ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఒకరి ఆత్మహత్య

Published Mon, Feb 17 2025 12:11 AM | Last Updated on Mon, Feb 17 2025 12:11 AM

-

శంకరపట్నం: మండలంలోని మెట్‌పల్లి గ్రామంలో బావమరిది ఇంట్లో బావ ఆత్మహత్య చేసుకున్నాడు. కేశవపట్నం ఎస్సై రవి వివరాల మేరకు.. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ గ్రామానికి చెందిన ముప్పిడి రాంరెడ్డి(72) కొన్ని రోజులుగా మండలంలోని మెట్‌పల్లి గ్రామంలోని తన బావమరిది తుమ్మల పురుషోత్తమరెడ్డి ఇంటివద్ద ఉంటున్నాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దినసరి కూలీ మృతి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): స్థానిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో చైన్నెకి చెందిన జీవా(55) అనే దినసరి కూలీ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఆర్నెల్ల క్రితం చైన్నె నుంచి ఇక్కడకు వచ్చిన జీవా దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. బస్టాండ్‌లోనే తలదాచుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం కూలీ పనిచేసి మద్యం తాగాడు. అక్కడే పడుకున్నాడు. సకాలంలో మంచినీరు తాగలేదు. దీంతో బాడీ డీహెడ్రేషన్‌కు గురై మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు.

గుండెపోటుతో చిత్రకారుడు..

జగిత్యాలరూరల్‌: జగిత్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు మచ్చ రవి (50) గుండెపోటుతో మృతి చెందాడు. రవికి శనివారం రాత్రి గుండెపోటు రాగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.

మహిళకు గాయాలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): కనగర్తి గ్రామంలో ఆదివారం ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవాశాత్తు సరోజన కిందపడి గాయాలపాలైందని ప్రయాణికులు తెలిపారు. తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

గంజాయి స్వాధీనం

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ పరిసరాల్లో గంజాయి విక్రయించడానికి వచ్చిన ఇదే గ్రామానికి చెందిన గంగాధర్‌ నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పృథ్వీధర్‌ ఆదివారం తెలిపారు. గ్రామ పరిసరాల్లో గంజాయి విక్రయించడనానికి వస్తున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా 64 గ్రాముల గంజాయి దొరికింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

రుద్రంగి మండలంలో..

రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని నేవూరిపల్లి బస్‌స్టాండ్‌ వద్ద గంగాధర గ్రామానికి చెందిన పొత్తూరి అలియాస్‌ సముద్రాల రాకేశ్‌ అలియాస్‌ రాఖి నుంచి గంజాయి పట్టుకున్నట్లు సీఐ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం రాత్రి పక్కా సమాచారం మేరకు ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో రాఖి నుంచి 24 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎల్లయ్యగౌడ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. వీర్నపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా ఉన్న లాల్‌సింగ్‌తండాకు చెందిన దినేశ్‌, అజ్మీర పవన్‌, హరీశ్‌లను తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement