ఒకరిపై కేసు
కౌటాల: మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. వీరవెల్లి గ్రామానికి చెందిన కేడ్కర్ నాగోరాం ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన కోరిక తీర్చకుంటే చంపేస్తానంటూ అక్కడే ఉన్న బకెట్తో దాడి చేయడంతో ఆమె ఎడమ కంటిపై గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం
నిర్మల్ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
నర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు.
పలువురిపై వీధికుక్కల దాడి
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న హర్ష అనే బాలుడిపై, కొట్రంగి చంద్రక్క, నాజర్పై క కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. బాధితులను బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.
కీచక ప్రధానోపాధ్యాయుడిపై కేసు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఓ కీచక ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదైంది. రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ రామకృష్ణాపూర్కు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గతంలో విద్యార్థులను సైతం వేధింపులకు గురి చేసినట్లు ఘటనలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఒకరిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment