
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.
పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సంక్షోభ లంకపై నెలవంక!
Comments
Please login to add a commentAdd a comment