చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్! | Vijay Sethupathi Maharaja breaks box office records in China | Sakshi
Sakshi News home page

Maharaja: చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు

Jan 5 2025 9:11 PM | Updated on Jan 5 2025 9:11 PM

Vijay Sethupathi Maharaja breaks box office records in China

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్‌ సామినాథన్‌ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.

విజయ్ సేతుపతి లీడ్‌ రోల్‌లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే  ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్‌ చేశారు.

చైనా అధికారి ట్వీట్.. 

2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది.  ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్‌ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్,  సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement