పొలం పనిచేస్తూ కుప్పకూలి..
● గుండెపోటుతో యువ రైతు మృతి
దామరగిద్ద: పొలంలో పనిచేస్తూ కుప్పకూలి గుండెపోటుతో ఓ యువ రైతు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలో వత్తుగుండ్లకి చెందిన కొత్తమాలే మాణిక్యప్ప(35) శుక్రవారం తన పొలంలో సాగుచేసిన కీరదీస పంటను కోసేందుకు పొలానికి వెళ్లాడు. పొలం పనుల్లో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, గణేష్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మహమ్మదాబాద్: మొకర్లాబాద్ శివారులో అనుమానాస్పదస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.. వివరాలు.. మండలంలోని మొకర్లాబాద్ రెవెన్యూ శివారులో ముందలితండా అటవీ ప్రాంతంలో 8రోజుల క్రితం గుర్తుతెలియని వృద్ధ మహిళ (65) అక్కడికెళ్లి మరణించింది. శుక్రవారం విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికెళ్లి చూడగా మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నది. మహిళకు సంబంధించిన ఆనవాళ్లు తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ వివరాలు తెల్పిన వాళ్లు మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
బిజినేపల్లి : మండలంలోని వెల్గొండకి చెందిన రమేష్ (38) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం శాయిన్పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్గొండకి చెందిన రమేష్ అతని స్నేహితుడు కలిసి బైక్పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్పల్లి గ్రామంలో ఎత్తైన స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి రమేష్ ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితుడికి గాయాలు కాగా చికిత్స కోసం నాగర్కర్నూల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాయిన్పల్లిలోని ఈ ఎత్తైన స్పీడ్ బ్రేకర్ ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని వృద్ధురాలి మృతి
మల్దకల్ : గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన అమరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి, కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. శుక్రవారం హోలీ పండగ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న ఆమె మధ్యాహ్న భోజనం సమయంలో అన్నం ముద్ద గొంతుల్లో ఇరుక్కోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే108అంబులెన్స్లో చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
పొలం పనిచేస్తూ కుప్పకూలి..
Comments
Please login to add a commentAdd a comment