిళ్ళకు కావిడెత్తే యిళ్ళు సిన్న పిల్లలతో గుండు గిన్నెల్లో అన్నాలు పంచుతున్నారు. తలనిండా వెండెంటికల పెద్ద మనుషులు, రెండు మూడు బంగారెంటికల నడి మనుషులు కలుసుకొని వూరి తలారితో మిద్దింగు మురగయ్యను, ఆచారి కిష్టయ్యను పిలిపించారు. పసి పిల్లలు చొక్కా నిక్కర్లేసుకొని బొమ్మల కోసరం పోతుంటే, పయని యీడోల్లు లచ్చిమి యీడున్న పడుసు పిల్లల కోసం పోతున్నారు. కావిడెత్తే వాళ్ళు పసుపు బనీను, పసుపు పంచితోంటే కావిడెత్తనోళ్ళు కొత్త బట్టలతో వున్నారు. మిద్దింగు మురగయ్య దొంకలబడ్డ బనీనుతో డమరు వాయిస్తుంటే ఆచారి కిష్టయ్య నిగనిగలాడే తెల్ల చొక్కాయితో పాటలందుకున్నాడు. పిల్లలు డాన్సులేస్తున్నారు. అందరూ నెత్తిలో రైలు పట్టాలు మాదిరి మూడు యిబూది పట్టలు, దానిపైన చందనం కుంకుమాలద్ది భత్తి పరవశంతో ఉన్నారు. కావిడెత్తే వాళ్ళు మెడలో పూలమాలతో, కావడికి పసుపు కుంకుమలు పెట్టి, బంతి పూలు, చామంచి పూలు, ఎరిక్కా మాలలు చుట్టి గలగలా గంటలూపుతున్నారు. వీధంతా పట్టరాని జనాలతో కిక్కిరిసిపోతున్నాది. గ్రామ దేవత గెంగమ్మకు పూజలు జేసి, వూరిడిచి పుత్తూరు రైల్వే టేషనుకు పూడ్సినారు. ఆరు గంటలకు గరుడాద్రి రైలు బండి పట్టాలకొచ్చింది. ఒక నిమిషానికే ఈగల మాదిరి గుంపుగా రైలెక్కినారు. ‘బోయ్’ మని హారన్ కొడుతా బయల్దేరింది రైలు. సమోసాలు, చాయ్, వేంపుడు చెనిక్కాయలు, యల్లరికాయలు ( కీర దోస కాయ) అమ్మేవాళ్ళొస్తున్నారు. ‘పయనిగా ఏమైనా తీస్కోరా. తిందాం’ అని రాణత్త అడిగితే, ‘వొద్దు అత్తా. యిదంతా తినకూడదు. దుడ్లు వేస్టు’ అన్నాడు పయని. తలకొట్టుకున్నారు వూరోళ్ళు పయని పిసినారితనం జూసి.చూస్తుండగానే తిర్తిని వచ్చినాది. రైలు కిటికీల నుంచి ధగ ధగ యలిగిపోతున్న తిర్తిని కొండని జూసి ‘హరోం హర హరోం హర’ మంటూ అరుస్తూ దిగినారు. రాతిరి పడుకునేకి దుప్పట్లు ఎత్తుకొని ప్లాటుఫారం పైన జాగాలు వెతుక్కొని బుక్ చేసుకున్నారు. పయనిగాడు ఉసారుగా ముందుగానే బుక్చేసి పెట్టాడు. ఊరు వూరంతా కల్సి నెలవంక సుట్టూరా కూర్చున్నట్టు తిండి సుట్టూరా కూర్చున్నారు. అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు వొగరికొకరు పంచుకుంటున్నారు. జయలచ్చిమి పులుసన్నాన్ని వుండగా జేసి పయనికి పెట్టింది. ముసిముసి నవ్వులు నవ్వతాండాది రాణత్త. ముచ్చట్లు, కబుర్లు చెప్పుకుంటూ తిన్న తర్వాత కొంతమంది పక్కనేవున్న కమలా సిన్మా కోటాయికి ఫస్టు షో, సెకండ్ షో కోసం పూడ్సినారు. మరికొంత మంది రోడ్లెంబడి షికారుకు పోయినారు. ఇంకొందరు ముచ్చట్లు పెట్టుకొంటుంటే, పిల్లలంతా వచ్చి పోయే రైలు బండ్ల బోగీలను లెక్కిస్తా కూర్చున్నారు. అంతలోకి ‘అయ్యో యమ్మా.. నా సంచిని రైలులోనే వదిలేశాను’ అని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తాండాది నడీడున్న వల్లెమ్మ. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘యామంటున్నావే పాపిస్టిదాన. సంచిని వదిలేశావ? యాముంది అందులో? అంత మతిమరుపు యాందిమే నీకు’ అని రాణత్త కోపంగా అరుస్తున్నాది. ‘అయ్యో! అక్కా కావాలని చేస్తానా? ఆ సంచిలోనే మురగడుకి వుండీలో వేస్తానని మొక్కున్న బంగారు వేలు, వెండి శూలం, సెల్లు ఫోను, దుడ్లు, బట్టలన్నీ వున్నాయక్కా, యింక నా బిడ్డల గతేంది, మా ఆయనకాడ నేనెట్ల బతికి బట్టకట్టేది నాయనా’ అని గుండెలు బాదుకుంటాంది. ‘మనం దిగిన రైలు బండి మద్రాసు చేరుంటాది. యింకో రైలెక్కి మద్రాసు సెంట్రలుకు పోతే సంచి దొరకొచ్చు. నేను పోయి సూస్తా’ అని యనక బండెక్కి పోయినాడు పయని. ఊరంత కళ్ళలో వత్తులేసుకొని పయని కోసరం ఎదురుచూస్తాన్నాది. మద్రాసు నుంచి వచ్చే రైళ్లు చానా తిర్తినిలో ఆగి మరలా తిర్పితి వైపుగా పోతున్నాయి. కానీ పయని మాత్రం ఏ రైలు నుంచి దిగలేదు. జయలచ్చిమి ‘సంచి లేకున్నా సరే, పయని జాగిర్తగా తిరిగొస్తే చాలు’ అనుకుంటూ దిగులుగా సూస్తున్నాది. తమ్ముడు కొడుకు యామైనాడో? యప్పుడొస్తాడోని కూతురికి తోడుగా కూర్చుంది రాణత్త. రాతిరి రెండు గంటలప్పుడు.. పయనిగాడు సంచిని తెచ్చాడు. వల్లెమ్మ కంటిలో కన్నీటి పొర కమ్ముకున్నాది. పయనికి చేతులెత్తి మొక్కినాది. రాణత్త, లచ్చిమి పయనిగాన్ని సూసి వూపిరి పిల్చుకున్నారు. ‘పయనిగాడు మొనగాడురా’ అని ఊరంతా పొగడాతంటే లచ్చిమి మన్సు పొంగిపోతాండాది. అందరూ నిమ్మళంగా పొనుకున్నారు. పయని.. లచ్చిమిని సూస్తా కూసున్నాడు. వచ్చిన కస్టం చాలదని ఒక మనిషి ముఖానికి మాస్క్ పెట్టుకొని నైసుగా రాణత్త పక్కన కూసున్నాడు. మెల్లగా కాళ్ళకున్న గొలుసును యిప్పుతున్నాడు. పయని పొనుకున్నట్టే పొనుకొని గబుక్కున లేసి దొంగను పట్టుకుని రైలు పోలీసులకు అప్పగించాడు. ‘వెరీ గుడ్. వి సెల్యూట్ టు యువర్ బ్రేవరీ’ అన్నారు పోలీసులు. జయలచ్చిమి, రాణత్త, వూరోళ్ళ ముందు యీరో అయిపూడ్సినాడు పయని.∙∙ ఆడి కిర్తిక దినం పొద్దు మొల్సినాది. నాలుగున్నరకి టేషను కమ్మీలకు తగిలించున్న కావల్లకి యదురుంగా కర్పూరం అంటించి ‘హరోం హర.. హరోం హర ’ అని మూడు తూర్లు అరిసి, కర్పూరం సుట్టూ వూగించి భుజాలకెత్తుకున్నారు. కోనేటిలో తానం చేసి, కావల్లను కడిగి కొత్త పూలను చుట్టి, యిబూదితో అడ్డం బొట్లు గీసుకొని, టెంకాయలు కొట్టి, కర్పూరం యలిగించి మళ్ళా మూడు సూర్లు ‘హరోం హర’లు సెప్పి కొండెక్కారు. కొండపైన గుండు కొట్టుకునే వాళ్ళు కొట్టుకున్నారు.‘సార్ తమరికి నాయన సెప్పింది గుర్తులేదా?’ అంది జయలచ్చిమి. ‘గుర్తుంది. కానీ పాసయితే కొడుదాంలె. ఇప్పుడెందుకు’ అన్నాడు పయని. ‘మొక్కొని గుండు కొట్టకపోతే మురగడే నీకు కొట్టిస్తాడాగు’ అంది జయలచ్చిమి. ‘సూస్కుందాంలె. యాదైతే అదయితాద’న్నాడు ధీమాగా! ఎవరికి కావల్సింది వాళ్ళు కోరుకుంటూ దేముడికి దండం పెట్టుకున్నారంతా. అగ్గి గుండంలో కర్పూరం, టెంకాయలు వేసి మొక్కులు చెల్లించుకొని ఒక్కచోటుకు చేరారు. అందరొచ్చారో లేదో లెక్కపెట్టుకుని, దారెంట ఉన్న అంగళ్ళను సూసుకుంటా కొండ దిగడం మొదలుపెట్టారు. ఎవరికి కావల్సింది వాళ్ళు, యాడ సలీసుగుంటే ఆడ కొనుక్కుంటున్నారు. పయని మాత్రం తన దగ్గరున్న యాభై రూపాయల నోటును యాభై లచ్చల సూర్లు ఆ నోటుందో లేదో అని తడుముకుంటూ వున్నాడు. బ్లేడుతో చేతులను కోసుకుంటా రక్తాన్ని పసిపాపల పైన పోస్తా జాటీలతో కొట్టుకుంటా ‘రుయ్.. రుయ్’ మని భార్య దరువేస్తే చేతులు చాచి దుడ్లు అడుక్కుంటూ కొందరు.. దారాల పైన నడుస్తూ కోతులతో మ్యాజిక్కులు, సర్కసులు చేస్తా మరికొందరు.. భత్తి పేరుతో ఎండిన డొక్కలకి కొంకీలు గుచ్చుకుని బిచ్చమెత్తుకుంటూ బిడ్డలకు బరువైన ముసలోళ్ళు.. ‘దేముడు దగ్గిరే వున్న వాళ్ళని దేముడెందుకు కాపాడలేకపోతున్నాడు? జానెడు కడుపు కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని పనులు, ఎన్ని బాధలు? చేతి కోతలు ఆరొచ్చేమో కానీ కడుపు కోతలు? కళ్ళు చెమర్చి ఏమీ చెయ్యలేక గమ్మున వెళుతున్నాడు పయని. బాగా బలిసినోళ్ళు ఖద్దరు బట్టలేసుకుని పుణ్యం కోసం ‘అన్నదానం.. రాండి.. రాండి’ అని అరుస్తుంటే బక్క జీవులంతా దేముడు ప్రసాదం దొరకడమే అదృష్టం అనుకుని తినొస్తున్నారు. ఎండ నడినెత్తికెక్కినాది. రైల్వే టేషనుకు పోయే దోవలో ‘మోర్ మజ్జిగ.. మోర్ మజ్జిగ’ అని పిలుస్తుంటే పయని వెళ్ళాడు. కొత్తి మీర, పచ్చి మిరప వేసిన పాల పెరుగు వాసన నోరూరిస్తుండగా గబ గబ తీసుకొని గుట గుట రెండు గిలాసులు తాగినాడు. మూడో గిలాసు కూడా తీసుకుని తాగబోతుండగా.. ‘బాబు వొగ గ్లాసు మోర్ యిరవై ఐదు రూపాయలు అయినాది’ అన్నాడు. గబుక్కున ఆ గిలాసును పక్కన పెట్టేస్తూ ‘యొవ్ ముందే సెప్పాలి కాదుయా? పిలిచి పుణ్యం కోసం దానం చేస్తున్నావని తాగాను’ అన్నాడు అమాయకంగా పయని. ‘హా.. రమ్మంటారు నిన్ను. మూస్కొని దుడ్లు యిచ్చి పో’ అన్నాడు. చేసేదేమి లేక తన దగ్గిరున్న యాభై రూపాయలనిచ్చాడు. ఊరోళ్ళందరూ నవ్వినారు. యిరో జీరో అయిపూడ్సినాడు. యంటికలుండగానే గుండు కొట్టిన మాదిరి అయిపూడ్సినాది యవ్వారం. నాయన మాటలు గుర్తొచ్చినయ్ పయనికి. మురగడు మామూలోడు కాదనుకున్నాడు. మారు మాట్లాడకుండా అత్తబెట్టిన చార్జితో రైలెక్కి యిల్లు చేరాడు.పొంగలి పెట్టి నడింట్లో వేసి మొక్కుకున్నారు. తిర్తిని నుంచి తెచ్చిన బొరుగులు, హల్వా, పొంగలి, బేరికాయలు పందేరాలు మొదలైనాయి. జయలచ్చిమి కూడా ఫలాలు, పొంగలి, బేరికాయలు, బొరుగులు తీసుకుని పయని యింటికి వచ్చినాది. ‘హలో సార్.. అన్నీ టయాలు వొగిటి గావు. యిదిగో నీకోసం వాచ్’ అని చేతిలో పెట్టి ముదిగారంగా బుగ్గలు గుద్దేసి దూడ పిల్ల మాదిరి ఎగురుకుంటూ యల్లిపూడ్సినాది. ఒక పక్కగా జత కట్టిన పయని తాత పాత కావడి బుట్టీలు నవ్వుతూ నిలబడినాయి.∙ -
ఈవారం కథ: క్షమాఛాయ
ఆకాశంలో గురకొయ్యలు టైమ్ నాలుగైనట్టుగా నిలబడి మిణుకు మిణుకుమంటున్నాయి. కోళ్ళెందుకో ఇంకా సడి మొదలెట్టలేదా రోజు. కీచురాళ్ళ రొద మాత్రం దారి పొడవునా కొనసాగుతానే ఉంది. చేపల చెరువు వైపు అంత చీకట్లో అంచనా కొద్దీ వెళుతున్న కొండా దొంగల్ని పట్టుకొనే టైమ్ ఇది కాదేమోనని అనుమానపడ్డాడు. ఇంకొంచెం ముందు రావలసిందనుకొంటా అనుకున్నాడు. బండేసుకొస్తే సౌండ్కి తెలిసిపోతుందని, చీకట్లో కనిపించకుండా ఉండాలని, బూడిద రంగు షర్ట్, అదే రంగు ప్యాంట్తో వచ్చాడు. కొండాకి తాను శారీరకంగా దృఢంగా, ఎత్తుగా ఉంటానని, ధైర్యం ఎక్కువని, ఒక్కసారి దొంగలు తనని చూశారంటే చాలు దడ పుట్టాల్సిందే అనే గట్టి నమ్మకం. సైకిల్ రోడ్డు దిగి కాలిబాట పట్టేసరికి ఎగుడు దిగుడుగా ఎగురుతూ వెళ్తున్నట్టుంది. ఇంకెంత దూరంలో చెరువు ఉందో అని దృష్టి సారించబోయాడు కొండా.‘నాన్నా’ భయంతో వణుకుతున్నట్టుగా పెద్ద కేక వినపడింది. ఎవరది! ఈ టైమ్లో? పైగా ఎవరో చిన్నపిల్లాడి అరుపులా ఉంది! చీకట్లో దూరంగా కొంచెం ఎత్తుగా చెరువు కట్ట కనిపిస్తూంది.‘నాన్నా’ ఎంతో ఆర్తిగా ఉందా పిలుపు. కీచుగా వినపడటంతో అటుగా సైకిల్ పోనిద్దామని చూస్తే సైకిల్ వెళ్ళేలా లేకపోవటంతో దాన్నక్కడే వదిలేసి రెండడుగులు వేశాడో లేదో మరోసారి ‘నాన్నా, రా నాన్న..’ దీనాతిదీనంగా ఉన్న ఆ అరుపు కొండాని తుప్పలకడ్డంగా పరుగందుకునేలా చేసింది. చెరువు కట్టకి దగ్గరలో బురద గుంతలు ఉన్నాయని గుర్తొచ్చి, అక్కడి నుంచేనా ఈ కేకలు అనే అనుమానంతో మరింత వేగంగా అడుగులేశాడు కొండా. రెండు నిమిషాల్లోపే అక్కడికి చేరుకొని, సెల్లో లైట్ ఆన్ చేసి చూసి ఆశ్చర్యంగా, ‘వోరివోరి ఊబిలో పడిపోయావా’ అన్నాడు.మెడ, తలా.. పైకి లేపి ఉంచిన ఒక చెయ్యి.. మాత్రమే కనిపిస్తున్నాయి. చేతికందనంత దూరంలో ఉన్నాడు. అటూ ఇటూ ఎటు చూసినా కర్రా గట్రా ఏం దొరికేలా లేదని అర్థమై పోయింది కొండాకి. భయంతో దిగాలు ఏడుపు, చూస్తుండగానే ఇంకొంచెం బురదలోకి కూరుకుపోయినట్టున్నాడు వాడు. వెంటనే ప్యాంట్ తీసి ఒక కాలి అంచు తను పట్టుకుని రెండో కాలి అంచు వాడికి అందేలా విసిరేశాడు.‘చేత్తోనే కాదు నోటితో కూడా పట్టుకోరోయ్’ అరిచాడు కొండా. చావు భయంతో ఉన్నాడని వాడికి తెలియదు కానీ ఉన్నాడు. దాంతో చెప్పింది చెప్పినట్టు చేశాడు వాడు. బురద నుండి మెల్లగా తప్పించి చేతికి అందేంత దూరంలోకి రాగానే పట్టుకుని బలంగా తన వైపు లాక్కున్నాడు కొండా. బయటికిరాగానే వాడు ‘నాన్నా’ అంటూ బురద అంటి ఉన్న చేతులు కొండా మెడ చుట్టూ వేసి ఏడవసాగాడు. వాడు షాక్లో ఉన్నాడని అర్థమైంది. ‘భయం లేదు.. బయటకు వచ్చేశావ్ కదా, ఇంక భయపడకు’సెల్ఫోన్ లైట్ వెలుగులోనే వాడిని చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. అలవాటైన మాటల శబ్దం విన్న చేపలు గుంపుగా బులబులమంటూ తోసుకొంటూ తెరిచిన నోళ్ళు పైకి పెట్టి మేత వేస్తాడని నెట్టుకోసాగాయి. వాడు భయంతో ‘నాన్నా’ అంటూ మళ్ళీ చేయి గట్టిగా పట్టుకున్నాడు. బురదంతా శుభ్రంగా కడిగి తన ప్యాంట్ కూడా చెరువులో జాడించి నీళ్ళు పిండి మళ్ళీ దాన్నే వేసుకున్నాడు కొండా. వదిలేసిన సైకిల్ దగ్గరికి ఆ తడి బట్టలతోనే ఇద్దరూ నడవటం మొదలెట్టారు. ‘బడికి పోతున్నావేంరా?’ అని అడిగాడు కొండా. ‘ఆ పోతున్నా’ అన్నాడు. ‘ఎన్నో తరగతి?’ ‘ఒకటో తరగతి’ ‘నీ పేరేంటిరా?’ ‘సూర్య’ ‘ఇంత చీకట్లో ఇంటికాణ్ణుంచి నువ్వెందుకొచ్చావురా ఇటు?’ఒక క్షణం మాట్లాడలేదు వాడు. మళ్ళీ అడగటంతో ‘మా నాన్న వస్తంటే ఎనకాలొచ్చాను’ అన్నాడు. ‘మరి నిన్నెందుకు వదిలేసెల్లాడిట్టా?’‘నేనొచ్చినట్టు మా నాన్నకి తెలీదు. తెలిత్తే కొడతాడని నేనే నక్కినక్కి వచ్చా’‘ఈ టైమ్లో మీ నాన్నెందుకు వచ్చాడ్రా ఇటు?’ ‘రోజూ ఒత్తాడుగా’ ‘ఆ! వస్తాడా! ఎందుకు?’‘చేపలు పట్టుకోటాకి’‘మీ నాన్న పేరేంట్రా?’‘కృష్ణదాసు’మనసులో తను వచ్చిన పని నెరవేరినట్టు అనిపించింది కొండాకి. ఒకవేళ రాకపోతే అని ఆలోచించాడు. అమ్మో!! వీడేమైపోయేవాడు!! రోడ్డు వరకు సైకిల్ నడిపించుకుంటూ వచ్చి, అక్కడి నుండి సూర్యని సైకిల్ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే భార్య సురేఖ వాకిలూడుస్తూ ఉంది. జరిగిన విషయాన్ని సూర్య ఎదురుగానే భార్యకు చెప్తున్నాడు కొండా. జరిగిందంతా విని ‘అయ్యో అవునా’ అంటూ సూర్య వంక చూసి జాలి పడింది. కృష్ణదాసు చేసిన దొంగతనాల లిస్టు, పంచాయతీలో వాడికి వేసిన జరిమానాలు, సూర్య వాళ్ళ అమ్మ డబ్బులు కట్టడాలు, ఆమె హఠాత్ మరణం అన్నీ వాడెదురుగానే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు.వేడినీళ్ళు పెట్టి వాడికి రుద్దిరుద్ది స్నానం చేయించిందామె. తెల్లగా తెల్లారిన వెలుగులో ఒళ్ళు తుడుస్తూ ఏడేళ్ళుండొచ్చు అనుకొంటూ వాడి ముఖవర్చస్సు చూస్తూ వీడు నలుపులో మెరుపులా ఉన్నాడని మనసులో అనుకుంది. ‘ఒక్క నిమిషం ఉండు’ అని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి నిక్కరు, టీ షర్టు తీసుకొచ్చింది. టీ షర్ట్ వేస్తే బాగానే ఉంది. నిక్కర్ వేస్తే వాడు భయం భయంగా చేత్తో పట్టుకున్నాడు. ‘ఏం కాదులే, వదిలేయ్, నేను ఎంత లూజ్ ఉందో చూసి పిన్నిస్ పెడతాను’ అంది. వాడు వదిలేయగానే నిక్కరు టప్న కింద పడింది. వెంటనే నిక్కర్ పైకి లాక్కున్నాడు. వాడిని అలా చూడగానే సురేఖ పకపక నవ్వడంతో వాడు మొహం చిన్నబుచ్చుకొన్నాడు. సూర్య మొహం చూసి నవ్వాపి వాడిని దగ్గరికి తీసుకుంది. వాడు కూడా సురేఖ మెడ చుట్టూ చేతులేసి కొన్ని క్షణాలు అలా ఉండిపోయాడు. సూర్య మెత్తని చేతుల ఆ స్పర్శ సురేఖకు మనసులో ఎక్కడో ఏదో తట్టి లేపినట్టు అయింది. ఒక్కసారిగా కొత్త రకం భావనలతో కళ్ళు ఊట చెలమలయ్యాయి. చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడం సరదాగా ఉన్న కృష్ణదాసు పదో తరగతి ఫెయిల్ అయినప్పటి నుంచి దాన్నే వృత్తిగా కొనసాగించాడు. సుమతితో పెళ్ళయిన తర్వాత కూడా దొంగతనాలు మానింది లేదు. కానీ దొంగతనం చేసి ఎక్కడ, ఎప్పుడు పట్టుబడినా జరిమానా కట్టాల్సి వచ్చిన ప్రతిసారి సుమతికి అది ఎంతో అవమానకరంగా.. ఆ అవమానమే తనని దహించి వేస్తున్నంతగా బాధ పడేది. దొంగతనాలు చెయ్యొద్దని బతిమిలాడి మరీ చెప్తూ ఉండేది. జరిమానా కట్టాల్సి వచ్చినప్పుడు తను కూలికి వెళ్ళి దాచుకున్న వెయ్యో, రెండు వేలో ఏమాత్రం ఆలోచించకుండా అతనికిచ్చి జరిమానా కట్టించేది. చివరిగా పసుపు కళ్లంలో చేసిన దొంగతనానికి వేసిన ఐదువేల రూపాయల జరిమానా వారం రోజుల్లో కట్టాలి అన్నప్పుడు ఆ దిగులుతోనే మంచం పట్టిన సుమతి తిరిగి కోలుకోలేక పోవటం, దానిలోనే ఉద్ధృతంగా వచ్చిన గుండెపోటుతో చనిపోయింది. అప్పుడు కూడా కృష్ణదాసు పెద్దగా చలించింది ఏమీ లేదు. అతిగా ఏడ్చేవాళ్ళను చూస్తే కృష్ణదాసుకు చాలా ఆశ్చర్యం. అంతగా ఎందుకు ఏడుపు వస్తుంది వీళ్ళకి అని. మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళని చూసినా కూడా ఆశ్చర్యమే. ఇంతలా నవ్వాల్సిన అవసరమేంటో! కనీసం మనిషిలా స్పందించే గుణం ఏమాత్రం లేని కృష్ణదాసు.. భార్య అలా అవడానికి కారణాలు ఏంటి అని ఆలోచించటం గాని, నామమాత్రంగా కూడా బాధపడింది గాని లేదు. జేబు నింపుకుని ఇంటికి తిరిగొచ్చిన కృష్ణదాసుకి తను వెళ్ళేటప్పుడు దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు ఇప్పుడు తీసి ఉండటంతో అనుమానం వచ్చింది. సైకిల్ అక్కడే వదిలేసి ఇంట్లోకి వచ్చి చూస్తే బోసిపోతున్న ఇల్లు సూర్య లేడనేసింది. ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. ఇంతకు ముందు తను ఏకువజామున లేచి ఎళ్ళేప్పుడు సూర్య తన ఎనకాలే వచ్చాడు. కోపంగా బెదిరించి ఎనక్కి తీసుకొచ్చి ఇంట్లో వదిలాడు. రెండోసారి ఎనకాల వస్తుంటే సులగ తీసుకుని గట్టిగా కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అసలే సుమతి లేని ఇల్లు కళతప్పి బావురుమంటున్నా పట్టని కృష్ణదాసు.. ఈడినెక్కడెతకాలో అనుకొంటా బయటకొచ్చాడు. సాయంత్రం వరకు ప్రయత్నించినా కొడుకు జాడ తెలుసుకోలేకపోయాడు. ఏడవుతుండగా అతనికి వరుసకు తమ్ముడైన శేఖరు.. ‘కొండా ఇంటి ముందు మీవాడు ఆడుతున్నాడు అన్నా..’ అని చెప్పాడు. కొండా పేరు వినపడగానే కృష్ణదాసుకి అనుమానం వచ్చింది. తను తెల్లారుజామున బయటికి వెళ్ళగానే వచ్చి కొండా తన కొడుకుని ఇంట్లో నుంచి తీసుకెళ్ళుంటాడని అనుకున్నాడు. వెంటనే సైకిలేసుకుని ఊరికి అటు చివర ఉన్న కొండా ఇంటికి వెళ్ళాడు. ఇంటిముందు ఇంకో పిల్లాడితో కలిసి ఆడుకుంటున్న సూర్యాను చూసి ‘రారా ఇంటికి పోదాం’ అన్నాడు కృష్ణదాసు. వాడు ఒకసారి ఎగాదిగా తండ్రి వంక చూసి మళ్ళీ తలొంచుకుని ఆడుకుంటున్నాడు. బయట అలికిడికి కొండా బయటికి వచ్చాడు. ‘అట్టెట్టా వత్తాడ్రా ఊరికినే? రేప్పొద్దున పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుందాం. అప్పుడు తీసుకెళ్దువుగాని’ అన్నాడు. కృష్ణదాసు కోపంగా ‘తెల్లారుజావున ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి పిల్లాడ్ని ఎత్తుకొచ్చి ..’ అంటూ ఇంకేదో మాట్లాడబోతుంటే–‘దాసు ఆగు అక్కడితో. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. రేప్పొద్దున తొమ్మిది గంటలకి గంగరావి చెట్టు దగ్గరికి రా. వీడిని తీసుకొని నేను కూడా వస్తాను అక్కడికి. మాట్లాడుకున్న తర్వాత నీ కొడుకుని తీసుకెళ్దువు గాని’ అన్నాడు కొండా. అయిష్టంగా ముఖం పెట్టుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కృష్ణదాసు. తెల్లవారక ముందే మెలకువ వచ్చిన కొండాకి మంచం దిగాలనిపించలేదు. ఇంటర్ వరకు చదువుకున్న కొండాకి ఫార్మా కంపెనీలో సంవత్సరం ఉద్యోగం చేసేసరికి ఆ వాతావరణమే కాదు ఆ ఉద్యోగం కూడా సరిపడదని అర్థమయ్యేసరికి సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. దాంతో పాటుగా రెండు చేపల చెరువులు చూసుకుంటున్నాడు. తన పని తాను నిజాయితీగా చేసుకొనే కొండాకి అమ్మకానికొచ్చిన చేపలు దొంగతనానికి గురవుతున్నాయని తెలుసుకోగానే మనసంతా కలతగా మారింది. ఒకడి కష్టార్జితాన్ని ఇలా దొంగతనం చేయడం అంటే.. అని లోతుగా ఆలోచిస్తూనే పంచాయతీకి సిద్ధం అయ్యాడు.ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి గంగరావి చెట్టు దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. అన్నీ కలిపి వంద ఇళ్ళ కంటే తక్కువే ఉండేంత చిన్న ఊరు అది. పంచాయతీ ఉందని తెలిస్తే ఎవరికి వాళ్ళు రావటం ఆ ఊరి ఆనవాయితీ. ఎవరూ ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు. కొండా సూర్యని తీసుకుని వచ్చి గంగరావి చెట్టు చుట్టూతా కట్టి ఉన్న గట్టు మీద కూర్చున్నాడు. గుంపుగా మరో 10 మంది వచ్చారు. నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కొందరు తలవంచుకొని పక్కవాళ్ళతో మాట్లాడుతున్నారు. మరికొందరు పబ్లిక్గా పైకే మాట్లాడుతున్నారు. ఇంకొందరు పక్క వాళ్ళ చెవిలో నెమ్మదిగా ఏదో చెప్తున్నారు.శివయ్య, ఎర్రన్న, పాపారావు వస్తుంటే చూసిన వాళ్ళు పక్కకు తప్పుకుని దారి ఇచ్చారు. ‘బాబాయ్ ఇటు రండి’ అంటూ కొండా పిలవటంతో ముగ్గురూ వచ్చి ఆ గట్టు మీదే కూర్చున్నారు. పనులకు అకాలం కావటం వలన పైగా ఆదివారం కావటం వలన కూడా చాలామందే వచ్చారు. కాని ఇంతకీ కృష్ణదాసు వస్తాడా రాడా అనుమానం వచ్చింది కొండాకి. అప్పుడప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ బుగ్గలు ఉబ్బిచ్చి గాలి వదులుతూ అసహనంగా ఉన్నాడు. అప్పటి వరకు అందరినీ చూస్తూ కొండా పక్కనే నిలబడ్డ సూర్య కొండా చెయ్యి పట్టుకుని ఊపుతూ ‘మనం ఇక్కడకెందుకొచ్చాం’ అని అడిగాడు. ‘మీ నాన్న కూడ ఇక్కడికే వస్తానన్నాడు’ వాడి వంక చూస్తూ చెప్పాడు. ‘ఎందుకు?’ ‘నిన్ను తీసుకెళ్ళటానికి’అందరూ ఎదురు చూస్తున్న కృష్ణదాసు ఎదురుగా వస్తూ కనిపించాడు.వాళ్ళు చూస్తున్నవైపు కొండా కూడ చూశాడు. ఐదడుగుల బక్క పల్చటి మనిషి, నిర్లక్ష్యంగా రేగిన జుట్టుతో ఎప్పటిలానే నల్ల టీ షర్ట్ వేసుకుని వస్తూ కనిపించాడు. ‘అదుగో, అటు చూడు’ అంటూ కృష్ణదాసు వస్తున్న వైపు సూర్యకి చూపెట్టాడు కొండా. కృష్ణదాసు వచ్చి గట్టుకి దగ్గరగా నిలబడ్డాడు.‘ఏంది మావా నీ కత? పోయిన పొడుగూత ఈ దొంగతనాలేంది, నువ్వేంది ? ఒల్లొంచి ఏదోక పనిచేసుకుని బతక్కా’ అన్నాడు సాంబయ్య . కృష్ణదాసుకు అలాంటి మాటలకు సమాధానం చెప్పే అలవాటు మొదటి నుంచీ లేదు. ‘నిన్న తెల్లారుజామున ఏం జరిగిందిరా దాసు’ అడిగాడు శివయ్య. కృష్ణదాసు మాట్లాడ లేదు. ‘అసలు నిన్న ఏకుజావున ఏం జరిగిందిరా కొండా ఇవరంగా చెప్పు’ శివయ్య అడిగాడు. కొండా జరిగింది జరిగినట్టు స్పష్టంగా చెప్పాడు. విన్నవాళ్ళల్లో చాలామంది ఆశ్చర్యంగాను, అయ్యో అనవసరంగా పిల్లాడు బలయ్యేవాడుగదా అంటా జాలిపడ్డారు.కృష్ణదాసుని మాట్లాడమని ఇద్దరు ముగ్గురు గట్టిగా చెప్పినా ఏం ప్రయోజనం లేకపోయింది. ‘పిల్లాడు చనిపోబోయేవాడు బతికి బయటపడ్డాడని తెలిసినాక కూడా నువ్వు మాట్లాడకపోవడం ఏంట్రా? నువ్వేం మనిషివి రా దాసు’ ఆశ్చర్యంగా అన్నాడు శివయ్య. ‘ఇలాంటి మనిషినెక్కడా చూళ్ళేదురా బాబూ’ అన్నాడు ఎర్రన్న. కృష్ణదాసులో ఎలాంటి మార్పు లేదు. ‘యాందబ్బాయా ఈణ్ణి బతివాలేది? జబిర్రొండు బుచ్చుకోకా’ గుంపులోంచి ఒకరు. ‘ఏందిరో అణాకాణీ దొంగతనాలకింత యాగీ జాత్తన్నారు. వేలకోట్లు దోసుకొని ఇక్కడే కులికేవాళ్ళు, దేశవొదొలి పారిపోయే వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈడు మీకు తేరగా దొరికాడా?’ జోగీంద్ర.‘అలాంటి అణాకాణీలన్నీ పొతం జేసుకుంటేనే గదరా రూపాయి అయ్యేది? అదే పనిగా వాటి కోసవే కన్నాలేత్తంటే అంతంతమాత్రపాళ్ళం బతికేదెట్టా’ అన్న పాపారావు ప్రశ్నకి ‘అవున్లే అదీ నిజవే’ అని ఒప్పుకున్నాడు జోగీంద్ర.మళ్ళీ ఆయనే ‘అదొక్కటే సమస్య కాదు జోగీంద్రా.. మనది అనుకున్నదేదో దోపిడీకి గురైందని గుర్తించిన ప్రతిసారి అలా జరగటం మన అసమర్థత వల్లేమో.. అజాగ్రత్త మూలంగానేమో అనిపించగానే మనలో తెలియకుండానే ఒక అసహనం మొదలై అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇక్కడున్న వాళ్ళల్లో చాలామందికి ఇది అనుభవ పూర్వకంగా తెలుసు’ వాళ్ళలో ఎక్కువమంది తమ బాధని సరిగ్గా అర్థం చేసుకొని కరెక్ట్గా చెప్పినందుకు ఆయనవైపు గౌరవంగా చూశారు. పక్కింటి విమల పెద్దమ్మ కూడా వచ్చి గుంపుగా ఉన్న వాళ్ళకి వెనకగా నిలబడింది. ‘ఇయ్యన్ని ఎందుగ్గాని.. దాసు అసలు నిన్న తెల్లారుజామున చేపలు పట్టావా లేదా? ఒక మాట చెప్పు’ పాపారావు అడిగాడు. పట్టానన్నట్టుగా తలూపాడు కృష్ణదాసు. ‘అది కాదురా నోటితో చెప్పు’ మళ్లీ ఆయనే అన్నాడు గట్టిగా. ‘పట్టాను’ మెల్లగా అన్నాడు కృష్ణదాసు. జనంలోంచి వేగంగా కృష్ణదాసు దగ్గరకొచ్చిన శీనయ్య ‘ఆరోజు మా అరుగు మీదున్న మొక్కజొన్నల మూటెత్తుకొని చీకట్లో పారిపోయింది కూడ నువ్వే కదరా’ ఆవేశంగా అడిగాడు. ‘అవును నేనే’ అన్నాడు కృష్ణదాసు. ఆ మాట వినగానే అప్పటికే పట్టుకొన్న కృష్ణదాసు షర్ట్ కాలర్ని గట్టిగా రెండూపులూపి, కాలి చెప్పు తీయబోవటం చూసిన కొండా వెంటనే ‘ఆ ఆ’ అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లి ‘ఆగాగు నువ్వా పనులేం పెట్టుకోకు. వాణ్ణి కొట్టడానికి కాదు ఇక్కడకు పిలిచింది’ అంటూ శీనయ్యని ఆపాడు కొండా. పాపారావు కూడా లేచి వచ్చి ‘ఇది వాడిని కొట్టే సమయం కాదులేరా శీనయ్యా.. ఆ విషయం తర్వాత చూసుకుందాం’ అని శీనయ్య చేతిలో నుంచి కృష్ణదాసు షర్ట్ కాలర్ విడిపించాడు. కృష్ణదాసు చూస్తా ఉండిపోయాడు. ‘రేయ్ దాసు, నీ జీవితాన్ని నువ్వు ఎటై్టనా జీవించొచ్చు అనుకుంటే పొరపాటురోయ్. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాందని పదిమంది నీకు చెప్పినప్పుడు ఒక్కసారైనా మనిషిగా నీ గురించి నువ్వు ఆలోచించుకుని నీ పంథా మార్చుకోవాల్రా. లేపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏవుందిరా?’ అన్నాడు కొండా. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ తనే, ‘దాని కోసం నేను నిర్ణయించుకున్నది ఒక్కటే. అదేంటంటే ఇదిగో నీ కొడుకుని నేను ఇక్కడ వదిలి పెడుతున్నాను. వాడు నీతో వస్తానంటే తీసుకెళ్ళు. కానీ నాతో వస్తానంటే మాత్రం నేను వదిలిపెట్టన్రోయ్. నేనే తీసుకెళ్తాను’ అంటూ కొండా కృష్ణదాసు వైపు చూశాడు. కృష్ణదాసు నిర్లక్ష్యంగా నుదుటి మీదకు పడుతున్న జుట్టుని పైకెగరేసుకున్నాడు. ‘ఇలా చేస్తే మారతాడనే నమ్మకం, ఇలాగే చేయాలనే ఆలోచన, పట్టుదల నీకెందుకొచ్చినయ్రా కొండా’ ఎంతో ఆసక్తిగా అడిగాడు పాపారావు. ‘మనం అన్ని రకాలుగా బాగుండాలంటే మనుషుల మధ్య సరైన సంబంధాలుండాలి. ఈ లోకంలో మానవ సంబంధాలను మించిన ఆస్తిగాని, దానిని మించిన గొప్ప విలువగాని మరోటి లేదని మా పంతులుగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. దాన్ని నేనెప్పుడూ పదే పదే మననం చేసుకుంటాను’ కొండా అలా చెప్పగానే పాపారావు దగ్గరకొచ్చి ‘శభాష్ రా కొండా’ అంటూ భుజం తట్టాడు. ఆ తాత్త్వికత అక్కడున్న వాళ్ళలో ఎంత మందికి అర్థమైందా అని గాలికి వంగిన చెట్ల శిఖరాగ్రాలు ఆసక్తిగా తొంగి చూశాయి. నాకెవరితోనూ సంబంధం లేదన్నట్టుగా అందర్నీ తాకుతూ ఓ పిల్లతెమ్మెర వెళ్ళి పోయింది. ‘సూర్య మీ నాన్నతో ఇంటికి వెళ్ళు’ అంటూ వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి ఇవతలికి వచ్చేశాడు కొండా. సూర్య అక్కడే నిలబడి పోయి ఉన్నాడే కానీ వాడేమీ వాళ్ళ నాన్న వైపు ఒక్కడుగు కూడా వేయలేదు. ఇంటికి వెళ్ళేందుకు కొండా నాలుగడుగులు వేయగానే వెనక నుంచి సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి కొండా చేయి పట్టుకున్నాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతమందిలో ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ఊహించని పరిణామం. గుంపుగా ఉన్న వాళ్ళు వెళ్ళడానికి దారి ఇచ్చారు.వాళ్ళందరినీ దాటుకుంటూ నాలుగడుగులు వేయగానే ‘అయ్యా’ అని వినపడటంతో కొండా వెనక్కి తిరిగి చూస్తే పెద్దావిడ విమలమ్మ గబగబా నడుచుకుంటూ వస్తూ కనిపించడంతో ఆగాడు. కొండా దగ్గరికి వచ్చి, ఆమె ‘ఏందిరా అయ్యా ఈ అన్నాయం? ఆడి కొడుకుని నువ్వు తీసుకెళ్ళి పోతుంటే ఆడన్నాయమై పోతాడుగందా. అసలే ఆడి భార్య చనిపోయి మూణ్ణెల్లుగూడ గాలేదాయె’ వణికే స్వరంతో, జాలిగా, కొండా రెండు చేతులు పట్టుకుని ఇలా చేయొద్దని అభ్యర్థిస్తున్నట్టుగా ‘ఒద్దయ్యా’ అంటూ బతిమిలాడుతూ అడిగింది. కొండా ఆమెకు మాత్రమే వినిపించేలా ‘వేరే వాళ్ళ పంటలు, వస్తువులు దొంగతనం చేసి అమ్మేస్తుంటే అవతలి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఈ రకంగా అయినా దాసుకి అర్థమవుతే మారుతాడేమోనని ఆశ పెద్దమ్మా. అంతేకానీ ఆడి కొడుకుని నేను ఎందుకు శాశ్వతంగా తీసుకెళ్తాను. వాడిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను అంతే’ అన్నాడు. పెద్దమ్మ ఏమి మాట్లాడలేక చూస్తా ఉంది. ‘నన్ను నమ్ము’ ఆమె చెయ్యి పట్టుకుని నమ్మకంగా చెప్పాడు. కొండా చెయ్యి పట్టుకుని వెళ్తున్న సూర్య ఆ చెయ్యి వదిలి వెనక్కు తిరిగి ‘నాన్నా’ అంటూ పిలిచాడు తండ్రిని. కొండా ఒక్కసారిగా హతాశుడై నిల్చుండిపోయాడు. కృష్ణదాసు.. సూర్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘నువ్వూ , యాక్ త్ఫూ .. నాన్నవి’ ఆ మాట అన్న వెంటనే వెనుదిరిగొచ్చి కొండా చెయ్యి పట్టుకున్న సూర్య అతని ముఖం వంక చూస్తూ ‘పద పోదాం’ అని ఓ పెద్ద మనిషిలా అన్నాడు. సురేఖకి సూర్య తమ సొంత కొడుకు కాదనే విషయం గుర్తు చేసుకోవటం మొదటి నుండి అస్సలు ఇష్టం ఉండదు. తమకు పిల్లలు పుట్టరని తెలిశాక అది మరింత ఎక్కువైంది. ఇంటర్ చదువుతున్న సూర్యకి అలాంటి విషయాల ఊసెత్తడం కూడ ఏమాత్రం నచ్చదు. సూర్య తను ఒకటో తరగతి వరకు గడిపిన జీవితమూ మర్చిపోలేదెప్పుడు. ఓ రోజు మాటల సందర్భంలో, ‘అమ్మా అన్నం పెట్టిందగ్గర నుండి దగ్గరే కూర్చుని తల, వీపు నిమురుతూండే నీ ప్రేమను పొందుతున్నానంటే ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను! నా మనసులో ఈ మాట అనుకోని పూట ఉండదు’ అన్నాడు సూర్య .‘పిచ్చి తండ్రి, మాకున్న లోటుని నువ్వు ఎంత బాగా తీర్చావో నీకు అర్థం కాదురా నాన్నా. మా బతుకులో ఇంత సంతోషాన్ని నింపావు. మేమే కాదు నువ్వొచ్చింతర్వాత ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఎంత సందడిగా ఉందో నీకు తెలీదురా’ మనసులోని ఆర్ద్రత కళ్ళల్లో కొస్తుండగా అన్నది సురేఖ. కొండా పెంపకంలో సూర్య వంక పెట్టలేని వ్యక్తిగా ఎదుగుతున్నాడు. ఓ రోజు సూర్యతో ‘నీ కన్నతండ్రి బాధ్యత కూడ నీదే. అది మాత్రం మర్చిపోకూడదురా నువ్వెప్పటికీ’ అన్నాడు కొండా. ‘అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా నాన్నా, నీ పెంపకంలో ఎలాంటి విషయాలైనా నిర్లక్ష్యం చేయకుండా పాటించేలా వాటంతటవే వచ్చేస్తాయి’ ప్రేమగా కొండా వంక చూస్తూ చెప్పాడు సూర్య. ‘చాలురా కన్నా ఈ పూటకి అన్నం తినకపోయినా పర్వాలేదు. కడుపు నిండిపోయింది నీ మాటతో’ సూర్యని దగ్గరకు తీసుకుంటూ ఎంతో తృప్తిగా అన్నాడు కొండా. శిక్షలిచ్చే గోడలతో పాటు క్షమను పంచే నీడలతో ఈ సమాజం అనాదిగా సాగుతోంది. ఇక మీదటా సాగుతుంది– గోడలు అక్కర్లేని, శిక్షలు అనివార్యమయ్యే అవస్థకు మనుషులు చేరుకొనే సమాజాన్ని నిర్మించుకునేంత వరకు. అప్పటి వరకు అందరినీ చూస్తూ కొండా పక్కనే నిలబడ్డ సూర్య కొండా చెయ్యి పట్టుకుని ఊపుతూ ‘మనం ఇక్కడకెందుకొచ్చాం’ అని అడిగాడు. తెల్లగా తెల్లారిన వెలుగులో ఒళ్ళు తుడుస్తూ ఏడేళ్ళుండొచ్చు అనుకొంటూ వాడి ముఖవర్చస్సు చూస్తూ వీడు నలుపులో మెరుపులా ఉన్నాడని మనసులో అనుకుంది. -
ముద్గల మహర్షి కుమారుడు
ముద్గల మహర్షి వేద వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు, పరమ శాంతుడు. ఆయన భార్య ధర్మిష్ట. ఆమె ఆదర్శ గృహిణి. చాలాకాలానికి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ బాలుడు అంధుడు, మూగవాడు. ముద్గల మహర్షి ఆశ్రమ పరిసరాల్లోని అరణ్యంలో శూర్పాక్షి, ఘటోదరుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. ఘటోదరుడు అంధుడు కావడంతో శూర్పాక్షి వేటకు వెళ్లి, ఆహారం సంపాదించుకుని వచ్చేది. శూర్పాక్షి, ఘటోదరులకు కూడా ఒక కొడుకు పుట్టాడు.ఒకనాడు శూర్పాక్షి తన కొడుకును ముద్గల మహర్షి ఆశ్రమం వద్ద విడిచిపెట్టి, ఆయన కొడుకును తన గుహకు ఎత్తుకుపోయింది. గుహలోకి శూర్పాక్షి వచ్చిన అలికిడి విన్న ఘటోదరుడు ‘ఏం తెచ్చావు?’ అని అడిగాడు. ముద్గల మహర్షి ఆశ్రమం వద్ద తమ బిడ్డను వదిలేసి, వారి బిడ్డను ఎత్తుకు వచ్చినట్లు చెప్పింది. భార్య చేసిన పనికి ఘటోదరుడు కలత చెందాడు.‘ఎంత పనికిమాలిన పని చేశావు! తపోనిధి అయిన ముద్గల మహర్షి అసలు సంగతి గ్రహిస్తే, మనం ఆయన శాపానికి గురి కావాల్సి వస్తుంది. వెంటనే నువ్వు ఆయన బిడ్డను ఆశ్రమం వద్దనే క్షేమంగా విడిచిపెట్టి, మన బిడ్డను తీసుకు వచ్చేయి’ అని చెప్పాడు. భర్త మాటపై ఆ బిడ్డను తిరిగి ఆశ్రమం వద్ద వదిలేయడానికి శూర్పాక్షి బయలుదేరింది.ఆమె అక్కడకు తిరిగి చేరుకునేలోగానే ముద్గలుడు తన పుత్రుడు ఉండాల్సిన చోట రాక్షస పుత్రుని చూశాడు. ఇది రాక్షసమాయ అని గ్రహించాడు. తన మంత్రబలంతో రాక్షస బాలుడిని ఉయ్యాలలో బంధించేశాడు. తర్వాత కాసేపటికి శూర్పాక్షి అదృశ్యరూపంలో అక్కడకు వచ్చి, ముని కుమారుడిని విడిచిపెట్టింది. తన కుమారుడిని తీసుకుపోవడానికి ప్రయత్నించింది. మంత్ర ప్రభావంతో బంధితుడైన కుమారుడిని తీసుకుపోవడం ఆమెకు సాధ్యపడలేదు. ఇక చేయగలిగినదేమీ లేక వెనుదిరిగింది. గుహకు చేరుకుని, భర్తకు జరిగినదంతా చెప్పింది. ఆ రాక్షస దంపతులు తమ బిడ్డ మీద ఆశలు వదిలేసుకున్నారు.ముద్గల దంపతులు ఆశ్రమంలో ఇద్దరు బిడ్డలనూ సమానంగా చూడసాగారు. ఒక సుదినాన ముద్గలుడు సుమూహర్తంలో బాలకులిద్దరికీ నామకరణం చేశాడు. రాక్షస బాలకుడికి దివాకరుడని, తన కొడుకుకు నిశాకరుడని పేర్లు పెట్టాడు. ఆ బాలురిద్దరూ ఆవుపాలతో పెరిగారు. విద్యాభ్యాసం ప్రారంభించే వయసు వచ్చాక, ముద్గలుడు ఇద్దరికీ అక్షరాభ్యాసం జరిపి, విద్యాబోధన మొదలుపెట్టాడు. ముని బాలకుడైన నిశాకరుడు మొదటి నుంచి మందకొడిగా ఉండేవాడు. తల్లిదండ్రుల చీవాట్లు, పెద్దల తిరస్కారాలు చిన్నప్పటి నుంచి భరించాడు. మాట పలుకు రాని మూగ, అంధుడు అయిన కొడుకు చదువుకు కూడా కొరగాకుండా పోవడంతో ముద్గలుడు విరక్తి చెందాడు. ఒకనాడు నిర్భాగ్యుడైన నిశాకరుడిని అడవిలోనున్న పాడుపడిన బావిలోకి తోసేశాడు. బావి మీద అడ్డంగా ఒక బండరాతిని పెట్టాడు.ఆ బావిలో ఒక ఉసిరి చెట్టు ఉంది. నిశాకరుడు ఉసిరిచెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాడు. ఉసిరిచెట్టు కాయలనే తింటూ, ఆ బావిలోనే పదేళ్లు పెరిగాడతడు. ఒకనాడు ముద్గలుడి భార్య అడవిలో కట్టెపుల్లలు ఏరుకునేందుకు ఆ బావి వైపుగా వచ్చింది. బావి మీద అడ్డంగా మూసి ఉన్న బండరాతిని చూసింది. ‘బావిని ఎవరిలా మూసేశారు?’ అని గట్టిగా అరిచింది. ‘అమ్మా! బావి మీద బండరాతిని పెట్టినది ఎవరో కాదు, నా తండ్రిగారే’ అని బావిలోనున్న నిశాకరుడు బదులిచ్చాడు. ‘బావిలోంచి మాట్లాడుతున్నదెవరు?’ అడిగిందామె. ‘నేను నిశాకరుడినమ్మా’ బదులిచ్చాడు ఆ బాలుడు. తన కొడుకుకు మాటలు రావడంతో ఆమె సంభ్రమాశ్చార్యాలు చెందింది. ఆమె అతి ప్రయాసతో బావి మీద మూసిన బండరాతిని తొలగించింది. ‘నిశాకరా!’ అని పిలిచింది. అతడు క్షేమంగా బయటకు వచ్చాడు. కన్నకొడుకును కళ్లారా చూసి, దగ్గరకు తీసుకుని ముద్దాడింది.కొడుకును భర్త వద్దకు తీసుకువెళ్లి జరిగినదంతా వివరించింది.‘నిశాకరా! నీలో ఈ మార్పు ఎలా వచ్చింది?’ అడిగాడు ముద్గలుడు. ‘తండ్రీ! పూర్వజన్మల పాప ఫలితంగానే నేను అంధుడిగా, మూగవాడిగా పుట్టాను. పూర్వజన్మలో నా తండ్రి వేద వేదాంగాలను, ధర్మార్థ కామమోక్షాలను గురించి చక్కగా ఉపదేశించాడు. నేను విజ్ఞానఖనినయ్యాను. జ్ఞానంతో పాటు నాకు అహంకారం కూడా పెరిగింది. అహంకారం బుద్ధిని కమ్మేయడంతో కన్నూ మిన్నూ కానక చేయరాని పాపాలన్నీ చేశాను. పరధనాన్ని దౌర్జన్యంగా అపహరించాను. పరస్త్రీలను బలవంతంగా అనుభవించాను. మరణానంతరం నరకానికి వెళ్లి, కొన్నేళ్లు నరకయాతనలు అనుభవించాను. తర్వాత పులిగా జన్మించాను. ఆ తర్వాత పులిగా చేసిన పాపాలకు గాడిదగా జన్మించాను. గాడిద జన్మలో చేసిన పాపాలకు ఫలితంగా మూగ గుడ్డిగా మీకు జన్మించాను. తండ్రీ! నువ్వు నన్ను బావిలో పడవేసిన తర్వాత ఉసిరిచెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాను. ఉసిరికాయలు తిని బతికాను. ఉసిరికాయలు తినడం మొదలుపెట్టిన ఆరునెలలకు నాకు పూర్వజన్మల స్మృతి కలిగింది. నాకు జ్ఞానోదయమైంది. పూర్వజన్మలో అధ్యయనం చేసిన శాస్త్రాలన్నీ జ్ఞప్తికి వచ్చాయి. పూర్తిగా పాపక్షయం చేసుకోవడానికి నేను తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసుకోవడానికి నేను బదరికాశ్రమం వెళుతున్నాను. నన్ను అనుమతించండి’ అని నిశాకరుడు తల్లిదండ్రుల పాదాలకు ప్రణమిల్లాడు.వారు అనుమతించడంతో తపస్సు చేసుకోవడానికి బదరికాశ్రమం వైపు బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
క్రిస్టల్ స్పెన్సర్ మర్డర్ మిస్టరీ?
‘టిన్సెల్ టౌన్’.. హాలీవుడ్ ప్లాట్ఫామ్కి అదో అద్భుతమైన వార ధి. అది చూపించే గ్లామర్, స్టార్డమ్ వంటి అబ్బురాలను తన కలగా మార్చుకుని, అడుగులు వేసిన క్రిస్టల్ స్పెన్సర్ అనే అమ్మాయి కథే ఈ వారం మిస్టరీ.అమెరికా, కాలిఫోర్నియాలోని యూకియా నగరంలో క్రిస్టల్ పుట్టి పెరిగింది. తన ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. క్రిస్టల్కు ఇద్దరు సోదరులు. పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లి కష్టం చూడలేక, చదువు మానేసి ఉద్యోగంలో చేరి, సంపాదన మొదలుపెట్టింది.యుక్తవయసు వచ్చేసరికి తన అందాన్ని మెచ్చేవాళ్లు, నటిగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. దాంతో టిన్సెల్ టౌన్ ఆహ్వానాలను నమ్మి, తన ప్రతిభను నిరూపించుకోవడానికి లాస్ ఏంజెలెస్ చేరింది.అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ, సుమారు మూడేళ్లపాటు నటిగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇంతలో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో, అయిష్టంగానే విమానాశ్రయంలోని వైల్డ్ గూస్ నైట్క్లబ్లో డాన్సర్గా చేరింది. ‘ఎంతో ఎదగాలని వచ్చి, సమాజమే తప్పుగా చూసే క్లబ్ డాన్సర్గా మారి, దిగజారిపోయా’ అని తన స్నేహితురాలు జూలీతో చెప్పుకుని బాధపడేది.నటి కావాలనే ప్రయత్నంలో ఆమెకు ఆంటన్ క్లెయిన్ అనే స్క్రీన్ రైటర్ పరిచయమయ్యాడు. క్రిస్టల్ అందానికి, ప్రతిభకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన ఆంటన్.. ఆమె ఎప్పటికైనా మంచి నటి అవుతుందని నమ్మాడు. నాటినుంచి ఆమె అడుగులకు అతడు బాటలు వేయడం మొదలుపెట్టాడు. ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్లు ఇలా ప్రతిచోటికీ వెంట తీసుకెళ్లేవాడు. కచేరీల్లో తనకున్న పరిచయాలను ఆమెకు అవకాశాలుగా మార్చడానికి ప్రయత్నించాడు. క్రమంగా వారి బంధం ప్రేమ, పెళ్లి అనే రెక్కలు తొడిగింది. ‘నేనొక క్లబ్ డాన్సర్ని అనే నిజం అతడికి చెప్పలేకపోతున్నా. చెబితే నన్ను చిన్నచూపు చూస్తాడేమో!’ అని జూలీ ముందు క్రిస్టల్ ఏడ్చేంది.అయితే ఒక రాత్రి ఆంటన్ స్నేహితుడు.. ఆమెను క్లబ్లో చూసి, ఆ నిజాన్ని ఆంటన్కి చెప్పాడు. ముందే చెప్పనందుకు కలత చెందిన ఆంటన్.. క్రిస్టల్ని దూరం పెట్టేశాడు. కానీ ఆమె ప్రేమ ముందు అతడి కోపం చిన్నబోయింది. తిరిగి కలిశారు. క్రిస్టల్ని యాక్టింగ్ క్లాసులో చేర్పించాడు. నిజానికి క్రిస్టల్లో అతడికి నచ్చని ఒకే ఒక్క విషయం.. ఆమెకు డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం. వాటికి దూరంగా ఉండమని చాలాసార్లు గొడవపడేవాడు.ఒకరోజు ఆమెకు జపాన్ లోని ఒక నైట్క్లబ్లో ‘హోస్టెస్ గర్ల్’గా 3 నెలల పాటు పనిచేయాలంటూ పెద్ద ఆఫర్ వచ్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే దానికి వెళ్లడమే మేలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మరునాడు తీవ్రమైన జ్వరంతో క్లబ్కి వెళ్లకుండా క్రిస్టల్ ఆమె అపార్ట్మెంట్లోనే ఉండిపోయింది. ఆ సాయంత్రం తన ల్యాండ్ ఫోన్ నుంచి ఆంటన్కి కాల్ చేసి, ‘జపాన్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. అయితే మరునాటి నుంచి ఆమె ఫోన్ చేయలేదు. తిరిగి చేస్తుంటే కలవలేదు. సుమారు 2 రోజులు గడిచిపోయాయి. క్రిస్టల్ వర్క్ చేసే క్లబ్కి వెళ్లిన ఆంటన్..గత ఐదు రోజులుగా ఆమె క్లబ్కు కూడా రాలేదని తెలుసుకున్నాడు. జపాన్ ఆఫర్ను ఓకే చేసి, అక్కడికి వెళ్లి ఉంటుందిలే అనుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అతడికి పోలీసుల నుంచి కాల్ వచ్చింది. ‘క్రిస్టల్ని చివరిగా ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడావ్?’ అంటూ చాలా ప్రశ్నలకు ఆంటన్ నుంచి సమాధానాలు రాబట్టారు. తర్వాత ‘వారం క్రితం క్రిస్టల్ తన అపార్ట్మెంట్లోనే చనిపోయింది, దుర్వాసన వస్తోందని పొరుగువారు కంప్లైంట్ చేస్తే తలుపు పగలగొట్టి చూశాం. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్కు పంపించాం’ అని చెప్పారు. ఆ వార్త విని ఆంటన్ హతాశుడయ్యాడు.‘వారం క్రితం చనిపోయిందంటే క్రిస్టల్కి జ్వరం వచ్చాక కూడా ఆల్కహాల్, డ్రగ్స్ వంటివి తీసుకుని ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంది కాబోలు’ అనుకున్నాడు ఆంటన్. అయితే, క్రిస్టల్ అపార్ట్మెంట్లో ఉండే కొందరు అతడికి మరో షాకింగ్ విషయం చెప్పారు. ‘క్రిస్టల్ మృతదేహం ఇంట్లో ఒక మూలన పడుంది, ఆమె నడుముకు టెలిఫోన్ వైర్తో కట్టి, అర్ధనగ్నంగా ఉంది’ అని చెప్పడంతో ఆంటన్ తెల్లబోయాడు. వెంటనే పోస్ట్మార్టమ్ రిపోర్ట్ చూశాడు. అది మరింత షాక్కు గురి చేసింది. ఎందుకంటే హైట్, వెయిట్ దగ్గర నుంచి చాలావిషయాలు క్రిస్టల్ని పోలిలేవు. బాడీ బాగా కుళ్లిపోవడంతో మరణానికి కారణం తెలియలేదని డాక్టర్స్ తేల్చేశారు. క్రిస్టల్ పక్క అపార్ట్మెంట్లో ఉండే ఒక జంట.. మరో నిజం చెప్పింది. సుమారు వారం క్రితం, ఒకరాత్రి క్రిస్టల్ అపార్ట్మెంట్ నుంచి భీకరమైన ఏడుపులు, అరుపులు వినిపించాయని, ఎవరో ఎవరినో తీవ్రంగా హింసిస్తున్నట్లనిపించిందని, కానీ పోలీసులకు చెప్పాలంటే భయమేసి ఆగిపోయామని చెప్పారు. అంటే ఆ రోజు దాడి జరిగింది క్రిస్టల్ పైనేనా? లేదంటే క్రిస్టల్ను ఎత్తుకెళ్లి.. మరో అమ్మాయి మృతదేహాన్ని అక్కడ పెట్టారా? అనేది ఆంటన్కు అర్థం కాలేదు. కనీసం క్రిస్టల్ మృతదేహాన్ని అప్పగించాలని అధికారుల చుట్టూ్ట ఎంత తిరిగినా.. ఏవేవో కారణాలు చెప్పి, మృతదేహాన్ని అప్పగించలేదు. అసలు జపాన్ ఆఫర్ కూడా ఆమెను కిడ్నాప్ చేసే కుట్రలో భాగమా? అనే అనుమానం ఆంటన్కి వచ్చింది.1988 మే 4న క్రిస్టల్ జ్వరం వచ్చి, ఆంటన్ను కలవకుండా, క్లబ్కి వెళ్లకుండా అపార్ట్మెంట్లోనే ఉండిపోయింది. మే 13న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుపై ఆంటన్ ప్రయత్నాలు తీవ్రం కావడంతో ఒకరోజు అతడికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ‘కొన్నిసార్లు చెడిపోయిన అమ్మాయిలకు చెడు జరుగుతుంటుంది, అలాంటి వాటిని పట్టించుకుంటే, మనం ప్రమాదంలో పడతాం’ అనే సారాంశంతో ఫోన్ కట్ అయ్యింది. ఆ మాటలే ఆంటన్ అనుమానాలకు బలాన్నిచ్చాయి. అప్పుడే ఆంటన్ దృష్టి మాజీ కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారి హోరేస్పై పడింది. నిజానికి క్రిస్టల్ పని చేసిన క్లబ్కి రహస్య యజమాని అతడేనని అప్పటికే పుకార్లున్నాయి. అతడు చాలా క్లబ్స్, బార్స్ను బినామీ పేర్లతో నడుపుతుంటాడని ఆంటన్ విచారణలో తేలింది. పైగా తన స్నేహితులను, వ్యాపార భాగస్వాములను అలరించడానికి తన క్లబ్స్లో పనిచేసే డాన్సర్స్ని నియమించేవాడని.. వారిలో క్రిస్టల్ కూడా ఉండొచ్చని కొందరు ఆంటన్కి చెప్పారు. మరోవైపు మెక్కెన్నాకి ఇంగ్లీవుడ్లోని ఒక గిడ్డంగిలో రహస్యంగా కసీనో కూడా ఉందని, డ్యూటీలో భాగంలో క్రిస్టల్ ఒకసారి అక్కడికి వెళ్లిందని.. ఆ తర్వాత ఆ అనధికారిక స్థావరం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే క్రిస్టల్ని మెక్కెన్నా చంపించి ఉంటాడని మరికొందరు చెప్పారు. అయితే వేటికీ సాక్ష్యాలు లేక.. పోలీసుల సహకారం లేక ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
మోడర్న్ ఆల్కెమీ.. లాబ్లో బంగారం
పసుపు రంగులో ధగధగలాడే బంగారం అంటే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో అంతులేని మోజు. బంగారం అరుదుగా దొరుకుతుంది. బంగారు గనులు అతి పరిమితంగా ఉంటాయి. అందుకే బంగారానికి అంత విలువ. ఇబ్బడి ముబ్బడిగా దొరికే తక్కువ విలువ చేసే లోహాలతో బంగారం తయారీకి మధ్య యుగాల్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. శతాబ్దాల ప్రయత్నాల తర్వాత శాస్త్రవేత్తలు లాబొరేటరీల్లో విజయవంతంగా బంగారాన్ని తయారు చేయగలిగారు. లాబొరేటరీల్లో బంగారాన్ని తయారు చేసే ప్రక్రియలనే ‘మోడర్న్ ఆల్కెమీ’గా అభివర్ణిస్తున్నారు. మోడర్న్ ఆల్కెమీ కథా కమామిషూ తెలుసుకుందాం.బంగారం విలువ ఎక్కువ కాబట్టి దానికి అంత గిరాకీ. పురాతన కాలంలో నగలకే కాదు, నాణేలకూ బంగారమే వినియోగించేవారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు కూడా బంగారమే కీలకం. అరుదుగా ఉండే గనులను అన్వేషించి, వాటిని తవ్వి, ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలంటే రకరకాల దశల్లో రకరకాలుగా మనుషులు శ్రమించాల్సి ఉంటుంది. అంత శ్రమ లేకుండా, తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ చేస్తే బాగుంటుందనే ఆలోచన మనుషులకు పురాతన కాలం నుంచే ఉండేది. తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ ఎలా చేయాలనే దానిపై నానా రకాల ప్రక్రియలను ఊహించారు. వాటిపై రకరకాలుగా ప్రయోగాలు చేశారు. క్రమంగా ఈ ప్రక్రియలకు సంబంధించిన ‘శాస్త్రం’ ఒకటి రూపుదిద్దుకుంది. మనవాళ్లు దీనిని ‘పరుసవేది’ అని, ‘రసవిద్య’ అని అన్నారు. పాశ్చాత్యులు ‘ఆల్కెమీ’ అన్నారు. ‘అల్–కిమియా’ అనే అరబిక్ పదం నుంచి ‘ఆల్కెమీ’ అనే మాట వచ్చింది. దాదాపు నాలుగువేల ఏళ్ల కిందట ఆల్కెమీ ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ రాజ్యాల్లో విస్తృత ప్రాచుర్యంలో ఉండేది. పురాతన గ్రీకు, రోమన్ రాజ్యాల కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో విపరీతమైన వేలంవెర్రి ఉండేది. అప్పట్లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ఆల్కెమీ పరిశోధనలకు కేంద్రంగా ఉండేది. అదేకాలంలో, ప్రాచ్య ప్రపంచంలో భారత ఉపఖండం, చైనా ఆల్కెమీ ప్రయోగాలకు ఆలవాలంగా ఉండేవి. ఆనాటి కాలంలో వేర్వేరు దేశాల్లోని రసవేత్తలు సీసం వంటి తృణలోహాలతో బంగారం తయారు చేసే ప్రక్రియ సహా కృత్రిమ పద్ధతుల్లో విలువైన రత్నాలను తయారు చేయడం, నకిలీ బంగారం, నకిలీ వెండి వంటి లోహాలను తయారు చేయడం వంటి ప్రక్రియలను వివరిస్తూ గ్రంథాలు రాశారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి రసవిద్య ఒక మార్మికశాస్త్రం స్థాయికి చేరుకుంది. ఆల్కెమీ పేరుతో ఆనాటి సమాజంలో రకరకాల మోసాలు కూడా జరిగేవి. ఈ పరిస్థితిని భరించలేక ఇంగ్లండ్లో కింగ్ హెన్రీ–ఐV ఆల్కెమీని నిషేధించాడు.అప్పట్లో దగ్గరగానే ఊహించారుమిగిలిన లోహాలతో పోల్చుకుంటే, పాదరసంతో బంగారం తయారీ కొంత సులువు. పాదరసం ఎక్కడ? బంగారం ఎక్కడ? ఈ రెండింటికీ పోలిక ఏమిటి? పాదరసంతో బంగారం తయారీ ఏమిటి? అని కొట్టి పారేయకండి. రసాయనిక శాస్త్రంతో కనీస పరిచయం ఉంటే, రెండింటికీ సంబంధం ఏమిటో సులువుగానే అర్థమవుతుంది. ఆవర్తన పట్టికలో పక్కపక్కనే ఉండే మూలకాలు బంగారం, పాదరసం. వీటిలో బంగారం పరమాణు సంఖ్య 79, పాదరసం పరమాణు సంఖ్య 80. సాంకేతికంగా అర్థం చేసుకోవాలంటే, పాదరసం పరమాణువులోని 80వ ప్రోటాన్ను తొలగించగలిగితే, అది బంగారం పరమాణువుగా మారుతుంది. ఆధునిక కాలంలో కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పాదరసాన్నే ఎంపిక చేసుకున్నారు. కొందరు శాస్త్రవేత్తలు 1941లో ప్రయోగాత్మకంగా పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్ను తొలగించి, బంగారాన్ని సృష్టించగలిగారు. దీనికోసం వారు కాంతివేగంతో న్యూట్రాన్ కిరణాలను పంపి, పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్ను తొలగించారు. ఈ ప్రక్రియను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ అంటారు. ఈ ప్రయోగంలో తయారైన బంగారం పరమాణువులు అణుధార్మికతతో ఉండటమే కాకుండా, బాహ్య వాతావరణానికి బహిర్గతమైనప్పుడు రసాయనిక చర్యలకు లోనై, నశించిపోయాయి. ప్రయోగశాలలో బంగారాన్ని సృష్టించే ప్రక్రియల్లో ఇది తొలి పాక్షిక విజయం. అంతకంటే ముందు పురాతన రసవేత్తలెవరూ తక్కువ విలువైన లోహాలతో బంగారాన్ని తయారు చేసిన దాఖలాల్లేవు.ఆవర్తన పట్టిక అంటే ఏమిటో తెలియని కాలంలో, మూలకాల పరమాణు సంఖ్యలపై ఏమాత్రం అవగాహన లేని కాలంలో మన భారతీయ రసవేత్తలు పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఊహించారు. క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన బౌద్ధ గురువులు సిద్ధ నాగార్జునుడు, సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారీ సాధ్యమేనని ప్రగాఢంగా విశ్వసించారు. నాగార్జునుడు తన ‘రసేంద్ర మంగళం’, నిత్యానందుడు తన ‘రసరత్నాకరం’ గ్రంథాల్లో పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం గురించి విపులంగా రాశారు. బంగారానికి, పాదరసానికి గల దగ్గరి సంబంధం వాళ్లకు ఎలా తెలిసిందనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే! బంగారం బాదరబందీలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్థూలంగా రుజువు చేయగలిగారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ప్రయోగశాలల్లో బంగారం తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో గనుల్లో దొరికే బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రయోగశాలల్లో తయారైన బంగారాన్ని పరిగణించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇప్పటి పద్ధతుల్లో బంగారాన్ని ప్రయోగశాలల్లో భారీ స్థాయిలో తయారు చేయడం వీలయ్యే పరిస్థితులు కూడా లేవు. గనుల్లో దొరికే బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులు అభివృద్ధి చెందితే తప్ప జనాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు ఇన్ని ఫలితాలను సాధించిన శాస్త్రవేత్తలు కొన్నాళ్లకు ప్రయోగశాలల్లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పరిమాణంలో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులను రూపొందించ గలుగుతారనే ఆశాభావం కూడా ఉంది. ఒకవేళ శాస్త్రవేత్తలు ఆ ప్రయత్నాల్లో విజయం సాధించినా, ప్రయోగశాలల్లో తయారైన బంగారానికి మార్కెట్లో అంత త్వరగా ఆమోదం లభించకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన జనాలు గనుల్లో దొరికిన బంగారానికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కృత్రిమ వజ్రాలను విజయవంతంగా తయారు చేస్తున్నారు. వీటిని ఆభరణాల్లో కూడా విరివిగా వాడుతున్నారు. గనుల్లో దొరికిన వజ్రాలతో పోల్చుకుంటే, కృత్రిమ వజ్రాలకు గిరాకీ తక్కువగా ఉంటోంది. ఆ అనుభవంతోనే ప్రయోగశాలల్లో తయారైన కృత్రిమ బంగారానికి కూడా ఆశించిన గిరాకీ ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. గనుల్లో దొరికే బంగారానికి, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారానికి స్వచ్ఛతలో, నాణ్యతలో ఎలాంటి తేడా లేకపోయినా, కృత్రిమ బంగారానికి జనాదరణ ఏమేరకు ఉంటుందనేదే అనుమానం.కృత్రిమ బంగారంతో లాభాలుగనుల్లోంచి తవ్వి తీసిన బంగారంతో పోల్చుకుంటే, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారంతో చాలా లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గనుల్లోంచి తవ్వి తీసిన బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి కలిగే చేటును పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. గనుల్లోంచి బంగారాన్ని తీయడం వల్ల అడవుల నాశనం విపరీతంగా జరుగుతోంది. ముడి ఖనిజం నుంచి బంగారాన్ని వేరు చేయడానికి సైనైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన విషపదార్థాలను ఉపయోగించాల్సి వస్తోంది. గనుల్లో కార్మికుల శ్రమదోపిడీ విపరీతంగా జరుగుతోంది. బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు తరచుగా ప్రమాదాల బారినపడటం, ప్రమాదకర రసాయనాలతో పనిచేయడం వల్ల వ్యాధిగ్రస్థులు కావడం జరుగుతోంది. ప్రయోగశాలల్లో చౌకగా బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల్లోని బంగారానికి ప్రత్యామ్నాయంగా జనాలు కృత్రిమ బంగారాన్ని ఆమోదించగలిగితే, ఇప్పటి వరకు గనుల వల్ల జరుగుతున్న అన్ని అనర్థాలనూ అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.బిస్మత్ నుంచి బంగారంపాదరసం నుంచి బంగారాన్ని సృష్టించడం సాధ్యమైనా, ఆ ప్రయోగం పాక్షికంగా మాత్రమే విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు మరింత మెరుగైన ఫలితాలను సాధించే దిశగా ప్రయోగాలను ప్రారంభించారు. అమెరికన్ రసాయనిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గ్లెన్ సీబోర్గ్ 1980లో బిస్మత్ నుంచి బంగారాన్ని విజయవంతంగా తయారు చేయగలిగాడు. బిస్మత్ పరమాణు సంఖ్య 83. బిస్మత్ పరమాణువుల్లోని అదనపు ప్రోటాన్లను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ కాకుండా వేరే ప్రక్రియలో విజయవంతంగా తొలగించగలిగాడు. పార్టికల్ యాక్సిలరేటర్ ద్వారా సీబోర్గ్ అదనపు ప్రోటాన్లను తొలగించి, బిస్మత్ను బంగారంగా మార్చగలిగాడు. ఈ ప్రయోగాన్ని సీబోర్గ్ తన బృందంతో కలసి లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీలో విజయవంతంగా జరిపాడు. ఈ ప్రక్రియ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనికి ఆదరణ లభించలేదు. ఈ పద్ధతిలో తయారు చేసిన బంగారం, గనుల్లోంచి తీసిన బంగారం కంటే ఎక్కువ ఖరీదు కావడంతో ప్రయోగం విజయవంతమైనా, జనాలకు ఉపయోగం లేకుండా పోయింది. పాదరసం నుంచి, బిస్మత్ నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రక్రియల్లో మూలకాల పరమాణు నిర్మాణాన్ని మార్చడమే కీలకం. తక్కువ విలువ గల మూలకాల్లోని అదనపు ప్రోటాన్లను తొలగించడం ద్వారా వాటిని బంగారం పరమాణువులుగా మార్చడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు రుజువు చేయగలిగారు.మరిన్ని పద్ధతుల్లోనూ ప్రయోగాలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం కోసం మరిన్ని పద్ధతుల్లోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతులు:1 రసాయనిక పద్ధతి బంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!2లేజర్ పద్ధతిబంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!3 బ్యాక్టీరియా పద్ధతిబ్యాక్టీరియాకు, బంగారానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యం కలుగుతోందా? కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారాన్ని తయారు చేసే శక్తి ఉంది. ‘క్యూప్రియావిడస్ మెటాలిడ్యూరన్స్’ వంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారం కలిసిన వివిధ సమ్మేళనాల నుంచి బంగారం అయాన్లను గ్రహించి, వాటిని స్వచ్ఛమైన బంగారు కణాలుగా మార్చే సామర్థ్యం ఉంది. భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరు చేసేందుకు ఇలాంటి బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. వీటివల్ల విషపూరితమైన భారలోహాల కాలుష్యం తగ్గి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టులు కాజేమ్ కషేఫీ, ఆడమ్ బ్రౌన్ తొలిసారిగా భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరుచేయగల బ్యాక్టీరియాను గుర్తించారు. -
జానపద సంప్రదాయ సమ్మేళనం
కేరళలో విలక్షణమైన జానపద సంప్రదాయ సమ్మేళనానికి నిదర్శనం ‘తెయ్యం’ వేడుకలు. ముఖ్యంగా కేరళ ఉత్తర ప్రాంతంలో రకరకాల ‘తెయ్యం’ వేడుకలు జరుగుతాయి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా కోట్టంకుళిలో డిసెంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు ‘పేరుమ్తిట్ట తరవాడ్’ అనే తెయ్యం ఉత్సవాలు జరుగుతున్నాయి. మలబార్ ప్రాంతంలోని వివిధ గిరిజన తెగలకు చెందిన కళాకారులు సంప్రదాయ వేషాలను ధరించి, పౌరాణిక గాథలకు సంబంధించిన సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. ‘పేరుమ్తిట్ట తరవాడ్’ వేడుకల్లో ‘ఎలయూర్ తెయ్యం’, ‘చాముండీ తెయ్యం’, ‘పంచూర్ల తెయ్యం’, ‘ముత్తూర్ తెయ్యం’ వంటి వివిధ పురాతన సంప్రదాయ రీతుల తెయ్యం నృత్యరూపకాలను ప్రదర్శిస్తారు. వేలన్ తెగకు చెందిన గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘తెయ్యం’ నృత్యంగా పరిణామం చెందింది. ఈ నృత్యానికి దాదాపు పదిహేనువందల ఏళ్ల చరిత్ర ఉంది. దేవతల నుంచి, పితృదేవతల నుంచి ఆశీస్సులు కోరుతూ ఈ నృత్యం చేస్తారు. మలబార్ ప్రాంతంలో ఇలాంటి తెయ్యం వేడుకలు ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వేర్వేరు చోట్ల జరుగుతాయి. ‘తెయ్యం’ ప్రదర్శనలు సాధారణంగా ఆలయ ప్రాంగణాల్లోను, ఆలయాలకు సంబంధించిన వేడుకల్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపైన జరుగుతాయి. ‘తెయ్యం’ అనే మాట ‘దైవం’ నుంచి వచ్చిందని చెబుతారు. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యంగా నమ్ముతారు. మలబార్ ప్రాంతంలో దాదాపు నాలుగువందల తెయ్యం రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువగా పురుషులే ‘తెయ్యం’ ప్రదర్శనలు చేస్తారు. అయితే, ‘దేవకూత్తు తెయ్యం’ నృత్యాన్ని మాత్రమే మహిళలు ప్రదర్శిస్తారు. ‘తెయ్యం’ నృత్యం చేసే కళాకారులు విచిత్రమైన సంప్రదాయ వేషాలను ధరిస్తారు. వీరు నృత్యం చేసేటప్పుడు వాద్య కళాకారులు సంప్రదాయ వాద్యాలైన డోలు, సన్నాయి, తప్పెటలు వంటివి మోగిస్తారు. వేడుకలకు సంబంధించిన పౌరాణిక గాథలను గానం చేస్తారు. కళ్లు చెదిరే రీతిలో సాగే ఈ ప్రదర్శనలను తిలకించడానికి దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తుంటారు. -
కలుపే కల్పతరువు
ఈ బుట్టలు.. బ్యాగులు వెదురుతో అల్లినవనుకుంటున్నారా? గుర్రపుడెక్కతో తయారైనవి అంటే నమ్ముతారా? ఈ కళను వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ అంటున్నారు! ఆంధ్రప్రదేశ్ బందరు దగ్గర్లోని చిన్నాపురంలో ఈ మధ్య జరిగిన హ్యాండీక్రాఫ్ట్స్ శిక్షణ శిబిరం గురించి తెలిసినవాళ్లకు ఇది పరిచయమయ్యే ఉంటుంది. తెలియని వాళ్ల కోసం ఈ పరిచయం.. యిర్రింకి ఉమామహేశ్వరరావు, అమరావతివర్షాకాలం వస్తే చాలు డ్రెయిన్లు, కాలువల్లో దట్టంగా అల్లుకుపోయి.. నీటి ప్రవాహానికి అడ్డుపడి మహా చిక్కులు తెచ్చిపెడుతుందీ గుర్రపుడెక్క. రైతుల పాలిట శాపంగా మారుతోందీ కలుపు. దాన్ని తొలగించి గట్టున పడేసినా నీటి చుక్క తగిలితే చాలు ఎండిపోయింది కూడా ప్రాణం పోసుకుని పదిహేను రోజుల్లోనే అడవిలా అల్లుకుపోతుంది. దాంతో గత్యంతరం లేక దానిమీద పురుగుమందును పిచికారీ చేస్తున్నారు. ఆ రసాయనాలు కలిసిన కాలువల్లోని నీటినే చేపల చెరువులు, చేలకు పెడుతుండటంతో చేపలు చనిపోతున్నాయి, పంట విషతుల్యమవుతోంది. అందుకే దీన్ని పర్యావరణహితంగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించి, పరిశోధించి.. అద్భుతమైన ఫలితాలను సాధించారు అసోమ్కు చెందిన రీటా దాస్. ఆ రిజల్టే ఈ బుట్టలు, బ్యాగులు ఎట్సెట్రా! చిన్నాపురం ట్రైనింగ్ క్యాంప్లో శిక్షణనిచ్చింది రీటానే! తన స్వస్థలమైన అసోమ్లో కూడా గుర్రపుడెక్క సమస్య తీవ్రమే! రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దీన్ని.. జ్యూట్లా హ్యాండీక్రాఫ్ట్ మెటీరియల్గా మలచొచ్చేమో అని ఆలోచించారు. గుర్రపుడెక్కను కాండంతో సహా సేకరించి, పదిరోజులపాటు ఎండబెట్టి, తర్వాత చిన్నపాటి యంత్రాల సహాయంతో దాన్ని ప్రాసెస్ చేసి.. అల్లికలకు అనువుగా తయారుచేశారు. ముందు ఓ మ్యాట్ని అల్లి చూశారు. బ్రహ్మాండంగా వచ్చింది. అంతే రీటాకు నమ్మకం వచ్చింది.. గుర్రపుడెక్కతో చక్కగా హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేయొచ్చని! డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, బ్యాగులు, బుట్టలు, టోపీలు తయారుచేసి మార్కెట్లో పెట్టారు. మంచి గిరాకీ కనపడింది. దాంతో ఇది చక్కటి ఉపాధి మార్గం కానుందని గ్రహించారు. ఆసక్తిగల వారికి శిక్షణనివ్వడం ప్రారంభించారు. ఇలా గుర్రపుడెక్క ఆదాయవనరుగా మారి, రైతుల సమస్యా తీరుతోంది, పర్యావరణానికి మేలూ జరుగుతోంది. వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ గురించి తెలుసుకున్న తమిళనాడు.. రీటాతో తమ రాష్ట్రంలోనూ శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసింది. ఈ కళ ఇప్పుడు అసోమ్, తమిళనాడు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ గుర్రపుడెక్క సమస్య ఉండటంతో చిన్నాపురంలో వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ మీద రీటా రెండునెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు.ఆహారంగా.. అంటార్కిటికా మినహా ప్రపంచమంతా వ్యాప్తి చెందిన నీటి మొక్క గుర్రపుడెక్క. ఇందులో నాలుగు రకాలున్నాయి. ఒకదానితో ఒకటి అల్లుకుపోయి గుంపుగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని వియత్నాం, తైవా¯Œ వంటి దేశాల్లో అప్పుడప్పుడు సాలడ్గా తింటారు. గుర్రపుడెక్కను బయోగ్యాస్గా, నీటి శుద్ధికి, ఎరువుల ఉత్పత్తికి ఉపయోగించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే ప్రపంచంలో అతిపెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టవుతుంది. -
Mystery: ఓ సరదా.. రెండు జీవితాలు..
అది 1983 జూలై 24, అమెరికా, లాస్ఏంజెలెస్ శివార్లలో డంప్యార్డ్లో అదే ఏడాదికి చెందిన ఒక డైరీ చెత్తకుప్పలో తెరిచినట్లుగా పడుంది. దానిలోని పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. అటుగా వచ్చిన అటెండెంట్ అప్రయత్నంగా ఆ డైరీ తీసి, పేజీలు తిప్పుతుంటే, అతడి చూపు ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. ‘ఈ అమెరికన్స్ సహృదయులు. వీరి మనసులు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి’ అనే లైన్ చదివి అతడు గర్వంగా నవ్వుకున్నాడు. ఆ డైరీలోని రాతలు జూలై 21తో ఆగిపోయాయి. వెంటనే అతడు తలెత్తి చుట్టూ చూశాడు. అప్పుడే కాస్త దూరంలో చెత్తకుప్పల మధ్య ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దానిలో రెండు పాస్పోర్టులు, అంతకుముందు ట్రావెల్ చేసిన కొన్ని టికెట్స్ ఉన్నాయి. ఒక పాస్పోర్ట్, డైరీ రాసిన మారియా వాహిన్స్ అనే 25 ఏళ్ల అమ్మాయిది, రెండవ పాస్పోర్ట్ ఆమె స్నేహితురాలు మేరీ లిలియన్బర్(23)ది. ఇద్దరూ స్వీడిష్ యువతులే! ‘పొరబాటున వారెక్కడో వీటిని పారేసుకుంటే, ఇక్కడికి చేరి ఉంటాయి’ అని భావించిన ఆ అటెండెంట్ వాటిని పోలీసులకు ఇచ్చి, ఆ అమ్మాయిలకు అందించాలని కోరాడు.అయితే పదిరోజులు గడిచేసరికి మేరీ, మారియాలు ఏమయ్యారో తెలియడంలేదని స్వీడన్స్ నుంచి వారి పేరెంట్స్ అమెరికాకి వచ్చి, కాలిఫోర్నియా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో, పత్రికలు మొదటిపేజీ వార్తకు సిద్ధమయ్యాయి. అప్పటికే వారి వివరాలు రికార్డ్స్లో ఉండటంతో విచారణను డంప్యార్డ్ నుంచి మొదలుపెట్టారు.స్వీడన్ నుంచి వచ్చిన మేరీ, మారియా.. కొలరాడో, వైల్లోని ఒక రిసార్ట్ హోటల్లో చాంబర్ మెయిడ్స్గా పని చేసేవారు. ఒకే దేశానికి చెందినవారు కావడంతో స్నేహితులుగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వారి స్నేహం ఇరు కుటుంబాలకు.. ఒకరికొకరు ఉన్నారన్న ధైర్యానిచ్చేది. అయితే వారిద్దరికీ పర్యాటకంపై ఆసక్తి ఉండటంతో, వారిలో హిచ్ హైకింగ్ (అపరిచితులను లిఫ్ట్ అడుగుతూ, పలు ప్రాంతాలను సందర్శించడం) చేయాలనే ఆశ మొదలైంది. హిచ్ హైకింగ్తో కాలిఫోర్నియా మొత్తం తిరగాలని ఇద్దరూ ప్లాన్స్ చేసుకున్నారు. పర్వతాలు, అడవులు ఉండే చోట హిచ్ హైక్ చేయడం అమ్మాయిలకు అసలు సురక్షితం కాదని తోటి స్వీడిష్ స్నేహితులతో పాటు పలువురు అమెరికన్లు కూడా వారిని హెచ్చరించారు. లాంటి ప్రమాదాన్నైనా, ఎవరి మోసాన్నైనా ముందే గ్రహించే శక్తి, తెలివి తమకున్నాయని వారు సమాధానమిచ్చేవారు. ఆత్మరక్షణ కోసం కత్తి కూడా ఉందని తీసి చూపించేవారు. అలాంటి ట్రిప్స్కి పోవద్దని మేరీని ఆమె తండ్రి ఓవ్ ఫోన్స్ లో బతిమాలాడు. ‘ఈ ఒక్క సారికే’నని మేరీ మాటివ్వడంతో ఓవ్ ఒప్పుకున్నాడు. జూలై 12 నుంచి వారి ట్రిప్ మొదలైంది.పోలీసుల విచారణకు మారియా డైరీ చాలా ఉపయోగపడింది. ఏరోజు ఎక్కడ తిరిగారో డైరీలో పరిశీలిస్తూ, చాలామంది డ్రైవర్స్ని అధికారులు ప్రశ్నించారు. వారిలో కొందరు మేరీ, మారియాల ఫొటోలు చూసి గుర్తుపట్టారు. మార్క్ అనే ఒక ట్రక్ డ్రైవర్.. ‘వీళ్లకు నేను శాన్స్ డియాగో నుంచి లాస్ ఏంజెలెస్లోని కాంప్టన్స్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. ఇలాంటి ప్రయాణాలు అమ్మాయిలు చేయడం మంచిది కాదని సలహా కూడా ఇచ్చాను’ అని చెప్పాడు. అలా రకరకాల ఆధారాలను సేకరించిన పోలీసులు.. శాంటా మారియా సమీపంలో హైవే 166పై ఒకచోట వారి బట్టలు, ఇతర వస్తువులను కనుగొన్నారు. మరో 4 వారాల తర్వాత శాంటా బార్బరా సమీపంలో వేటగాళ్లకు కుళ్లిన రెండు మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. అవి మేరీ, మారియాలవేనని, వారిపై లైంగిక దాడులు జరిగాయని, ఆపై కత్తితో పొడిచి చంపేశారని తేలింది. కానీ కేసు అంతకుమించి ముందుకు పోలేదు.సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత(1991లో) కాలిఫోర్నియాలోని శాన్స్ డియాగోలో ఉన్న స్వీడిష్ కాన్సులేట్కి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి.. ‘మేరీ, మారియాలను చంపిన కిల్లర్ ఎవరో నాకు తెలుసు!’ అనడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ‘కిల్లర్ పేరు లోరెన్స్ , అతడు కెనడాకు చెందినవాడు. ఆరడుగులుంటాడు. ప్రతి ఏడాది శీతకాలం అమెరికాలోని శాన్స్ డియాగో మీదుగా మెక్సికోకు తన వ్యాన్స్ లో ట్రెక్కింగ్కి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడే నాకు పరిచయమయ్యాడు. అతడు తీవ్రమైన స్త్రీ ద్వేషి. సుమారు ఆరేళ్ల క్రితం తాను నన్ను కలిసినప్పుడు ఇద్దరు స్వీడిష్ అమ్మాయిలకు తన వ్యాన్స్ లో లిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. మేరీ, మారియాల మర్డర్ కేసు గమనిస్తుంటే.. లోరెన్ లిఫ్ట్ ఇచ్చిన స్వీడిష్ అమ్మాయిలు వీరే కావచ్చనిపిస్తోంది. అతడు స్త్రీ ద్వేషి కాబట్టి అతడే వారిని ఏమైనా చేసి ఉండొచ్చు’ అని అజ్ఞాత కాలర్ చెప్పాడు. అయితే అధికారులు అతడ్ని ‘మీ పేరేంటి?’ అని ఆరా తీయడంతో భయపడి ఫోన్ పెట్టేశాడు. కొంతకాలానికి అధికారులు టెక్నాలజీని ఉపయోగించి ఆ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టగలిగారు. మరోసారి ఆరా తీసి, అతడు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకున్నారు. అయితే అది కేవలం అతడి అనుమానం కావచ్చని భావించారు.1999లో స్పీడ్ ఫ్రీక్ కిల్లర్స్గా కాలిఫోర్నియాను వణికించిన ఇద్దరు నరరూప రాక్షసులను వేరే పలు కేసుల్లో అరెస్ట్ చేసి, నేర నిర్ధారణ చేయడంతో వారిద్దరికీ జీవిత ఖైదు పడింది. వారిద్దరూ కలిసి సుమారు 15 హత్యలు చేసినట్లు తేలింది. అయితే ఆ ఇద్దరు కిల్లర్స్లో ఒకడి పేరు లోరెన్స్ (అజ్ఞాత కాలర్ చెప్పిన పేరు). పూర్తి పేరు లోరెన్స్ హెర్జోగ్. ఇతడే మేరీ, మారియాలను చంపి ఉంటాడని అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈసారి సాక్ష్యమివ్వడానికి.. ఆ అజ్ఞాత కాలర్ అధికారులకు చిక్కలేదు. మరోవైపు అరెస్ట్ అయిన మూడేళ్లకే లోరెన్ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఏదేమైనా పెద్దలు, శ్రేయోభిలాషుల హెచ్చరికలను పక్కనపెట్టి, సరదా కోసం మొండితనంతో మేరీ, మారియాలు జీవితాలనే పోగొట్టుకున్నారు. ‘ఈ అమెరికన్స్ చాలా స్నేహస్వభావులు’ అని మేరీ చాలాసార్లు తన తండ్రి ఓవ్తో చెప్పేదట. మారియా అవే మాటలు డైరీలో రాసుకుంది. నిజానికి వారి నమ్మకం అపనమ్మకమైన క్షణాల్లో.. వారి జీవితాన్ని మట్టుబెట్టిన అమెరికన్ క్రూరులెవరో నేటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయింది. అసలు డైరీ, హ్యాండ్బ్యాగ్ డంప్యార్డ్లో ఎందుకు పడున్నాయి? హైవేపై బట్టలు, అడవిలో మృతదేహాలు దొరికాయంటే.. వారికి, కిల్లర్కి మధ్య ఎంతటి ఘర్షణ జరిగుంటుందో? అతడి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటారో?! ఇలా వేటికీ సమాధానాలు లేవు.∙సంహిత నిమ్మన -
బృహస్పతి వద్ద శనైశ్చరుని విద్యాభ్యాసం
భూలోకవాసులకు బ్రహ్మజ్ఞానం బోధించాలని దేవగురువైన బృహస్పతికి సంకల్పం కలిగింది. భూలోకంలో ఒక బ్రాహ్మణుని ఇంట వాచస్పతి అనే పేరుతో జన్మించాడు. యుక్తవయసు వచ్చేనాటికి సకలశాస్త్ర పారంగతుడిగా గుర్తింపు పొందాడు. నర్మదా నదీతీరం వద్ద ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, అనేక మంది విప్ర బాలకులను శిష్యులుగా చేర్చుకున్నాడు. వారికి తానే అన్నవస్త్రాదులను ఇస్తూ, విద్యాబోధన చేస్తుండేవాడు.అదే కాలంలో సూర్యపుత్రుడైన శనైశ్చరుడు విద్యాభ్యాసం చేయాలనుకున్నాడు. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి, తన కోరికను వెలిబుచ్చాడు. ‘తండ్రీ! నేను విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నాను. నాకు తగిన గురువు ఎవరు?’ అని అడిగాడు. ‘నాయనా! దేవగురువు బృహస్పతి సమస్త విద్యలలోనూ గొప్పవాడు. నీకు తగిన గురువు అతడే! ఇప్పుడు అతడు వాచస్పతి అనే పేరుతో భూలోకంలో జన్మించి, భూలోకవాసులకు విద్యాబోధన చేస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని పొందు. అతడు విప్రకుమారులకు తప్ప ఇతరులకు బోధించడు. అందువల్ల నువ్వు విప్రవేషంలో వెళ్లు’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే శనైశ్చరుడు విప్రబాలకుడి వేషంలో వాచస్పతి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న విప్రబాలకుల ద్వారా గురువును కలుసుకున్నాడు. ‘ఆచార్యా! విద్యాభ్యాసం కోరి మీ వద్దకు వచ్చాను’ అని చెప్పాడు. వాచస్పతి అతడిని చూసి, ‘నీ వంశమేది?’ అని ప్రశ్నించాడు. ‘కపిలుడి వంశంలో జన్మించాను’ అని బదులిచ్చాడు శనైశ్చరుడు. వాచస్పతి అతడిని తన గురుకులంలో చేర్చుకున్నాడు.వాచస్పతి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులందరిలోనూ శనైశ్చరుడు అనతికాలంలోనే బ్రహ్మజ్ఞానం సహా సమస్త విద్యలనూ, శాస్త్రాలనూ పరిపూర్ణంగా నేర్చుకున్నాడు. ఇక అతడికి నేర్పాల్సినది ఇంకేమీ లేదని నిశ్చయించుకున్నాక వాచస్పతి ఒకనాడు అతడిని పిలిచి, ‘అబ్బాయీ! నీకు నేర్పాల్సినది ఇంకేమీ లేదు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నువ్వు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, సుఖప్రదంగా జీవించవచ్చు’ అని చెప్పాడు.‘ఆచార్యా! గురుదక్షిణగా ఏమివ్వమంటారు? మీకు గురుదక్షిణ చెల్లించకుంటే, అది నాకు శ్రేయస్కరం కాదు’ అని పలికాడు శనైశ్చరుడు.‘నాకు ఏమీ అవసరం లేదు. నిజంగా నువ్వెవరివో వివరంగా చెప్పి వెళ్లు, చాలు’ అన్నాడు వాచస్పతి. ‘ఆచార్యా! నేను సూర్యపుత్రుడిని. నా పేరు శనైశ్చరుడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు మీ వద్దకు వచ్చి, విద్యలు నేర్చుకున్నాను’ బదులిచ్చాడు శనైశ్చరుడు.వాచస్పతి ఆశ్చర్యపోయాడు. ‘నాయనా! ఇప్పుడు నీకు తప్పక గురుదక్షిణ అడుగుతాను. నీ దృష్టి నా మీద పడకుండా వరమివ్వు, చాలు’ అని అడిగాడు.‘ఆచార్యా! మీరు కోరినా, అది అసాధ్యం కదా! గ్రహచారాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం? బ్రహ్మాదులకైనా అది తప్పదని మీకు కూడా తెలుసు కదా! అయితే, నా దృష్టి పడినా, మీకు ఆపద లేకుండా మాత్రం చేయగలను’ అని చెప్పాడు శనైశ్చరుడు. ‘అది చాలు నాకు’ బదులిచ్చాడు గురువు.ఒకనాడు వాచస్పతి పూలసజ్జ పట్టుకుని, ఆశ్రమ సమీపంలోని పూలతోటలో పూలు కోసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దేశపు రాజు పరివారంతో పాటు వేటకు వచ్చి, ఆ ఉద్యానవనంలో విశ్రాంతి కోసం నిలిచారు. రాజుతో పాటు రాణి, పసిపిల్లవాడు కూడా ఉన్నారు. పసిపిల్లవాడిని ఉయ్యాలలో వేసి దాసీజనం కాపలాగా ఉన్నారు. హఠాత్తుగా ఉయ్యాలలోని పసిపిల్లవాడు అదృశ్యమయ్యాడు. రాజ పరివారంలో హాహాకారాలు మొదలయ్యాయి. కొడుకు కనిపించక రాణి దుఃఖించసాగింది. ‘పసిపిల్లవాడిని వెంటనే వెదికి తీసుకురండి’ అంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు.వారు తోట నలుమూలలా వెదుకుతుండగా, పూలు కోసుకుంటున్న వాచస్పతి కనిపించాడు. అతడి చేతనున్న పూలసజ్జలోని పూల మీద నెత్తుటి మరకలు కనిపించాయి. వారు అతడిని పట్టుకుని, సజ్జను వెదికారు. అందులో బాలుడి మొండెం కనిపించింది. అతడిని వెంటనే బంధించి, రాజు ముందు ప్రవేశపెట్టారు. ‘ఇతడికి తగిన శిక్ష విధించండి’ అని మంత్రులను ఆజ్ఞాపించాడు రాజు.వాచస్పతిని ముందు నుంచి ఎరిగి ఉన్న మంత్రులు అతడు అంతటి ఘోరం చేసి ఉంటాడంటే నమ్మలేక, అతడికి శిక్ష విధించడానికి తటపటాయించసాగారు. నేరానికి బలమైన రుజువు ఏదీ లేక విచారణ చేయడం ప్రారంభించారు. వాచస్పతి ఏం జరుగుతున్నదో అర్థంకాక కాసేపు తికమకపడ్డాడు. కాసేపు ధ్యానంలోకి వెళ్లాడు. ఇదంతా శనైశ్చరుని దృష్టి ప్రభావమేనని గ్రహించాడు. మనసులోనే శనైశ్చరునికి స్తోత్రం చేశాడు.శనైశ్చరుడు ఇచ్చిన మాట ప్రకారం గురువును ఆపద నుంచి గట్టెక్కించాలని నిశ్చయించుకున్నాడు.రాజ పరివారం ఆందోళనలో ఉన్న ఆ సమయంలో అశరీరవాణి ఇలా వినిపించింది: ‘రాజా! ఈ విప్రుడు నిర్దోషి. నీ కుమారుడికి ఆపదేమీ కలగలేదు. అతడు నీ ఇంటనే హంసతూలికా తల్పంపై ఆదమరచి నిదురపోతున్నాడు’ అని వినిపించింది. రాజాజ్ఞపై రాజ భటులు హుటాహుటిన గుర్రాల మీద దౌడు తీసి, రాజ ప్రాసాదానికి చేరుకున్నారు. హాయిగా నిద్రిస్తున్న బాలుడు వారి అలికిడికి మేలుకున్నాడు. వారు అతణ్ణి జాగ్రత్తగా ఎత్తుకుని, రాజు వద్దకు తీసుకువచ్చారు. రాజ పరివారం అంతా సంతోషించారు. వాచస్పతికి ఘన సత్కారం చేసి, అనేక కానుకలను బహూకరించి, రాజు, అతడి పరివారం తిరుగు ప్రయాణమయ్యారు.∙సాంఖ్యాయన -
యువ కథ : అబార్షన్
‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది. భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్లోని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నరేంద్ర.కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని. కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది. -
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
ఈవారం కథ: తూటా
‘బావగారూ! కాస్త పక్కకొస్తారా? ఒకసారి మీతో మాట్లాడాలి’ అన్నాడు గోవిందరావు, కాబోయే వియ్యంకుడు గోపాలరావుతో.గోవిందరావు ఇంట్లో నిశ్చితార్థం జరుగుతోంది. ఆనందసందోహాల ఆ వేడుకకి అతని మాటతో బ్రేక్ పడింది. అతనికి తన వియ్యంకుడు పెళ్ళిచూపుల్లో అన్నమాటలు గుర్తుకొచ్చాయి. ‘నిశ్చితార్థంలో కానీ, పెళ్ళి వేడుకలో కానీ డబ్బు కంటే ఆత్మీయతాను రాగాలే కనిపించాలి. మా నుండి కట్నకానుకల విషయంలో ఎలాంటి డిమాండ్ లేదు. మీ శక్తి కొద్ది ఇవ్వాలనుకున్నది ‘ఇదీ’ అని ఏ మాటైతే మీరిస్తారో అది తప్పకుండా సమయానికివ్వాల్సిందే! మాట, మర్యాదల విషయంలో నేను కాస్త కఠినంగా ఉంటాను’ అని!‘ఏంటి గోవిందరావుగారూ?’ అనుమానంగా అన్నాడు గోపాలరావు.‘అదీ.. అదీ.. నిశ్చితార్థం నాడు కట్నకానుకల రూపంగా మీకిస్తామన్న రెండు లక్షల రూపాయలను కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సమకూర్చలేకపోతున్నా. పెళ్ళికింకా నెల రోజుల గడువుంది. మీకిస్తానన్న రొక్కాన్ని ఓ వారంలో ఇచ్చి తీరుతాను. ఇప్పటికి నన్ను మన్నించండి’ అన్నాడు గోవిందరావు.‘అదేంటండీ.. అప్పుడు మీరే ఇస్తానని, ఇప్పుడు మీరే కుదరదంటున్నారు? నాకు డబ్బు కంటే మాట ముఖ్యం. మీరు డబ్బు రెడీ చేసుకుని కబురు పంపండి. అప్పుడే తాంబూలాలు పుచ్చుకుందాం’ అన్నాడు..లోలోన దాగున్న తన కట్నదాహాన్ని బయటపెడుతూ గోపాలరావు.‘డబ్బు కారణంగా తల్లి లేని పిల్ల నిశ్చితార్థం ఆపడం భావ్యం కాదు బావగారూ..! కొంచెం పెద్ద మనసు చేసుకోండి’ అన్నాడు గోవిందరావు.‘నేను మిమ్మల్ని ఏ డబ్బూ అడగలేదు. మీకు మీరుగా ఇస్తానన్నది మాత్రం ఇచ్చి తీరవలసిందే. లేదా మీకూ, మీ సంబంధానికో దండం’ అంటూ కటువుగా సమాధానమిచ్చి హాల్లో కేసి కదిలాడు.‘పంతులుగారూ.. కొన్ని కారణాల వల్ల ఈరోజు తాంబూలాలు పుచ్చుకోవడం లేదు. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. క్షమించండి!’ అన్నాడు గోపాలరావు. అలాగే వచ్చిన బంధువర్గానికీ క్షమాపణలు చెబుతూ కార్యక్రమం రద్దయిందని ప్రకటించాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన నిశ్చితార్థానికి ఎన్నో అర్థాలు వెతుకుతూ, తమలో తామే గుసగుసలాడుతూ ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు బంధువులు.‘అంకుల్.. నిశ్చితార్థం నిలిపివేయడం ఏం బాగాలేదు. అసలేం జరిగింది? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అంతేగానీ ఈ తంతుని ఆపకండి..ప్లీజ్!’ అన్నాడు గోవిందరావు కొడుకు విశాల్.. గోపాలరావుని ప్రాధేయపడుతూ.‘ఏం జరిగిందో వెళ్ళి మీ నాన్ననే అడుగు’ కోపంగా గోపాలరావు.‘ఇప్పుడీ కార్యక్రమాన్ని కానిద్దాం. ఏమున్నా తరువాత చూసుకోవచ్చుగా నాన్నా?’ అన్నాడు పెళ్ళికొడుకు తన తండ్రితో. అతడి తల్లి కూడా ఆ మాటల్ని బలపరచింది. చివరికి పెళ్ళికూతురు కూడా బతిమిలాడినా వినకుండా వడివడిగా బయటకి నడిచాడు గోపాలరావు. దాంతో అతడి కుటుంబం కూడా అక్కడి నుండి కదలక తప్పలేదు.పొంగివస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది పెళ్ళికూతురు. ‘నాన్నా..! ఏంటిదంతా? మీరంతా చూసుకుంటున్నారనుకున్నాను. ఈ గందరగోళమేంటి? ఏం జరిగింది?’ అన్నాడు విశాల్ తండ్రిని నిలదీస్తున్నట్టు!ఏమీ మాట్లాడకుండా ఒక్క ఉదుటన తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాడు గోవిందరావు. తండ్రి వాటం చూస్తే విశాల్కి ఎందుకో అనుమానం వచ్చింది. ‘నాన్నా..! నాన్నా..!’ అంటూ గది తలుపులు బాదాడు విశాల్. అటు నుండి స్పందన లేదు. కిటికీ గుండా చూసి హడలిపోయాడు. ఆలస్యం చెయ్యకుండా గది తలుపులను భుజంతో బలంగా రెండు మూడుసార్లు తోసేసరికి లోపల చిన్న గొళ్ళెమే పెట్టి ఉండటంతో అది ఊడి వచ్చి తలుపులు తెరచుకున్నాయి.అప్పటికే గోవిందరావు కుర్చీ మీద నిలబడి పంచెతో సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఒక్క ఉదుటన తండ్రిని సమీపించి గట్టిగా కాళ్ళు పైకెత్తి పట్టుకుని, మెడకు పంచె బిగుసుకోకుండా చూశాడు విశాల్. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ గొడవకి లోపలున్న గోవిందరావు కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం తెలుసుకుని భోరున విలపించింది. ‘నాన్నా.. ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డారు? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. అసలు ఇంతకీ మీరు అంకుల్తో ఏం మాట్లాడారు? వివరంగా చెప్పండి’ అన్నాడు విశాల్. మౌనం వీడాడు గోవిందరావు..‘అదీ.. నిశ్చితార్థం రోజున వారికి రెండు లక్షలు ఇస్తానని మాటిచ్చాను. కానీ ఇవ్వలేకపోయా’ అంటూ ఆగాడు.‘ఎందుకు? పొలం అమ్మి నెలరోజుల క్రితమే డబ్బు సమకూర్చుకున్నారు కదా? చెల్లి పెళ్ళికోసమని నేనూ ఎప్పటి నుంచో నెల నెలా పదో, ఇరవయ్యో వేలు పంపుతునే ఉన్నానుగా? మరెందుకు ఇవ్వలేదు?’‘ఆ డబ్బు లేదు నా దగ్గర’ అంటూ బాంబులాంటి వార్త పేల్చాడు గోవిందరావు.‘ఏంటీ..? డబ్బు లేదా..?’ షాకయ్యారు అన్నాచెల్లెళ్ళిద్దరూ! ‘అవును. ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు’ దుఃఖం ముంచుకొస్తుండగా తల బాదుకుంటూ చెప్పాడు గోవిందరావు.‘అంత డబ్బు ఏం చేశారో చెప్పండి ప్లీజ్’ అడిగాడు విశాల్. అప్పుడు అసలు విషయం చెప్పసాగాడు గోవిందరావు.ఆ రోజు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో గోవిందరావు పెళ్ళి పనుల షాపింగ్లో ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు.‘లక్ష్మీగోవిందనారాయణగారా మాట్లాడేది?’ఆ మాటకు గోవిందరావు ఆశ్చర్యపోయాడు.. తన పూర్తిపేరు ఎవరికీ తెలియదు, పిల్లలతో సహా. మరి ఫోన్లో వ్యక్తికి ఎలా తెలిసింది చెప్మా.. అనుకుంటూ! ‘ఆ.. మీరెవరూ..?’ అడిగాడు గోవిందరావు.‘మేము ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుండి కాల్ చేస్తున్నాం!’అప్పుడర్థమైంది తన పూర్తి పేరుతో అకౌంట్ ఉండబట్టే అతడలా పిలిచాడని. ‘చెప్పండి..?’‘మీ సేవింగ్స్ అకౌంట్ కేవైసీ అప్ డేట్ కాలేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వెంటనే అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అది చెబుదామనే ఫోన్ చేశాను.’ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు గోవిందరావు. ఆ అకౌంట్ ఎంత ముఖ్యమో అతడికి బాగా తెలుసు. కూతురి పెళ్ళి కోసం పొలం అమ్మగా వచ్చిన రెండు లక్షలతో పాటు, కొడుకు పంపుతున్న డబ్బూ అందులో ఉంది. రాబోయే మంగళవారమే కూతురి నిశ్చితార్థం. ఆ రోజుకు డబ్బు చాలా అవసరం. ‘సరే.. రేపు నేను బ్యాంకుకి వచ్చి కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను’ చెప్పాడు గోవిందరావు.‘సార్.. రేపు సెకండ్ శాటర్డే సెలవు, ఎల్లుండి ఆదివారం. సోమవారం నుండి మూడు రోజుల వరకు ఆలిండియా బ్యాంక్ యూనియన్ స్ట్రయిక్! మీరు గురువారం వెళ్ళి అప్ డేట్ చేసుకోండి..’అది విని గోవిందరావు మరింత కంగారు పడ్డాడు. కూతురి నిశ్చితార్థానికి ఒకరోజు ముందు బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేద్దామనుకున్నాడు. కానీ వాళ్ళు చెప్పింది వింటుంటే అది కుదిరేట్టు లేదనుకుని ‘వేరే మార్గమేం లేదా..?’ అడిగాడు.‘ఆన్లైన్లో అప్ డేట్ చేసుకోవచ్చు సార్! మీకు ఓకే అయితే మా టీమ్ మీకు కాల్ చేస్తుంది..’హమ్మయ్యా.. బతికించారు. అలా అప్ డేట్ చేసుకుంటే అకౌంట్ లాక్ అవకుండా ఉంటుంది అనుకుంటూ, ‘సరే’ అని చెప్పి, కాల్ కట్ చేశాడు గోవిందరావు.కాసేపటికే బ్యాంక్ నుండి కాల్ వస్తే, అవతల వ్యక్తి చెప్పినట్టు చేసి, కేవైసీ పూర్తయిందని ఊపిరి పీల్చుకున్నాడు.∙∙ విషయం చెబుతూ దుఃఖం ముంచుకురాగా మధ్యలో ఆగాడు గోవిందరావు. ‘మరి డబ్బు తీసే ఉంటారు కదా.. దాన్ని వారి మొహాన కొట్టలేకపోయారా?’ అన్నాడు విశాల్. ‘అవును కదా’ అన్నట్టుగా చూసింది గోవిందరావు కూతురు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు గోవిందరావు. తండ్రి మౌనంతో ఒక్కసారిగా వారికి ఉత్కంఠ ఎక్కువైంది. ‘ఏమైంది నాన్నా.. చెప్పండి..’ అడిగాడు విశాల్ ఆత్రంగా.‘అదీ.. అదీ.. కేవైసీ పేరుతో వచ్చిన కాల్ బ్యాంకు నుండి కాదు, సైబర్ మోసగాళ్ళ నుండి!’‘ఆ..!’ షాక్ అయ్యారు అన్నాచెల్లెళ్ళిద్దరూ!‘మొన్న ఆదివారం ఏటీఎమ్లో డబ్బు డ్రా చేయబోతే నిల్ బ్యాలెన్స్ చూపించింది. మతిపోయింది. బ్యాంకు స్ట్రయిక్ క్యాన్సిల్ అయిందని తెలుసుకుని, నిన్న బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని కలిశాను. జరిగింది చెప్పాను. తాము ఎలాంటి కాల్ చెయ్యలేదన్నాడు. తన కంప్యూటర్లో డీటెయిల్స్ చెక్ చేసి, నేను సైబర్ మోసగాళ్ళ వలకి చిక్కానని చెప్పాడు. అప్పుడు ఆలోచిస్తే నేను చేసిన తప్పు అర్థమైంది. ఆ ఎగ్జిక్యూటివ్ అడిగిన విధంగా నా ఆధార్ నంబర్, పాన్ నంబర్, చివరికి నా ఫోనుకి వచ్చిన ఓటీపీ అన్నీ చెప్పాను. నిశ్చితార్థం టెన్షన్లో నా బుర్ర పనిచేయలేదు. ఆ క్షణాన నాకే మాత్రం అనుమానం రాలేదు. నా అకౌంట్ లాక్ కాకుండా ఉంటే చాలనుకున్నాను. ఆ సైబర్ మోసగాడు నా బలహీనతని క్యాష్ చేసుకున్నాడు’ అంటూ భోరుమన్నాడు గోవిందరావు. ‘మా కెందుకు చెప్పలేదు?’ నిలదీశాడు విశాల్.‘కష్టం మీద సెలవు దొరికి, పై ఊరు నుండి నువ్వు ఆరోజే ఇంటికొస్తుంటే ఈ విషయం చెప్పి నీ మనసు పాడుచేయదలచుకోలేదు. వియ్యంకుడిని బతిమిలాడుకుంటే జరగబోయే శుభకార్యాన్ని ఆపడని అనుకున్నాను. వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకుంటే ఈ విషయం బయటికి పొక్కి శుభకార్యం ఎక్కడ ఆగిపోతుందేమోనని.. నిశ్చితార్థం అయిపోయాక కంప్లయింట్ ఇవ్వొచ్చనుకున్నాను..’‘పదండి నాన్నా.. ఇప్పుడే వెళ్ళి సైబర్ పోలీస్స్టేషన్లో కంప్లయింట్ ఇద్దాం’ అన్నాడు విశాల్.సైబర్ పోలీస్స్టేషన్లో ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ని కలిశారు గోవిందరావు, విశాల్.‘చెప్పండి..’అన్నాడు ఈశ్వర్.‘సర్.. నాపేరు గోవిందరావు. నా బ్యాంకు అకౌంట్లోంచి రెండు లక్షలు పోయాయి’ సూటిగా విషయంలోకి వచ్చాడు గోవిందరావు.‘ఎప్పుడు? ఏలా? ’అంటూ ఈశ్వర్ అడిగిన రకరకాల ప్రశ్నలకు తనకి తెలిసినంత వరకూ సమాధానాలు ఇచ్చాడు గోవిందరావు. అతడి ఫోన్ తీసుకుని శ్రద్ధగా పరిశీలించాడు ఈశ్వర్. తరువాత అసిస్టెంట్ని పిలిచి ఆ ఫోన్ అతడికిస్తూ అందులో వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనవి కాపీ చేయమన్నాడు.‘ఇన్స్పెక్టర్ గారూ! ఎలాగైనా మా డబ్బు మాకు దక్కేట్టు చెయ్యండి’ అన్నాడు విశాల్ కల్పించుకుంటూ. ‘ఆ.. ఆ.. ఇంతకీ నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావ్?’ అడిగాడు ఈశ్వర్. ‘నా పేరు విశాల్, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాను. ఈయన మా నాన్నగారు’ చెప్పాడు విశాల్.‘సాధారణంగా సైబర్ బాధితులు ఎంత తొందరగా వచ్చి కంప్లయింట్ చేస్తే అంత త్వరగా డబ్బు తిరిగిపొందే అవకాశం ఉంటుంది. ఇది జరిగి ఐదురోజులవుతోంది. మోసానికి గురైనానని తెలిసి ఇంతవరకు కంప్లయింట్ చెయ్యకపోవడం మీరు చేసిన మరో తప్పు’ అంటూ కంప్లయింట్ రిజిస్టర్ చేసి, ఆ ఇద్దరి ఫోన్ నంబర్స్ తీసుకుని, వాళ్లను పంపించేశాడు ఈశ్వర్. మూడు నాలుగురోజుల తరువాత గోవిందరావుకి ఈశ్వర్ నుండి కాల్ వచ్చింది, ఒకసారి స్టేషన్కొచ్చి కలవమని. సంబరపడ్డాడు.. దొంగల్ని పట్టుకుని తన డబ్బు రాబట్టారేమో అని! ఎక్కడలేని ఉత్సాహంతో వెంటనే స్టేషన్కి బయలుదేరాడు. స్టేషన్లో గోవిందరావును చూసి ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ‘మీ కేసులో కొంచెం ముందుకు వెళ్ళాం. బ్యాంక్ వాళ్ళతో కో ఆర్డినేట్ చేసుకుని వాళ్లిచ్చిన కొన్ని వివరాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిందేంటంటే.. మీకు వచ్చిన కాల్ ఉత్తరప్రదేశ్ నుండని! ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎంక్వయిరీ చేస్తున్నాం. అసలు ఇలాంటి కేసుల్లో బాధితులకు ఎంతవరకు వాళ్ల డబ్బును తిరిగి ఇప్పించగలమో తెలీదు కానీ, మోసగాళ్ళను మాత్రం పట్టుకుని.. ఇంకెంతమందో వారి బారిన పడకుండా కట్టడిచేయడమే మా లక్ష్యం’ అన్నాడు. ఆ సమాధానానికి గోవిందరావు కాస్త నిరుత్సాహపడ్డాడు. ‘మరేం లేదు గోవిందరావుగారూ.. ఈ మధ్యకాలంలో మీకొచ్చిన కాల్ వివరాలు కావాలి. అందుకే పిలిపించాను’ అంటూ గోవిందరావుతో డిస్కస్ చేసి, కావలసిన సమాచారం తీసుకుని అతణ్ణి పంపించేశాడు ఈశ్వర్. సెలవులు ముగియడంతో విశాల్.. తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంట్లో అందరూ ముభావంగానే ఉన్నారు. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడవటంతో గోవిందరావు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఈశ్వర్! గోవిందరావు మొహంలో కాస్త ఆనందం తొణికిసలాడింది, అతడు ఏ శుభవార్తతో వచ్చాడోనని!‘రండి..’ అంటూ ఆహ్వానించాడు గోవిందరావు. ఎవరొచ్చారా అని లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న విశాల్ బయటకొచ్చి ఇన్స్పెక్టర్ని చూసి ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వాడు. గోవిందరావు చూపించిన కుర్చీలో కుర్చుంటూ ఈశ్వర్ ‘గోవిందరావుగారూ! మీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ విషయాలు మీతో పంచుకుందామని వచ్చాను’ అంటూ మొదలుపెట్టాడు ఈశ్వర్.‘మంచి వార్త చెప్పారు. ఇంతకీ నేరగాళ్ళు పట్టుబడ్డారా? నా డబ్బు దొరికే అవకాశముందా?’ అంటూ ప్రశ్నల్ని సంధించాడు గోవిందరావు.‘ఆ .. మోసగాళ్ళెవరో తెలిసింది’ అంటూ ఆగాడు ఈశ్వర్.గోవిందరావుతో పాటు విశాల్ కూడా చాలా సంతోషించాడు. ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెబుతాడోనని ఆసక్తిగా చూడసాగారిద్దరూ.‘ఘజియాబాద్ అంటే ఢిల్లీలోని ఓ భాగానికి చెందిన సైబర్ నేరగాళ్ళ పని ఇది!’ అన్నాడు ఈశ్వర్.‘ఏ ప్రాంతమైతే ఏంటి? ఇంతకీ ఆ మోసగాళ్ళు పట్టుబడ్డారా?’ అడిగాడు గోవిందరావు ఆత్రుతతో.‘కొంత వరకు ఎవరన్నది తెలిసింది’ అంటూ ఆగాడు ఈశ్వర్.‘వారెవరో మేం తెలుసుకోవచ్చా సార్..?’ అడిగాడు గోవిందరావు.‘విశాల్..!’ అంటూ బాంబు పేల్చాడు ఈశ్వర్.ఆ ముక్కతో గోవిందరావుకి మతిపోయింది. డబ్బు పోయినప్పటి షాక్ కంటే.. ఈశ్వర్ ఇప్పుడు చెప్పిన దానికి రెట్టింపు షాక్ తిన్నాడు.‘ఏంటి సర్.. మీరంటున్నది? నేను సైబర్ మోసగాడినేంటి? మా నాన్న డబ్బు నేనే కాజేయడమేంటి? బీ సీరియస్’ దుఃఖం లాంటి స్వరంతో అన్నాడు విశాల్.‘ముమ్మాటికీ నువ్వే! కేవైసీ అప్ డేట్ చేయమని మీ నాన్నకి ఆరోజు కాల్ చేసింది నువ్వే. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ విషయం నీకు కూడా తెలియదు’ అన్నాడు ఈశ్వర్.‘సార్.. మీరేం మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదు. వివరంగా చెప్పండి’ అన్నాడు విశాల్ ఓ రకమైన భయంతో.‘యెస్..! మా విచారణలో భాగంగా మీ నాన్నకి వచ్చిన ఫోన్ కాల్స్ని ట్రేస్ చేస్తే అందులో నీ పర్సనల్ నంబరు నుండి రోజూ మీ నాన్నకి చేసే కాల్స్ లొకేషన్, ఆ రోజు కేవైసీ నెపంతో సైబర్ నేరగాడు మీ నాన్నకి కాల్ చేసిన లొకేషన్ ఒకే ప్రాంతం నుండి అని తేలింది. ఇంకా చెప్పాలంటే ఒకే బిల్డింగ్ నుండి! ఈ పాయింటే ఈ కేసును ఛేదించడంలో కీలకమైంది. మీ నాన్నని పిలిపించి మాట్లాడి నీ కంపెనీ వివరాలు సేకరించడంతో మా అనుమానం నిర్ధారణైంది. వెంటనే మా ఢిల్లీ సైబర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి మీ కేసు విషయం చెబితే వాళ్ళు ఎన్నో నిజాలు బయటకు లాగారు’ అంటూ ఆగాడు ఈశ్వర్.‘సార్.. మా కంపెనీ అలాంటిది కాదు. మా కంపెనీ ఎస్బీఐ బ్యాంక్కి ఫ్రాంచైజ్ చేస్తోంది. కస్టమర్స్కి కాల్ చేసి, వారికి సేవలు అందించడమే మా డ్యూటీ. కానీ ఆధార్, ఓటీపీ లాంటివి నేనెప్పుడూ కస్టమర్స్ నుండి సేకరించలేదు. అటువంటప్పుడు నేను సైబర్ నేరగాడినెలా అవుతాను?’ ప్రశించాడు విశాల్.‘అక్కడే మీ కంపెనీ తెలివి చూపిస్తోంది. ఎస్బీఐతో మీ కంపెనీకి ఎటువంటి టయ్యప్ లేదు. మీ కంపెనీలోనే బ్యాకెండ్ టీమ్ అంటూ మరో విభాగం ఉంది. అది చీకటి విభాగం. అక్కడే సైబర్ క్రిమినల్స్ అసలైన కథ నడిపిస్తున్నారు. మీరు మొదట కాల్ చేసిన కస్టమర్ డీటెయిల్స్ని ఈ నేరగాళ్ళు స్క్రూటినీ చేసి అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తారు. బ్యాంకులకి రెండు, మూడురోజులు వరుసగా సెలవులు వచ్చే ముందు రోజే వారు ఎక్కువగా మోసాలకి పాల్పడతారు. మీరు కాల్ చేశాక మా టీమ్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారని చెప్పడంతో మీ పని ముగుస్తుంది. కానీ మీరిచ్చే వివరాలతో మీ వెనకున్న నేరగాళ్ళు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అంటే తుపాకీని మీ భుజాల మీదుగా వాళ్ళు పేలుస్తున్నారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మీరు తూటా లాంటి వారు. దాన్ని పేల్చేది మీ వెనకున్న సైబర్ క్రిమినల్స్! మీ నాన్న విషయంలో తుపాకీని పేల్చింది ఆ నేరగాళ్ళే అయినా.. తూటా రూపంలో నువ్వే మీ నాన్నని గాయపరచావు. ఆ రోజు మీ నాన్నకి మొదట కాల్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోమని చెప్పింది నువ్వే! ఇది మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. కస్టమర్ కేర్ కాల్స్ సాధారణంగా క్లారిటీగా ఉండవు. అందుకే నువ్వుగానీ, అటు మీ నాన్నగానీ ఒకరినొకరు పోల్చుకోలేకపోయుండొచ్చు.’ఆ నిజం తెలుసుకుని విశాల్ విస్తుపోయాడు. గోవిందరావుకైతే నోట మాటలేదు. ‘విశాల్..! నేరగాళ్ళు పట్టుబడేవరకు నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళకూడదు. నీ పాత్ర ఏంటన్నది తేలాకా, నీపై ఫైనల్ యాక్షన్ ఉంటుంది’ చెప్పాడు ఈశ్వర్. ‘సర్.. మా డబ్బు దొరుకుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక. కానీ నేరగాళ్ళని మీరు పట్టుకుంటే నేను బయటపడటమే కాక, మరికొందరు మోసపోకుండా ఉంటారు. అందుకు నా పూర్తి కో ఆపరేషన్ ఉంటుంది!’ స్థిరంగా చెప్పాడు విశాల్.మా విచారణలో భాగంగా మీ నాన్నకి వచ్చిన ఫోన్ కాల్స్ని ట్రేస్ చేస్తే అందులో నీ పర్సనల్ నంబరు నుండి రోజూ మీ నాన్నకి చేసే కాల్స్ లొకేషన్, ఆ రోజు కేవైసీ నెపంతో సైబర్ నేరగాడు మీ నాన్నకి కాల్ చేసిన లొకేషన్ ఒకే ప్రాంతం నుండి అని తేలింది. -
Rickshaw Pullers: రిక్షా పుల్లరమ్మలు
అభ్యర్థులు చురుకుగా ఉండాలి.. టోక్యో చరిత్రపై అవగాహన కలిగి ఉండాలి .. నగరం నలుమూలలు తెలిసుండాలి..ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తాం.. శారీరక దారుఢ్యం తప్పనిసరి!ఇది గైడ్ కొలువుకు అప్లికేషన్ అని అర్థమవుతోంది. కాని చివరి రిక్వైర్మెంట్ ఏంటీ?నిజమే అది గైడ్ ఉద్యోగమే! దానితోపాటు రిక్షా పుల్లర్ జాబ్ కూడా! ఆశ్చర్యం వద్దు, అది నిజం! టోక్యో అనే పేరుంది కాబట్టి ఎక్కడో తెలిసిపోయే ఉంటుంది.. ఎస్ జపాన్లో! అయితే ఈ కొలువుకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారట! టూరిస్ట్లు కూడా లేడీ రిక్షా పుల్లర్స్నే కోరుకుంటున్నారట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఓపిగ్గా ఉండటం, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వాళ్లే బేషుగ్గా ఉండటం, చిరునవ్వును చెరగనీయకపోవడం, భద్రంగా తిప్పటం వంటి కారణాల వల్ల లేడీ రిక్షా పుల్లర్స్కే డిమాండ్ ఉందట టోక్యోలో! టెక్నికల్ అడ్వాన్స్మెంట్కి మారుపేరైన జపాన్లో రిక్షాలు.. అదీ మనిషి లాగే రిక్షాలు?! అలాంటి రిక్షాలను మన దేశంలో ఎప్పుడో బ్యాన్ చేశాం. కానీ జపాన్లో ఇంకా ఉనికిలో ఉండటమే కాక.. వాటిని లాగే ఉద్యోగం పట్ల క్రేజ్ కూడా ఉండటం విస్మయమే!రిక్షా పుల్లర్ ఉద్యోగానికి కరోనా తర్వాత డిమాండ్ పెరిగింది. కరోనా వచ్చి కొలువులకు చెక్ పెట్టడంతో ఇలాంటి జాబ్స్కి మళ్లారు చాలామంది. మన దగ్గర ఆటోలను అద్దెకిస్తున్నట్టు.. టోక్యోలో రిక్షా పుల్లర్ కొలువులను ఇచ్చే సంస్థలున్నాయి. దాని కోసం శిక్షణ కూడా ఇచ్చి, మరీ అపాయింట్ చేసుకుంటున్నాయి. అభ్యర్థి లర్నింగ్ స్కిల్స్ని బట్టి ఈ ట్రైనింగ్ రెండు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది.అమ్మాయిలెలా వచ్చారు?ఇందాక చెప్పుకున్న కారణమే.. కరోనా! పాండమిక్కి ముందు ఈ రంగంలో మహిళలు పెద్దగా లేరు. కరోనా తర్వాత ఈ రిక్షా సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావించారు. రిక్షా లాగుతున్న అమ్మాయిల వీడియోలూ పెట్టడంతో, టోక్యోలోని నిరుద్యోగ వనితలు చాలామంది ఈ ఉద్యోగంలో చేరారు. అయితే ఆ అమ్మాయిలకు తమ కుటుంబ సభ్యుల నుంచి చాలానే వ్యతిరేకత వచ్చింది. ఆడపిల్లలకు అలాంటి ఉద్యోగం ఇస్తున్న రిక్షా సంస్థలకూ స్త్రీవాదుల నుంచి నిరసన, వ్యతిరేకత తప్పట్లేదు. ‘వారానికి అయిదారైనా ఇలాంటి నిరసన, వ్యతిరేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి’ అని చెప్తాడు రిక్షా సంస్థల్లో ఒకటైన ‘టోక్యో రిక్షా సంస్థ’ మేనేజర్. లేడీ రిక్షా పుల్లర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కూడా ఈ సంస్థలోనే! లేడీ రిక్షా పుల్లర్స్ రోజుకు దాదాపు 250 కేజీల బరువుతో, 20 కిలోమీటర్ల వరకు రిక్షాలను లాగుతారు. డిమాండ్లో ఉన్న రిక్షా పుల్లర్స్ నెలకు పదిలక్షల యెన్లను సంపాదిస్తున్నారట. అంటే మన కరెన్సీలో ఇంచుమించు అయిదు లక్షల 48 వేల రూపాయలన్నమాట. లేడీ రిక్షా పుల్లర్స్ టోక్యోలోని అసకుస అనే టూరిస్ట్ ఏరియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు దీన్నొక డిఫరెంట్ జాబ్గా భావించి, జాయిన్ అవుతున్నారట! -
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్ను ఎంచుకుంది. ‘వైభవ్లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
స్టార్ నుంచి స్టోరీ వైపు..
భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్తో స్క్రీన్ను కమ్మేయకుండా మన జీవితాలకు రంగుల ఫ్రేమ్ను సెట్ చేస్తే? మనిల్లు లాంటి ఇల్లు.. మన ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ.. మన ఇరుగు పొరుగు అంతా కథలో పాత్రలయితే.. థియేటర్ దాటినా ఆ అనుభూతి వెంటాడుతుంది.. ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్ దాకా సీన్ టు సీన్ చెప్పాలనిపిస్తుంది! ఎన్నేళ్లయింది ఇలాంటిది అనుభవంలోకి రాక..? ఈ మాట విన్నదేమో మన తెలుగు కథ.. వెండి తెరకు బలమై.. మంచి సినిమాలా వెలుగుతోంది!ఆ మలయాళం సినిమా చూశారా..? సహజత్వం.. కథా గమనం..! ఎంత అద్భుతంగా ఉందో కదా..! భారీ బడ్జెట్ లేకున్నా పెద్ద సక్సెస్ సినిమాలు ఇలా కూడా తీస్తారా..! అవును నిజమే.. ఫీల్ గుడ్ మూవీస్కు కేరాఫ్ మలయాళం చిన్న కథలు.. మెస్మరైజ్ చేసే టేకింగ్ నిజ జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు సరే.. మాలీవుడ్ మూవీస్ గొప్పగానే ఉండొచ్చు మరి టాలీవుడ్ సినిమా సంగతేంటి ?పొరుగు సినిమాలు విపరీతంగా చూసి మన దగ్గర అసలు విషయం ఏమాత్రం లేదనుకుంటాం గానీ.. మల్లు సినిమాలను మించి అద్భుతమైన కథ, కథనాలతో ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు చిత్రాలు సైలెంట్గా సక్సెస్ సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలను పక్కన పెడితే.. రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా మనసుకు హత్తుకునే సినిమాలతో తెలుగుతెర పులకించిపోతోంది. వందల కోట్ల బడ్జెట్,భారీ తారాగణం, పెద్దపెద్ద సెట్టింగులు.. ఇవి ఉంటేనే సినిమా అనే రోజులు పోయాయి. మూస సినిమాలు చూసి బోరుకొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఈ ఏడాది చిన్న సినిమాలు విందు భోజనమే పెట్టాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు ఈ తరహా సినిమాలు సిల్వర్ స్క్రీన్తో పాటు ఓటీటీలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. గొప్పగొప్ప సినిమాలన్నీ తమిళ, మలయాళం వాళ్లే తీస్తారు.. తెలుగు వాళ్ల దగ్గర అంత క్రియేటివిటీ లేదు అన్న విమర్శలకు చిన్న సినిమాలు తమ సక్సెస్తో సమాధానం చెబుతున్నాయి. పెద్ద సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయిఏడాదంతా చిన్న సినిమాల పండగే2024ను చిన్న సినిమాల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆరంభం, పేకమేడలు, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, వీరాంజనేయులు విహార యాత్ర, 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా 2, సోపతులు, జనక అయితే గనక.. ఇవన్నీ ఈ ఏడాది మూవీ లవర్స్తో శభాష్ అనిపించుకున్న చిన్న సినిమాలే. ఐఎమ్బీ (ఐMఆ) రేటింగ్స్లో ఈ మూవీస్ అన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. తెరపై కనిపించే నటీనటుల నుంచి తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల వరకు అందరూ కలిసి ఈ చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. ఊహాజనితమైన కథలు, పాత్రలకు భిన్నంగా నేటివిటీకి చాలా దగ్గరగా ఈ చిత్రాలు కనిపిస్తాయి. సామాన్య జన జీవితాలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాలు మాలీవుడ్ సినిమాలను మైమరపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ను డామినేట్ చేస్తాయన్న అభిప్రాయాన్ని చిన్న బడ్జెట్ సినిమాలు బ్రేక్ చేశాయి. ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించడంలో చిన్న సినిమా దర్శకులు విజయం సాధిస్తున్నారు.కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యంఒక సినిమా విజయానికి కలెక్షన్ల సునామీ ఒక్కటే గీటురాయి కాదు. కమర్షియల్గా నిర్మాతలకు కోట్లు కుమ్మరించలేకపోయినా కొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. ఫీల్ గుడ్ మూవీస్గా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాల్లో ఉండేది కంటెంట్ మాత్రమే. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, చిత్ర తారాగణం వీటన్నింటికంటే కథ.. ఆ కథను దర్శకుడు నడిపించిన తీరే చిన్న సినిమాల సక్సెస్కు అసలు కారణం. హీరోల ఇమేజ్, దర్శకుల పాపులారిటీ కారణంగా పెద్ద సినిమాలు ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి సినిమాలు అభిమానులతో పాటు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పిస్తాయి. ఈ తరహా సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేసినా చిన్న సినిమాలు మాత్రం మనసుకు హత్తుకుని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. కేవలం సినిమా కోసమే కథలు.. హీరోలను ఎలివేట్ చేయడం కోసమే పాత్రలు, పాటల కోసమే హీరోయిన్లు.. ఇలా దారి తప్పిన సినిమాను యువతరం దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి గాడిన పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. 2024లో విడుదలై సత్తా చాటిన చిన్న సినిమాలే ఇందుకు నిదర్శనం.మీకో కథ చెబుతా చూస్తారా..ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్.. యువ దర్శకులకు బాగా తెలిసిన విద్య. సినిమాను అతుకుల బొంతలా కాకుండా ప్రేక్షకుడి మనసును తాకేలా కథలను రాసుకుని అంతే వినూత్నంగా తెరపై ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది సక్సెస్ రుచి చూసిన సినిమాలన్నింటిలోనూ ఇది కనిపిస్తోంది. నిజ జీవితాలకు దగ్గరగా, నేటివిటీ ఉండేలా ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చిన్న సినిమాలు ఉంటున్నాయి. కథలో కొత్తదనం.. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే పాత్రలు సినిమా సక్సెస్ను నిర్ణయిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలన్నీ స్టార్ పవర్ పైనా, హీరోల ఇమేజ్ పైనా ఆధారపడుతుంటే.. చిన్న చిత్రాలు మాత్రం మంచి కథలను మాత్రమే నమ్ముకుంటున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరున్న వారు కూడా ఈ మధ్య ఆడియన్స్ను మెప్పించడంలో తడబడుతుంటే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తమ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్తో వెండితెరపై భావోద్వేగాలను పండిస్తున్నారు. పల్లెటూరి స్నేహాలు వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు, కుల పట్టింపులు, స్థానిక రాజకీయాలు వీటన్నింటి మధ్య ఎమోషన్స్ ను చూపించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి సక్సెస్ సాధించింది. చిన్ననాటి స్నేహాన్ని, అమాయకత్వాన్ని, మమకారాన్ని హృద్యంగా చూపించిన సోపతులు ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి నటించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. కండోమ్ కంపెనీపై యుద్ధం ప్రకటించే వ్యక్తిగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా మంచి రేటింగ్తో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పెద్ద చర్చనే రేపింది.ఓటీటీ మెచ్చితే అదే పెద్ద విజయంఓటీటీలు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖచిత్రమే మారిపోయింది. వివిధ భాషా చిత్రాలు అందుబాటులో ఉండటంతో కంటెంట్ వినియోగం కూడా పెరిగిపోయింది. భిన్న అభిరుచి గల ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్ను వీక్షించడం అలవాటు చేసుకున్నారు. అందుకే థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్న సినిమాలకు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. మంచి కథలతో వస్తున్న తెలుగు చిన్న సినిమాలు ఓటీటీ వేదికలపై సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే రోజులు వచ్చాయి. మౌత్ టాక్తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్స్ చిన్న సినిమాలను ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. దీంతో చిన్న చిత్రాలు పెద్ద సక్సెస్ను నమోదు చేసుకుంటున్నాయి.వైవిధ్యం.. విజయ రహస్యంకథలో వైవిధ్యం, కథనంలో కొత్తదనం.. మలయాళ సినిమా విజయ రహస్యం ఇక్కడే ఉంది. అందుకే దేశమంతా మాలీవుడ్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. టాలెంట్, క్రియేటివిటీ ఈ రెండూ సరిహద్దులు లేనివి. ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మంచి కథలు రాసే దర్శకులు, వాటిని అందంగా చిత్రీకరించే సాంకేతిక నిపుణులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉంటారు. సరైన అవకాశాలు, అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికినప్పుడు ఆ కథలు మంచి చిత్రాలుగా ప్రేక్షకులకు చేరతాయి. టాలీవుడ్ సినిమాలను కంటెంట్ మాత్రమే శాసించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. చదవండి: పెళ్లిలో మెరిసిన అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!చిన్న సినిమాల సక్సెస్ కూడా ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు. పెద్ద సినిమాలు, హీరోల ఆధిపత్యాలు చలామణి అవుతున్న రోజుల్లో కూడా మంచి కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గుండెలకత్తుకున్నారు. ఈ నగరానికేమైంది, c/o కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెమరీస్, బలగం, కలర్ఫోటో ఇలా భిన్న కథాంశాలతో కూడిన చిత్రాలెన్నో విజయం సాధించి చిన్న సినిమాను నిలబెట్టాయి. ఆ ట్రెండ్ను కొనసాగిస్తూ నేటి యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు లోబడ్జెట్ సినిమాను తెలుగులో ట్రెండ్గా మార్చేశారు. అందుకే 2024 సినీ ప్రేమికులకు మంచి అనుభూతులను మిగిల్చింది.చిన్న సినిమాల వెనుక పెద్ద నిర్మాతలుస్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, వందల కోట్ల వసూళ్లు ఈ రొటీన్ సినిమాటిక్ ఫార్ములా నుంచి నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మంచి కథలతో ముందుకొచ్చే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య సక్సెస్ చూసిన చిన్న సినిమాల వెనుక పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండటం విశేషం. ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నటుడు రానా ప్రమోట్ చేశారు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బేనర్పై ఆయ్ చిత్రాన్ని నిర్మించారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ మంచి సక్సెస్ సాధించింది. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్పై ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించి బిగ్ సక్సెస్ సాధించారు. తెలుగులో పెద్ద సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్కు చిన్న సినిమా ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది. ఒకప్పుడు కొత్త దర్శకులు కథలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న దర్శకులను నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలకు, స్టార్ హీరోల చిత్రాలకు మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అయితే ఈ సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అంచనాలు తలకిందులైతే సీన్ మారిపోతుంది. అభిమానులు కూడా పెదవి విరిచే పరిస్థితి తలెత్తుతుంది. చిన్న సినిమాలతో ఈ సమస్య లేదనే చెప్పాలి. తక్కువ బడ్జెట్తో కొత్త సాంకేతిక నిపుణులతో తెరకెక్కే చిన్న చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది.ఇదొక గుడ్ సైన్‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లాంటి చిన్న సినిమాను గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసింది. దీన్ని చిన్న సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఒకప్పుడు చిన్న సినిమాను చిన్న ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్సే తీయాలి అని ఉండేది. కాని ఇప్పుడు చిన్న సినిమాలను తీయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ముందుకొస్తున్నాయి. కొత్త కథకులను, కొత్త డైరెక్టర్స్ను ఎంకరేజ్ చేస్తున్నాయి. మంచి కథలకు డెఫినెట్గా ఇదొక గుడ్ సైన్!∙ దుష్యంత్, దర్శకుడురెస్పెక్ట్ దొరికింది‘వీరాంజనేయులు విహార యాత్ర’తో నాకొక రెస్పెక్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూడగలిగే హెల్దీ హ్యూమర్తో హెల్దీ ఫిల్మ్ తీయడం వల్లేమో మరి! ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఇలాంటి సినిమా కథలను ప్రొడక్షన్ హౌస్లు వెదుక్కోవడం. ఇదివరకైతే స్క్రిప్ట్ పట్టుకుని ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లే కథాబలమున్న స్క్రిప్ట్లను వెదుక్కుంటున్నాయి. వైవిధ్యమైన కథలు, ఆ కథల మీద గట్టి నమ్మకం, రాజీపడని తత్వం ఉంటే తప్పకుండా మంచి సినిమాలు వస్తాయని అర్థమైంది.అనురాగ్, దర్శకుడుతప్పకుండా ఆదరిస్తారుఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్లు తక్కువగా వస్తున్నాయి. అందులోకి గోదావరి బ్యాక్డ్రాప్లో మన నేటివిటీని బేస్ చేసుకుని వినోదాన్ని పంచే స్క్రిప్ట్లు వంశీ, జంధ్యాల వంటి దర్శకుల తర్వాత పెద్దగా రావట్లేదని చెప్పొచ్చు. అందుకే మన నేటివిటీని యూజ్ చేసుకుని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే సినిమా హిట్ అవుతుందనిపించి.. ‘ఆయ్’ సినిమా తీశాను. ఫస్ట్ సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం, అది హిట్ అవడం నిజంగా అదృష్టం. ఇండస్ట్రీలో పది పన్నెండేళ్ల నా స్ట్రగుల్ మంచి రిజల్ట్నే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మన నేటివిటీ, నిజ జీవితంలో కనిపించే పాత్రలతో కథను పండించగలిగితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రూవ్ అయింది. అంజి కె మణిపుత్ర, దర్శకుడుప్రయత్నాన్ని నమ్మారు..‘కమిటీ కుర్రోళ్లు’ వల్ల గనుక నిర్మాతలు నష్టపోతే ఇక భవిష్యత్తులో ఎవరూ చిన్న సినిమా మీద డబ్బు పెట్టడానికి ముందుకురారు అనే భయం ఉండింది. కథాబలంతో చిన్న సినిమా ఉనికి చాటాలనేదే నా ప్రయత్నం. నా ప్రయత్నంలోని నిజాయితీని నిర్మాతలు, ప్రేక్షకులు నమ్మారు. చిన్న సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. యదు వంశీ, దర్శకుడుఫణికుమార్ అనంతోజు -
అరవింద్ గ్రాండ్ సమేత..
చెన్నై గ్రాండ్మాస్టర్స్ ఫైనల్ తర్వాత బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది.. విజేతగా నిలిచిన అరవింద్ చిదంబరం వేదిక మీదకు వచ్చాడు. అతను ట్రోఫీ తీసుకున్న తర్వాత కోచ్ ఆర్బీ రమేశ్ను కూడా శిష్యుడిని అభినందించేందుకు వేదికపైకి పిలిచారు. అక్కడికి వచ్చిన రమేశ్ అనూహ్యంగా చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యపరచింది. పసివాడిని ఎత్తుకున్నట్లుగా అరవింద్ను వేదికపైనే రెండు చేతులతో పైకి ఎత్తుకొని ఆయన తన ఆనందాన్ని ప్రదర్శించారు. తన శిష్యులు విజయాలు సాధించడం రమేశ్కు కొత్త కాదు. ప్రజ్ఞానంద, వైశాలి తదితర గ్రాండ్మాస్టర్లను తీర్చిదిద్దిన ద్రోణాచార్యుడు ఆయన. కానీ అరవింద్పై చూపించిన ఆ అభిమానానికి ప్రత్యేక కారణం ఉంది. దాదాపు దశాబ్దం కిందట తన కోచింగ్ కేంద్రం ‘గురుకుల్’లో చేరిన కుర్రాళ్లలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకొని అనూహ్యంగా తెర వెనక్కి వెళ్లిన అరవింద్ ఇప్పుడు మళ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్న టోర్నీలో విజేతగా నిలిచిన 25 ఏళ్ల అరవింద్..పెద్ద విజయాల కోసం పోటీలో ఉన్నానని నిరూపించుకున్నాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి..దాదాపు 11 ఏళ్ల కిందట చెన్నైలో గ్రాండ్మాస్టర్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్ జరిగింది. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో 14 ఏళ్ల అరవింద్ చిదంబరం విజేతగా నిలిచాడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా కూడా అతను నిలిచాడు. ఆ సమయంలో అతను గ్రాండ్మాస్టర్ కాదు కదా.. కనీసం ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా కాదు. టైటిల్ను గెలిచే క్రమంలో అరవింద్ నలుగురు గ్రాండ్మాస్టర్లు, ఇద్దరు ఇంటర్నేషనల్ మాస్టర్లను ఓడించాడు. అప్పుడే అతని ప్రదర్శనపై ప్రత్యేక ప్రశంసలు కురిశాయి. విదేశీ మీడియా కూడా ఎవరీ ప్రతిభావంతుడు అంటూ వాకబు చేసింది. టోర్నీ జరుగుతున్న సమయంలోనే అరవింద్లోని ప్రత్యేక ప్రతిభ గురించి దిగ్గజ ప్లేయర్ సుసాన్ పొల్గర్కు కోచ్ రమేశ్ వివరించారు. ఈ కుర్రాడు వచ్చే ఆరు నెలల్లో గ్రాండ్మాస్టర్ అవుతాడు చూడండి అని ఆయన చెప్పారు. అయితే పొల్గర్ దీనిని నమ్మలేదు. మహా అయితే ఇంటర్నేషనల్ మాస్టర్ మాత్రమే కాగలడని, అంత వేగంగా ఎదగలేడని ఆమె అభిప్రాయ పడింది. కానీ చెన్నై ఓపెన్లో విజయంతో తొలి జీఎం నార్మ్ను అందుకున్న అరవింద్ సరిగ్గా ఆరు నెలలు తిరిగేలోపే గ్రాండ్మాస్టర్ కావడం విశేషం.ప్రతికూలతలను దాటి..చెస్ కెరీర్లో అరవింద్ ప్రస్థానం చాలా కష్టంగా సాగింది. మూడేళ్ల వయసులోనే అతను తండ్రిని కోల్పోయాడు. ఎల్ఐసీ ఏజెంట్ అయిన తల్లి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అతడిని పెంచింది. మధురైకి చెందిన అరవింద్ చెస్పై ఆసక్తి చూపించడంతో ఆమె తన స్థాయిలో∙ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ అరవింద్ జాతీయ స్థాయిలో మంచి విజయాలు సాధించాడు. 12 ఏళ్ల వయసులోనే జాతీయ అండర్–19 చాంపియన్గా నిలిచిన అతను.. అండర్–14 వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో రెండో స్థానం దక్కించుకున్నాడు. అయితే మరింత పైకి ఎదగాలంటే సరైన ప్రణాళిక, శిక్షణ అవసరం. ఇలాంటి సమయంలో అరవింద్లో నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ రమేశ్ చెన్నైకి వస్తే తాను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. దాంతో అతను చెన్నై చేరాడు. అక్కడ రమేశ్ అతనికి చెస్లో ఉచితంగా శిక్షణ ఇవ్వగా.. చెస్ క్రీడాకారులకు అడ్డా అయిన వేలమ్మాళ్ స్కూల్ యాజమాన్యం కూడా అతడి నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇచ్చింది. ఓఎన్జీసీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడంతో అరవింద్ ఆట ముందుకు సాగి మంచి విజయాలు వచ్చాయి. జీఎం హోదాను అందుకొని..అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి చెస్ ప్లేయర్గా ఎదగాలంటే ప్రతిభ మాత్రమే సరిపోదు, తగినన్ని అవకాశాలు కూడా రావాలి. దాని కోసం పెద్ద సంఖ్యలో విదేశాల్లో టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అందుకు తగిన ఆర్థిక స్తోమత కూడా అవసరం. ఆ స్థితిలో అరవింద్ సహజంగానే ఇబ్బంది పడ్డాడు. అండర్–19లో జాతీయ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత చెస్ సమాఖ్య తమ ఖర్చులతో రెండో టోర్నీలకు పంపించింది. ఇంకా గ్రాండ్మాస్టర్గా కూడా మారని ఇలాంటి దశలో మరో వైపు రమేశ్ కూడా తన ప్రయత్నాలు కొనసాగించాడు. సరిగ్గా ఆ సమయంలో అతనికి సుసాన్ పొల్గర్ కూడా సహకరించింది. దాంతో చెస్ బేస్ అనే వెబ్సైట్ కొన్ని రోజుల వ్యవధిలో ఫండ్ రైజర్తో 10 వేల డాలర్లు సేకరించి అరవింద్కు అందించింది. దీనిని వాడుకున్న అతను టోర్నీల్లో వరుస విజయాలు సాధించి కొన్ని నెలల వ్యవధిలోనే గ్రాండ్మాస్టర్ హోదాను అందుకున్నాడు. ఒత్తిడిలో చిత్తయి..వేగంగా దూసుకొచ్చి జీఎంగా మారిన తర్వాత అరవింద్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దురదృష్టవశాత్తు అతను ఒక్కసారిగా ఒత్తిడి పెంచుకొని ఆందోళనకు గురయ్యాడు. అంచనాలను అందుకోలేకపోతే ఎలా అనే భయం అతడిని వెంటాడింది. దాంతో వరుస ఓటములు పలకరించాయి. చాలా సందర్భాల్లో తన స్థాయికి తగినట్లుగా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. సుదీర్ఘ కాలం పాటు ఒకే రేటింగ్ (2640) వద్ద ఆగిపోయాడు. తనతో పాటు ఆటను ప్రారంభించి, ఒక దశలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆటగాళ్లంతా ముందుకు వెళ్లిపోవడం కూడా అతడిని కలవరపెట్టింది. దీని నుంచి బయటకు రావడానికి అరవింద్కు చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు పాతికేళ్ల వయసులో సరైన దిశలో అతని ప్రస్థానం మళ్లీ మొదలైంది. కీలక విజయంతో సత్తా చాటి..నిజానికి ఎంతోమంది అగ్రశ్రేణి ప్లేయర్లు పాల్గొన్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో తనకు అవకాశం దక్కుతుందని ముందుగా అతనూ ఊహించలేదు. కానీ ఒకసారి అడుగు పెట్టాక స్పష్టంగా తన ఆటేంటో అతను అందరికీ చూపించాడు. ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతున్న అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతీ, లెవాన్ అరోనియన్, పర్హామ్ మఘ్సూద్లూలను దాటి అరవింద్ విజేతగా నిలవడం విశేషం. టోర్నీ చివరి దశకు వచ్చే సరికి టైటిల్ ఖాయమనుకున్న అర్జున్ను ఓడించడంతో అరవింద్ అగ్రస్థానం ఖాయమైంది. గత కొంతకాలంగా పెరిగిన ఆత్మవిశ్వాసమే అందుకు కారణమని అతను చెప్పాడు. ఇటీవల అత్యుత్తమంగా 2720 రేటింగ్ను కూడా అందుకొన్న అరవింద్ రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టైటిల్స్ గెలవడం ఖాయం. మొహమ్మద్ అబ్దుల్ హాది -
ద స్టయిల్ ఎలివేటర్
ఈశా అమీన్.. కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్! స్వస్థలం మంగళూరు అయినా ముంబైలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఏర్పడుతున్న వయసులో ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తగ్గట్టుగానే నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది. యూరోపియన్ ఎక్స్పోర్ట్ హౌస్లో డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. అందులో పనిచేస్తున్నప్పుడే డిజైన్కి సంబంధించి పలు బ్రాండ్లతో సమావేశమవడానికి తరచుగా యూరప్కి ప్రయాణం చేసేది. ఆ సమయంలోనే వివిధ కంపెనీల యాడ్ షూట్స్నీ పర్యవేక్షించాల్సి వచ్చేది. అప్పుడే అక్కడ స్టయిలింగ్ ట్రెండ్ని గమనించి, అవసరమైనప్పుడు షూట్స్లో మోడల్స్కి స్టయిలింగ్ కూడా చేసేది. దాంతో స్టయిలింగ్నీ కెరీర్గా మలచుకోవచ్చనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. ఓ వైపు డిజైనర్గా పనిచేస్తూనే, వీలుచిక్కినప్పుడల్లా స్టయిలింగ్ ప్రాజెక్ట్స్నీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆమె తొలిసారి స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీ.. స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం సానియాకు స్టయిలింగ్ చేసి గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పోటీదారులకు స్టయిలింగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఆ అసైన్మెంట్లో ఉన్నప్పుడే ఫిల్మ్ఫేర్, ఫోర్బ్స్, ఫెమినా, స్టార్డస్ట్, ఎగ్జిబిట్ లాంటి పత్రికల ముఖచిత్రాల మోడల్స్కీ కాస్ట్యూమ్ డిజైన్, స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. ఇక అక్కడి నుంచి ఈశాకు వెనక్కి మళ్లే అగత్యమే రాలేదు. ఆమె పనితీరుకు బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముచ్చటపడ్డాయి. సింగ్ ఈజ్ బ్లింగ్, ఆదత్, మణిదన్, బోగన్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా ఆమెకు టైటిల్ కార్డ్ ఇచ్చాయి. ఇంకోవైపు ఎండార్స్మెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కోసం సెలబ్రిటీలకు డ్రెస్ డిజైన్తో పాటు స్టయిలింగ్ చేసే అవకాశాలూ రాసాగాయి. హెవీ కాస్ట్యూమ్స్, ఊపిరి సలపని యాక్ససరీస్తో కాకుండా లైట్ వెయిట్.. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, మినిమమ్ యాక్ససరీస్తో కంఫర్ట్గా ఉండే ఆమె డిజైన్స్ అండ్ స్టయిలింగ్కి బాలీవుడ్ తారలు ఇంప్రెస్ అయ్యారు. కరిశ్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, లారా దత్తా, బిపాశా బసు, చిత్రాంగదా సింగ్, రితేశ్ దేశ్ముఖ్, జెనీలియా డిసూజా, నీరజ్ చోప్రా, ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధవన్, అమీ జాక్సన్, పూజా హెగ్డే, కార్తిక్ ఆర్యన్, నర్గిస్ ఫఖ్రీ, కల్కి కొచ్లిన్, తమన్నా, రియా చక్రవర్తి, సంజనా సంఘీ, అనుప్రియా గోయెంకా, కరిశ్మా తన్నా లాంటి తారలు ఆమెను తమ డ్రెస్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకున్నారు. సెలబ్రిటీలకు ఈశా.. స్టయిలింగ్ చేసే కంటే ముందు వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లకున్న ఇమేజ్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత వాళ్ల శరీరాకృతి, కలర్ టోన్, వాళ్ల వైబ్.. సౌకర్యం వంటివన్నీ పరిశీలించి, తదనుగుణంగానే డ్రెస్ డిజైనింగ్ గానీ.. స్టయిలింగ్ గానీ చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెడుతుంది కాబట్టే సెలబ్రిటీల దృష్టిలో ఆమె పర్ఫెక్ట్ స్టయిలిస్ట్ అయింది. తన పనికి ప్రేరణ, స్ఫూర్తి ప్రయాణాలే అని చెబుతుంది. మహిళల కంఫర్ట్ వేర్ కోసం ‘ఈశా అమీన్’ పేరుతోనే ఒక లేబుల్ని లాంచ్ చేసింది. లగ్జరీ వెడ్డింగ్ స్టయిల్ కోసం ‘ద స్టయిల్ ఎలివేటర్’ అనే కన్సల్టెన్సీనీ స్థాపించింది. పెటా వీగన్ ఫ్యాషన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ఏకైక ఇండియన్ స్టయిలిస్ట్గా గౌరవం దక్కించుకుంది.స్టయిల్ అంటే నా దృష్టిలో ఒక ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సెలబ్రిటీస్లో సైఫ్ అలీ ఖాన్కి స్టయిలింగ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. ఆయనతో వర్క్ అంటే భలే సరదాగా ఉంటుంది. సైఫ్.. క్లాసియెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్!– ఈశా అమీన్ -
పండుగలకే పండుగ!
నాగాలాండ్లో జరిగే ‘హార్న్బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
ఉపమన్యుడి వృత్తాంతం
ఉపమన్యుడి పసితనంలోనే అతడి తండ్రి వ్యాఘ్రపాదుడు కన్నుమూశాడు. వ్యాఘ్రపాదుడి అకాల మరణంతో అతడి భార్య కొడుకు ఉపమన్యుడితో పాటు పుట్టింటికి చేరుకుంది. మేనమామల ఇంట ఉపమన్యుడికి ఆదరణ కరవైంది. మేనమామల పిల్లలు రుచికరమైన పదార్థాలు భుజిస్తుండేవారు. పుష్కలంగా పాలు తాగుతుండేవారు. ఉపమన్యుడికి ఆకలి వేసినప్పుడు తగినన్ని పాలు కూడా దొరికేవి కాదు. ఉపమన్యుడు మేనల్లుడే అయినా, అతడి తల్లి తమ తోబుట్టువే అయినా, వారు అనాథలు కావడంతో మేనమామలు వారిని తగిన విధంగా ఆదరించేవారు కాదు.ఒకనాడు ఉపమన్యుడు పాలకోసం తల్లి వద్ద మారాం చేశాడు. కొడుకు అవస్థకు కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి తన కన్నీళ్లలోనే కాసింత పేలపిండిని కలిపి, అవే పాలు అని ఇచ్చింది. ఒక్క గుక్క తాగగానే అవి పాలు కాదని గ్రహించిన ఉపమన్యుడు, వాటిని తోసిపుచ్చాడు. పట్టరాని దుఃఖంతో, ఉక్రోషంతో ఏడుపు లంకించుకున్నాడు.నిస్సహాయురాలైన ఆ తల్లి అతడిని రకరకాలుగా లాలించింది. తన పరిస్థితిని వివరించింది. దుఃఖం నుంచి తేరుకున్న ఉపమన్యుడు తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘అమ్మా! నన్ను దీవించి పంపించు. శివుడి కోసం తపస్సు చేసి, పాల సముద్రాన్నే తెచ్చుకుంటాను’ అని ఆవేశంగా పలికాడు. సరేనన్న ఆ తల్లి అతడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది. ‘నాయనా! మన శైవులకు పంచాక్షరి మంత్రమే మహాయుధం. దీనినే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదనైనా తప్పిస్తుంది’ అని చెప్పి, తన భర్త నుంచి సంక్రమించిన విరజా భస్మాన్ని కొడుకు చేతికిచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుమతిస్తూ, శీఘ్రసిద్ధి కలగాలంటూ ఆశీర్వదించి సాగనంపింది.తల్లి అనుమతితో ఇల్లు విడిచిన ఉపమన్యుడు అడవుల బాట పట్టాడు. కాలినడకన కొన్నాళ్లకు ఒక దట్టమైన కీకారణ్యానికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని, పంచాక్షరి జపం మొదలుపెట్టాడు. జపం క్రమంగా ధ్యానంగా మారింది. ధ్యానం తపస్సుగా మారింది. అడవిలో ఉన్న రాకాసి మూక అతడిని భయపెట్టి, తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించింది. ఉపమన్యుడు చలించలేదు. అతడిని జయించలేక రాకాసులందరూ అతడికి కింకరులుగా మారిపోయారు.ఉపమన్యుడి తపస్సు ఊపందుకుంది. నానాటికీ తపస్సులో ఉగ్రత పెరగసాగింది. అతడి తపస్సు వేడిమి స్వర్గం వరకు ఎగబాకింది. దేవతల అరికాళ్లు చుర్రుమన్నాయి. ఈ పరిణామానికి హడలెత్తిన దేవతలు విష్ణువును వెంటబెట్టుకుని, పరమశివుడి వద్దకు చేరుకున్నారు. ‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. నువ్వు జాప్యం చేస్తే, అతడి తపస్సు పుట్టించే తాపానికి మేమంతా తప్తమైపోకుండా కాపాడు’ అని మొరపెట్టుకున్నారు.‘సరే’నని దేవతలకు మాట ఇచ్చాడు శివుడు.అయితే, ఉపమన్యుడిని పరీక్షించదలచాడు. ఇంద్రుని రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘కుమారా! ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.‘నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే, నువ్వొచ్చావేమిటి దేవేంద్రా? నీ వరాలేవీ నాకు అక్కర్లేదు. సాక్షాత్తు పరమశివుడే నా ముందు ప్రత్యక్షం కావాలి. అతడే నా మనోరథాన్ని ఈడేర్చాలి. ప్రయాసపడి వచ్చావుగాని, నువ్వు దయచేయవచ్చు’ అన్నాడు ఉపమన్యుడు.ఇంద్రుడి వేషంలో ఉన్న పరమశివుడు ఉపమన్యుడికి తన పట్ల గల అచంచల భక్తికి పరమానందం చెందాడు. నిజరూపంలో పార్వతీ సమేతంగా సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు తన కళ్లెదుట కనబడగానే ఉపమన్యుడు పారవశ్యంతో తబ్బిబ్బయ్యాడు. అతడికి నోట మాట పెగలలేదు. ఉపమన్యుడు నోరు తెరిచి అడగకపోయినా, పరమశివుడు అతడికి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని ధారాదత్తం చేశాడు. ‘నువ్వు నా బిడ్డవురా!’ అంటూ అతడిని చేరదీసి, ముద్దాడి గణాధిపత్యం కూడా ఇచ్చాడు.‘నాకు మాత్రం బిడ్డ కాడా’ అంటూ పార్వతీదేవి కూడా ఉపమన్యుడిని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించింది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉపమన్యుడికి నిత్య కుమారత్వం సిద్ధించింది.‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. ∙సాంఖ్యాయన -
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
ఈవారం కథ: చాక్లెట్ రాపర్స్
మార్నింగ్ 5:30కి అలారం మోగగానే నిద్రలేచాను. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నేను మామూలుగా పగలు అసలు సూర్యుడినే చూడకూడదు అనుకుంటా! అలాంటిది అంత ఎర్లీగా నిద్ర లేవటానికి కారణం వీకెండ్. నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడటానికి శనివారం మాత్రమే కుదురుతుంది. ఫ్రెండ్స్ అందరినీ అలర్ట్ చేసి ఫ్రెష్ అయి పక్కనే ఉన్న గ్రౌండ్కి బయలుదేరాం. మా కాలనీలో ఉన్న డాక్టర్స్ టీమ్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీమ్కి ప్రతి శనివారం క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఫీమేల్ ఆడియన్స్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్ మ్యాచ్కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అందరూ యూత్ అవటంతో క్రికెట్ మ్యాచులు హోరాహోరీగా సాగుతాయి. లాస్ట్ రెండు వారాలు మేం మ్యాచ్లు ఓడిపోవటం వల్ల ఈసారి మాకు ప్రెషర్ ఎక్కువ అయింది. మా కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవటంతో ఫీల్డింగ్ చేయటానికి గ్రౌండ్లో దిగాం. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 20 ఓవర్స్లో 140/6 చేసింది. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని చేజింగ్ స్టార్ట్ చేశాం. ఓపెనింగ్ బ్యాటర్స్ బాగా ఆడటంతో మ్యాచ్ మా చేతుల్లో ఉన్నట్టే అన్పించింది. 10 ఓవర్స్కి 84/2. ఇంకో 60 బాల్స్లో 57 రన్స్ చేస్తే మ్యాచ్ మాదే. కానీ వెంటవెంటనే వికెట్స్ పడటంతో టెన్షన్ ఎక్కువైంది. 16 ఓవర్స్ 108/5. బౌలింగ్ కట్టుదిట్టంగా ఉంది. చూస్తుండగానే మ్యాచ్ ఆఖరి ఓవర్కి వచ్చింది. 6 బాల్స్ 10 రన్స్. రెండు టీమ్స్లో ఒత్తిడి కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఈలోపు రెండు బాల్స్ డాట్ అయ్యాయి. ఒత్తిడి మొత్తం మా టీమ్ పైనే పడింది. అవతలి వాళ్లు మ్యాచ్ గెలిచేసిన ఆనందంలో ఉన్నారు. 3వ బాల్ బౌండరీ.. 4 రన్స్ వచ్చాయి. ఇంకా 3 బాల్స్లో 6 రన్స్.. వికెట్ పడింది. ఓపెనర్గా వచ్చి బాగా సెట్ అయి బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్మన్ అవుట్ అయిపోయాడు. 2 బాల్స్లో 6 రన్స్.. మ్యాచ్ పూర్తిగా వాళ్లవైపే ఉంది. ఒక బాల్ డాట్ అయితే మ్యాచ్ వాళ్లదే. 7వ ప్లేస్లో కెప్టెన్, నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ బ్యాటింగ్కి దిగాడు. అజయ్ ఏ టైమ్లో అయినా కూల్గా ఉండగలడు. హిట్టింగ్ బ్యాట్స్మన్. ఇలాంటి చాలా సందర్భాల్లో అజయ్ మా టీమ్ని గెలిపించాడు. బౌలర్ బాల్ వేయటానికి సిద్ధమయ్యాడు. బాల్ యార్కర్ మిస్ అయి ఫుల్ టాస్ పడింది. అంతే, అజయ్ షాట్ కొట్టగానే బాల్ లాంగ్ ఆన్లో గ్రౌండ్ బయట పడింది. అరుపులు కేకలతో మా టీమ్ హోరెత్తించింది. సునాయాసంగా గెలిచే మ్యాచ్ ఓడిపోవటంతో డాక్టర్స్ టీమ్ బాధగా గ్రౌండ్ వదిలింది. మ్యాచ్ గెలిపించిన ఆనందంలో ట్రీట్ ఇవ్వడానికి మా అందరినీ పక్కనే ఉన్న బేకరీకి తీసుకువెళ్లాడు మా కెప్టెన్. ఎవరికి కావలసినవి వాళ్లు తీసుకున్నారు. ఇంతలో మా వాచ్మన్ కొడుకు అటుగా వచ్చి ఇవాళ ‘నా బర్త్ డే’ అంటూ చాక్లెట్స్ ఇచ్చాడు. అబ్బాయిని విష్ చేశాను. కానీ ఆ చాక్లెట్ చూస్తే కోపం వచ్చింది. పిల్లాడి ముందు ఏమీ అనక, పక్కకు వెళ్లి దాన్ని విసిరికొట్టి, బేకరీ బిల్ పే చేయటానికి వెళ్లాను. నాలుగు రూపాయలు చేంజ్ లేకపోవటంతో బేకరీ అతను చాక్లెట్లు ఇచ్చాడు. సేమ్ చాక్లెట్స్.. చిర్రెత్తుకొచ్చింది. ఆ చాక్లెట్స్నీ విసిరికొట్టి, షాప్ అతని కాలర్ పట్టుకుని ‘చేంజ్ ఇవ్వటం నేర్చుకో!’ అంటూ విసురుగా అక్కడి నుంచి కదిలాను. కాస్త దూరం నడిచాక.. ఆ షాప్ అన్నతో అలా బిహేవ్ చేసినందుకు బాధపడి తిరిగెళ్లి ‘సారీ’ చెప్పి వచ్చేశాను. నా తీరు చూసి ‘ఏమైంది?’ అడిగాడు నా ఫ్రెండ్ అజయ్. ‘తర్వాత మాట్లాడదాం’ అంటూ మా ఫ్లాట్కి వెళ్లిపోయాను.మా ఫ్లాట్లో నలుగురం ఉంటాం. అందరం ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. సాయంత్రం ఎవరి పనుల్లో వాళ్లం ఉండగా ఇంతలో పవర్ కట్ అయింది. చేసేదేం లేక రూమ్మేట్స్ అందరం అపార్ట్మెంట్స్ టెర్రస్ పైకి ఎక్కాం. ఇంక ఎవరి ఫోన్లోనూ బ్యాటరీ పెద్దగా లేకపోవటంతో వెంటనే ఫుడ్ ఆర్డరిచ్చి, ఫోన్స్ పక్కన పడేశాం. లోకంలో జరుగుతున్న విషయాల మీద చర్చ మొదలుపెట్టాం. భిన్నమైన ఇష్టాలు, హాబీలు ఉండటంతో సంభాషణ ఇంట్రెస్టింగ్గా సాగింది. నా రూమ్మేట్ రాకేశ్కి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతలో మా ఫ్రెండ్ విక్రమ్ ‘టైమ్ ట్రావెల్ పాసిబుల్ అయ్యి పదేళ్ల వయసులో ఉన్న పాస్ట్ సెల్ఫ్ను మనం కలుసుకోగలిగితే మీకు మీరు ఇచ్చుకునే ఇన్ఫర్మేషన్.. గిఫ్ట్ ఏంటి?’ అని అడిగాడు. ‘నువ్ ఏం చేస్తావో చెప్పు ముందు?’ అని విక్రమ్ని అడిగా. ‘ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయమని, ఫ్యూచర్లో ఏ షేర్స్ పేరుగుతాయో.. వాటిని వీలైనన్ని కొనమని డీటైల్స్ ఇస్తా’ అని చెప్పాడు. రాకేశ్ని అడిగితే ‘విన్నింగ్ బెట్ డీటైల్స్ ఇస్తా’ అన్నాడు. అజయేమో క్రిప్టో కరెన్సీ అన్నాడు. ఇక అందరూ నా వైపు తిరిగారు.. నేనేం చెప్తానా అని! కింద నుంచి వాచ్మన్ కొడుకు ఏడుపు వినపడింది. రాత్రి నిశ్శబ్దంగా ఉండటంతో వాడి ఏడుపు టెర్రస్ని చేరింది. ‘ఏమైందిరా.. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు?’ అంటూ అజయ్ వెళ్లబోయాడు. అంతలో రాకేశ్ ‘మార్నింగ్ మనోడు చేసిన ఘనకార్యం గుర్తొచ్చి భయపడి ఏడుస్తున్నాడేమో’అన్నాడు. ఇంతలో అజయ్ ‘మార్నింగ్ ఎందుకురా అలా బిహేవ్ చేశావ్?’ అడిగాడు. నేను జవాబు చెప్పకుండా దాటవేస్తానేమో అని అందరూ ఒక్కటిగా ఏమైందో చెప్పమంటూ వెంటపడ్డారు. ‘చిన్నప్పుడు నన్నొక చాక్లెట్ కంపెనీ కొన్నాళ్ల పాటు మెంటల్ టార్చర్ చేసింది..’ అంటూ ఆగాను. అందరి మొహాల్లో ఉత్సుకత! నా కథ చెప్పడం మొదలుపెట్టాను. ‘మేము కదిరిలో ఉండేవాళ్లం. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, చెల్లి, నేను.. ఇదీ మా కుటుంబం! నాన్న టైలర్. అమ్మ హౌస్వైఫ్. నానమ్మ, తాత పళ్ల వ్యాపారం చేసేవాళ్లు. ముగ్గురి సంపాదనతో హ్యాపీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి ఒకరోజు తాత కళ్లు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో చూపిస్తే.. క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకడని చెప్పారు. అప్పటికి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏం చేయాలో తెలియని అయోమయం నుంచి తేరుకోక ముందే తాత చనిపోయాడు. రెండు నెలల తర్వాత తాత మీద బెంగతో నానమ్మ కూడా చనిపోయింది. కన్నీళ్లు ఆకలి తీర్చలేవు కదా! నాన్నే ముందు తేరుకుని పనిలో పడ్డాడు. ఒక్కరి సంపాదనే అవటంతో ఇల్లు గడవటం కొంచెం కష్టమయింది. అమ్మ మిషన్ కుట్టటం మొదలుపెట్టింది. అప్పటికి నేను నాలుగవ తరగతి. సోషల్ టెక్స్›్టబుక్లోని పావర్టీ లెసన్ వింటున్నప్పుడు మా కుటుంబం పేదరికానికి చాలా దగ్గరగా ఉన్నట్టనిపించింది. డబ్బుతో ముడిపడి ఉన్న చిన్నచిన్న కోరికలు, ఆశలను చిన్న వయసులోనే చంపేసుకోవాలని పేదరికం ఒక గొప్ప ఫిలాసఫీ నేర్పిస్తుంది. దాన్ని ఒంటబట్టించుకున్న నేను బట్టలు, బొమ్మల కోసం అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టటం మానేశా. నా పదకొండవ బర్త్ డే అప్పుడు.. ‘ఏం కావాలి?’ అని అడిగారు నాన్న. క్రికెట్ బ్యాట్ అని చెప్పా. మంచి బ్యాట్ ఎంత అవుతుందని అడిగితే, అయిదువందల రూపాయలు అని చెప్పా. రవి ఫ్యాన్సీ స్టోర్లో ఎమ్మారెఫ్ క్రికెట్ బ్యాట్.. నేను చాలాసార్లు కొనాలనుకుని.. కొనలేక ఆశను చంపేసుకున్న బ్యాట్.. ఆ బ్యాట్ ఎంతని షాపతణ్ణి ఒక 30 సార్లు అడిగుంటా! నా బర్త్డేకి మూడు రోజుల ముందు నుంచి ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు నాన్న. బహుశా ఆ బ్యాట్ కొనటానికేనేమో అనిపించింది. క్రికెట్ బ్యాటే అడగటానికి కారణం లేకపోలేదు. క్రికెట్ గ్రౌండ్కి వెళ్తే బ్యాట్ ఎవరి దగ్గర ఉంటే వాడికే బ్యాటింగ్. మాతో రోజు మొత్తం గ్రౌండ్లో ఫీల్డింగ్ చేయించేవాళ్లు. బౌలింగ్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. ఫీల్డింగ్తో మేము బాగా అలసిపోయాక మా ముఖాన ఒక ఫోర్ బాల్స్ బ్యాటింగ్ ఇచ్చేవాళ్లు. సో నేను బ్యాట్ కొనగానే నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాటింగ్ ఇవ్వాలని, వేరే వాళ్లలా చేయకూడదని ఫిక్స్ అయ్యా. నా పుట్టినరోజు రానే వచ్చింది. నా ఆలోచనలు అన్నీ ఆ క్రికెట్ బ్యాట్ చుట్టే! ఆ బ్యాట్ని గ్రౌండ్కి తీసుకెళ్తే నాకొచ్చే రెస్పెక్ట్ గురించే! అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మామూలుగా ఉదయం ఏడయినా నిద్ర లేవని నాకు అయిదున్నరకే తెల్లారింది. లేచి చూస్తే.. మా అత్త, మామ కనిపించారు. ఏదో పని పైన వెళ్లి రిటర్న్లో మా ఇంటికి వచ్చారు. అమ్మ పుట్టినరోజు విషెస్ చెప్పింది. అమ్మ చెప్పగానే అందరూ విష్ చేశారు. నేను మాత్రం నాన్న కోసం వెతుకుతూ అమ్మని అడిగితే మార్కెట్కి వెళ్లాడని చెప్పింది. వాళ్ల చెల్లి వచ్చిన ఆనందంలో నాన్న నాన్వెజ్ వెరైటీస్ అన్నీ తీసుకొచ్చాడు. నాకు అప్పటికే ఏదో తేడా కొట్టింది. ఇక నన్ను చూసి మా నాన్న విషెస్ చెప్పినప్పుడే కన్ఫర్మ్ అయింది బ్యాట్ కొనే ప్రోగ్రామ్ బిస్కట్ అయిందని. ఏడుపు ముంచుకొచ్చింది. భూమి మీద అత్యంత కష్టమైన పని ఏడుపు ఆపుకొని నవ్వు నటించటం. అంత చిన్న వయసులోనే జీవితంపై మొదటిసారి విరక్తి కలిగింది. ఇక వాళ్లని వీళ్లని నమ్ముకుంటే లాభం లేదని నేనే డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యా. నాకు బాగా ఇష్టమైన హాబీ కథలు రాయటం, చదవటం. ఒకసారి వారెన్ బఫెట్ గురించి పేపర్లో చదివా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడని, పన్నెండేళ్లకే అతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడని, పేపర్ బాయ్గా కూడా పని చేశాడని! అది చదివాక వారెన్ బఫెట్ను అమ్మేద్దామని ఫిక్స్ అయ్యా! అంటే మా ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను అమ్మేద్దామని! మా స్కూల్ దగ్గర్లోని గుజిరీ షాపులో ఎంక్వయిరీ చేయగా తెలిసిందేమంటే కేజీ న్యూస్ పేపర్స్కి ఆరు రూపాయలని, పన్నెండు ఫుల్ న్యూస్ పేపర్స్ కిలో బరువు ఉంటాయని! మా ఇంట్లో పేపర్స్ని ఎవరికీ తెలియకుండా గుజిరీ షాపులో అమ్మేశా. స్కూల్లో నేను బ్రైట్ స్టూడెంట్ను అవటంతో నన్నే క్లాస్ లీడరుగా పెట్టారు. దాంతో క్లాస్లో అందరినీ ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగా.. ‘ఎంతమంది ఇళ్లల్లో న్యూస్ పేపర్స్ వస్తాయి?’ అని. అరవై మందిలో ముప్ఫై అయిదు మంది చేతులు ఎత్తారు. ‘ప్రిన్సిపాల్ మేడమ్ చెప్పమంది’ అంటూ ఒక్కొక్కరినీ పన్నెండు న్యూస్ పేపర్స్ తీసుకురమ్మన్నాను. మరుసటి రోజు ట్వంటీ మెంబర్స్ న్యూస్ పేపర్స్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి ఆ పేపర్స్ని గుజిరీ షాప్కి తీసుకెళ్లా. 120 రూపాయలు వచ్చాయి. అంత డబ్బును చూసిందిలేదెప్పుడూ! కొంచెం అమౌంట్తో స్నాక్స్ తీసుకున్నా. సాయంత్రం స్టడీ అవర్ బ్రేక్లో అందరికీ స్నాక్స్ పంచిపెట్టా. మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు అందులోకి ఎంత ఎక్కువ మందిని లాగితే పనిష్మెంట్ అంత తక్కువ ఉంటుంది. సో అలా నా క్రైమ్లో అందర్నీ పార్టనర్స్ని చేసేశా. ముందురోజు స్నాక్స్ పంచటంతో పేపర్లను తీసుకొచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. అలాగే నా బ్యాంక్ బాలెన్స్ .. ఐ మీన్ కిడ్డీ బ్యాంక్ బాలెన్స్ కూడా పెరిగింది. బ్యాట్కి సరిపోయే డబ్బులు వచ్చేశాయని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు మేటర్ ప్రిన్సిపాల్ మేడమ్కి తెలిసింది. ప్రేయర్లో మా గ్యాంగ్ని పిచ్చికొట్టుడు కొట్టింది.పరువు పోయింది. అప్పటికీ పరువు కంటే పైసలే ముఖ్యమని గట్టిగా ఫిక్స్ అయ్యా! మేడమ్కి నా దగ్గరున్న మనీ గురించి చెప్పలేదు. లక్కీగా నా ఫ్రెండ్స్ అందరూ మాథమేటిక్స్లో వీక్. దాంతో నా దగ్గర ఎంత డబ్బున్నదీ ఎవరికీ తెలీలేదు. ‘ఎందుకలా చేశావ్?’ అని అడిగింది ప్రిన్సిపాల్ మేడమ్. ఆ క్షణంలో నా బ్రెయిన్ మెర్క్యురీలా పని చేసింది. ‘ఆ రోజు అల్బర్ట్ ఐన్స్టీన్ బర్త్డే.. ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియక అలా చేశా’ అని చెప్పా. మా ప్రిన్సిపాల్ ఫిజిక్స్ టీచర్ అవటంతో నన్ను కొట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయింది. కేకు తెప్పించి నాతోనే క్లాస్లో కట్ చేయించింది. నేను ఎవరినయినా మేనిప్యులేట్ చేయగలనని తెలిసింది. ఆ రోజు ఈవెనింగ్ డబ్బు లెక్క పెట్టా.. బ్యాట్కి సరిపోయేన్ని ఉన్నాయి. అంతే ఫుల్ జోష్ వచ్చింది. ఈలోపు మా చెల్లికి మలేరియా జ్వరమని తేలింది. పండగలు ఏవీ లేకపోవటంతో మా నాన్నకి బిజినెస్ సరిగా జరగలేదు. అసలు డబ్బు లేదు. ఎవర్ని అప్పు అడగాలో తెలియని పరిస్థితి. ఆ టైమ్లో నా చెల్లి కంటే నాకేదీ ఎక్కువ కాదనిపించింది. ఉన్న డబ్బు మొత్తంలో అయిదువందలు మా నాన్నకి ఇచ్చేశా. ఆ డబ్బు ఎక్కడిదని అడిగే స్థితిలో లేడు నాన్న. అమ్మ అడిగితే దాచుకున్న డబ్బని చెప్పా. ఆ క్షణంలో అమ్మ, నాన్న నన్ను ఒక హీరోని చూసినట్టు చూశారు. జీవితంలో ఫస్ట్ టైమ్ ఒక హీరోలా ఫీల్ అయ్యా. నా దగ్గర ఇంకా మనీ ఉండటంతో బ్యాట్ కొనటానికి చైనా బజార్కి వెళ్లాం. అరవై అయిదు రూపాయలకి మీడియం సైజు చెక్క బ్యాట్ ఇచ్చాడు. హ్యాపీగా ఆదివారం గ్రౌండ్లో తెగ క్రికెట్ ఆడాం. మా దగ్గర వికెట్స్ లేకపోవటంతో వాటి స్థానంలో ఒక బండరాయిని నిలబెట్టాం. మా ఫ్రెండ్ నిఖిల్æఅవుట్ అవగానే బ్యాట్ను ఆ బండరాయికి ఒరిగించి వెళ్లబోతుండగా.. ఆ బండ కాస్తా బ్యాట్ మీద పడి బ్యాట్ రెండు ముక్కలయింది. అప్పుడు అర్థమయింది నాకు ఆ షాప్కి చైనా బజార్ అనే పేరు ఎందుకు పెట్టారో! నా ఫ్రెండ్ నిఖిల్ని ఒక్కొక్కరు ఒక్కో మాటన్నారు. నేను మాత్రం ఏమీ అనలేదు. కళ్లతోనే థ్యాంక్స్ చెప్పాడు నిఖిల్. సెకండ్ టైమ్ హీరోలా ఫీలయ్యా. ఏదైతేనేం ఉన్న కొంచెం సంతోషం కూడా విరిగిపోయింది. ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్ కంపెనీ యాడ్ వచ్చింది.. అజయ్.. మార్నింగ్ నన్ను షాప్లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు. రాకేశ్ అండ్ విక్రమ్ కూడా! ‘చాక్లెట్స్ కొంటే ఆ రాపర్స్ వెనుక రన్స్ ఉంటాయని, ఆరయాభై పూర్తిచేసి, చెప్పిన అడ్రస్కి కొరియర్ చేస్తే.. సెల్ఫోన్, క్రికెట్ బ్యాట్ ఇంకా చాలా గిఫ్ట్స్తోపాటు ధోనీని కలుసుకునే అవకాశం’ అనేది ఆ యాడ్ సారాంశం. అందులో క్రికెట్ బ్యాట్ తప్ప నాకింకేదీ ఇంపార్టెంట్ అనిపించలేదు. మళ్లీ నా మైండ్ మెర్క్యురీలా వర్క్ చేయటం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అందరినీ వీలైనన్ని చాక్లెట్స్ కొనమని చెప్పా. ఆ రాపర్స్ని నేను కలెక్ట్ చేయసాగాను. ఎవరు దేనికి మనీ ఇచ్చినా ఆ చాక్లెట్స్నే కొనసాగాను. రాపర్స్ని చూసి ‘అవెందుకు?’ అడిగింది అమ్మ. ఆ యాడ్ చూపించా అమ్మకు. నవ్వుతూ ‘ఇప్పుడు రాపర్స్ కలెక్ట్ చేసి పంపితే బ్యాట్ వస్తుందా’ అని అడిగింది. వస్తుందని చాలా నమ్మకంగా చెప్పా. మొత్తానికి నా ఫ్రెండ్స్, నేను.. అందరం కలిసి యాభై రన్స్ అయితే చేశాం. ఇక నా బాధ చూడలేక అమ్మ ఆ చాక్లెట్ రాపర్స్ అన్నీ ప్యాక్ చేసి వాళ్లు చెప్పిన అడ్రస్కి పోస్ట్ చేసింది. నా ఆనందానికి అవధుల్లేవు.. మంచి బ్యాట్ రాబోతోందని! మా పోస్ట్మన్ని రోజూ అడగడమే నాకేమైనా పార్సిల్ వచ్చిందా.. అని! అలా దాదాపు రెండు నెలలు అతని వెంటబడ్డా! నేనతణ్ణి అడిగిన ప్రతిసారీ అతను నన్ను ఏం పార్సిల్ అంటూ ఎదురు ప్రశ్న వేసేవాడు. నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే దొంగ ఎదుటివారినెప్పటికీ నమ్మడు. నాకు వచ్చే బ్యాట్ని అతను తీసేసుకుంటాడేమోనని నా అనుమానం. అలా రెండు నెలలు గడిచాయి. ఎలాంటి రిప్లయ్ రాలేదు. దాంతో నేను రాపర్స్ పంపిన అడ్రస్కి వారం వారం లెటర్లు రాయటం మొదలుపెట్టా. ఈలోపు నాన్నకు బిజినెస్ అవకపోటంతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఊరు మారాల్సి వచ్చింది. నా బాధ వర్ణనాతీతం. ఆఖరికి మా ఫ్రెండ్స్కి, మా పక్కింటి అక్కకి.. నా పేరు మీద పార్సిల్ వస్తే తీసుకుని పెట్టుకొమ్మని చెప్పా! ఊరు మారిపోయాక కూడా మా పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి.. చాలాసార్లు అడిగా పార్సిల్ ఏమైనా వచ్చిందా అని! ఆ క్రికెట్ బ్యాట్ వస్తుందని నేను చుసిన ఎదురుచూపులు కలిగించిన బాధ మాటల్లో చెప్పలేను. అలా నా బాల్యంలో నన్ను అంతలా ఎమోషనల్ డ్యామేజ్ చేసిన ఆ చాక్లెట్ కంపెనీ పేరు మహాలాక్టో! ఆ సంఘటన తర్వాత జీవితంలో ఆ చాక్లెట్ను ముట్టుకోలేదు’ అని చెప్పా.ఇదంతా విన్న మా ఫ్రెండ్స్ కళ్లల్లో నీళ్లు తిరగడం గమనించా. అవతలి వాళ్ల బాధ విని కన్నీళ్లుపెట్టుకునే∙మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అనుకున్నా. ‘కెలెడియోస్కోపిక్ మెమోరీస్’ అంటే మనం ఆ పర్టిక్యులర్ సందర్భంలో చాలా బాధ అనుభవించి ఉంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎవరికైనా ఆ జ్ఞాపకాలు చెప్పినప్పుడు చాలా ఫన్నీవేలో చెప్తాం’ అంటూ మా ఫ్రెండ్స్ని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించా. ఈలోపు ఫుడ్ రావటంతో నేను, అజయ్ ఇద్దరం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లాం. çఫుడ్ తీసుకుని వెనక్కి వస్తుండగా మా అపార్ట్మెంట్ వాచ్మన్ కొడుకు టిన్ను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ‘ఎందుకు ఏడుస్తున్నాడు?’ అని మా వాచ్మన్ని అడిగా. ‘ఇవాళ వాడి బర్త్డే .. గిఫ్ట్గా క్రికెట్ బ్యాట్ కొనివ్వమని ఏడుస్తున్నాడు’ అని చెప్పాడు వాచ్మన్. మరుసటిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్లేటప్పుడు నా దగ్గరున్న క్రికెట్ బ్యాట్స్లో ఒకటి టిన్నుకి గిఫ్ట్గా ఇచ్చా. వాడి కళ్లల్లో కనపడిన ఆనందం మాటల్లో చెప్పలేను. వాడు నన్నో హీరోలా చూశాడు. వాడి జీవితంలో నన్నెప్పుడూ హీరోలానే గుర్తుపెట్టుకుంటాడు అనే ఆలోచన నాకూ ఆనందాన్నిచ్చింది. టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లి నాకు నేను క్రికెట్ బ్యాట్ని ప్రెజెంట్ చేసుకోలేకపోవచ్చు. కానీ టిన్నుకు ఇచ్చి.. ఆ హ్యాపీనెస్ని మాత్రం సొంతం చేసుకున్నా! ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్ కంపెనీ యాడ్ వచ్చింది.. అజయ్.. మార్నింగ్ నన్ను షాప్లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు. రాకేశ్ అండ్ విక్రమ్ కూడా!మా కాలనీలో ఉన్న డాక్టర్స్ టీమ్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీమ్కి ప్రతి శనివారం క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఫీమేల్ ఆడియన్స్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్ మ్యాచ్కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. -
వనరుల బంగారం.. బయ్యారం
బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఆ గుడులు ఇప్పుడు వాడుకలో లేవు.బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. చెరువు మట్టి మహత్యంబయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని టైల్స్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్ టైల్స్ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్ టైల్స్ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్ టైల్స్ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్ బ్రాండ్, ప్లోయింగ్ బిట్స్, సెంటర్ టైల్స్ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది.ఇనుపరాతి గుట్టతెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఖనిజాలుబయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. ఉద్యమాలకు నెలవునాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్బండారి వీరన్న, సాక్షి, బయ్యారంమురళీ మోహన్, ఫొటోగ్రాఫర్ -
పిల్లల కథ: విజయపురిలో విశ్వనాథుడు
విజయపురిలో విశ్వనాథుడనే పండితుండేవాడు. ఆయన వద్ద పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. ఆయన వాటిని చదవడమేగాక జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. అంతేగాక తను కూడా కావ్యాలను రాస్తుండేవాడు. అయితే పేదరికం ఆయన్ను బాగా పీడిస్తుండేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆయనకు అనారోగ్యం చేసింది. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు నాటువైద్యుడు. పట్టణంలో వైద్యం అంటే డబ్బుతో పని. ఆయన భార్యకేమీ పాలుపోలేదు. డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియ లేదు. దిగాలుగా ఉన్న ఆమెతో పక్కింటామె ‘మీ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు బోలెడున్నాయికదా! ఊళ్లో వాటినెవరికయినా అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో పట్టణంలో వైద్యం చేయించవచ్చు’ అన్నది. ‘ఈ ఊళ్లో గ్రంథాలు కొని, చదివే వాళ్లున్నారా?’ అని సందేహపడింది పండితుడి భార్య. ‘అది నిజమేకానీ ప్రయత్నిస్తే తప్పులేదు కదా!’ అంది పక్కింటామె. ఆ ఉపాయం నచ్చి, తాళపత్ర గ్రంథాలను భుజానికెత్తుకుని ఊరంతా తిరిగింది పడింతుడి భార్య. ఒక్కరూ ఒక్క గ్రంథం కొన్న పాపాన పోలేదు. నొప్పి పెడుతున్న భుజాలతో చివరకు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి అనంతయ్య ఇంటికి వెళ్లింది. ‘మా ఇంట్లో చదివేవారు ఎవరూలేరమ్మా! అలా అని నేను కాదంటే నీ అవసరం తీరేదెలా? నేనీ పుస్తకాలు కొనను కానీ, తాకట్టు పెట్టుకుంటాను. మీకు ధనం సర్దుబాటు కాగానే నా బాకీ తీర్చి, మీ గ్రంథాలను మీరు తీసుకుపొండి’ అన్నాడు. ఆ మాటకు పండితుడి భార్య సరేనంది. ఆమెకు కావలసిన పైకం ఇచ్చి, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా దాచి పెట్టాడు వడ్డీ వ్యాపారి. ఆ ధనంతో భర్తకు వైద్యం చేయించింది. త్వరలోనే ఆయనకు నయమైంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్నేలే ఆనందవర్ధనుడు.. కొడుకు అలోకవర్ధనుడికి పట్టాభిషేకం చేశాడు. అలోకవర్ధనుడికి గ్రంథపఠనం అంటే మహా ఇష్టం. తన పఠనానికి అనుకూలంగా అంతఃపురంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజ్యమంతటా గ్రంథ సేకరణకు చాటింపు వేయించాడు. గ్రామాల నుంచి పాత తాళపత్ర గ్రంథాలున్నవారంతా రాజధానికి వచ్చి తమ వద్ద ఉన్న గ్రంథాలను ఇవ్వసాగారు. వడ్డీవ్యాపారి అనంతయ్య తన దగ్గరున్న గ్రంథాలను రాజుకు ఇవ్వలేదు. ఆనోటా ఈనోటా ఆ విషయం రాజుగారి చెవిన పడింది. ఆయన భటులను పంపి అనంతయ్యను సభకు రప్పించాడు. గ్రంథాల గురించి అడిగాడు.‘గ్రంథాలు నా దగ్గరున్న మాట వాస్తవమే ప్రభూ! అయితే వాటికి నేను యజమానిని కాదు. అవి ఒక పండితుడివి. అతని వైద్యానికి అవసరం అయితే వాటిని నా వద్ద తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చాను. గ్రంథాలను తాకట్టు పెట్టుకోవడం మీకు కొత్తగా ఉండవచ్చు. నేను అలా ఎందుకు చేశానంటే.. నేనిచ్చే« ధనం వల్ల పండితుడికి వైద్యం లభించడమే కాదు, అలా ఆ గ్రం«థాలను భద్రపరచడం వల్ల అవి భవిష్యత్ తరాలకూ అందుతాయని ఆలోచించాను. అందుకే వాటిని తాకట్టు పెట్టుకున్నాను’ చెప్పాడు వడ్డీవ్యాపారి. అతని పెద్ద మనసుకు రాజు ఎంతగానో సంతోషించాడు. తనకు అవసరం లేకపోయినా భవిష్యత్లో చదువరులకు గ్రంథాలను అందించాలన్న ఆలోచనతోపాటు, సాటి మనిషిని ఆదుకోవాలన్న మంచి మనసు కూడా వ్యాపారికుండటం అలోకవర్ధనుడిని ఆనందపరచింది. పండితుడి అప్పును రాజు తీర్చడమేకాక, ఆ వ్యాపారికి ‘గ్రంథమిత్ర’ అనే బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించాడు. తరవాత పండితుడి భార్యనూ సన్మానించి, ఆ పండితుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు రాజు. ఆ గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి చేర్చి, జాగ్రత్త చేశాడు. -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్ఫార్మర్కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ వంటి వారు సైతం న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
జన్నత్ జుబైర్ రహమానీ
యాక్ట్రెస్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె హోమ్ టౌన్ ముంబై. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ్యూజిక్ వీడియోస్లో కూడా పర్ఫార్మ్ చేసింది. 2017లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. వ్లాగ్స్, మేకప్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్కు దాదాపు యాభై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లిప్ సింక్ వీడియోలతో జన్నత్ టిక్టాక్లోనూ పాపులర్ అయింది. మన దగ్గర టిక్టాక్ బ్యాన్ అయ్యాక, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ అందులో ఫేమస్ అయిపోయింది. ఆమె ఇన్స్టాకి దాదాపు అయిదుకోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్కి తెలియజేయడానికి "Jannat Zubair Rahmani Official" అనే యాప్నీ లాంచ్ చేసింది జన్నత్. ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకుంది. -
బాలల జీవన మందిరం
పోగూరి చంద్రబాబు, తిరుపతి సిటీ అమ్మ, నాన్నల అండతో.. ఆప్యాయతానురాగాల నీడన .. కుటుంబ బలంతో జీవితానికి బాట వేసుకునే అవకాశం ఉండటం నిజంగానే అదృష్టం!అమ్మ, నాన్నల్లేని అనాథలకూ అలాంటి అదృష్టాన్ని కల్పిస్తోంది ఎస్వీ బాలమందిరం! తిరుపతి, భవానీనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం.. నా అన్నవారు లేని బాలలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు తానున్నానంటూ ఆశ్రయమిచ్చి ఆదుకుంటోంది! ప్రేమ, వాత్సల్యాలను పంచుతూ.. విద్యాబుద్ధులు అందించి వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అందులో విద్యనభ్యసించిన పిల్లలు నేడు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వ్యాపారవేత్తలుగానూ ఎదిగారు. టీటీడీలో నాలుగో తరగతి ఉద్యోగాల నుంచి సూపరింటెండెంట్, డీఈఓ స్థాయి వరకు విధులు నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమం నుంచి ఎస్వీ బాలమందిరంగా..టీటీడీ తొలి ఈఓ అన్నారావు 1943లో టీటీడీ అనాథాశ్రమ పాఠశాలను ప్రారంభించారు. ఆదిలోనే ఇది నాటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ దృష్టిని ఆకట్టుకుంది. ఆయన 1962లో బడిని సందర్శించి ‘చిల్డ్రన్స్ ఆఫ్ లార్డ్ వేంకటేశ్వర’ అని పిలవడంతో అదికాస్త ఎస్వీ బాలమందిరంగా మారింది. 2005 నుంచి సుమారు 500 మంది అనాథ పిల్లలు బాలమందిరంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిని అధికారులు శ్రీవారి పిల్లలుగానే భావిస్తూ సేవలు అందిస్తున్నారు. బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా..మాది శ్రీకాళహస్తి, తొట్టంబేడు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. మా అవ్వ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. అది అమ్మ, నాన్న లేని లోటును తీర్చడమే కాకుండా చక్కగా చదువు చెప్పించింది. భరతనాట్యంలోనూ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అన్నీ టీటీడీ అధికారుల అండదండలతోనే పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరు కోటక్ మహీంద్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. – బి గుర్రమ్మక్వాలిటీ మేనేజర్గా..మాది చిత్తూరు జిల్లాలోని మోర్దాన్ పల్లి. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. నాన్న పోవడంతో అమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకో అన్న. కూలీ పనులకు వెళ్లేవాడు. నన్ను మా మేనమామ ఎస్వీ బాలమందిరంలో చేర్పించారు. పది వరకు అక్కడే చదివాను. డిగ్రీ తర్వాత మయాన్మార్లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ రావడంతో వెళ్లాను. ఆ వర్క్ ఎక్స్పీరియెన్స్తో బెంగళూరులో క్వాలిటీ మేనేజర్గా ఆఫర్ రావడంతో తిరిగొచ్చేసి అందులో జాయిన్ అయ్యాను. – రాజేష్మేనేజర్గా..మా స్వస్థలం తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు. చిన్నతనంలోనే అమ్మ, నాన్న దూరమయ్యారు. మా అమ్మమ్మ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. పదవ తరగతి వరకు అక్కడే ఉన్నాను. వారి సహకారంతోనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీఏ చేశాను. ఇప్పుడు యూఎస్ఏలో ఓ ఎమ్ఎన్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. – జి.ఇంద్రజయూరాలజిస్ట్గా..శ్రీకాళహస్తి మండలం, పల్లాం మా సొంతూరు. నా చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. నాకో అన్న. మా బాబాయ్ హెల్ప్తో ఎస్వీ బాలమందిరంలో చేరాను. టెన్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. ఎమ్సెట్లో ఫ్రీ సీట్ సాధించాను. కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ తర్వాత యూరాలజీలో స్పెషలైజేషన్ చేశాను. ప్రస్తుతం నెల్లూరులోని ఓ పేరొందిన హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మాలాంటి ఎంతో మందిని ఆదరించి మంచి భవిష్యత్తును ప్రసాదించిన ఎస్వీ బాల మందిరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – డాక్టర్ వై. యువరాజుఆంట్రపెన్యూర్గా.. మా సొంతూరు రెడ్డిగుంట. మేం ముగ్గురం పిల్లలం. నా తొమ్మిదేళ్ల వయస్సులో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. మమ్మల్ని మా బంధువులు ఎస్వీ బాలమందిరంలో చేర్చారు. ఎంబీఏ చేశాను. వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఐస్క్రీమ్ ఔట్లెట్స్ను ప్రారంభించాను. చెన్నై కేంద్రంగా ఎమ్ అండ్ ఎమ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఐస్క్రీమ్ షాపులు, ఔట్లెట్స్ ఉన్నాయి.హెయిర్ సెలూ¯Œ లనూ నడుపుతున్నాం. సుమారు వందమందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. బాలమందిరంలోని పదిమంది స్నేహితులకూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం! ఆ బడి మాకు అమ్మలాంటిది. – వి లోకేష్ -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
మీరే ఆదర్శం.. మీ మద్దతే ముఖ్యం!
టీనేజ్ అనేది టీనేజర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా సవాలే! వాళ్ల ఎదుగుదలను చూసి సంతోషం, గర్వం ఒకవైపు... వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి, దారి తప్పకుండా ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలు మరోవైపు. ఓపెన్నెస్– పరిమితుల మధ్య, అధికారం– సహానుభూతి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు తప్పవు. అందుకే ఈ వయసులో తల్లిదండ్రుల మద్దతు వారి అభివృద్ధినెలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. కమ్యూనికేషన్ డైనమిక్స్ఢ స్వతంత్రం కోసం తపిస్తారు. అదే సమయంలో వాళ్ల తల్లిదండ్రులు తమ అదుపు తప్పకూడదని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పేరెంట్స్ చెప్పే మాటలను టీనేజర్లు పట్టించుకోరు. అది తమను తిరస్కరించినట్లుగా భావిస్తారు. ఇదే ఘర్షణలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు జడ్జిమెంట్ లేకుండా వినడం అవసరం. అప్పుడే తల్లిదండ్రులు తమను అర్థం చేసుకున్నారని ఫీలవుతారు. వివాదాలు సహజం..కౌమారంలో తమదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ, స్వతంత్రాలను ప్రదర్శించడం అవసరమని టీనేజర్లు భావిస్తారు. ఈ క్రమంలో హెయిర్ స్టయిల్ నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకు, సిద్ధాంతాల నుంచి లైఫ్ స్టయిల్ వరకు, స్నేహాల నుంచి నైటవుట్ల వరకు తరాల మధ్య అంతరాలు ఉంటాయి. మరోవైపు పిల్లలు చేయిదాటిపోతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. వారి ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంటారు. కఠిన నియమాలు అమలు చేయాలని చూస్తుంటారు. ఈ విషయంలో టీనేజర్లు, పేరెంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇది సహజం. ఇందులో ఆందోళన పడాల్సిన పనిలేదు. భావజాల ఘర్షణలు..కౌమారంలో భావజాలం పరిపూర్ణంగా అభివృద్ధి చెందదు. టీనేజర్లు తీవ్రమైన భావజాలానికి సులువుగా ఆకర్షితులవుతారు. తమ భావాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన పద్ధతులు ఇంకా వారికి తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు కోపం లేదా అసహనాన్ని ప్రదర్శించడం వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పిల్లలు అసహనం చూపినప్పుడు తల్లిదండ్రులు కూడా అసహనం చూపకుండా శాంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. టీనేజర్లతో కలిసి కూర్చుని, చర్చించి హద్దులను నిర్ణయించాలి. అది వారిలో బాధ్యతను పెంచుతుంది. మీ మద్దతే వారి ఆత్మవిశ్వాసం... తల్లిదండ్రుల మద్దతు టీనేజర్లలో ఆత్మవిశ్వాసం, సహనాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వయస్సులో పీర్ ప్రెషర్, అకడమిక్ ప్రెషర్ లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు వారి భావాలను, ఆలోచనలను అంగీకరిస్తూ మద్దతు ఇవ్వడం ద్వారా టీనేజర్లు భద్రత, నమ్మకం పొందుతారు, తద్వారా వారు ఈ సవాళ్లను అధిగమించడానికి తగిన ధైర్యాన్ని తెచ్చుకుంటారు. పరిశోధనల ప్రకారం తల్లిదండ్రుల మద్దతు గట్టిగా ఉన్న కౌమారులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.మీరే ఆదర్శం... టీనేజర్లు తమ తల్లిదండ్రులను అనుకరించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులు గౌరవమర్యాదలు, జాగ్రత్త, సానుకూల దృక్పథం, నైతికత, పట్టుదలను ప్రదర్శించడం ద్వారా వారికి శక్తిమంతమైన ఉదాహరణలుగా నిలుస్తారు. టీనేజర్లు ఆ విలువలను చూసి, వాటిని తామూ అమలు చేస్తూ సవాళ్లను ఎదుర్కొనే విధానంలో పాజిటివ్గా ఉంటారు.బంధం బలపడాలంటే... ⇒ కలిసి భోంచేయడం, షికారుకు వెళ్లడం, సినిమాలు చూడటం వంటి మామూలు పనులు చేయండి. ఇది ఒత్తిడిలేని పరస్పర బంధానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ⇒ఎప్పుడూ చదువు, కెరీర్ గురించే మాట్లాడకుండా, అప్పుడప్పుడూ వారి ప్రపంచంపై ఆసక్తి చూపండి. వారికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్ బ్యాండ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా తరాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించవచ్చు. ⇒ఎప్పుడూ వారి గదిలోకి దూరిపోకుండా, వారి స్పేస్, ప్రైవసీని గౌరవించండి. అది వారు అటానమీని అభివృద్ధి చేసుకోవడానికి అవసరం. ⇒ఏదైనా గొడవ వచ్చినప్పుడు కోపంతో తిట్టకుండా, తప్పు పట్టకుండా... ‘నీ ప్రవర్తనకు నేను బాధపడుతున్నాను’ లాంటి ‘ఐ స్టేట్మెంట్స్ వాడండి. అది డిఫెన్సివ్ నెస్ను తగ్గిస్తుంది. ⇒వారు చేసిన పొరపాట్లను పక్కకు నెట్టేసి, వారి విలువను, ప్రేమను గుర్తుచేసేలా మాట్లాడండి. దాంతో మీరు వారిని అంగీకరించారనే భద్రతను పొందుతారు. -
వామదేవుడి వృత్తాంతం
పూర్వం పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకనాడు అతడు గుర్రమెక్కి వేట కోసం అడవికి వెళ్లాడు. అనేక మృగాలను వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో, దానిని మేతకు విడిచిపెట్టాడు. అందమైన అడవి పరిసరాలను పరిశీలిస్తూ అలా ముందుకు నడవసాగాడు. ఒకచోట అతడికి ఒక అందగత్తె కనిపించింది. ఆమెను చూడగానే రాజు మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా అతడిని చూసి, నర్మగర్భంగా నవ్వుతూ తన వలపును ప్రకటించింది.పరిక్షితుడు ఆమెను ‘సుందరీ! నువ్వెవరివి? క్రూరమృగాలు తిరిగే అడవిలో ఎందుకిలా ఒంటరిగా సంచరిస్తున్నావు?’ అని అడిగాడు.‘రాజా! నా పేరు సుశోభన. నా తండ్రి అనుమతితో వరాన్వేషణ కోసం బయలుదేరాను. మార్గమధ్యంలో ఈ అడవి ఎదురైంది’ అని బదులిచ్చింది. ‘సుందరీ! నా పేరు పరిక్షితుడు. ఇక్కడకు దగ్గరలోని అయోధ్యకు రాజును. నీకు అభ్యంతరం లేకుంటే, నిన్ను పెళ్లాడతాను’ అంటూ మనసులోని మాటను తెలిపాడు.‘రాజా! నీతో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నన్ను జలక్రీడల కోసం మాత్రం ఎన్నడూ నిర్బంధించనంటేనే పెళ్లికి సిద్ధపడగలను’ అంటూ షరతు విధించింది. ఆమె షరతుకు పరిక్షితుడు అంగీకరించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని, హాయిగా జీవించసాగారు. ఒకరోజు ఉద్యానవనంలో భార్యతో సల్లాపాలాడుతుండగా, పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. కాసేపు జలక్రీడలాడి సేదదీరాలని తలచి, ఉద్యానవనంలో ఉన్న కొలనులోకి దిగాడు. అందులో ఈదులాడుతూ, తనతో జలకాలాడాలంటూ భార్యను పిలిచాడు. ఆమె నవ్వుతూ వచ్చి, కొలనులోకి దిగి, వెంటనే అదృశ్యమైపోయింది. అనుకోని ఈ పరిణామానికి పరిక్షితుడు దిగ్భ్రాంతుడయ్యాడు. భార్య కోసం కొలనంతా గాలించాడు. ఆమె కనిపించలేదు. భటులను పురమాయించి, కొలనులోని నీటినంతటినీ తోడి పోయించాడు. కొలను అడుగున కప్పలు తప్ప మరేమీ కనిపించలేదు. కప్పలే తన భార్యను తినేసి ఉంటాయని భావించిన పరిక్షితుడు కప్పలపై కోపం పెంచుకున్నాడు. రాజ్యంలోని కప్పలన్నింటినీ వెదికి చంపమంటూ భటులను ఆదేశించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రాజ్యంలోని నీటితావులన్నీ గాలించి, కప్పలను వెదికి చంపి కుప్పలుగా పోయడం ప్రారంభించారు. కప్పలపై పరిక్షితుడి కక్ష విపరీతంగా మారుతుండటంతో కప్పలరాజు అయిన ఆయువు ఒక మహర్షి రూపంలో వచ్చి, కప్పల మీద ద్వేషానికి కారణమేమిటని అతడిని అడిగాడు. తన ప్రియురాలిని అదృశ్యం చేయడం వల్లనే కప్పలను చంపుతున్నానని పరిక్షితుడు బదులిచ్చాడు. అప్పుడు కప్పలరాజు ఆయువు తన నిజరూపంలో పరిక్షితుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పరిక్షితుడు ప్రేమించిన సుశోభన తన కూతురేనని చెప్పి, ఆమెను రప్పించి అప్పగించాడు. ఆమె ఎందరో రాజులను తన వలపుతో మోసం చేసిందని, అందువల్ల ఆమెకు పుట్టే కొడుకులు మోసగాళ్లవుతారని శపించాడు. కూతురికి హితవు చెప్పి వెళ్లిపోయాడు. పరిక్షితుడు, సుశోభనలకు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పెద్దవాడైన శలుడికి రాజ్యం అప్పగించి, పరిక్షితుడు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. శలుడు ఒకనాడు బంగారు రథంపై అడవికి వేటకు వెళ్లాడు. ఒక లేడి కనిపిస్తే, దానిని బాణంతో కొట్టాడు. బాణం దెబ్బతిన్న లేడి పరుగు లంకించుకుంది. శలుడు ఆ లేడి వెనుకనే రథాన్ని పరుగు తీయించాడు. లేడి వేగాన్ని రథాశ్వాలు అందుకోలేక పోయాయి. శలుడు విసుగు వ్యక్తం చేశాడు. ‘రాజా! వామ్యజాతి అశ్వాలైతే రథాన్ని అద్భుతమైన వేగంతో ఉరుకులెత్తించగలవు. వామ్యజాతి అశ్వాలు ఈ ప్రాంతంలో వామదేవుడు అనే మహర్షి వద్ద ఉన్నాయి’ అని చెప్పాడు రథసారథి. శలుడు రథాన్ని వామదేవుడి ఆశ్రమానికి మళ్లించమని ఆదేశించాడు. ఆశ్రమం చేరుకోగానే, శలుడు రథం దిగి, నేరుగా ఆశ్రమం లోపలకు వెళ్లాడు. వామదేవుడికి నమస్కరించి, వామ్యజాతి అశ్వాలను తనకు ఇవ్వమని కోరాడు. పని పూర్తయిన తర్వాత తిరిగి తనకు ఇచ్చేయాలనే షరతు మీద వామదేవుడు ఆ అశ్వాలను శలుడికి అప్పగించాడు. శలుడు వాటిని తన రథానికి పూన్చి, వేటాడాడు. వేట పూర్తయ్యాక ఆ అశ్వాలను వామదేవుడికి అప్పగించకుండా, తన కోటకు తోలుకుపోయాడు. నెల్లాళ్లు గడిచినా అశ్వాలను ఇవ్వకపోవడంతో వామదేవుడు అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుల్లో ఆత్రేయుడనే వాడిని శలుడి వద్దకు పంపాడు. అశ్వాలను ఇవ్వను పొమ్మనడంతో ఆత్రేయుడు గురువు వద్దకు వచ్చి, జరిగిన సంగతి చెప్పాడు. ఈసారి వామదేవుడు స్వయంగా వెళ్లాడు. ‘రాజా! మాట నిలబెట్టుకో! పరద్రవ్యాపహరణం పాపహేతువు అవుతుంది’ అని హెచ్చరించాడు. శలుడు అతడి మాటలు పట్టించుకోకుండా, ‘బ్రాహ్మణులకు అశ్వాలు ఎందుకు? కావాలంటే, గోవులు, ఎద్దులు గాని, కంచరగాడిదలు గాని రెట్టింపు సంఖ్యలో ఇస్తాను’ అన్నాడు. ‘విప్రుల సొమ్ము అపహరించడమే కాకుండా, దానికి బదులుగా మరొకటి ఇస్తాననడం దురహంకారం’ అన్నాడు వామదేవుడు. అహం దెబ్బతినడంతో శలుడు మండిపడ్డాడు. ‘ఈ మునిని బంధించి శూలాలతో పొడిచి చంపండి’ అని ఆదేశించాడు. వామదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. అతడి మంత్ర ప్రభావంతో వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చారు. వారు శలుడిపైకి లంఘించి, అతణ్ణి చంపేశారు. శలుడి తర్వాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొన్నాళ్లయ్యాక వామదేవుడు మళ్లీ వెళ్లి తన గుర్రాలను తిరిగి ఇచ్చేయమని అడిగాడు. వామదేవుడిని విషబాణంతో చంపడానికి ధనుస్సు తీసుకుని, బాణాన్ని ఎక్కుపెట్టాడు. వామదేవుడి మంత్రప్రభావంతో అతడి చేతులు స్తంభించిపోయాయి. నలుడు నివ్వెరపోయాడు. వామదేవుడి ముందు తలవంచి, క్షమాపణలు కోరాడు. వామదేవుడు ప్రసన్నుడై, అతడిని స్తంభన నుంచి విముక్తుణ్ణి చేశాడు. నలుడు వామదేవుడి అశ్వాలను తిరిగి అప్పగించాడు. వామదేవుడు వాటితో తన ఆశ్రమానికి వెళ్లాడు.∙సాంఖ్యాయన -
జుంబారే మొంబాసా!
కార్నివాల్ అంటే బ్రెజిల్లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి. బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్కి వెళ్ళి ఆర్డర్కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్దీప్ మా ఫ్లాట్కి మేము బయలుదేరాము. ఫ్లాట్కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
ఈవారం కథ: మ్యావ్
తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు! నన్ను చూడగానే తత్తరపడ్డాడు. ‘పాడు పిల్లి’ అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు! అసలు పిల్లి ఎదురొస్తే ఈ ఛాందసులు ఎందుకు ఇంతగా భయపడి చస్తారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేం!వాడి సంగతి వదిలేసి కలుగు దగ్గరకు వెళ్లి కాచుకు కూర్చున్నాను. ‘ఈరోజు నా చేతిలో ఈ ఎలుకగాడి పని సఫా! ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు’ అనుకున్నాను. ఏమాత్రం శబ్దం చెయ్యకుండా కామ్గా వున్నాను. అదను కోసం వేచి చూస్తున్నాను. ఈ ఎలుకగాడు ఏ టైముకి బైటకు వస్తున్నాడో ముందుగానే రెక్కీ నిర్వహించాను. ఆఫీసులకు అందరూ బైల్దేరి పోగానే వీడు బైటకొస్తున్నాడు. ఆ టైములో ఆడవాళ్ళు ఇంకా పనుల బిజీలోనే వుంటారు. కేరేజీలు కట్టి ఇచ్చాక తీరిగ్గా మిగిలిన పనులు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆ టైములో వాళ్ళు వంటగదిని వదిలి బైటకు వస్తారు. అదే సరైన సమయం. ఆ సమయంలో వంటగదిలోకి జొరబడగలిగితే వీడికి ఏదో తిండి దొరుకుతుంది. అదీ వాడి ప్లాన్! కానీ నా ప్లాన్ నాకుంది. సరిగ్గా ఆ సమయంలోనే వాడి కలుగు దగ్గరకు పోయి గప్ చుప్గా కూర్చున్నాను. నేను ఊహించినట్టే ఎలుకగాడు బైటికి వస్తున్న చప్పుడయింది. నేను అలర్టయ్యాను. వాడి దుంపతెగ.. తల బైటికి పెట్టి నన్ను చూసేసి వెంటనే మళ్ళీ కలుగులోకి తుర్రుమన్నాడు! నేను అప్పటికీ పంజా విసిరాను. కానీ ఏముంది? పంజాకి మట్టి తగిలింది.. ఎలుకగాడు తప్పించుకున్నాడు! ఇంక ఈరోజుకి వాడు నాకు దొరకడు. నేను ఇక్కణ్ణుంచి వెళ్తే తప్ప వాడు లోపల్నుంచి బైటకు రాడు! నాకు పిచ్చి కోపం వచ్చింది. అంతే కాదు, ఇంకో ఊహ కూడా వచ్చింది. వచ్చేటప్పుడు ఆ దరిద్రపుగొట్టు మొహం గాడు ఎదురుపడ్డం వల్లే ఇలా జరిగిందేమో? నేను ఎదురుపడ్డం వల్ల వాడికేమీ జరిగుండదు కానీ నాకు మాత్రం నా తిండి చేజారిపోయింది. అంటే నేను ఎదురుపడ్డం వల్ల వాడికి నష్టం కాదు, వాడు ఎదురుపడ్డం వల్ల నాకే దరిద్రం! ఇలా ఆలోచించుకుంటూ మళ్ళీ ‘ఛా.. ఇదేమిటి మరీ నేను మనుషుల్లా ఆలోచిస్తున్నాను? వాళ్ళ అజ్ఞానపు ఆలోచనా తీరు నాకు తగులుకుంటోందేమిటి? వాడి వల్ల నాకెందుకు నష్టం జరుగుతుంది? ఈ ఎలుకగాడు మరీ స్మార్ట్ అవడం వల్లే నాకు తిండి దొరకలేదు.. అంతే!’ అనుకున్నాను. నిరాశగా వీధిలోంచి వెళ్తూ వుంటే సుబ్బారాయుడు కన్పించాడు. ఈ సుబ్బారాయుడ్ని అందరూ ‘పిల్లికి కూడా బిచ్చం పెట్టడు’ అంటారు. అతను పరమ పిసినారి అని చెప్పడానికి మధ్యలో మా పేరెందుకు వాడుకుంటారో నాకర్థం కాదు. అసలు మాకు బిచ్చం పెట్టకపోతే పోనీ గానీ వున్నంతలో వాడు మంచి బట్ట కట్టి, మంచి తిండి తింటే చాలు! కానీ దానిక్కూడా ఎంతో ఆలోచిస్తాడు వాడు. అసలు ఈ మనుషులు తరతరాలకి సరిపడా దాచుకోవాలని ఎందుకంత తాపత్రయపడతారో అర్థం కాదు. మమ్మల్ని చూసి ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో?! ఏ జంతువైనా సరే.. తన పిల్లలు కాస్త ఎదిగేవరకు, స్వయంగా ఆహారం సంపాదించుకునే వరకూ మాత్రమే వాటిని పోషిస్తుంది. తర్వాత వాటి తిండి అవే సంపాదించుకోవలసిందే! మనుషుల్లో మాత్రం తాతలు, తండ్రులు సంపాదిస్తే జల్సాగా ఖర్చు చేస్తూ కష్టపడకుండా హాయిగా బతికేవారు బోలెడు మంది కనిపిస్తారు. ఏదో ఆలోచించుకుంటూ నా బసకు వెళ్తున్నాను. పక్క వీధి చివర ఒక పాడుబడిన ఇల్లుంది. అందులోనే నా నివాసం! ఎదురుగా ఒక సరుకుల వ్యాన్ వెనకాల ఫుల్ లోడ్తో వస్తోంది. ఎవరివో ఇంటి సామాన్లు తీసుకెళ్తున్నారు. ఇటువైపు నుంచి ఏదో ఆటో వస్తుండటంతో ఆ ఇరుకుదారిలో వ్యాన్ని ఒక పక్కకు తీసి ఆపారు. డ్రైవర్ పక్కన రామాంజనేయులు గారు కూర్చున్నారు. ఆయన ఇల్లు మారుతున్నారని నాకర్థమైంది. ‘ఈ ఇల్లు మారడమంత దరిద్రం మరొకటి లేదు. ఇంకాస్త పెద్ద ఇల్లు చూసుకుందాం అని మావాళ్ళు ఒకటే పోరుపెట్ట బట్టి మారక తప్పడం లేదు.. గొప్ప యాతన ఇది!’ ధుమధుమలాడుతూ అన్నాడాయన. అసలీ మనుషులకు అన్నీ సమస్యగానే కనిపిస్తాయి. చక్కగా అన్ని గదులతో అమరివున్న ఇంట్లో వున్నా కూడా వారికి సంతృప్తి వుండదు. అలాగని ఇల్లు మారడం కూడా వాళ్లకి పెద్ద సమస్యే! ఏ విషయాన్నైనా భూతద్దంలో పెట్టి చూసి ఏవో లోటుపాట్లు ఎంచుతారు. మరి ఇల్లే లేని మా పరిస్థితి ఏమిటి? మా జాతిలో పిల్లలు చిన్నవిగా వున్నప్పుడు వాటిని సురక్షితంగా వుంచడానికి ఆ తల్లి ఎన్ని పాట్లు పడుతుందో, ఎన్నిసార్లు స్థలాన్ని మారుస్తుందో నాకు తెలుసు. వెళ్ళేదారిలో అదృష్టవశాత్తు కాస్త తినదగిన ఆహారం ఏదో దొరికింది. దాంతో అది తిని నా బసకు వెళ్లాను. కడుపు నిండా తిండి దొరకడంతో కంటి నిండా నిద్రొచ్చింది. పడుకుని లేచేసరికి బైట ఏవో మాటలు వినబడుతున్నాయ్. బైటికి వచ్చాను. ఎదురింటి అరుగు మీద ఎవరో ఇద్దరు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ‘గేదెను కొనడానికి సంతకు ఎళ్ళినోడివి నీతో పాటు ఆ శంకుగాణ్ణి ఎందుకు తీసుకెళ్ళావ్? ఆడితో పెమాదం! ఎక్కువకి బేరమాడి కొనిపించేస్తాడు. నిజానికి అక్కడి మారు బేరగాళ్ళతో ఈడికి లాలూచీలు వున్నాయి. బేరం సెట్ చేసినందుకు తర్వాతెళ్లి ఆళ్ళ దగ్గర కమీషన్ లాగుతాడు. నాక్కూడా తెలీదు గానీ మొన్న నేను మా తమ్ముడింట్లో కార్యానికి గొర్రెపోతుల్ని కొనడానికెళ్తే పిలవకపోయినా నాతో పాటు తోడొస్తానని వొచ్చాడు. పోతుల్ని కొని ఇంటికి తెచ్చాక తెలిసింది ఈడి నిర్వాకం. అక్కడ నన్ను ఎరిగిన మనిషొకడు తర్వాత కనిపించి ఈడి విషయం సెప్పాడు. ఎప్పుడూ ఈణ్ణి ఎంటబెట్టుకు రావొద్దని కూడా సెప్పాడు’ అందులో ఒకడు పక్కవాడితో అన్నాడు.‘అయితే నేను కూడా మోసపోయానేమో.. ఎక్కువ ఇచ్చేస్తున్నానని అనిపించింది గానీ వీడే పక్కనుంచి మంచి బేరం.. మంచి గేదె.. ఇంతకంటే తక్కువకి రాదు అని ఊదరగొట్టి కొనిపించాడు. అసలు సంగతి ఇదా?’ పక్కవాడు కోపం, ఉక్రోషం కలిసినట్టుగా అన్నాడు.‘మరింకేటనుకున్నావ్.. నన్నయినా అడిగావు గాదు.. నీకు తోడు వద్దును కదా.. పెళ్ళికి ఎళ్తూ పిల్లిని సంకనబెట్టుకు ఎళ్లినట్టు ఆణ్ణి తీసుకెళ్ళావ్’ అన్నాడు మొదటివాడు. చెప్పొద్దూ.. వాళ్ళ సంభాషణ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. వెళ్లి ఆ సామెత చెప్పిన వాణ్ణి గోళ్ళతో రక్కేద్దునా.. అనిపించింది. ఎవడో ఏదో వెధవపని చేస్తే మధ్యలో మమ్మల్నెందుకు తీసుకువస్తారు? బాగా అనువైపోయాం వీళ్ళకి!చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయాను. కాసేపయ్యాక కాలు నిలవక మళ్ళీ బైటికొచ్చాను. ఎదురింటి అరుగు మీద కూర్చున్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడే కనుచీకటి పడుతోంది. వీధి లైట్లు వేసినట్టున్నారు. అవి గుడ్డిగా వెలుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక బక్కచిక్కిన ముసలి వ్యక్తి ఎదురింట్లోకి వెళ్ళడం గమనించాను. ఆ ఇంట్లో వుండే సుబ్బారాయుడు ఏదో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి ఉద్యోగమంటే నా ఉద్దేశం అందర్నీ తన చుట్టూ తిప్పుకునే ఉద్యోగం! అతను పెన్షన్లు మంజూరు చెయ్యడం, రిటైరైన వారి పాత బకాయిలు విడుదల చెయ్యడం లాంటి పనులు చూసే సీట్లో వున్నట్టున్నాడు. అందువల్ల పాపం ముసలీ.. ముతకా అతని చుట్టూ తిరిగి, అతను అడిగిన డబ్బులు సమర్పించుకుని తొందరగా తమ పని చేసిపెట్టమని వేడుకుంటారు. ఈ వేళప్పుడు అతని ఇంటికి వచ్చేవారంతా అలాంటివారే! ఈ ముసలాయన కూడా అలాంటి బాపతే లాగుంది. దర్శనం ఇచ్చే దేవుడిలాగా బైట వున్న పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చుని వున్నాడు సుబ్బారాయుడు. ఈ బక్కచిక్కిన శాల్తీ కూడా అతని ముందు నిలబడి ఏదో విన్నవించుకుని, ఆపైన మరేదో సమర్పించుకుని దణ్ణాలు పెడుతూ బైటపడ్డాడు. ఈ సుబ్బారాయుడు రోజూ ఉదయాన్నే పెద్ద గొంతేసుకుని అవేవో స్తోత్రాలు చదువుతూ దేవుణ్ణి తెగ పూజిస్తాడు. అవన్నీ నాకు వినబడుతూనే వుంటాయి. సాయంత్రమయితే తనే ఇలా వరాలిచ్చే దేవుడి అవతారమెత్తుతాడు. ఇక్కడ ఎవడి డ్యూటీ వాడు చెయ్యడానికి కూడా లంచాలు కావాలి! పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ అవినీతిపరుల్లో చాలామంది గొప్ప దైవభక్తులు! తాము చేసే వెధవ పనులు దేవుడు చూడ్డం లేదులే అనుకుంటారో ఏమిటో తెలీదు. వాళ్ళు చేసే పూజలు భగవంతుడు చూసి సంతృప్తి చెంది వరాలిస్తాడనీ, ఈ తప్పుడు పనుల్ని మాత్రం పట్టించుకోడనీ వాళ్ళ నమ్మకం! పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడ్డం లేదని అనుకుంటుందని మామీద సెటైర్లు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్లకి ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. వీళ్ళు ఏదో ఒకరోజు దెబ్బతినిపోకుండా వుంటారా? అని కసిగా అనుకున్నాను. కానీ అంతలోనే పిల్లి శాపనార్థాలకు కూడా ఫలితం వుంటుందా? అనే మాట గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది. మర్నాడు ఉదయం మామూలుగానే ఆహారవేటకు బైల్దేరుతుండగా పక్కవీధిలో వుండే నల్లపిల్లిగాడు వచ్చి నా ఎదురుగా నిలుచున్నాడు. వాడెందుకు నా డెన్కు వచ్చాడో నాకస్సలు అర్థం కాలేదు. ‘ఏంటి మావా ఇలా వచ్చావ్? నీది రాజభోగం కదా.. ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు గేటు లోపలున్న నిన్ను చూస్తుంటాను. కనీసం ఎవరినీ పట్టించుకోవు. అయినా మాలాంటి వీధి పిల్లులంటే నీకెందుకు లెక్కుంటుందిలే.. ఎంతైనా నువ్వు పెంపుడు పిల్లివి కదా! ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చావు?’ కాస్త ఆశ్చర్యంతోనూ, కొంత అసూయతోనూ అడిగాను.వాడు విషాదంగా నవ్వి ‘ఏం చెప్పమంటావు మావా.. నా యజమాని నన్ను చాలా బాగా చూసుకునేవాడు. బైట పిల్లులతో అస్సలు కలవనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లగా వుండగా బుజ్జిగా వున్న నన్ను చూసి ముచ్చట పడి తెచ్చుకున్నాడు. వాడు కూడా మన వూరి నల్లరాయి కొండలాగా కారునలుపుగా వుండడం కారణమేమో తెలీదు గానీ నా నల్లరంగంటే వాడికి మహా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ నల్లరంగే నా కొంపముంచింది. ఎవడో తలకుమాసినవాడు నల్లపిల్లి ఇంట్లో వుంటే అరిష్టం అని చెప్పాడట! అంతేకాదు.. నల్లపిల్లుల్ని మంత్రగత్తెలు పెంచుకుంటారు అని కూడా చెప్పాడట. అంతే! మా యజమాని నన్ను వున్నపళంగా బైటికి గెంటేశాడు!’ విచారంగా చెప్పాడు.మనుషులు మరీ ఇంత మూర్ఖుల్లాగా ఎందుకుంటారో నాకెప్పటికీ అర్థం కాదు. అయినా ఈ నల్లపిల్లిగాడిని ఎదురుగా చూస్తూండేసరికి మళ్ళీ వాడి పూర్వపు ప్రవర్తన గుర్తొచ్చి మంటెక్కింది.‘వీడి తస్సాదియ్యా.. వీడు ఎంత పోజు కొట్టేవాడు? బాగా అయిందిలే..’ అనుకున్నాను. కానీ ఎంతైనా సాటి పిల్లే కదా అని జాలి కలిగింది. ఈ మనుషులు ఎంత తొందరగా బంధాల్ని తెంచుకుంటారు? అనిపించింది. ‘సరే. చేసేదేముంది? నువ్వూ ఇక్కడే వుండు. దొరికిందేదో తిని బతుకుదాం’ అన్నాను.ఆ నల్లపిల్లిగాడు అప్పట్నుంచి నా డెన్లోనే వుంటున్నాడు. వాడు అంతవరకూ పెంపుడు పిల్లిగా వుండటం వలన ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం రాలేదు. వాడు వున్న ఇంట్లో ఎలుకలు కూడా లేకపోవడం వల్ల వేటాడాల్సిన పని లేకపోయింది. దాంతో వాడు వేటాడటంలో నైపుణ్యాన్ని కూడా కోల్పోయాడు. అందువలన వాడికి నేనే ఆహారం సంపాదించి పెట్టాల్సివచ్చింది. సరే.. పోనీ అని నేను కూడా వాడిని బాగానే చూసుకుంటున్నాను. వేటాడటం, ఆహార సంపాదనలో వాడు కాస్త రాటుదేలేవరకూ నేనే అండగా వుంటానని కూడా మాటిచ్చాను.కానీ ఏం లాభం? నేను ఆశ్రయమివ్వడం కాదు గానీ వాడు నాకే ఎసరు పెట్టే పని చేశాడు. నాకెంతో ప్రియమైన నా డాళింగ్ పిల్లికి వాడు లైనెయ్యడం మొదలుపెట్టాడు. నా డాళింగ్ పిల్లి ఎదురింట్లోనే వుంటుంది. అది ఎదురింటి వాళ్లకి ప్రియమైన పెంపుడు పిల్లి! అసలు ఈ దిక్కుమాలిన ఇంట్లో ఏమీ సౌకర్యంగా లేకపోయినా ఇక్కడ వుంటున్నది ఎదురింట్లో వుంటున్న నా డాళింగ్ పిల్లి కోసమే! ఈ నల్లపిల్లి గాడొచ్చి మొత్తం సీన్ రివర్స్ చేశాడు. ఒళ్ళంతా తెల్లగా మెరిసిపోయే వెంట్రుకలతో, లేతాకు పచ్చని కళ్ళతో ఎంతో అందంగా వుండే నా డాళింగ్ పిల్లి ఇప్పుడు వాడి మాయలో పడింది. వాడి వైపే కులుకులొలికిస్తూ చూస్తోంది. నల్లపిల్లి గాడు నిన్న మొన్నటి వరకూ పెంపుడు పిల్లే కదా.. బహుశా పెంపుడు పిల్లులకు ఒకేరకమైన అభిరుచులు, ఆలోచనలు వుంటాయేమో మరి?!నల్లపిల్లిగాడంటే నాకు ద్వేషం మొదలైంది. ఇప్పుడు వాడి ఆహారం వరకూ వాడే తిప్పలు పడుతున్నాడు. ఆ పని అవగానే అవతల నా డాళింగ్ పిల్లి గేటు లోపల తచ్చాడుతుంటే వీడు బైట నిల్చుని దానికి సైట్ కొడుతున్నాడు. నాకు లోపల్నుంచి ఉక్రోషం తన్నుకొస్తోంది. అంతకుముందు మా చూపులు కలిసేవి గానీ ఈ నల్లపిల్లిగాడు సీన్లోకి వచ్చిందగ్గర్నుంచీ నా డాళింగ్ పిల్లి నావైపు చూడ్డమే మానేసింది. నాలాంటి కేరాఫ్ ఫ్లాట్ ఫామ్ గాడికి నా డాళింగ్ పిల్లి మనసులో చోటు లేదేమో! అయినా ఇప్పుడు నల్లపిల్లి గాడు కూడా పెంపుడు పిల్లి కాదు కదా.. నా దగ్గరే పడి వుంటున్నాడు. ఏదేమైనా ఈ విషయం నా గుండెను రగిలిస్తోంది. తప్పకుండా ఏదో ఒకటి చేసి నా డాళింగ్ పిల్లి ప్రేమను సొంతం చేసుకోవాలి.. ఈ నల్లపిల్లి గాడిని ఎలాగైనా నా దారి నుంచి తప్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను.ఆలోచించగా ఒక మంచి పథకం తట్టింది. రోజూ సాయంత్రం నా డాళింగ్ పిల్లిని బైట లాన్లో వదులుతారు. అది స్వేచ్ఛగా అక్కడ తిరుగుతుంది. ఆ టైములోనే ఈ నల్లపిల్లిగాడు అక్కడక్కడే గేటు బైట తచ్చాడుతాడు. మళ్ళీ ఆ పిల్లి ఇంటి లోపలికి వెళ్లిపోయాకే మా నల్లపిల్లిగాడు తిరిగి మా ఇంటికొస్తాడు. ఆ వచ్చేదారిలో బాట పక్కనే ఒక పెద్ద కాలువ వుంది. వర్షాకాలం కావడం మూలాన అది పొంగి ప్రవహిస్తోంది. నల్లపిల్లిగాడు వచ్చేటప్పుడు నేను సరిగ్గా మధ్యలో వున్న చెట్టు పక్కనే నక్కి నిల్చుంటాను. వాడు నన్ను గమనించలేడు. నా దగ్గరికి రాగానే అదాటున వాడి మీద పడి కాలవలోకి తోసేస్తాను. అందులో పడి కొట్టుకుపోతాడు. అక్కడితో వాడి పీడ నాకు విరగడవుతుంది. ఈ ఆలోచన వచ్చిన దగ్గర్నుంచీ నాకు ఒకటే ఆత్రుతగానూ, కొంత ఆందోళనగానూ వుంది. ఆందోళన అంటే మరేం లేదు.. నేను అనుకున్నది సరిగ్గా జరుగుతుందా? లేదా? అని! ఆ సాయంత్రం చెట్టు పక్కన నిల్చున్నాను. నా గుండె కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. అప్పుడప్పుడూ దారి వైపు తొంగి చూస్తున్నాను. కాసేపయ్యేసరికి నల్లపిల్లిగాడు ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను అలర్టయ్యాను. వాడు నోటితో ఏదో గిన్నె కరుచుకుని వస్తున్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తొంగిచూశాను. సరిగ్గా అప్పుడే నల్లపిల్లిగాడు నన్ను చూసేశాడు. గిన్నె కిందన దించి ‘మావా.. ఇలారా’ అని కేకేశాడు. చేసేదేమీలేక వాడి దగ్గరకు వెళ్లాను. ‘రాణీ లేదూ.. ఏం చేసిందనుకున్నావ్?’ ఉత్సాహంగా అన్నాడు. రాణి అంటే నా డాళింగ్ పిల్లి పేరు.‘ఏం చేసింది?’ నిరాసక్తంగా అడిగాను‘దానికి పెట్టిన తిండి గిన్నెను నోట కరుచుకుని గేటు కింద నుంచి నాకు అందించింది. నన్ను తినమంది. నేనేం చేశాననుకున్నావ్? వెంటనే ఆ గిన్నెను నోట కరుచుకుని చక్కా వచ్చాను. చూశావా.. చిన్న చిన్న చేపలు! ఇలాంటివి మనకెక్కడ దొరుకుతాయి? అందుకే నీకోసమే ఎత్తుకొచ్చాను. నేను తిండి సంపాదించుకోలేనప్పుడు నువ్వే నాకు తిండి పెట్టి బతికించావు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మావా.. అందుకే ఈ తిండి నీకోసమే తీసుకొచ్చాను.. తిను..’ నావంకే ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నల్లపిల్లిగాడు. నా బుర్ర తిరిగిపోయింది. అరె.. వీణ్ణి నేను ఎంత అపార్థం చేసుకున్నాను? కాలవలో తోసి చంపాలనుకున్నాను. నేనసలు పిల్లినేనా? నేను కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నానేమిటి? అయినా నేను రాణికి లైన్ వేస్తున్నట్టు వీడికి తెలీదు కదా! అంచేత వాడి పాట్లేవో వాడు పడుతున్నాడు. అందులో తప్పేముంది? నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించి వాడి మీద కక్ష పెంచుకున్నాను. ఛీ.. ఛీ.. నాదీ ఒక జంతువు జన్మేనా? మనిషి కంటే దిగజారిపోయాను! నామీద నాకే అసహ్యం వేస్తోంది.‘ఏవిటి మావా అలా వుండిపోయావ్? తిను మావా..’ మళ్ళీ అన్నాడు వాడు.‘కాదులే.. ఇవి మనిద్దరం కలిసి తిందాం. మన స్నేహానికి గుర్తుగా ఈ చేపలవిందు చేసుకుందాం’ అన్నాను. వాడు సంతోషంగా తలూపాడు. ఇద్దరం కలిసి ఆ చేపల్ని ఇష్టంగా తింటున్న సమయంలో నేను మరోసారి గుర్తు చేసుకున్నాను, నేను మనిషిని కాదు.. పిల్లిని! ఇక ఎప్పటికీ మనుషుల్లాగా ఆలోచించకూడదు అని!∙ -
ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది. చిందర వందరగా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు గందరగోళంగా ఉంటారు. ఇంటిని ఒద్దికగా సర్దుకోవడం ఒక కళ. ఇంటి నిండా రకరకాల పనులు చేయడానికి మనుషులు ఉంటారు కాబట్టి సంపన్నుల ఇళ్లు మాత్రమే చక్కగా ఉంటాయి అనుకుంటే పొరపాటే! మనసుంటే, సామాన్యులు కూడా ఇంటిని శుభ్రంగా, చూడచక్కగా తీర్చిదిద్దు కోగలుగుతారు. ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దుకునే పద్ధతులపై జపానీస్ యువతి మేరీ కొండో చెబుతున్న పాఠాలు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. మేరీ కొండో ముద్దుపేరు ‘కోన్మారీ’. ఇల్లు సర్దుకోవడంలో ఈమె సూచించిన పద్ధతి ‘కోన్మారీ’ పద్ధతిగా ప్రసిద్ధికెక్కింది. కోన్మారీ కథ, ఆమె పద్ధతి కమామిషూ తెలుసుకుందాం..జపాన్లోని ఒసాకా నగరంలో పుట్టిన మేరీ కొండోకు ఇంటిని చక్కగా సర్దుకోవడం అంటే ఐదేళ్ల వయసు నుంచే ఇష్టమైన వ్యాపకంగా ఉండేది. ఆ వయసు పిల్లలు బొమ్మలతో ఆటలాడుతుంటే, ఆమె మాత్రం ఇల్లు సర్దడంలో తలమునకలుగా ఉండేది. అప్పట్లో జపాన్ మాత్రమే కాదు, పలు ఇతర దేశాల్లోనూ చైనీస్ వాస్తు పద్ధతి ‘ఫెంగ్ షుయి’ వేలంవెర్రిగా ఉండేది. ఇంచుమించుగా ‘ఫెంగ్ షుయి’లాంటి ‘ఫు సుయి’ అనే పురాతన పద్ధతి జపాన్లో వాడుకలో ఉంది. ఇంటి అలంకరణలో మేరీ కొండో తల్లి ‘ఫు సుయి’ పద్ధతులు అనుసరించేది. చిన్నారి కొండో అదంతా గమనిస్తూ ఉండేది. ఊహ తెలిసి, కొంత ఎదిగిన తర్వాత ఇంటిని ఒద్దికగా సర్దుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి కేవలం ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ వంటి పద్ధతులు సరిపోవని గుర్తించింది. ఇంటిని మరింత ఒద్దికగా, చూడముచ్చటగా సర్దుకోవడంలో తనదైన శైలిలో ప్రయోగాలు మొదలుపెట్టి, అద్భుతమైన ఫలితాలను సాధించింది. అలా మొదలైందిమేరీ కొండో చిన్నప్పటి నుంచి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని చాలా ఇళ్లను గమనిస్తూ వచ్చేది. ఇల్లు సర్దుకోవడంలో తన ఇంటి చుట్టుపక్కల జనాలు అనుసరించే పద్ధతులను నిశితంగా పరిశీలించేది. ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ పద్ధతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ అలంకరించిన ఇళ్లను కూడా చూసేది. ఇవన్నీ చూసినా, ఆమెకు వాటిలో ఏదో లోపం ఉన్నట్లే అనిపించేది. తన ఇంట్లోనే తల్లికి చేదోడుగా ఇంటిని చక్కగా సర్దుకోవడంలో రకరకాల ప్రయోగాలు చేసేది. జూనియర్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్వెల్లో పిల్లలంతా ఆడుకోవడానికి బయట మైదానంలోకి వెళితే, మేరీ కొండో మాత్రం తరగతి గదిలోని పుస్తకాల షెల్ఫులను చక్కగా సర్దిపెట్టేది. ఆమె పనికి టీచర్ల ప్రశంసలు లభించేవి. తాను ఉన్న పరిసరాలను శుభ్రంగా, చూడచక్కగా సర్దుకోవడం అప్పట్లోనే ఆమెకు వ్యామోహంగా మారింది. ఒకనాడు స్కూల్లోని పుస్తకాల షెల్ఫులను నిర్విరామంగా సర్దుతుండగా, విశ్రాంతి లేకపోవడం వల్ల స్పృహతప్పి పడిపోయింది. రెండు గంటల తర్వాత ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటనే తన జీవితాన్ని మలుపు తిప్పిందని మేరీ కొండో చెబుతుంది. ‘ఆ రోజు పుస్తకాల షెల్ఫులు సర్దుతుండగా, స్పృహ తప్పిపోయాను. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఏం జరిగిందో అర్థంకావడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. ఇల్లు, స్కూలు సర్దుకోవడంలో నేను అప్పటి వరకు చేస్తూ వచ్చిన పొరపాటు నాకు తెలిసి వచ్చింది. అప్పటి వరకు పనికిరానివి పారేస్తూ, కొద్దిపాటి వస్తువులను చూడముచ్చటగా కనిపించేలా సర్దుతూ వచ్చేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతిని మార్చుకున్నాను. పారవేయాల్సిన వస్తువుల పనిపట్టడం బదులుగా, అట్టే పెట్టుకోవలసిన వస్తువులను ఎలా సర్దుకోవాలనే దానిపై దృష్టిపెట్టడం మొదలుపెట్టాను. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే వస్తువులను కంటికి ఇంపుగా కనిపించేలా సర్దుకోవడం ప్రారంభించాను’ అని చెబుతుందామె. బడి చదువు పూర్తయ్యాక మేరీ కొండో టోక్యో విమెన్స్ క్రిస్టియన్ యూనివర్సిటీలో సోషియాలజీ చదువుకుంది. ఆ తర్వాత ఒక షింటో ఆలయంలో అటెండెంట్గా ఐదేళ్ల పాటు సేవలందించింది. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక పూర్తి స్థాయిలో ఇల్లు, బడి, ఆఫీసు వంటివి చక్కగా సర్దుకునే పద్ధతులపై సలహాలు, సూచనలు ఇవ్వడాన్నే వృత్తిగా మార్చుకుంది.సంతోషాల వెలుగుమేరీ కొండో వస్తువులను చక్కగా సర్దుకోవడంలో కనిపెట్టిన పద్ధతి ‘కోన్మారీ’గా పేరు పొందింది. జపానీస్ భాషలో ‘కోన్మారీ’ అంటే సంతోషాల వెలుగు అని అర్థం. వస్తువులను త్వరగా, చూడముచ్చటగా, పరిపూర్ణంగా ఎలా సర్దుకోవాలో చెప్పే ఈ పద్ధతికి జపాన్లోనే కాకుండా, మరో ముప్పయి దేశాలలో అనతికాలంలోనే జనాదరణ పెరిగింది. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన పరిసరాల్లో మన సంతోషాన్ని పెంచే వస్తువులను చూడముచ్చటగా సర్దుకోవడం, మనకు ఏమాత్రం సంతోషం కలిగించని వాటిని వదుల్చుకోవడమే ‘కోన్మారీ’ పద్ధతి. ‘కోనామారీ’కి ఆదరణ పెరగడంతో మేరీ కొండోపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు దృష్టి సారించాయి. కొన్ని చానళ్లు ఆమెతో ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. ఇంకొన్ని ఆమెతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రేటింగులను పెంచుకున్నాయి. ఒక టీవీ చానల్లో ప్రసారమైన ‘స్పార్కింగ్ జాయ్ విత్ మేరీ కొండో’ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభించింది. వస్తువులను సర్దుకోవడంపై మేరీ కొండో ఇప్పటి వరకు ఆరు పుస్తకాలు రాసింది. అవి చాలా భాషల్లోకి అనువాదం పొందాయి. లక్షలాది కాపీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. షింటో బోధనల స్ఫూర్తితో తాను ‘కోన్మారీ’ పద్ధతికి రూపకల్పన చేసినట్లు మేరీ కొండో చెబుతుంది. ‘కోన్మారీ’ పద్ధతి చాలా సరళమైనది. ఇంట్లోని వస్తువులను రకాల వారీగా విభజించుకోవడం ఇందులోని మొదటి ప్రక్రియ. అంటే, దుస్తులు, పుస్తకాలు, కాగితాలు, పాత్రలు, డబ్బాలు– ఇలా ఒక్కోరకం వస్తువులను ఎంపిక చేసుకుని, ముందుగా ఒకచోట పోగు పెట్టాలి. తర్వాత వాటిలో మనకు పనికొచ్చే వాటిని, మనకు సంతోషం కలిగించే వాటిని ఏరుకుని, వాటిని పొందికగా సర్దుకోవాలి. పనికిరాని వాటిని పారేయాలి. ఇంతే! ఈ పని చేస్తే చాలు, ఇంటి తీరుతెన్నులే మారిపోతాయి. ఇంట్లోకి అడుగుపెడుతూనే ప్రశాంతంగా అనిపిస్తుంది. జపాన్ నుంచి అమెరికాకుమేరీ కొండో ఒసాకోలోనే పనిచేసే కవాహరా తకుమిని 2012లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కవాహరా ఒసాకోలోని ఒక కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేసేవాడు. ‘కోన్మారీ’కి ఆదరణ పెరిగి మేరీ కొండో కెరీర్ నిలదొక్కుకున్నాక కవాహరా ఉద్యోగం మానేసి, భార్యకు పూర్తిస్థాయి మేనేజర్గా మారాడు. తర్వాత ఈ దంపతులు ‘కోన్మారీ’ మీడియా సంస్థను నెలకొల్పారు. కవాహరా మీడియా సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మేరీ కొండో సంస్థకు చెందిన సృజనాత్మక వ్యవహారాలను చూసుకుంటోంది. సంస్థను మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు అమెరికా చేరుకున్నారు. తొలుత శాన్ఫ్రాన్సిస్కోలో కొన్నాళ్లు ఉన్నాక, తర్వాత లాస్ ఏంజెలెస్కు మకాం మార్చి, ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అమెరికాకు తరలిపోయిన తర్వాత ‘కోన్మారీ’కి పాశ్చాత్య ప్రపంచంలో ఆదరణ బాగా పెరిగింది. మేరీ కొండో ‘యూట్యూబ్’లోను, ‘ఇన్స్టాగ్రామ్’లోను పెడుతున్న వీడియోలకు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘కోన్మారీ’ పద్ధతిలో ఇల్లు సర్దుకోవడం చాలా సులువు. ఈ పద్ధతిలో ఒద్దికగా ఇంటిని సర్దుకున్నట్లయితే, ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్లుగా ఉంటుంది.కోన్మారీ చిట్కాలుఒక టీవీ కార్యక్రమంలోమేరీ కొండో చెప్పిన చిట్కాలు ఇవి:⇒ఇల్లు ఎలా ఉంటే ఇంట్లో సౌకర్యంగా, సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందో ఊహించండి. మీ ఊహలను అమలు పెట్టడానికి ప్రయత్నించండి.⇒ఇంట్లో ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వని వస్తువులు పడి ఉంటే, వాటిని వదుల్చుకోండి. దానివల్ల కొంత చోటు ఖాళీగా మిగులుతుంది. ఇల్లు విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.⇒ప్రతి వస్తువుకు దానిదైన చోటును నిర్దేశించుకోండి. ఆ వస్తువు అక్కడే ఉండేలా సర్దుకోండి.⇒అలాగని తక్కువ చోటులో ఎక్కువ దుస్తులను పట్టించాలనే ప్రయత్నంలో వాటిని కుక్కేయకండి. వాటిని జాగ్రత్తగా మడతపెట్టి, తిరిగి సులువుగా వాడుకునేలా సర్దుకోండి.⇒బాగా సంతోషాన్ని ఇచ్చే వస్తువులను ఇంట్లోకి అడుగుపెడుతూనే కనిపించేలా పొందికగా సర్దుకోండి.⇒నిలువుగా ఎక్కువ అరలతో ఉండే వార్డ్రోబ్లలో మడతపెట్టిన దుస్తులను సర్దిపెట్టుకోండి. దానివల్ల చాలా చోటు కలిసొస్తుంది.⇒గోడలకు ఫొటో ఫ్రేములు, చిత్రపటాలు అతిగా వేలాడదీయకండి. పూలకుండీలను ఇరుకిరుకు మూలల్లో ఉంచకండి. -
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..ముంబైలో పుట్టిపెరిగిన రిద్ధికి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఉండేది. ఆ మక్కువనే కెరీర్గా మలుచుకోవాలని కాలేజ్ డేస్లో నిర్ణయించుకుంది. డిగ్రీ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, లండన్కి వెళ్లి ఫ్యాషన్ కోర్సు చేసింది. ముంబైకి తిరిగొచ్చి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమీ పటేల్ దగ్గర ఇంటర్న్గా చేరింది. ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి పేరు ఉంది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ అమీ ఫేవరిట్! అందుకే ఆమె దగ్గర ఇంటర్న్గా వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది రిద్ధి. పనిలో మెలకువలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ స్టయిలింగ్ తీరుతెన్నులనూ బాగా గమనించింది. తనలోని సృజనకు ఆ పరిశీలనను జోడించి ప్రతిభను ప్రదర్శించి, సెలబ్రిటీల దృష్టిలో పడింది. అప్పుడే నటి ప్రియంకా చోప్రా పెళ్లిలో, రిద్ధికి అసిస్టెంట్ స్టయిలిస్ట్గా చాన్స్ దొరికింది. పలువురు బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు సింప్లీ సూపర్బ్ దుస్తులు, వెరీ లైట్ ఆభరణాలతో గ్రాండ్ లుక్ని తెచ్చి..పెళ్లంటే భారీ దుస్తులు, బరువైన నగలే అనుకున్న వారి అభిప్రాయాన్ని మార్చేసింది. తన స్టయిలింగ్తో మ్యాజిక్ చేసింది. అభినందనలు అందుకుంది. తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా ఎంచుకున్నారు. అలా అమీ దగ్గర పనిచేస్తూనే రిద్ధి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా చాన్సెస్ పొందింది. బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలపరచుకుంది. కంఫర్ట్తో పాటు గ్రాండ్ లుక్ నిచ్చే రిద్ధి డిజైన్స్, స్టయిలింగ్ను మెచ్చి ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్స్ ఆమెను తమ పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకున్నారు. ఇంకెందరో వర్ధమాన నటీనటులను స్టయిలిష్ స్టార్స్గా తీర్చిదిద్దుతోంది రిద్ధి. -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్ఓ ప్రతి ఏడు నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్) దినంగా పరిగణిస్తోంది.స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత, స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్లైన్ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్ఫెక్ట్గా లేదని తేలింది ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ (డబ్ల్యూపీఎస్)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్ కనిపించింది. ఇక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్ వయొలెన్స్ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. ‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్ టాప్స్ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్ కామెంట్ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’‘మా అమ్మాయి మంచి అథ్లెట్. కోచింగ్కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్లోనే స్పోర్ట్స్ ఫీల్డ్లో మహామహులు వినేశ్ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’‘నా సీనియర్ మేల్ కొలీగ్ హెరాస్మెంట్ భరించలేక మేనేజర్కి రిపోర్ట్ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్ చేశాడు. దాంతో నా సీనియర్ కొలీగ్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక జాబ్కి రిజైన్ చేశాను!’ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్.. కోల్కత్తా డాక్టర్ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్లైన్లో ఎక్కడైనా.. ఆన్లైన్లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్ఓ! అందుకే ఏటా నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమె¯Œ అండ్ గర్ల్స్) దినంగా జరుపుతోంది. పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. మన దగ్గరున్న మహిళా చట్టాలు...గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి.గృహహింస అంటే..గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్)కి సంబంధం లేదు. గృహహింస కింద కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు (15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.ఈ ‘డే’ వెనుక చరిత్రకరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్ రిపబ్లిక్ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్ రిపబ్లిక్లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్ సిస్టర్స్గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి రఫైల్ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్లోనే పెట్టి, జీప్కి యాక్సిడెంట్ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్ రిపబ్లిక్ ప్రజలు "Las Mariposas.. ద బటర్ఫ్లైస్’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’కి లోగోగా బటర్ఫ్లైనే నిర్ణయించింది యూఎన్ఓ! ‘మీరాబాల్ సిస్టర్స్’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఆ మీరాబాల్ సిస్టర్స్ గౌరవార్థమే యూఎన్ఓ 1999లో నవంబర్ 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్.. 2020లో ‘హండ్రెడ్ విమెన్ ఆఫ్ ద ఇయర్’ సంచికలో చేర్చింది. పాఠ్యాంశం చేయాలికాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్క్రైమ్ ట్రోలింగ్ వద్దే ఆగడంలేదు. మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస నార్మలైజ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్ చార్జ్లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులే అడిషనల్ చార్జ్లో ఉన్నారు.పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి..
అది కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం. ఒక మారుమూల పల్లె. అదిప్పుడు చరిత్రకెక్కుతోంది. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని, ఈ ఊరు చేపట్టిన సేంద్రియ సాగు విధానాలు రైతు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాడిపంట అనే పదానికి అసలైన అర్థం చెబుతున్నారు ఇక్కడి రైతులు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునర్జీవం తీసుకొస్తున్నారు. ఆ ఊరి పురుషులు పొలాలను పర్యావరణహితంగా మారుస్తుంటే.. మహిళలు ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపి అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. దేశానికే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వం ఈ గ్రామాన్ని దుర్గా ఊడ, దుర్గా వాహిని అనే పేర్లతో పిలిచేవారు. ప్రాచీన కవి పుల్ల కవి 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించారన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు సంబంధించిన స్మారక చిహ్నాలు, భవనాలు కనిపిస్తాయిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొట్టి మిర్చి విత్తన తయారీ నుంచి అంతా ఇక్కడే పండిస్తారు. ఈ ఊళ్లో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. రైతులు తాము వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. భారతీయ రైల్వే, సాఫ్ట్వేర్, బ్యాకింగ్, టీచింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, చార్టర్డ్ అకౌటెంట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అతి పురాతన ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయం, మసీదు, చర్చిలతో మతసామరస్యానికి పెట్టింది పేరుగా ఉంది ఈ ఊరు. కరోనా చూపించిన దారిదుర్గాడలో ఎటు చూసినా పచ్చని పొలాలే. ప్రతి ఇంటా గోవులు దర్శనమిస్తాయి. ధాన్యం నుంచి కూరగాయలు, పళ్లు అన్నీ తామే పండించుకుంటూ ఆదాయాన్నే కాదు ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు. ఇక్కడ నదులు, కాలువలు లేకపోవడంతో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు సాగుతోంది. సన్నకారు రైతులే ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మామిడికాయ పచ్చళ్లు, కూరగాయలు, మిర్చి వ్యాపారాలూ అధికమే! అయితే కరోనా ముందు వరకు ఇక్కడ రసాయన ఎరువులనే వాడేవారు. కరోనా వల్ల సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం, ఆం్ర«ధప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వమూ సేంద్రియ సాగుకు పెద్దపీట వేయడంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందీ ఊరు. తొలుత ఒక ఇంట్లో మొదలైన ఈ ఉద్యమం అనతి కాలంలోనే పల్లె అంతా విస్తరించింది. సేంద్రియ ఎరువుల ద్రావణాల తయారీ ఇక్కడ ఓ కుటీరపరిశ్రమగా మారిపోయింది. ఏటీఎం విధానంలో సాగువ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసా లేదు. ప్రకృతి దయ.. రైతుల ప్రాప్తం అన్నట్టు ఉంటుంది. దుక్కి దున్నిన నాటి నుంచి పంట కోసి, ధాన్యాన్ని ఎండబెట్టి మార్కెట్కి తీసుకెళ్లే వరకు ఆదాయం ఉండదు. ఈలోపు ప్రకృతి కన్నెర్రజేస్తే అంతే సంగతులు. అందుకే వ్యవసాయం గాలిలో దీపం లాంటిది అంటారు. అలాకాకుండా నారు వేసిన పదిహేను రోజుల నుంచి రోజూ ఆదాయాన్ని పొందే మార్గాన్ని పట్టుకున్నారు దుర్గాడ రైతులు. దాన్నే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ సాగు అంటున్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల చేత శిక్షణ తీసుకున్నారు. కొంత నేలను సిద్ధం చేసుకుని అందులో ఒకేసారి.. కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు.. పూలు ఇలా 30 రకాలను వేస్తారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ఏదో ఒక కాయగూరో.. ఆకు కూరో.. దుంపలో.. పూలో.. కోతకు వచ్చేస్తాయి. దాంతో ప్రతిరోజూ వాటిని కోసి అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అలా ఏటీఎం సాగు పద్ధతిలో రోజూ ఆదాయాన్ని ఆర్జిస్తూ జనాలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. దీనికయ్యే పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సాగు మీదే పెట్టుబడిగా పెడుతున్నారు చాలామంది రైతులు. కోసిన పంట స్థానంలో మళ్లీ విత్తనాలు వేస్తూ! ఇలా కాలంతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి, నిత్యాదాయం.. వైవిధ్యమైన పంటలుగా సాగుతోంది ఏటీఎం పద్ధతి.చేపలతో చేలకు వైద్యం..వ్యర్థ పదార్థాలతో పంటకు బలాన్నిచ్చే రసాయనాలను తయారు చేయడంలో దుర్గాడ రైతులకు సాటి,పోటీ లేదు. మత్స్యకారులు పక్కన పడేసిన కుళ్లిపోయిన చేపలతో చేలకు చేవనిచ్చే మీనామృతాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేసే ఈ మీనామృతం కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని మొక్కల ఎదుగుదలకు, పూత, పిందె బలంగా మారడానికి వాడుతున్నారు. ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీన్ని తయారీదారులు లీటరు రూ.120 ధరకు విక్రయిస్తున్నారు. పురుగులు, తెగుళ్లపై యుద్ధంపంటలపై దాడి చేసే పురుగులు, తెగుళ్లపై నీమాస్త్రం, బ్రహ్మాస్త్రాలతో ఇక్కడి రైతులు యుద్ధం చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ ఆకులు అలములే! నీమాస్త్రంతో చిన్న చిన్న పురుగులు చనిపోతే, బ్రహ్మాస్త్రంతో ఎంతటి తెగులైనా, పురుగైనా పరారవుతుంది. అంతేకాదు ఉల్లి, మిరప, మజ్జిగ, బెల్లం, గోమూత్రం వంటి వాటితో కషాయాలనూ తయారుచేస్తూ పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా పర్యావరణహితమైన ప్రయోగాలు, ప్రయత్నాలతో నిరంతర ఆదాయాన్ని గడిస్తూ ప్రకృతి సాగులో ప్రపంచానికి స్ఫూర్తి పంచుతోందీ గ్రామం. వ్యవసాయ పాఠశాలగా దుర్గాడ గ్రామం ప్రకృతి సాగుకు పాఠశాలగా మారింది. వ్యవసాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను బ్యాచులుగా విభజించి.. వ్యవసాయ క్షేత్రాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల్లోని రైతులతో వారికి ప్రకృతి సాగులో శిక్షణనిప్పిస్తున్నారు.గోమయంతో ప్రమిదల తయారీ..గోమూత్రంతో కషాయాలు, గోమయంతో ఘన జీవామృతంలాంటి ఔషధాలు తయారు చేస్తున్న దుర్గాడ రైతులు దేశీ ఆవుపేడతో ప్రమిదలు ధూప్స్టిక్స్ వంటివీ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఈ ప్రమిదలలో ఆవునేతితో దీపం వెలిగిస్తే పరిసరాల్లో క్రిమి కీటకాలు నశిస్తాయి. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు.తయారవుతున్న సేంద్రియ ఎరువులుబీజామృతం, జీవామృతం, మీనామృతం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, చిల్లి స్పెషల్ కషాయం మొదలైనవి.పండిస్తున్న పంటలు ఉల్లి, బురియా మిర్చి (పొట్టి మిర్చి, చిన్న రౌండ్ బెల్ రకం మిర్చి), చెరకు, కొబ్బరి, ఆయిల్ పామ్, మామిడి, బొప్పాయి, మినప, పెసర, శనగ, అరటి, వరి, కూరగాయలు, పుచ్చ, నువ్వులు, మునగ మొదలైనవి.మా ఇంటి పంట పదిళ్లకు వంటమా పెరట్లోని ఒక సెంటు స్థలంలో ఏటీఎం పద్ధతిలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టాను. నాట్లేసిన పదిహేను రోజుల నుంచి ఫలసాయం మొదలైంది. ఖర్చు తగ్గడం, నా ఆదాయానికి గ్యారంటీ ఉండటం, మా ఇంటి పంట చుట్టుపక్కల పదిళ్లకు వంట అవటం చూసి మా ఊళ్లోని చాలామంది మహిళలు నాలా ఇంటి పంటను మొదలుపెట్టారు. – ఆకుల కనక సూర్యలక్ష్మి, రైతు, దుర్గాడ.ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను..ప్రకృతి వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఆరెకరాల పొలంలో సేంద్రియ సాగు స్టార్ట్ చేశాను. ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఇంటర్ పూర్తి చేశాను. నా పొలంలోని సేంద్రియ సాగు ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను. వీటికి మంచి గిరాకీ ఉంది. – జీలకర్ర భాను, యువ రైతు, దుర్గాడపరిశీలిస్తున్నారు.. తెలుసుకుంటున్నారుగత ఐదేళ్లలో ఇక్కడ ప్రకృతి సాగు బాగా పెరిగింది. ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు, విదేశీ రైతులు దుర్గాడకు వచ్చి ప్రకృతి సాగును పరిశీలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, ద్రావణాల తయారీని తెలుసుకుంటున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖాధికారి, కాకినాడ -
ఈవారం కథ: ధర్మం
వచ్చే పోయే జనాలతో, బస్సులతో బస్టాండ్ సందడిగా ఉంది. ఎండ చుర్రున కొడుతోంది. వైజాగ్ వెళ్లవలసిన బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. ‘ప్రయాణికులకు గమనిక’ అంటూ ఒకపక్క అనౌన్స్మెంట్, మరోపక్క టీవీలో ప్రకటనల హోరు. కలగాపులగంగా సంభాషణల జోరు. మొత్తానికి అక్కడ అంతా జాతరలా ఉంది. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్లా ఉంది. విరిగిపోయిన కడలి అలల సద్దులా ఉంది. ‘అయ్యా! ఆకలేస్తుందయ్యా.. ధర్మం సేయండయ్యా’ హృదయ విదారకమైన వేదన విని తలతిప్పి చూశాను.సుమారుగా ఓ ముప్పై, ముప్పయి ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఆమెకు. జుట్టంతా తైలసంస్కారం లేక రేగిపోయి చిందర వందరగా ఉంది. మాసిపోయి, అక్కడక్కడ చిరుగులున్న చీర, స్నానం చేసి ఎన్నాళ్లయిందో అనేలా శరీరం మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. కళ్ళలో దీనత్వం, జోడించిన చేతుల్లో వినయం. ‘అయ్యా, ఆకలేస్తుందయ్యా’ నాభిలోంచి వస్తున్న ఆ చిన్న అరుపు గుండెను పట్టి పిండేస్తుంది అనడంలో సందేహమే లేదు. ‘అయ్యా ..’ మరోసారి ఆ బిచ్చగత్తె ప్రార్థనకు ఆలోచనలు ఆపి, ప్యాంట్ వెనుక జేబులో చెయ్యి పెట్టి చేతికి దొరికిన నాణెం తీసి ఆమె చేతిలో వేశాను. ఆమె ఆ నాణెం వైపు చూసి ‘వద్దయ్యా! ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా పెట్టండయ్యా’ నా కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.నా హృదయం ఒక్కసారిగా భారమయ్యింది. ఒక మనిషి మరో మనిషి కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత కష్టం వచ్చుండాలి. ఆత్మాభిమానం చంపుకోవాలి కదా.బస్టాండ్లో పక్కనే ఉన్న హోటల్పై నా దృష్టి పడింది. ‘పదమ్మా, టిఫిన్ కొనిస్తా’నంటూ దారి తీశాను. ‘టిఫిన్ వద్దయ్యా’ మెల్లగా, నీరసంగా అందామె. ‘మయూరోటల్లో బిర్యానీ కావాలేమో మేస్టారూ..’ ఆ పక్కనే బెంచిపై కూర్చొని మమ్మల్నే గమనిస్తున్న ఆసామి పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆయన మాటలకు కిసుక్కున నవ్వారు మరికొందరు.ఆ ఆసామి మాటలకు ఆమె తల మరింతగా భూమిలోనికి వంగిపోయింది.నాకు చాలా బాధేసింది. సాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు గాని, ఇలా వెటకారం చేసే వారంటేనే నాకు ఒళ్ళు మంట. సగటు మనిషిని కదా. కోపం నాలోనే అణచుకొని ‘ఏం కావాలో చెప్పమ్మా’ ఆప్యాయంగా అడిగాను.బస్ కోసం వేచి ఉన్న జనాలకు ఇదో కాలక్షేప వ్యవహారం అయ్యింది. మన గురించి కాకుండా పక్కవారి బాగోగులు, యోగక్షేమాలు, ఏం చేస్తున్నారో? నవ్వుతున్నారా? అయితే ఎలా ఏడిపించాలి? ఏడిస్తే, నిజంగానే ఏడుస్తున్నారా? అనే ఆరాటం లేకపోతే మనం మనలా ఎలా ఉంటాం? ‘బిస్కట్టులు కావాలయ్యా’ మొహమాటం ఆమె కోరికలో.‘పదమ్మా కొంటాను..’నా మాటలకు ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. దీనుల ముఖంలో ఆ వెలుగు చూస్తే నాకు తెలియని ఆనందం, మనసు నిండా తృప్తీ! చుట్టూ ఉన్న కొంతమంది జనాల కళ్ళల్లో మెచ్చుకోలు. అదే నాకు తెలియని మత్తునిస్తుంది.అంతమంది అక్కడ ఉండగా ఒక ముష్టిదానికి నేనొక్కడినే దానం చెయ్యాలి అనుకోవడం నా మంచి మనసుకు తార్కాణం అని అక్కడ ఉండేవారు గుర్తించే ఉంటారు కదా. ఎందుకు గుర్తించరు? తప్పకుండా గుర్తిస్తారు. ఆమె ఆ పక్కనే ఉన్న షాప్ దగ్గర ఆగింది.‘ఆ ఐదు రూపాయల బిస్కట్ ప్యాకెట్ ఇవ్వండి’ షాపతన్ని అడిగాను.ఆమె ముఖంలో వెలుగు ఒక్కసారిగా తగ్గిపోవడం చూసి, ఆకలి ఎక్కువగా ఉంటే ఆ చిన్న బిస్కట్ ప్యాకెట్ ఏమూలకు సరిపోతుంది అనిపించింది.‘అది వద్దు, ఆ పది రూపాయలది ఇవ్వండి’ పది రూపాయలు నోటు అందిస్తూ ఆమె వైపు చూశాను.ఆమె ముఖం ఇంకా దిగులుగా ఉండటం చూసి ‘ఏం కావాలమ్మా నీకు?’ తెలియకుండానే విసుగు నాలో.చెయ్యెత్తి చూపించింది ఆమె. షాపతను నేను అడగకుండానే ఆ బిస్కట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.‘ఇంకో పదివ్వండి సార్, ఆ ప్యాకెట్ ఇరవై రూపాయలు.’పాపం ఆ ప్యాకెట్ తినాలని ఆశ గాబోలు అనుకుంటూ మరో పది అందించి ‘తినమ్మా, పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో..’ నా జాలి గుండె మాటలు. చెప్పాకదా నా మనసు వెన్న అని. ‘ఊహూ, అటెల్లి తింటాను’ ఆమె బస్టాండ్ వెనుక వైపు చూపించి అటు నడవసాగింది.బహుశా ఆమె పిల్లలు అక్కడ ఉండి ఉంటారు గాబోలు. తనకు ఆకలేస్తున్నా తినకుండా పిల్లల కోసం తీసుకెళ్ళడం నన్ను కుదిపివేసింది. అందుకే అంటారు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని! పిల్లలు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? ఆ ప్యాకెట్ వారికి ఏం సరిపోతుంది? ఆలోచనలతో పాటు కుతూహలం వెంటరాగా ఆమె వెళ్ళిన దిశకు వ్యతిరేక దిశలో బస్టాండ్ వెనుక వైపు వెళ్ళాను.జనసంచారం పెద్దగా లేకపోవడం వలన గాబోలు అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. ముక్కు బద్దలవుతున్న వాసనలు. పిల్లల జాడ ఎక్కడా కనబడలేదు. ఆమెకు కనబడకుండా ఒక చెట్టు చాటు నుండి చూడసాగాను. గోడ వెనక్కి వచ్చిన ఆమె అటూ ఇటూ చూసి ఒక్కసారిగా తన చీరను కాస్తా పైకి లేపింది.సిగ్గుతో తలతిప్పుకొని అక్కడ నుండి రాబోయాను. కానీ నా కళ్ళకు ఏదో అసహజంగా అనిపించి తలతిప్పి చూశాను. ఆమె చీర కింద లంగాపై సంచుల్లాంటివి వేలాడుతున్నాయి. వాటినిండా బిస్కట్ ప్యాకెట్లు. నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.నేనిచ్చిన ప్యాకెట్ని కూడా వాటిలో పెట్టింది. చీరను కిందకి దించి సర్దుకొని అటువైపు ఆగి ఉన్న బస్సుల వద్దకు నడవసాగింది. బహుశా నాలాంటి బకరాని వెతకడానికి గాబోలు. ఉండేలు దెబ్బతిన్న కాకిపిల్లలా విలవిలలాడిపోయాను. ఇంత చదువుకొని కూడా అంత సులభంగా ఎలా వెధవనయ్యానో?గుండె మండిపోతుండగా ఆమెను నిలదిద్దామనేంత ఆవేశం వచ్చింది. చెడామడా కడిగేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, అటువంటి వారితో గొడవపడటం సభ్యత కాదు, తన పాపానికి తనే పోతుందని తిట్టుకున్నాను. గుండెమంటతో నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే, ఆ బిస్కట్ల షాప్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’ మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా? షాపతను నన్ను చూసి జాలి పడుతున్నట్లు అనిపించింది. ఎదుటివారిపై జాలి చూపడం నాకు అత్యంత ఇష్టమైనది. కానీ నన్ను చూసి జాలి పడితే భరించలేను. ఆయన పెదవులపై ఎందుకనో కాస్త నవ్వు విరిసింది అసంకల్పితంగా. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ ఆగలేక అడిగేశాను అప్పటికే మనసు కుతకుతలాడుతోంది మోసపోయాను అన్న భావనతో.‘ఏం లేద్సార్, మీరు రాములమ్మను అనుసరిస్తూ వెళ్ళడం గమనించాను. అక్కడ ఏం చూసుంటారో ఊహిస్తే నవ్వొచ్చింది అంతే. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. అందుకే చనువుగా నవ్వాను.’నిర్ఘాంత పోయాను. ఓహో ఆ మోసగత్తే పేరు రాములమ్మన్నమాట. ‘అంటే మీకు ముందే తెలుసా ఇలా చేస్తుందని’ విస్మయం నాలో.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా?నా ముఖంలో మారుతున్న రంగులను అణచుకుంటూ ‘మా దగ్గర డబ్బులే అడగొచ్చుకదా. ఎందుకిలా డొంకతిరుగుడు బిస్కట్ల వ్యవహారం?’ ఏదో తెలియని కుతూహలం నాతో అడిగించింది.చిన్న నవ్వు నవ్వి ‘మళ్ళేమైనా అంటే మీకు పుసుక్కున కోపం ఒచ్చేస్తాది గానీ మీరు ముష్టి వేస్తే రూపాయో, రెండ్రూపాయలో వేస్తారు. మహా అయితే ఐదు వేస్తారు. అంతేకదా..!’మౌనంగా తలూపాను.‘సాయంత్రం అయ్యేసరికి కనీసం పదిహేను, ఇరవై ప్యాకెట్లయినా నాదగ్గర మార్చుకొని రెండొందల వరకు తీసుకొని వెళ్తుంది. మధ్య మధ్యలో చిల్లర వేసేవారు ఎలాగూ ఉంటారు.’అంటే రూపాయికి రూపాయి లాభం. ఎంత దగా! పది రూపాయలకు కొని, ఇరవై రూపాయలకు అమ్మడం. ఛ! ఈ ప్రపంచంలోని మోసం అంతా ఈ బస్టాండ్లోనే ఉందనిపించింది. అంతలోనే నాకొక సందేహం తలెత్తింది.. అడగనా వద్దా? అనే సంశయంలో ఉండగానే..‘ఏదో అడగాలని తెగ మొగమాటం పడిపోతున్నారు. అడిగేయండి, పర్లేదు’ అభయం ఇచ్చాడా నవ్వులరేడు. ‘మరేం లేదు, మీరే అమ్మి, మీరే కొనడం వలన మీకేంటి లాభం? తర్వాతవి అమ్ముడవకపోతే?’ సంశయిస్తూనే అడిగేశాను. ఒక్కసారిగా మౌనం వహించాడతను. అతని కళ్ళల్లోకి చూస్తున్న నా ముఖాన్ని ఒకసారి పరిశీలించి, అటూ ఇటూ చూసి ‘మీరెవ్వరికీ చెప్పనంటే చెప్తాను’ లోగొంతుతో అన్నాడు.‘ఇక్కడ జరిగిందంతా ఇప్పుడే మర్చిపోతాను’ మాట ఇచ్చాను. ‘ఇంకేటీ లేదు. అవన్నీ పాడయిపోయిన బిస్కట్ ప్యాకెట్లు. అదేలెండి ఎక్స్పైర్ అయిపోయినవి. ఎట్లాగూ బయటపడేయ్యాలి. అవే రాములమ్మకు ఇస్తాను. వేరేవారికి అమ్మను. ఆ ప్యాకెట్లు తను ఎట్లాగూ తినదు, నాకే తిరిగిస్తుంది. ఆ ప్యాకెట్లు ప్రతిరోజూ నాకు డబ్బులు తెస్తున్నాయి. ఈ విషయం రాములమ్మకు కూడా తెలియదు.’విస్తుపోయాను.. కంటికి కనబడకుండా పన్నిన వల తెలిసి! ఏ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీల్లో కూడా నేర్పని పాఠం. వ్యాపారంలో మెలకువలు ఉంటాయని తెలుసు గాని, ఒక చిన్న బస్టాండ్లో, అతి చిన్న దుకాణంలో, పెద్దగా చదువుకోని వ్యక్తి అంత చక్కగా ఆర్థిక వలనేయగలడు అని ఊహించలేదు. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది. నా ఆలోచనలను చెదరగొడుతూ అతని మాటలు వినిపించాయి. ‘మరోమాట సార్, పాపం రాములమ్మ భర్త రోగంతో మంచాన పడితే, పిల్లలతో పాటుగా మొగుడ్ని కూడా చంటిబిడ్డలా సాకుతూ, కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తోంది. అందుకే నేను కూడా నావంతుగా ఇలా సాయపడుతున్నాను..’షాపతని మాటలు నన్ను ఆవేశంలోంచి ఆలోచనలోకి పడేశాయి. ఆర్థిక మోసానికి మానవత్వపు పూత.గీతా రహస్యం బోధించిన వాడిలా చిద్విలాసంగా నవ్వాడు షాపతను.∙∙ ‘బావా! ఎప్పుడు వచ్చితీవి? సుఖులే బ్రాతల్, సుతుల్, చుట్టముల్?నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మున్నీలున్ సుఖోపేతులే?’తన్మయత్వంతో తారస్థాయిలో రాగాలాపన చేస్తున్నాను. తలపై నెమలి పింఛంతో కిరీటం, ముఖానికి, మెడకు చిక్కని నీలపు రంగు మేకప్తో, మెడలో పూలహారంతో చేతిలో ముచ్చటైన పిల్లనగ్రోవితో మేకప్లో అచ్చం కృష్ణుడిలా ఉంటానని అందరూ అంటారు. నా గొంతు నాకొక వరం. మేకప్లో నన్ను చూసినవాళ్ళు నన్ను ఫలానా అని గుర్తుపట్టడం కష్టం. అంతగా కృష్ణుని పాత్రలో ఒదిగి పోతాను అని మా నాటకబృందం కితాబు. వందలమంది ప్రేక్షకులు నాటకంలో లీనమయి ఉన్నారు. మా వూరు పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ ఏడాది కూడా బుర్రకథలు, హరికథలు, నాటకాలు జరుగుతున్నాయి. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది.మరో ఇద్దరు ముగ్గురు చెరో పది, ఇరవై రూపాయలు కానుకగా అందించారు. ప్రేక్షకుల చప్పట్లు, అభినందనల మధ్య రెట్టించిన ఉత్సాహంతో, ఉవ్వెత్తునలేచిన కడలి తరంగంలా పాత్రలో లీనమయిపోయా. నాటకం రసవత్తరంగా సాగుతోంది. ‘మా మధ్యమ పాండవుని విక్రమంబు ఎట్టిదంటిరేని..’‘జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియుం గూర్చి నేదండంబున్ గొని తోలు స్యందనము మీదన్ ..’రాగం ఆపగానే ఆర్గనైజర్ గారి కంఠం మైకులో వినిపించసాగింది. ‘శ్రీకృష్ణుని పాత్రధారిని ఆశీర్వదిస్తూ కళాభిమానులందరి తరుపున అని చెప్పమంటూ మంచి మనసుగల ఒక తల్లి వంద రూపాయలను బహుమతిగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ చల్లని తల్లి పైడితల్లెమ్మ కరుణతో చూడాలని కోరుకుంటున్నాము.’నాకొక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. అందరూ పదులు, ఇరవైలు చదివిస్తుంటే ఒక్కసారిగా వందరూపాయలు చదివిస్తూ కూడా తన పేరు చెప్పకోకుండా అందరి తరుపున అన్న ఆ గొప్ప వ్యక్తి ఎవరా? అని చూశాను.ఫ్లడ్ లైట్ల వెలుగులు నా కంటికి అడ్డం పడ్డాయి. చెయ్యి అడ్డుపెట్టుకొని మరీ చూశాను. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను.. ఆర్గనైజర్కు డబ్బులు అందించిన ఆమెను చూసి! ఆ మధ్య బస్టాండ్లో నన్ను మోసం చేసిన బిచ్చగత్తే రాములమ్మ. ముష్టి ఎత్తి కుటుంబ పోషణకు సంపాదించిన డబ్బును, కళాపోషణకు ఇస్తూ, కనీసం తన పేరు కూడా చెప్పని ఆ నిరాడంబరత నా వీపున ఛెళ్ళున కొరడా దెబ్బ వేసింది. నాలో నాకే తెలియని మానసిక సంఘర్షణ. వృత్తికి, ప్రవృత్తికి మధ్యగల తేడాను, స్పష్టతను, నిర్మలత్వాన్ని, సున్నితత్వాన్ని , కళాపోషణను, కళారాధనను తెలుసుకోగలిగాను.తెలియకుండానే నా కన్నులు చెమ్మగిల్లుతుండగా రెండు చేతులు జోడించి ఆమెకు వందనం చేశాను. -
యువ కథ: చినుకుల అలజడి
జయరాం, తనకు కాబోయే అల్లుడు ప్రవీణ్ పక్కనే నిలబడి మాట్లాడతా వుండాడు.‘రేయ్ చిన్నోడా, ఇప్పుడేలరా ఈ పెండ్లిసూపులు. ఒకేసారి లగ్నపత్రిక రాయించుకోని ఒచ్చేద్దామంటే ఇనవు’ ప్రవీణ్ నవ్వతా ‘నా కోసరం గాదు. నీ ముద్దుల కూతురు ఉంది కదా, ఆయమ్మ ఆగిత్యమే’ అన్నాడు. ‘చిన్నప్పట్నించి అనుకున్న సంబంధానికి మళ్లీ పెళ్లిచూపులేంట్రా. ఏంటో ఈకాలం పిల్లలు’ అన్నాడు.దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటోంది శిరీష. ప్రవీణ్ మాటలకి కోపమొచ్చేసింది ఆమెకు. కానీ అది సమయం సందర్భం కాదని ఏం మాట్లాడకుండా గమ్మునే ఉండిపోయింది.అరగంటలో పెండ్లిచూపుల కార్యక్రమం అంతా అయింది. వచ్చే మంగళవారం లగ్నపత్రిక రాయించుకొద్దాం అని రెండు కుటుంబాలు అనుకునేశాయి. ఇద్దరూ ఉండేది అదే ఊళ్లో. జరగాలి కాబట్టి జరిపించినట్టుగా ఉంది తంతు.‘ఎల్దాం పదండి’ అంటా అమ్మాయి తరుపువాళ్లు బయల్దేరతా ఉంటే శిరీష ‘మీరు బొండి, నాకు పవిగాడితో కాస్త పాతబాకీల ముచ్చట ఉంది. తేల్చుకొనొస్తా’ అనింది. శిరీషకు ఎప్పుడూ ఎవురూ అడ్డు జెప్పింది లేదు. అట్లే కానియ్యమని బయల్దేరి పోయినారు. ప్రవీణ్ మిద్దె మీద ఎండబెట్టిన మిరక్కాయలని గోతాంలో ఏస్తాన్నాడు. వానొస్తాదని నమ్మకమొచ్చేలా ఇంకోసారి ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినపడింది. ఎండ కూడా తన పెగ్గి తగ్గించుకుంటాంది.‘అత్తా.. పవీ ఏడా’ అనడిగింది శిరీష నవ్వతా. అత్త కూడా నవ్వతా పైకి చూపెట్టింది. మూటగట్టిన మిరక్కాయల గోతాంని లోపలికేసి కిందకు దిగిన ప్రవీణ్ చెయ్యి కడుక్కుని తుడుచుకుందామని అట్టా ఇట్టా చూశ్నాడు. శిరీష అగుపడ్నాది. దగ్గరకెళ్ళి చీర కొంగు బట్కోని తుడుసుకోబోయినాడు, శిరీష వెంటనే వెనక్కి జరిగి – ‘రేయ్.. కొత్త చీరరా’ అనింది. ప్రవీణ్ రెండు చేతులూ ఏసేసరికి చేతుల తడి నడుముకు తగిలింది. శిరీష వెంటనే ప్రవీణ్ను ఎనక్కి తోసేసి, ‘మండుతాది వాయ్’ అనింది కోపంగా. ‘లాస్టు మూడు నెలలుగా నాకు మండినట్టా?’ అనేసి బాల్కనీ వైపుగా నడిచి అక్కడ అలానే కింద కూర్చుండిపోయినాడు. ‘అబ్బా .. మళ్ళీ మొదలు పెట్నావా?’ అంటూ పక్కనే ఒచ్చి కూర్చొనింది శిరీష.ప్రవీణ్ తలవంచుకున్నాడు. వోని గెడ్డం పట్టుకొని పైకి లేపింది. వోని కండ్లు ఎర్రగా నరాలు తేలేసి ఉన్నాయ్. ‘దీనికి ఎందుకురా పవీ ఏడవడం? ఏమన్నా అంటే ఇట్టా ఆడపిల్లలా ఏడుస్తావ్..’ అనేసి కండ్లు తుడిచింది శిరీష. ‘ఏం, ఆడపిండ్లోల్లే ఏడసాల్నా? మొగపిండ్లోల్లు యాడ్సకూడదు అని యాడైనా రాసుండాదా ఏం..?’ అన్నాడు ప్రవీణ్ కండ్లు తుడుసుకుంటా. శిరీష నవ్వి ‘సర్లే , మళ్ళీ ఏడుద్దువులే గానీ, ఈ మూడు నెలలు ఎట్లున్నావ్రా నాతో మాట్లాడకుండా, నన్ను సూడకుండా?’ అనింది. ‘అదేమంత కష్టం కాదులేమే, నువ్వే మళ్లీ పలకరిస్తావ్ అని నాకు దెల్సు. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నా’ అన్నాడు ప్రవీణ్. ‘ఉద్యోగం మానేశ్నావంట ? ఏంది కత?’ ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.‘అక్కడ టౌన్లో ఉండబుద్ధి గాట్లేదు మే. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉద్యోగం నావల్ల కాదు ఇంక. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడనియ్. అప్పటిదాకా నువ్వున్నావ్గా, ఏం చూస్కోవా నన్ను?’ ‘నేను చూసుకుంటాలే గానీ, ఈలోపు నీ చేయి కంట్రోల్లో లేకుంటే ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా.’‘మరెట్టాగే? ఇంకెన్నాళ్ళు ఇట్టా దూరంగా ఉండాల నీతో?’‘రేయ్ తిక్క సన్నాసీ.. వయసు శానా ఆట్లే ఆడమంటాది. కొన్నిదినాలు ఆగు, పెండ్లైపోనీ’అని గట్టిగా ఒక ముద్దిచ్చి ఆడ నుంచి ఇంటికి బోయింది శిరీష.మూడు నెలల క్రితం శిరీష ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఏకాంతం చూసి చనువు చూపించబోయాడు. లాగిపెట్టి కొట్టింది. పద్ధతి ప్రకారం ఉండకపోతే పెళ్లీగిళ్లీ జాన్తానై అంది. ‘అసలు మూడు నెలలు కనపడకుండా వినపడకుండా నిష్టగా ఉంటేనే పెళ్లి’ అంది. ఆ మాటను అంత పట్టింపుతో అనకపోయినా ప్రవీణ్ సీరియస్గా తీసుకున్నాడు. ఇద్దరి వైఖరిలో మార్పు గమనించి పెద్దవాళ్లు ఇది ఎటుపోయి ఎటొస్తుందోనని పెళ్లికి వేగం తెచ్చారు. అది కూడా జనం కోసం జరిపించాల్సిన ఒక తంతే. ప్రవీణ్, శిరీష మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలు. ఆ రేతిరి మిద్దె మీద చాప ఏస్కొని అటూ ఇటూ దొర్లుతున్నాడు ప్రవీణ్. నిద్ర పట్టక కింద వీధిలో కొచ్చి సిగరెట్ వెలిగించినాడు. శిరీష గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మొబైల్ చూస్కున్నాడు. గీత నుంచి మళ్ళీ మెసేజ్– ‘మేల్కొనే ఉన్నావా?’ అని. దాన్ని పట్టించుకోకుండా ‘డార్లింగ్’ అని ఉన్న నంబర్కి డయల్ చేశాడు.నిద్ర మత్తులో ఫోన్ ఎత్తినాది శిరీష. ‘ఏంది పవీ ఈ టైములో ఫోను’ ‘నిద్రపట్టట్లే మే’ ‘పడుకుంటే అదే వస్తాదిలే. పడుకో పవీ’ అంటూ ఫోన్ పెట్టేశ్నాది శిరీష. ఇంతలో గీత నుంచి మళ్ళీ మేసేజ్– ‘పడుకునేశ్నావా’ అని. ‘లేదు’ వెంటనే ఫోన్ రింగయ్యింది. గీత నుంచి ఫోన్.‘హలో’ అన్నాడు ప్రవీణ్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘ఏం జెయ్యట్లా. నిద్రపట్టకపోతే అలా బయటకొచ్చినా’ ‘బయటికి అంటే మీ ఇంటి ముందుకా ?’‘అవును. అయినా యాడైతే నీకు తేడా ఏముందే, నువ్వుండేది బెంగుళూరులో గదా’‘రామాలయం వీధి వైపు నడుస్తున్నావా?’‘అవును. అంత కరెక్టుగా ఎట్టా జెప్పినావ్?’‘ఇంకొంచెం ముందుకి నడువు అలాగే’ అట్టాగే ముందుకి పోయిన ప్రవీణ్కి ఎదురుగా చెయ్యి ఊపుతూ ఎవరో కనబడ్డారు. ఈ టైంలో ఎవరా అని చూస్తే గీత! ‘ఒసేయ్, నువ్వేందే ఈడ ? బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినావ్?’ అన్నాడు. ‘సాయంత్రం ఒచ్చినాన్లే గానీ, దా ఇక్కడ చలిగా ఉంది లోపలికెళ్దాం.’ ‘ఈ టైంలో ఎందుకులేమే, తెల్లార్నంక మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రవీణ్. ‘అబ్బా, ఏంగాదు రా ప్రవీణ్’ అంటూ బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది గీత. ప్రవీణ్ ఇల్లంతా చూస్తూంటే ‘ఎవరూ లేరు. అందురూ పెండ్లికి ఎలబారిపోయినారు. నువ్వూ నేనే ఉండాం’ అనేసి సోఫాలో కూర్చునింది. బయట వర్షం మొదలైంది. మెల్లగా ఊపందుకుంది. ‘ఈ రేతిరికి వాన ఇంకా గెట్టిగా పడేట్టుగా ఉండాది మేయ్. ఇంకా పెరిగే లోపు నేను ఇంటికెళ్ళిపోతా’ అన్నాడు ప్రవీణ్.‘సర్లే ఎల్దువులే గానీ, కాసేపు ఉండు ప్రవీణ్’ అనింది. ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకునింది. ప్రవీణ్ గుండె వేగం ఆ పిల్లకి కూడా తెలుస్తాంది.‘నువ్వంటే చిన్నప్పట్నుంచీ ఇష్టంరా ప్రవీణ్. కానీ నీకేమో ఆ శిరీష అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ జెప్పలా నీకు. కానీ నువ్వు కావాలి’ గీత కండ్లు మూసుకునింది. మొహాన్ని మొహానికి దగ్గిరగా తెచ్చాడు ప్రవీణ్. పెదాల మీద ముద్దు పెడతాడు అనుకునింది. అయితే ప్రవీణ్ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ‘ఇట్టా చేయడం తప్పు మేయ్’అన్నాడు. వెంటనే కండ్లు తెరిచేశ్నాది గీత. ‘నా శిరీషకు నేను అన్యాయం చేయలేను. ఈ వయసులో మనందరికీ ఒకేలా ఉంటుంది. అదే మాట శిరీషతో అంటే– ఉంటుంది. నాకూ ఉంటుంది. కాని ఆగాలి కదా అని ఆగడం నేర్పింది. నీకూ అదే మాట చెప్తున్నా. వయసు ఆడించినట్టు మనం ఆడకూడదు’ అనేసి పైకి లేచాడు.‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్. గీత ఏం మాట్లాడకుండా నిలబడింది. కండ్లు తుడుచుకొని, ‘నాదే తప్పు. మీ మధ్య దూరుండకూడదు. పెండ్లెప్పుడు అనుకుంటా ఉండారు?’ అనడిగింది.‘రెండు నెలల్లో. కానీ అంత దూరం మంచిది కాదనిపిస్తాంది’ అంటూ నవ్వినాడు ప్రవీణ్. గీత కూడా నవ్వింది. ‘సరే మేయ్ నేను పోతా’ అనేసి వానలోనే తడ్సుకుంటా ఇంటికి పోయి మిద్దె మీదకెల్నాడు ప్రవీణ్. అక్కడ చాప, దిండు రెండూ తడిసి ముద్దయిపోయున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే శిరీష వొచ్చినాది. ఆరేసున్న బొంత, చాప, ఎండబెట్టిన దిండు అన్నిటినీ చూస్తూ నిలబడింది. ‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.‘ఇది. ఈ కంట్రోల్ ఉండాల్ననేరా మూడు నెలలు నన్ను కల్సొద్దు అని కండిషన్ బెట్టి కూర్సోబెట్టింది. కానీ నిన్ను నమ్మినా, ఈ వయసును నేను నమ్మలేను పవీ’ అంది. ‘మరేం చేద్దాం?’ అన్నాడు ప్రవీణ్. వారం తర్వాత ప్రవీణ్, శిరీషల పెండ్లి ఘనంగా జరిగింది.ఆ రేతిరి, దాదాపు ఒంటిగంట ప్రాంతంలో.. ‘ఏంది పవీ, ఇంకా ఒంటి గంట కూడా కాలేదు. అప్పుడే పడుకుంటే ఎట్టా?’‘అట్టా కాదు లెమ్మే, నాకు నిద్దొరస్తాంది’ అన్నాడు ప్రవీణ్. శిరీష నవ్వతా అనింది ‘నాకు రాట్లేదు’ -
Mystery: హంతకుడు ఏమయ్యాడు?
ఇది 44 ఏళ్ల క్రితం, మార్చిలో ప్రారంభమై, అదే ఏడాది సెప్టెంబర్లో ముగిసిన రొమాంటిక్ క్రైమ్ కథ. 1980 సెప్టెంబర్ 18, సాయంత్రం 5 కావస్తోంది. అమెరికా మిసూరీలోని కాన్సాస్ సిటీలో ఓ బిల్డింగ్ ముందు ఓ కారు వేగంగా వచ్చి ఆగింది. కారులోంచి 34 ఏళ్ల తాన్యా కోప్రిక్ అనే డాక్టర్ కాలు బయటపెట్టింది. ఆమె పూర్తిగా దిగకముందే ఏకధాటిగా తుపాకి తూటాలు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. ఆ అలికిడికి బిల్డింగ్లోని కొందరు బయటికి పరుగు తీశారు. కారు దగ్గరకు వచ్చి చూస్తే, తాన్యా కారు ముందు సీటులో కుప్పకూలిపోయి ఉంది. కిల్లర్ అతి సమీపం నుంచి కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు డాక్టర్స్ తేల్చారు. తాన్యా చాలా అందగత్తె. ఆరేళ్ల క్రితమే యుగోస్లేవియా నుంచి అమెరికా వచ్చి, సొంతంగా ఆసుపత్రి పెట్టుకుని డాక్టర్గా సెటిల్ అయ్యింది. మరోవైపు పలు ఆసుపత్రుల్లో డాక్టర్గా, కాలేజీల్లో ప్రొఫెసర్గా చాలా విధులు నిర్వహించేది. ఆమె హత్య జరిగిన భవంతిలోనే ఆమెకు సొంతగా అపార్ట్మెంట్ ఉంది. కారు, ఇల్లు, కావాల్సినంత సంపాదన, చక్కని జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. తాన్యా మరణవార్త యుగోస్లేవియాలోని ఆమె పేరెంట్స్కు తెలియడంతో వాళ్లు కూడా కాన్సాస్ సిటీకి హుటాహుటిన చేరుకున్నారు.అయితే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు చాలా కీలక సమాచారం అందింది. అసలు తాన్యాను హత్య చేసింది ఎవరో కాదు మాజీ ప్రియుడు రిచర్డ్ గెరార్డ్ బోక్లేజ్ అని తెలుసుకున్నారు. తాన్యాను రిచర్డ్ చంపడం, పారిపోవడం స్వయంగా చూశామని ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.యూనివర్సిటీ ఆఫ్ మిసూరీలో రిచర్డ్ ఫార్మసీ విద్యార్థిగా తాన్యాకు పరిచయం అయ్యాడు. అతడి కంటే తాన్యా పదకొండేళ్లు పెద్దది. వారి పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారడానికి నెలరోజులు కూడా పట్టలేదు. వారి బంధం ఎంత వేగంగా అల్లుకుందంటే 1980 మార్చిలో రిచర్డ్, హాస్టల్ ఖాళీ చేసి తాన్యా అపార్ట్మెంట్లోకి మారిపోయాడు. కాలక్రమేణా అతడికి చదువు మీద శ్రద్ధ తగ్గింది. తాన్యా చుట్టూనే ప్రదక్షిణలు చేసేవాడు. అతడి తీరును అతడి స్నేహితులు తీవ్రంగా విమర్శించినా పట్టించుకునేవాడు కాదు. కేవలం తాన్యా డబ్బు, ఆస్తి కోసమే ఆమెతో సాంగత్యం మొదలుపెట్టాడని చాలామంది గుసగుసలాడుకునేవారు. కానీ ఆ జంట ఎవరి మాటా వినలేదు. ఆరు నెలలు గడవకముందే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాన్యా ధ్యాసలో రిచర్డ్ తన కెరీర్ని పక్కన పెట్టేశాడు. చదువు తగ్గిపోయింది. మార్కులు తగ్గిపోయాయి. అతడి తీరు గమనిస్తూ వస్తున్న ప్రొఫెసర్స్ అతడిపై రెడ్ మార్క్ వేశారు. జూలై వచ్చేనాటికి రిచర్డ్ డాక్టర్ కావడానికి అనర్హుడని, ఇక యూనివర్సిటీకి రావాల్సిన పనిలేదని నోటీసులిచ్చారు. దాంతో రిచర్డ్ రగిలిపోయాడు. ‘నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే’ అంటూ తాన్యాను వేధించడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్స్తో, యూనివర్సిటీ నిర్వాహకులతో గొడవలకు దిగడం ప్రారంభించాడు. అడ్మిష¯Œ ్స డిపార్ట్మెంట్లో తన తరపున మాట్లాడి, తిరిగి తనకు అర్హత పత్రాన్ని ఇప్పించాలని ప్రతిరోజూ తాన్యాతో గొడవకు దిగేవాడు. అతనితో పడలేక సెప్టెంబర్ 2న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది తాన్యా. అపార్ట్మెంట్లోంచి అతణ్ణి బయటికి పంపించేసింది. దాంతో అతడు మరింత ఉన్మాదిగా మారిపోయాడు.రెండు వారాల తర్వాత తన కేసును పునఃపరిశీలించాలని వేడుకుంటూ యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయంలోని అధికారులకు లేఖ రాశాడు రిచర్డ్. చివరకు సెప్టెంబర్ 18న మధ్యాహ్నం మూడుగంటలకు పరిశీలనలో భాగంగా రిచర్డ్ను విచారణకు ఆహ్వానించారు ప్రొఫెసర్స్. అయితే అక్కడ కూడా రిచర్డ్ తీరు నచ్చక అతడు తిరిగి జాయిన్ కావడానికి వీల్లేదంటూ వారంతా తీర్మానించారు. దాంతో అదే రోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న తాన్యాను రిచర్డ్ కాల్చి చంపేశాడు. అయితే ఆ రోజు విచారణకు రిచర్డ్ ఒక కవర్ తెచ్చాడు. తాన్యా హత్య తర్వాత ఆ కవర్ను చూసిన చాలామంది ప్రొఫెసర్స్.. అందులోనే తుపాకి ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు కొన్ని వారాల ముందే ఆ పిస్టల్ని కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన రోజు కొంత దూరం వరకూ రిచర్డ్ పరుగుతీస్తూ వెళ్లాడని డాగ్స్ స్క్వాడ్ గుర్తించింది. బహుశా అతడికి ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి ఉంటారని, అందుకే తప్పించుకోగలిగాడని డిటెక్టివ్స్ ఊహించారు. హత్య జరిగిన వారంలోనే రిచర్డ్ నుంచి తాన్యా తల్లిదండ్రులకు ఓ లేఖ వచ్చింది. దానిలో ‘తాన్యాకు నేను మరణ శిక్ష విధించాను. ఆమెకు తగిన శిక్షే వేశాను’ అని రాశాడు. ఆ పోస్ట్కార్డు మీద 2 రోజుల ముందు తేదీ ఉంది. ప్రస్తుతం రిచర్డ్కి 67 ఏళ్లు దాటుంటాయి. అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో అతని పేరు చేరింది. ఏళ్లు గడిచే కొద్దీ రిచర్డ్ ఎలా ఉండి ఉంటాడోనని పోలీసులు ఎన్నో ఊహాచిత్రాలు గీయిస్తున్నారు. అయినా అతను మాత్రం ఇప్పటికీ దొరకలేదు. దాంతో ఈ కేసు అపరిష్కృతంగానే మిగిలిపోయింది. రిచర్డ్ ఏమయ్యాడనేది నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.∙సంహిత నిమ్మన -
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్లోకి అడుగుపెట్టాడు. బీర్బల్ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్ట్రంక్ రోడ్పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్పాల్. ప్లేయర్గా, కెప్టెన్గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్ఫీల్డర్గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్లో ప్లేయర్గా, కెప్టెన్గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్కు గుడ్బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
International Mens Day: మార్కెట్లో మగసిరులు
అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్లో సిరులు కురిపిస్తున్నాయి.అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.నవతరం కొత్తపోకడలుతర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు. ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు. శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్స్క్రీన్ లోషన్, ఫేస్వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధశరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్లైన్లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్లైన్లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సౌందర్య చరిత్రపురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు. గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి. స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీమహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
సింగర్ అవ్వాలి అనుకున్నా? యాక్టర్ అయ్యాను!
అన్నపూర్ణా సోనీ.. సింగర్ కావాలనుకుని యాక్టర్ అయింది. చక్కటి స్వరం ఒక్కటే ఆమె ప్రత్యేకత అనుకుంది. కానీ, కాలం ఆమెకు నటనపై ఆసక్తిని కలిగించి, వరుస అవకాశాలతో మంచి నటిని చేసింది. ఆ విషయాలే క్లుప్తంగా...మొదటిసారి నా గురించి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు.. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలై, ఆ పేపర్ని ఇరుగు పొరుగు వారందరికీ గొప్పగా చూపించారు. నేనిప్పటికీ అదే ఉత్సాహంతో ఉంటాను. సింగర్ కంటే కూడా మంచి నటి అనే గుర్తింపునే ఇష్టపడతాను. అందుకే క్లిష్టమైన పాత్రల్లో నటించి, గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా! – అన్నపూర్ణా సోనీ.⇒ అన్నపూర్ణా సోనీ మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ తీసుకుంది. సంగీతంతోపాటు నాట్యం, నటన, మైమ్.. ఇలా ఎన్నో కళల్లో ప్రతిభ చూపేది.⇒‘వివేచన రంగమండల్’ అనే నాటక సంస్థలో చేరిన తర్వాత అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్డీ) గురించి గొప్పగా విని, ఎలాగైనా అందులో చేరాలని నిశ్చయించుకుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. కానీ, రెండో ప్రయత్నంలో సీటు సాధించింది. లఘు చిత్రాలు, స్టేజ్ షోలు చేస్తూ నటనకు మెరుగులుదిద్దుకుంది.⇒ఆమె తొలి లఘు చిత్రం ‘చీపటాకడుంప’ దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ లఘు చిత్రాన్ని ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్నూ గెలుచుకుంది.⇒షార్ట్ ఫిల్మ్స్లో ఆమె నటనను చూసిన బాలీవుడ్.. ‘గుడ్బై’, ‘ఢిల్లీ క్రైమ్ 2 ’, ‘ ఛపాక్’ వంటి సినిమాల్లో అవకాశాలను ఇచ్చింది. అవన్నీ విజయం సాధించాయి.⇒ఆ విజయాలతో అన్నపూర్ణా వెబ్ దునియా దృష్టిలోనూ పడింది. ‘సన్ప్లవర్ ’, ‘రంగ్బాజ్ ’, ‘ద రైల్వే మెన్’ అనే సిరీస్లతో ఆమె టాలెంట్కి వెబ్ స్క్రీన్ కూడా స్పేస్నిచ్చింది. ఆ సిరీస్లు జీ5, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
Copenhagen: చికుబుకు చికుబుకు బకనే!
డెన్మార్క్ రాజధాని కోపన్హేగన్కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు. ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్హేగెన్ వాసులకు సీజన్ పాస్లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.నీటిబుగ్గతో మొదలైంది..ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. -
భక్త మార్కండేయుడు
మృకండు మహర్షి శివభక్తి పరాయణుడు. ఆయన భార్య మరుద్వతి పరమసాధ్వి. ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, వారు సాత్విక జీవనం కొనసాగించేవారు. ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ, అక్కడ వెలసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు. ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు. కొన్నాళ్లు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో, ఏమో: ‘మీకు పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. అయితే, ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. దుర్మార్గుడై వందేళ్లు జీవించే దీర్ఘాయుష్కుడా లేక సన్మార్గుడై పదహారేళ్లు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా?’ అన్నాడు. ‘దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్లు బతికితేనేం? సన్మార్గుడు, గుణవంతుడు అయిన కొడుకు చాలు. అలాంటి వాడు పట్టుమని పదహారేళ్లు మా కళ్ల ముందు బతికినా అదే పదివేలు’ అన్నారు మృకండు దంపతులు.పరమశివుడి వర ప్రభావంతో మృకండు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. మృకండుడి కొడుకు కావడం వల్ల మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ చదివేశాడు. ఇలా ఉండగా, ఒకనాడు సప్తర్షులు మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు అక్కడే ఉన్న మార్కండేయుని చూశారు. దివ్యదృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్షు తీరిపోతుందని అర్థమైంది. వెంటనే వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయి, తరుణోపాయం చెప్పమని కోరారు.‘నిత్యం శివారాధన చేస్తూ ఉండు. అంతా శుభమే జరుగుతుంది’ అని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. శివనామ స్మరణ వల్ల అకాలమృత్యువు దాపురించదని సప్తర్షులు కూడా మార్కండేయుడికి చెప్పారు. పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుంచి శివలింగం ముందు కూర్చుని శివనామ స్మరణ చేయసాగాడు. మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చింది. ఒకవైపు అతడికి మృత్యు ఘడియలు సమీపంచసాగాయి. మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది.మృత్యుఘడియలు ఒక్కో నిమిషమే దగ్గరవుతున్న కొద్ది మార్కండేయుడి శివనామ స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది. మృత్యు సమయం ఆసన్నమైంది. మార్కండేయుడి ప్రాణాలను తీసుకు రమ్మని యముడు తన భటులను పంపాడు. యముని ఆదేశంతో వారు బయలుదేరారు. యమభటులు భూమ్మీదకు అడుగుపెట్టే సరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకధాటిగా శివనామ స్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు. యమభటులు అతడు ఉన్నచోటకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు. శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు. చేసేదేమీ లేక వారు వెనుదిరిగి, యముడికి జరిగినందా విన్నవించారు.ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు. మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు.‘మార్కండేయా! నీకు మృత్యువు సమీపించింది. ధ్యానం మాని బయటకు రా!’ అని యముడు బిగ్గరగా హుంకరించాడు. యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా, శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. యముడు మార్కండేయుడిని సమీపించలేక, అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు. యమపాశం మార్కండేయుడితో పాటు, మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది. శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేశంతో ప్రళయరుద్రుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు, నా మీదకు నీ పాశాన్ని విసురుతావా? ఎంత ధైర్యం?’ అంటూ త్రిశూలంతో యముడిని ఒక్కపోటు పొడిచాడు. యముడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు. హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు.‘యముడే లేకపోతే, జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది. దేవాదిదేవా! దయతలచి యముడిని మళ్లీ బతికించు’ అని ముక్తకంఠంతో ప్రార్థించారు. వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేశాడు. ‘మరెప్పుడూ మార్కండేయుడి జోలికి రావద్దు. ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి. అంతేకాదు, ఇకపై శివభక్తులను నరకానికి తీసుకుపోవద్దు’ అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు శివుడు.పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. ∙సాంఖ్యాయన -
fishmonger: తీరిన కోరిక!
కీళ్లపూడిలో కృష్ణప్ప అనే ఓ చేపల వ్యాపారి ఉండేవాడు. చేపల చెరువులో రోజూ చేపలు పట్టుకుని ఓ పెద్ద గంపలో తీసుకెళ్లి పక్కనే ఉన్న రామగిరిలో అమ్ముకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు. వచ్చే ఆదాయంతోనే తన నలుగురు కూతుళ్లను చదివించుకుంటున్నాడు. తండ్రి కష్టాన్ని చూసి కూతుళ్లు బాధపడేవారు. ఈ కారణంగా చదువులపై శ్రద్ధపెట్టారు. ఓ రోజు కృష్ణప్ప గంప నిండా చేపలు పట్టి పక్క ఊరిలో సంతకు బయలుదేరాడు. దారిలో ఓ పెద్ద చేప గంపలో ఎగిరెగిరి పడుతుంటే కిందికి దించి చూశాడు. ఆ చేప దిగులుగా ఉంది. ‘అయ్యా.. నాకు జబ్బుపడ్డ చిన్నారి ఉంది. దాని బాగోగులు చూసుకోవాలి. నేను చూసుకోకుంటే అది బతకదు. అదంటే నాకు చాలా ప్రాణం. వెనక్కి వెళ్లి అది బాగయ్యే వరకు ఉండి వచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎక్కడైనా అమ్ముకో!’ అంటూ కంట తడిపెట్టింది బంగారు చేప.దాని ఆవేదనకు కృష్ణప్ప మనసు కరిగి, వెనక్కి వెళ్లి దాన్ని చేపల చెరువులో విడిచిపెట్టాడు. వేయికళ్లతో ఎదురు చూస్తున్న పిల్ల చేప దగ్గరికి చేరింది ఆ తల్లి చేప. నాలుగురోజుల పాటు దానికి మంచి ఆహారం పెట్టాడు కృష్ణప్ప. వారం రోజులకు, తన పిల్ల చేప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. గట్టు మీద కూర్చొని చేపలు పడుతున్న కృష్ణప్ప గంపలోకి వచ్చి పడింది బంగారు చేప.ఆశ్చర్యపోయాడు కృష్ణప్ప. ‘నీ బిడ్డ ఆరోగ్యం బాగైందా?’ అడిగాడు. ‘మీ దయ.. మంచి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుపడింది. నా కోరిక తీరింది. ఇక నన్ను ఎక్కడైనా అమ్ముకుని లాభం పొందు’ అంది బంగారు చేప. తీసుకెళ్లాడు కృష్ణప్ప. దాన్ని సంతలో అమ్ముతుండగా బతికున్న ఆ చేపను ఓ ధనవంతుడు చూశాడు. పాతికవేలు ఇచ్చి కొనుక్కుపోయాడు. తీసుకెళ్లి ఉడికించడానికి పెనం మీద వేస్తుండగా ఎగిరి కింద పడింది. ‘అయ్యా.. జబ్బుపడ్డ నా బిడ్డ ఎలా ఉందో ఓసారి చూసుకుని వస్తాను. ఆ తర్వాత వేయించుకుని తిందువు’ అని వేడుకుంది.దాంతో ఆ ధనవంతుడు బంగారు చేపను కృష్ణప్ప వద్దకు తీసుకెళ్లి, విషయం చెప్పాడు. ఆశ్చర్యపోతూ కృష్ణప్ప, ఆ బంగారు చేపను మళ్లీ చెరువులో వదిలిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత అది తన పిల్లతో చెరువు గట్టు మీదకి వచ్చింది. కృష్ణప్ప వద్దకు వెళ్లి ‘నా పిల్లతో సహా నన్ను ధనవంతుడి వద్ద విడిచిపెట్టు’ అంది. కృష్ణప్ప ఆ రెండిటినీ ధనవంతుడి వద్దకు తీసుకెళ్లాడు. దాని నిజాయితీని మెచ్చుకున్న ధనవంతుడు ‘వద్దు కృష్ణప్పా.. వీటిని నువ్వే సంరక్షించు’ అంటూ ఆ రెండిటినీ వెనక్కి పంపాడు. కృష్ణప్ప తన ఇంట్లోనే పెద్ద అక్వేరియాన్ని ఏర్పాటు చేసి ఆ తల్లి, పిల్లను అందులో ఉంచి, ప్రదర్శన ఏర్పాటు చేశాడు.ఆ ఊరి వాళ్లే కాక, ఇరుగు, పొరుగు ఊళ్ల వాళ్లూ వచ్చి ఆ బంగారు చేపల్ని చూసి ఆనందించసాగారు. అలా జనం పెరిగి కృష్ణప్ప ఇంట్లోని అక్వేరియం పెద్ద ప్రదర్శనశాలగా మారిపోయింది. దాంతో కృష్ణప్పకు రోజూ డబ్బులు రాసాగాయి. చేపలు పట్టే పని మానుకుని, చేపల ప్రదర్శనతో వస్తున్న ఆదాయంతో తన పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు కృష్ణప్ప. ∙బోగా పురుషోత్తం -
పిసినారి పుల్లయ్య
ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారి వాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్లి తెచ్చుకునే రకం. కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు.. ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పడూ భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక, పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు’ అంటూ! ‘ఎందుకండీ.. ఇలా మాట్లాడుతారు. దానధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయి’ అని బదులిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని, ‘ఎంత చెప్పినా అంతే! దాని మంకు దానిదే.. నా మాట ఎప్పుడు విన్నది గనుక’ అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకుని చేనుకు వెళ్లాడు పుల్లయ్య.. వాటిని మేపడానికి. అక్కడే ఉన్న మల్లయ్య ‘ఏరా పుల్లయ్యా.. ఇంత పొద్దు పోయింది?’ అని అడిగాడు. ‘ఏముందిరా.. ఊళ్లో వాళ్లందరికీ నా ఇల్లే కనిపిస్తుంది. నా ఇల్లొక సత్రం అయింది. ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు. నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేస్తుంటే.. అదేమో దాన ధర్మాలకు ధారపోస్తోంది’ అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య.‘సరే గానీ, ఎండాకాలం వస్తోంది. పక్కనే ఉన్న చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను. నేను రేపు వెళ్తున్నాను. నువ్వు కూడా రా.. వెళ్లి కుండలు తెచ్చుకుందాం’ అన్నాడు మల్లయ్య. ‘ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో, ఇంట్లో ఉన్న సిమెంటు గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా? కుండలు అవసరమా! డబ్బులు దండగ కాకపోతే’ అని బదులిచ్చాడు పుల్లయ్య. ‘సరే రా.. నీ ఇష్టం! నేనైతే రేపు పొద్దున బయలుదేరుతాను’ అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్లాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు బెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య. ఇద్దరూ అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం ‘అమ్మో! ఈ కుండకు ఇంత ధరా! ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి’ అన్నాడు మల్లయ్యతో. ‘నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్లు. నేను ఇక్కడే కూర్చుంటాను’ అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య. పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్లాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి ‘ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లండి. అక్కడ తక్కువకు దొరుకుతాయి’ అని చెప్పాడు. వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. ‘లేదండీ .. ఆ ధరకు మాకే రాలేదు’ అని అన్నాడు కుండలయ్య. అయినా సరే, పట్టువిడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరుబట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమిగూడారు. చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్లి చూడగా.. పుల్లయ్య కిందపడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి, మజ్జిగ తాగించాడు. స్పృహలోకొచ్చాడు పుల్లయ్య. కుండ పుటుక్కుమనడం చూసి, భోరున విలపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే, భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. ‘మల్లయ్య మాట వినుంటే బాగుండేది. అనవసరంగా రెండు కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు’ అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది.