కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే.
ఆఖరున శబరిమల వెళ్లి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష ముగించడం జరగుతుంది. సాధారణంగా అయ్యప్ప ఆలయం నవంబర్, జనవరి మధ్య కాలంలోనే తెరుస్తారనే విషయం తెలిసిందే. అది కూడా మండలదీక్ష పూర్తి చేసుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక విశిష్ణ పూజ నిమిత్తం ఐదు రోజులు తెరిచే ఉంచుతారు. అది శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా ఆ పండుగ విశేషాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.
ఆ పండుగే చిత్తిర అట్టవిశేషం (అత్తతిరునాల్) ఇది శబరిమలలో జరుపుకునే ప్రత్యేక పండుగ. ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారట. ఆయన గౌరవార్ధం ఈ వేడుకను నిర్వహిస్తారు. అప్పటి పందళం రాజవంశం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్కు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే ఈవేడుకను ఆలయన నిర్వహాకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.
సరిగ్గా ఆయన పుట్టిన రోజున 1942లో చితిర తిరునాళ్ మహారాజు తన కుటుంబంతో శబరిమల సందర్శించినందుకు గుర్తుగా కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మహారాజు తమ్ముడు ఉత్రాడం తిరునాల్ మార్తాండ వర్మ శబరిమల దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అది ఇప్పటికీ నెట్టింట వైరల్ ఫోటోగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేడుకను మహారాజు జన్మదినమైన తులా మాసంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున నిర్వహిస్తారు. చెప్పాలంటే సాధారణంగా ఆ పండుగ అక్టోబర్ నెలాఖరు-నవంబర్ మొదటి వారంలో జరుగుతుంటుంది.
చిత్తిర అట్టవిశేషం విశిష్టత..
అత్తతిరునాల్ పూజ కోసం అయ్యప్ప ఆలయం దాదాపు 29 గంటలు తెరిచి ఉంటుంది. ఈ వేడుకను అచ్చం మళయాళుల జరుపుకునే సంవత్సరాది వేడుక మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ పండుగ రోజు ఉదయ 5 గంటలకు ఊరేగింపు, అభిషేకం జరుగుతాయి. దాంతోపాటు నెయ్యాభిషేకం, అష్టద్రవ్య మహాగణపతి హోమం, ఉష పూజ వంటి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే..తిరువనంతపురంలోని కవడియార్ ప్యాలెస్ నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం తీసుకొచ్చిన ప్రత్యేక నెయ్యిని అయ్యప్పస్వామికి అభిషేకం చేస్తారు.
అంతేగాదు ఈ ప్రత్యేక రోజున, అయ్యప్పన్ సన్నిధిలో ఉదయం సాయంత్రాల్లో పూజ, అష్టాభిషేకం, లక్షార్చనే, సహస్రకలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రి భోజనాల అనంతరం భస్మానికి అభిషేకం చేసి 10 గంటలకు హరివరాసన గానంతో ఊరేగిస్తారు.
ఈ ‘చిత్తిర అట్టవిశేషం’ వేడుకల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు మండలం(మండల దీక్ష) కోసం తిరిగి నవంబరు నుంచి మూడు మాసాల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలోనే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటుంటారు.
(చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..)


