
డైరెక్టర్ పోస్టులు ఖాళీ..
హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలిలో (టీజీ ఎన్పీడీసీఎల్) డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి 14 నెలలు అయినా నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆశావాహుల్లో నైరాశ్యం నెలకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 జనవరి 29న అప్పటి వరకు ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ పాలక మండలిని తొలగించింది. కొత్త పాలక మండలి నియామకంలో భాగంగా నాలుగు డైరెక్టర్ పోస్టుల నియామకానికి 2024 జనవరి 30న నోటిఫికేషన్కు జారీ చేసింది. అప్పటికే ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. నాలుగు డైరెక్టర్ల పోస్టులకు 2024 మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపుగా 83 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. ఫలితంగా ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియని అయోమయంలో ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు.
డైరెక్టర్ పోస్టుల భర్తీలో నాన్చివేత ధోరణి..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు పని చేస్తున్న డైరెక్టర్లను తొలగించి చీఫ్ జనరల్ మేనేజర్లను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించారు. వీరు సీజీఎంలుగా, డైరెక్టర్లుగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీజీఎంగా ఒక విభాగం, డైరెక్టర్గా మరో విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, టీజీ ఎన్పీడీసీఎల్, తెలంగాణ సౌథర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేస్తున్న సీజీఎంలు, రిటైర్డ్ సీఈలు, గతంలో పని చేసిన డైరెక్టర్లు.. టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్లో ప్రస్తుతం పని చేస్తున్న సీజీఎంలు కూడా ఉన్నారు. దరఖాస్తులు స్వీకరించి 12 నెలలవుతున్నా డైరెక్టర్ పోస్టుల భర్తీలో నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. దీంతో ఆశావహులు సుదీర్ఘకాలం వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. పూర్తి కాలం డైరెక్టర్ల నియామకం చేపట్టకపోయిన కంపెనీకి కార్యకలాపాలు, అభివృద్ధి పనులు యథాతథంగా నడుస్తుండడంతో డైరెక్టర్లు లేని లోటు కనిపించడం లేదు.
ఆశావహులకు నిరాశ, ఎదురుచూపులే..
ప్రధాన నిర్ణయాలు తీసుకునే బోర్డులో కనీస డైరెక్టర్లు ఉండడంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు ఏర్పడడం లేదు. బోర్డు మీటింగ్లో పాల్గొనేందుకు కనీసం ముగ్గురు పూర్తి స్థాయి డైరెక్టర్లు ఉంటే సరిపోతుందని విద్యుత్రంగ నిపుణులు తెలిపారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ట్రాన్స్కో నుంచి జి.నర్సింగరావు, ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ సెక్రటరీ కె.చంద్రకళ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.పక్కీరిసామి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దల్జీత్సింగ్ ఖత్రీ పూర్తి స్థాయి డైరెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు ఈ బోర్డులో ఇన్చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, ఇన్చార్జ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.సదర్లాల్ ఉన్నారు. దీంతో నిర్టయాలు తీసుకోవడంతో పాటు పనుల చకచకా సాగుతున్నాయి. పూర్తి స్థాయి డైరెక్టర్లు లేరనే లోటు కనిపించడం లేదు. అయితే డైరెక్టర్లు కావాలనే ఆశావహులకు మాత్రమే నిరాశ, ఎదురుచూపులు తప్పడం లేదు.
నోటిఫికేషన్ విడుదల చేసి 14 నెలలు..
దరఖాస్తులు స్వీకరించినా
కొనసాగని ప్రక్రియ
టీజీ ఎన్పీడీసీఎల్లో ఇన్చార్జ్
డైరెక్టర్లతో పనులు
సర్కారు జాప్యంతో
ఆశావహుల్లో నైరాశ్యం
టీజీఎన్పీడీసీఎల్ స్వరూపం..
కంపెనీ విస్తరించిన జిల్లాలు 17
మండలాలు 299
గ్రామాలు 5,580
హామ్లేట్ గ్రామాలు 7,474
విద్యుత్ సర్వీస్లు 68,62,858
ఉద్యోగులు 9 వేలకు పైగా..