
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లోని ఓ థియేటర్లో ఆర్జీవీ సినిమాలు విడుదల అవుతాయి. తొలి సినిమాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘డీ-కంపెనీ’ మే 15న ఇందులో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆర్జీవీకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్ముఖ్తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment