కేజీఎఫ్‌ 'యశ్‌' పుట్టినరోజు.. ముగ్గురు యువకులు మృతి | Actor Yash Fans Died Due To Electric Shock | Sakshi

కేజీఎఫ్‌ 'యశ్‌' పుట్టినరోజు.. ముగ్గురు యువకులు మృతి

Jan 8 2024 11:45 AM | Updated on Jan 8 2024 11:57 AM

Actor Yash Fans Died To Electric Shock - Sakshi

కర్ణాటకలో ప్రముఖ హీరో యశ్‌కు చెందిన ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేడు (జనవరి 8) 38వ పుట్టినరోజును ఆయన జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఈ వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. 

మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్‌ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది సినిమాల పనుల కారణంగా విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ లేఖ రాసి అభిమానులకు తెలియజేశారు. ఈ సంఘటన గురించి యశ్‌ త్వరలో రియాక్ట్‌ కానున్నాడని తెలుస్తోంది.

'జనవరి 8.. నాపై మీకున్న ప్రేమను వ్యక్తిగతంగా చెప్పాలనుకునే రోజు.. పుట్టినరోజు మీతో గడపాలని ఉంది. కానీ సినిమా పనులు మాత్రం నన్ను బిజీగా ఉంచాయి. అనివార్యమైన ప్రయాణాల కారణంగా నేను ఈ జనవరి 8న మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీ ప్రేమ వెలకట్టలేనిది.. నా పుట్టునరోజు నాడు నేను మీతో గడపలేకపోతున్నాననే  బాధ నాలో కూడా ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.. నేను ఎక్కడ ఉన్నా మీరందరూ నాతోనే ఉంటారు. మీ ప్రేమ, అభిమానమే నాకు పుట్టినరోజు కానుక.' అని యష్ నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement