తరలిపోనున్న ఏసీబీ కార్యాలయం! | - | Sakshi
Sakshi News home page

తరలిపోనున్న ఏసీబీ కార్యాలయం!

Published Wed, Feb 12 2025 12:31 AM | Last Updated on Wed, Feb 12 2025 12:31 AM

తరలిపోనున్న ఏసీబీ కార్యాలయం!

తరలిపోనున్న ఏసీబీ కార్యాలయం!

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయం మంచిర్యాల జిల్లాకు తరలిపోనుంది. ఈ నెల 14న ఇక్కడి నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాలలోని సింగరేణి క్వార్టర్స్‌లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు పనిచేసిన అధికారులు జిల్లాలో ఉన్న కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలించేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో అనుమతి వచ్చినట్లు సమాచారం. ఇదివరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కొనసాగిన స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సైతం అధికారులు మంచిర్యాల జిల్లాకు తరలించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్‌ నుంచి మంచిర్యాల జిల్లాకు కార్యాలయాలను తరలించడంపై జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలో ఏసీబీ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదని, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోనే ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఈ కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులకు జిల్లా అనుకూలంగా లేకపోవడం, మంచిర్యాల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ ఉండడంతో వారి జిల్లాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండడంతోనే అక్కడికి తరలిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

ఆదిలాబాద్‌ వాసులకు ఇబ్బందులు

జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలిస్తుండడంతో జిల్లా వాసులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జిల్లాలో అధిక శాతం మంది గిరిజనులు ఉండడం, అమాయక ప్రజలను కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ వసూళ్లు చేసినప్పుడు ఏసీబీని ఆశ్రయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇదివరకు జిల్లాకు ఇన్‌చార్జి డీఎస్పీ ఉండగా ప్రస్తుతం రెగ్యులర్‌ డీఎస్పీని ప్రభుత్వం నియమించింది. ఇద్దరు సీఐలతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు పనిచేస్తున్నారు. ముఖ్య కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలించి నామ్‌కే వాస్తేగా జిల్లా కేంద్రంలో సబ్‌ కార్యాలయాన్ని అందుబాటులో ఉంచుతారనే చర్చ సాగుతోంది. ఇద్దరు హోంగార్డులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ను సంప్రదించగా ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాలలో ఏసీబీ కార్యాలయం కొనసాగుతుందని పేర్కొన్నారు.

మంచిర్యాల కేంద్రంగా నిర్వహణ..

ఈనెల 14న తరలించనున్నట్లు సమాచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement