
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
అత్తాపూర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చంద్రాయణగుట్టకు చెందిన మీర్ ముస్తఫా అలీ, ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఖయ్యూమ్లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వత్తిగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నమోదై ఉన్నాయి. వీరు తరచు దొంగతనాలు చేస్తూ పట్టుబడిన ప్రతిసారి బైయిల్పై బయటకు వస్తు తిరిగి అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన టీఎస్12ఈఏ 4398 నెంబర్ గల వారి యాక్టివా స్కూటీకి డూప్లికేట్ టీఎస్09ఈవై 0733 నంబర్ ప్లేట్ను అతికించారు. అనంతరం సర్వారెడ్డి కాలనీకి చేరుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును తెంచుకుని పారిపోయి డూప్లికేట్ నెంబర్ప్లేట్, వారు ధరించిన బట్టలు, మాస్క్లను తొలగించి ఏమీ తెలియనట్లు ప్రయాణించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగలించిన బంగారు గొలుసును జకియా సుల్తానా అనే మహిళకు ఇవ్వడంతో ఆమె విక్రయించిందన్నారు. ముగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, యాక్టివా స్కూటీ, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment