![LinkedIn gives staff a week off for their well-being - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/3/LINKEDIN.jpg.webp?itok=V_Le7ele)
సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సంస్థంలోని ఫుల్ టైం ఉద్యోగులకు ఏకంగా వారం రోజుల పాటు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కష్టించిన పనిచేసిన తమ సిబ్బంది ఒత్తిడిని అధిగమించి, రిలాక్స్ అయ్యి, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రీఛార్జ్ అయ్యేందుకు వీలుగా ఈ వెసులుబాటును కల్పిస్తోంది. వచ్చే సోమవారం (ఏప్రిల్ 5 ) నుంచి ఇది అమలు కానుంది. తద్వారా దాదాపు 15,900 మంది పూర్తికాల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ "రెస్టప్!" అంటూ వారం రోజుల సెలవును ఉద్యోగులకు కల్పిస్తోది. ఈసందర్భంగా లింక్డ్ఇన్ కీలక ఉద్యోగి తుయిలా హాన్సన్ మాట్లాడుతూ, సంస్థ కోసం కష్టపడి పనిచేసిన తమ ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నామని తెలిపారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులందరూ పూర్తి శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే మెయిట్ టీం ఈ వారంలో పని చేస్తారు. ఆ తరువాత వారు కూడా ఈ సెలవును తీసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు సేద తీరనున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు లింక్డ్ఇన్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించుకోవచ్చు. అంతేకాదు సగానికి సగంమందికి ఇంటినుంచే పనిచేసే విధానాన్ని ప్రామాణింగా మార్చాలని కూడా యోచిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2016 మధ్యలో లింక్డ్ఇన్ను 26.2 బిలియన్లకు కొనుగోలు చేసింన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment