గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టు కింద సాగుచేసిన ఆయకట్టు పంటలకు వారబందీ విధానంలో సాగునీటిని ఇస్తామని జిల్లా ఇరిగేషన్శాఖ అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టులోని 104 ప్యాకేజీ కింద 5 వేల ఎకరాలు నీరందక ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగగా.. ‘పంటలు ఎండుతున్నాయ్’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈమేరకు అధికారులు స్పందించారు. 104ప్యాకేజీ కింద 5వేల ఎకరాలకు, కుడికాల్వ కింద 15 వేల ఎకరాలకు సాగునీటిని వారబందీ విధానంలో ఇవ్వాలని ఎస్సీఐడబ్య్లుఏఎం కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, రైతులు 50వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారని, కాల్వపై అక్రమంగా మోటార్లు వేసి సాగునీటిని తరలిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈనెల 10వ తేదీన సాగునీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సూచన మేరకు ఈ నెల 14వ తేదీన 104 ప్యాకేజీ కింద ఉన్న చివరి ఆయకట్టు పొలాలకు నీరు ఇవ్వటానికి నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా అక్రమ మోటార్ల వినియోగంపై చర్యలు తీసుకుని కట్టడి చేస్తామని, వారబందీ విధానంలో సాగునీటిని చివరి ఆయకట్టు పొలాలకు సైతం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ను కలిసిన
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అలంపూర్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కలిశారు. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగగా.. సమావేశానికి వారు ఇరువురు హాజరయ్యారు. ఈక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ను కలిసినట్లు వారు తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
గట్టు: గట్టులో కొనసాగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షలను మంగళవారం సిట్టిండ్ స్క్వాడ్ బృందం బాలస్వామి, నల్లన్న తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు, మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా తావులేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఐదో రోజు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 288 మంది విద్యార్థులకు గాను 281 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ కేఎస్డీ రాజు, డీపార్టుమెంటల్ అధికారి కాశీ విశ్వనాథ్తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు సంబందించి 61 మంది విద్యార్థులకు గాను 55 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం బయట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment