
ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్ను ఆయన అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత నావికాదళంతో
కృష్ణా వర్సిటీ ఒప్పందం
రుద్రవరం(మచిలీపట్నంరూరల్): భారత నావికాదళంతో కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనలు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కేయూ రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం న్యూ ఢిల్లీలోని నావికాదళ కేంద్రంలో నావెల్ ఆర్కిటెక్చర్ డైరెక్టరేట్ డైరెక్టర్ అభిలాష్ శ్రీ కుమారన్, తాను ఎంఓయూపై సంతకాలు చేశామని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తాయన్నారు. అలాగే నావికాదళ అధికారుల విద్యార్థులు కూడా కేయూలో విద్యనభ్యసించే అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం అభిలాష్ శ్రీ కుమారన్ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సీడీఆర్ తరుణ్ చందర్ కమల్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవో,
డీపీవోలకు అవార్డులు
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ అవార్డులు అందుకున్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సమర్థంగా వినియోగించినందుకు సీఈఓ.. జిల్లాలో స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినందుకు డీపీవో అవార్డుకు ఎంపికయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చేతుల మీదుగా వీరు ఇరువురూ అవార్డులను గురువారం స్వీకరించారు.
జీజీహెచ్కు క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలు అందజేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు విలువ చేసే రెండు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలను అందజేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు ఎంపీ తరఫున ఆరా సంస్థ ప్రతినిధి అందజేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలలో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీనింగ్ డివైజ్లు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంపీ విజయేంద్ర ప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరికరాలు బరువు తక్కువగా ఉండటమే కాకుండా, పరీక్ష చేసేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా ఉండే విధంగా తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత

ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత

ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత