మరమ్మతు చేయరా..?
కేఎల్ఐ ప్రాజెక్టులో పాడైన రెండు మోటార్లు
● ఎల్లూరు పంప్హౌజ్లో నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసిన వైనం
● మూడింటితోనే కొనసాగుతున్న ఎత్తిపోతలు
● వివిధ రకాల సాకులతో కాలయాపన
● ఏటా వేసవిలో తప్పని సాగు, తాగునీటి కష్టాలు
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపు మోటార్ల మరమ్మతు ఏళ్ల తరబడిగా పెండింగ్లో పడుతూనే ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుతున్నారు. అయితే ప్రాజెక్టులోని మొదటి పంపుహౌజ్ (ఎల్లూరు లిఫ్టు)లో రెండు మోటార్లు పాడై ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఇటు ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు.
ఎత్తిపోతలకు ఇక్కట్లు..
ఎల్లూరు పంప్హౌజ్లో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు మోటార్లలో రెండింటితోనే నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తుండగా.. మరొకటి స్పేర్లో ఉంది. రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతుండటంతో వరదల సమయంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు ఆలస్యమవుతోంది. కృష్ణానది వరద ప్రవాహ సమయంలో ఎల్లూరు పంప్హౌజ్లో నాలుగు మోటార్లు నడిపించి రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితో రిజర్వాయర్లతో పాటు, చెరువులు కూడా నింపుకోవాలి. కానీ, ఎల్లూరు లిఫ్టులో రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎత్తిపోతలు జరగడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,208 చెరువులు నింపేందుకు నెలలు గడిచిపోతోంది.
మరమ్మతులకు ఆటంకం
కేఎల్ఐ ప్రాజెక్టులో మోటార్లు పాడైతే మరమ్మతు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోత జరుగుతుంది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బిల్లులు పెండింగ్లో ఉండటం కూడా కొంత కారణమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి పాలమూరువాసుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో.. రూ.వేల కోట్లు వెచ్చించి.. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.. కానీ, రెండు మోటార్లకు చిన్నపాటి మరమ్మతు చేసేందుకు అంతకు మించి కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విషయం పక్కనపెడితే.. ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం ప్రతిఏటా ఎండాకాలంలో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి గోస పడక తప్పడం లేదు. – కొల్లాపూర్
Comments
Please login to add a commentAdd a comment