
జూనియర్ vs సీనియర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే కొందరు విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ఇటీవల రెండు సంఘటనల్లో పలువురు విద్యార్థులను హాస్టళ్లనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరిచిపోకముందే తాజాగా శుక్రవారం కామన్ మెస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భోజనం చేస్తున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. భోజనం ప్లేట్లు, గిన్నెలను కిందపడేశారు. ఆ సమయంలో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు.
సాయంత్రం మరోసారి ఘర్షణ..
క్యాంపస్లోని పీహెచ్సీలో చికిత్స పొందిన ఇద్దరు జూనియర్లు సాయంత్రం గణపతిదేవ హాస్టల్కు వచ్చారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు.. జూనియర్లకు, సీనియర్లకు మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. సీఐ రవికుమార్, ఎస్సై మాధవ్ ఇతర పోలీస్సిబ్బంది అక్కడి చేరుకొని ఇరువర్గాలకు చెందిన 18 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించారు. తొలుత కామన్మెస్లో దెబ్బలు తగిన ఇద్దరు జూనియర్లను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
హాస్టళ్ల డైరెక్టర్ ఏమంటున్నారంటే..
తమకు గౌరవం ఇస్తలేరనే కారణంతోనే సీనియర్ విద్యార్థులు.. జూనియర్లతో గొడవ పడినట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ చెబుతున్నారు. మొదట ‘నావైపు ఎందుకు చూస్తున్నావు’ అని ఓ సీనియర్.. జూనియర్ విద్యార్థిని ప్రశ్నించగా.. మాటమాట పెరిగి పరస్పరం కొట్టుకున్నారని తెలిపారు. అదే కారణమా? మరేదైనా ఉందా అనే కోణంలో విచారించాల్సి ఉందని చెబుతున్నారు. తమను సీనియర్లు కొట్టారని ముగ్గురు జూనియర్లు, జూనియర్లే కొట్టారని ముగ్గురు సీనియర్ విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినట్లు రాజ్కుమార్ తెలిపారు.
నేడు వీసీ వచ్చాక నిర్ణయం
ఘర్షణ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న వీసీ కె.ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా యూనివర్సిటీలోనే ఉన్న రిజిస్ట్రార్ రామచంద్రం, కెమిస్ట్రీ విభాగం అధిపతి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శనివారం వీసీ వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సమావేశమై నిర్ణయించనున్నట్లు సమాచారం. హాస్టల్నుంచి సస్పెండ్ చేయాలా.. ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. కామన్ మెస్లో ప్లేట్లు, గిన్నెలు పడేయడంతో జరిగిన నష్టం ఎంత అనేది కూడా అంచనా వేస్తున్నారు. సీసీ పుటేజీలు కూడా పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. ఎవరెవరి మీద ఎవరు దాడి చేసుకున్నారనేది స్పష్టంకానుంది.
కేసు నమోదు
కొట్టుకున్న విద్యార్థులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు సీనియర్లు 8 మంది, జూనియర్లు 10మంది, నలుగురు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కొట్టుకున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులు
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
సీనియర్లకు గౌరవం ఇస్తలేరనే
కారణంతో గొడవ?
కామన్మెస్లో ఒకసారి,
హాస్టల్ వద్ద మరోసారి ఘర్షణ
ఇద్దరు జూనియర్లను
ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
పోలీసుల అదుపులో
18మంది విద్యార్థులు
నేడు వీసీతో చర్చించి
చర్యలు తీసుకునే అవకాశం
ఆధిపత్యం కోసమేనా..
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్లు తమకు జూనియర్లు గౌరవం ఇవ్వడం లేదని కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కామన్మెస్లో అందరూ భోజనం చేస్తున్నారు. ఏమి జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా జూనియర్లకు, సీనియర్లకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్, కేయూ పోలీస్టేషన్ ఎస్పై మాధవ్ తన పెట్రోలింగ్ సిబ్బందితో కామన్మెస్కు చేరుకున్నారు. దెబ్బలు తాకిన ఇద్దరు జూనియర్లను క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘర్షణకు దారితీసిన పరిస్ధితులను పోలీసులు అక్కడి సిబ్బంది, విద్యార్థులను, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు.

జూనియర్ vs సీనియర్
Comments
Please login to add a commentAdd a comment