
ఆన్లైన్ వస్తే మరింత మేలు
● ఇల్లెందులో ‘డిజిటల్ లైబ్రరీ’ కోసం ఎదురుచూపులు ● పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ● ఆన్లైన్ సదుపాయం లేక ఉన్న పుస్తకాలతోనే ప్రిపరేషన్
ఇల్లెందు: ఏళ్ల తర్వాత ఇల్లెందులో సువిశాలమైన గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. ఈ భవన నిర్మాణానికి 2023లో నాటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, అప్పటి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శంకుస్థాపన చేయగా, గత నెల 22న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఈ భవనం అందుబాటులోకి రావడంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నా ఆన్లైన్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, చర్ల, ఇల్లెందులో గ్రంథాలయాలకు విశాలమైన భవనాలు అందుబాటులో ఉండగా, పాల్వంచలో డిజిటల్ గ్రంథాలయం కూడా నెలకొల్పారు. ఇల్లెందులో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
ఇరుకు సందులో పాత భవనం
ఇల్లెందు గోవింద్ సెంటర్లోని ఇరుకు సందులో పురాతన భవనంలో గ్రంథాలయం కొనసాగేది. పట్టుమని పది మంది వచ్చినా కూర్చునేందుకు సదుపాయం లేకుండానే నిరవహించారు. ఆ తర్వాత జేకేకాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నూతన భవనం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఇందులో విశాలమైన రీడింగ్ హాల్, వేలాది పుస్తకాలు, ఎంతసేపు కూర్చున్నా ఇబ్బంది ఎదురుకాని తరహాలో నాణ్యమైన కుర్చీలను సమకూర్చారు. ఇందులో రీడింగ్ హాల్, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా ఉండగా ఏకకాలంలో 150 మంది వరకు చదువుకోవచ్చు.
డిజిటల్ కోసం ఎదురుచూపులు
అత్యాధునిక వసతులతో గ్రంథాలయ భవనం అందుబాటులోకి తీసుకొచ్చిన యంత్రాంగం డిజిటల్ సౌకర్యం మాత్రం కల్పించలేదు. ఐదు నుంచి 10 కంప్యూటర్లు, వైఫై సదుపాయం కల్పిస్తే ఆన్లైన్లో పోటీ పరీక్షల సమాచారం తెలుసుకుని జర్నల్స్ చదువుకునే వెసలుబాటు కలుగుతుందని నిరద్యోగులు చెబుతున్నారు. రూ.వేలల్లో వెచ్చించి దూర ప్రాంతాల్లో శిక్షణ తీసుకునే పరిస్థితి లేని తమలాంటి వారి కోసం ఇక్కడ ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
నిధులు లేక డీలా..
గ్రంథాలయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. మొక్కుబడిగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తద్వారా ఆశించినంత మేర ఆదాయం లేక తాగునీరు, విద్యుత్, పేపర్ బిల్లుల చెల్లింపునకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు చెల్లించే పన్నుల్లో 10 శాతం లోపు గ్రంథాలయాలకు సెస్ ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం గమనార్హం.
ఒకేసారి 150మంది చదువుకోవచ్చు
లైబ్రరీని నిరుద్యోగుల కోసం అధిక సమయం తెరిచి కొనసాగిస్తున్నాం. డిజిటల్ విభాగం కూడా ఏర్పాటైతే వారికి మరింత ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. గ్రంథాలయంలో 150 మంది ఏకకాలంలో చదువుకునే అవకాశం ఉంది.
–రుక్మిణి, లైబ్రేరియన్
ప్రత్యేక చొరవ చూపాలి..
గ్రంథాలయంలో డిజిటల్ విభాగం ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరం. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్తో పాటు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ చూపితే నిరుద్యోగులకు మేలు చేసిన వారవుతారు.
–కాళంగి హరికృష్ణ, ఇల్లెందు
డిజిటల్ విభాగం ఉంటే మేలు..
లైబ్రరీలో డిజిటల్ విభాగం కూడా నెలకొల్పితే మేలు జరుగుతుంది. దూరప్రాంతాల్లో శిక్షణకు వెళ్లలేని మాలాంటి వారికి ఆన్లైన్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాక ఎక్కువ సమయం తెరిచే ఉంచడంపై దృష్టి సారించాలి.
–శ్రీను, ఇల్లెందు

ఆన్లైన్ వస్తే మరింత మేలు

ఆన్లైన్ వస్తే మరింత మేలు

ఆన్లైన్ వస్తే మరింత మేలు

ఆన్లైన్ వస్తే మరింత మేలు

ఆన్లైన్ వస్తే మరింత మేలు

ఆన్లైన్ వస్తే మరింత మేలు
Comments
Please login to add a commentAdd a comment