
పీఓలు, ఏపీఓలే కీలకం
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పీఓలు, ఏపీఓలే కీలకమని, పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులలో పాల్గొన్న పీఓలు, ఏపీఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,953 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, 22 పోలింగ్ కేంద్రాలు, 1,281 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఉండగా 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల విధులు నిర్వహించేందుకు 43 మంది పీఓలు, 43 మంది ఏపీఓలకు విధులు కేటాయించినట్లు తెలిపారు. పురుషుల, మహిళా ఓటర్ల సంఖ్యను తప్పక నమోదు చేసుకోవాలన్నారు.
మాక్ పోలింగ్ ఉండదు
సాధారణ ఎన్నికల మాదిరి మాక్ పోలింగ్ ఉండదని, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపించాలన్నారు. దానిని వీడియో చిత్రీకరణ చేయాలని, తర్వాత ఆ బాక్సును సీల్ వేసిన తర్వాత పోలింగ్ ప్రారంభించాలని తెలిపారు. ఓటర్లు పేరులో తప్పులు ఉంటే, ఏదేని గుర్తింపు కార్డు ఆధారంగా ధ్రువీకరణ తర్వాత ఓటు హక్కుకు అనుమతించాలని కోరారు. టెండర్, చాలెంజ్ ఓట్లు ఏవైనా నమోదైతే పోలింగ్ అధికారులకు ఇచ్చే ప్రత్యేక మైన ఎన్వలప్లలో భద్రపరచాలన్నారు.
జిల్లాలో 43 పోలింగ్ కేంద్రాలు
11,953 మంది పట్టభద్రుల ఓటర్లు
1281 మంది ఉపాధ్యాయ ఓటర్లు
అవగాహన సదస్సులో
అదనపు కలెక్టర్ నగేష్
13 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఇతర ఎన్నికల సిబ్బందికి ఈ నెల 13వరకు కలెక్టర్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, జిల్లా సైన్స్అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment