
● రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు వేలిముద్రలు వేయాల్సిందే
● జిల్లాలో ఈకేవైసీ పెండింగ్ కార్డు సభ్యుల సంఖ్య 2,78,177
కర్నూలు(సెంట్రల్): రేషన్ కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేయించుకోకపోతే కార్డులోని వారి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టంది. కార్డులోని ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ డీలర్, వీఆర్వో, సచివాలయ సిబ్బంది లాగిన్లలో ఆధార్ కార్డు చూపించి వేలి ముద్రలు లేదా ఐరిస్ ఇవ్వాలి. లేదంటే మార్చి 31వ తేదీ తరువాత వారి పేర్లను కార్డు నుంచి తొలగిస్తారు. కర్నూలు జిల్లాలో 6,34,631 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో కుటుంబ సభ్యులంతా సభ్యులుగా ఉంటారు.
అలా 6,34,631 కార్డులలో 21,92,047 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఈకేవైసీ చేయించు కోవాలి. గతంలోనే దాదాపు 80 శాతం మంది చేయించుకున్నారు. మిగిలిన 20 శాతం మంది సభ్యుల ఈకేవైసీ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి వేలిముద్రలు, కంటి ఐరీష్తో ఈకేవైసీని పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లాలో 19,13,870 మంది రేషన్కార్డు సభ్యుల ఈకేవైసీ పూర్తయింది. మిగిలిన 2,78,177 మంది సభ్యులు మార్చి31వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది.
స్పందించని డీలర్లు.. పనిచేయని మొబైల్ ఆప్లికేషన్
పెండింగ్ ఈకేవైసీని డీలర్లు, వీఆర్వోలు, సచివాలయ కార్యాదర్శుల దగ్గర చేయించుకోవాలి. ఇందుకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ జాబితాను మండలాలు, సచివాలయాల వారీగా అందు బాటులో ఉంచారు. అయితే డీలర్లు ఈకేవైసీ వేయించడానికి స్పందించడం లేదు. వీఆర్వోలు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సచివాలయ సిబ్బంది మొబైల్ అప్లికేషన్లో సర్వనఖ బిజీ వస్తోంది. ఈక్రమంలో నిర్దేశించిన సమయం దగ్గర పడుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ కోసం గడువును పొడిగించాలని కోరుతున్నారు.
ఈనెలాఖరులోపు చేయించుకోవాలి
జిల్లాలో మొత్తం 21,92,047 మంది సభ్యుల్లో ఇంకా 2,78,177 మంది ఈకేవైసీ చేయించుకోవాలి. వీరంతా ఈకేవైసీని మార్చి31వ తేదీలోపు చేయించుకోవాలి. లేదంటే ఎవరి ఈకేవైసీ పూర్తి కాలేదో ఆ సభ్యుడి పేరును రేషన్ కార్డును నుంచి తొలగించి, రేషన్ సరఫరా నిలిపేస్తారు.
– ఎం.రాజారఘువీర్, డీఎస్ఓ
గడువును పొడిగించాలి
రేషన్ కార్డుల్లోని సభ్యుల ఈకేవైసీ కోసం గడువును పొడిగించాలి. ఈ అంశంపై అధికారులు విస్తృత ప్రచారం కల్పించడం లేదు. దీంతో చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు. మరో నెలపాటు గడువును పొడిగించాలి. లేదంటే చాలా మంది ఇబ్బంది పడతారు.
– చంద్రశేఖర్, సీపీఐ నాయకులు, కర్నూలు