
రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.
ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.
Passenger train derails in Komi Region, Russia pic.twitter.com/Ywh4s6NEaH
— RT (@RT_com) June 26, 2024