సిటీ కోర్టులు : రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్) లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతో పాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 6కు వాయిదా వేసింది. సినీ హీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబాన్ని కించపరిచేలా నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండానే మీడియా అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే ఈ విచారణలో కూడా ఆమె పూచీకత్తు పెట్టుకోకపోవడంతో మార్చి 6కు వాయిదా వేస్తున్నట్లు మంత్రి తరుఫు న్యాయవాదికి కోర్టు సూచించింది.
విచారణకు మంత్రి కొండా సురేఖ నాగార్జున గైర్హాజరు
మార్చి 6కు వాయిదా వేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు
Comments
Please login to add a commentAdd a comment