
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.
తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.
ఏం జరిగింది?
డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్, అతడి టీమ్తో పాటు సంధ్య థియేటర్పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
