గరుడ వాహనంపై శ్రీవారి నగరోత్సవం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అష్టబంధన మహా సంప్రోక్షణ సమేత మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయదేవి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేషధారణలు, గుర్రాలు, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగింపు కొనసాగింది. అనంతరం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో తపోవనం, శ్రీమాతా శివచైతన్య మాతాజీ (నులకపేట) పర్యవేక్షణలో చండీ హోమం, పూర్ణాహుతి, డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి నిర్వహణలో లలిత పారాయణ, సువాసిని సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం సాహితీవేత్తలు ముప్పవరపు సింహాచలశాస్త్రి, నారాయణం శేషుబాబు, మహా కుంభాభిషేక విశేషాలు, బ్రహ్మోత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, బీజేపీ నేతలు చెరుకూరి తిరుపతిరావు, యడ్లపాటి స్వరూపారాణి, పీవీ శంకరరావు (వికాస్ విద్యా సంస్థలు), ప్రముఖ వ్యాపారవేత్త మందలపు బంగారుబాబు ప్రసంగించారు. టీటీడీ ఆగమశాస్త్ర పండితులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీవేత్త నోరి నారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, బండారు సాంబశివరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment