
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి.
ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment