
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు.
అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు.