
ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ
3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన
● నేటినుంచి ఉమ్మడి
జిల్లావ్యాప్తంగా
66 స్కూళ్లలో నిర్వహణ
● గత నెల 25నే నారాయణపేటలో ప్రారంభం
● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు
● కంప్యూటర్ ల్యాబ్లు ఇతర పరికరాల ఏర్పాటు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల ద్వారా సాగుతుండగా.. విద్యార్థి అక్షర పరిజ్ఞానం, అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి.. వాటిని మదింపు చేయడం అనుకున్నంత మెరుగ్గా జరగడం లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో విద్యార్థి విద్యా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈకే స్టెఫ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంతో కీలకంగా మారింది. దీని సేవలను పాఠశాలలో వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద నారాయణపేటలో 10 పాఠశాలల్లో గత నెల 25న ప్రారంభించారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మరో 56 పాఠశాలల్లో శుక్రవారం నుంచి అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ప్రతి జిల్లాలో నలుగురు రీసోర్సుపర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు వచ్చినా ఇందులో టేబుళ్లు, కుర్చీలు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది.
ఈ విధానం బాగుంది..
కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించిన తర్వాత తెలుగు, ఆంగ్లంలో పదాలను అర్థం చేసుకుని బాగా పలుకుతున్నాం. గణితంలోనూ కూడికలు, తీసివేతలు తదితర వాటిని చక్కగా చేయగలుగుతున్నాం. మొదట్లో టీచర్లు ఎంత చెప్పినా నెత్తికి ఎక్కేది కాదు. ప్రస్తుత విధానం బాగుంది. – విజయలక్ష్మి, 4వ తరగతి, కొల్లంపల్లి, నారాయణపేట
●
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
మరో 56 పాఠశాలల్లో..
స్థాయిని బట్టి బోధన
ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా చిన్నారులను ఆకట్టుకునేలా ఏఐ బోధన ఉంటుంది. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని ఐదుగురిని ఒక బ్యాచ్గా విభజించి.. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తుంది. ఆ విద్యార్థి అర్థం చేసుకున్నాడా.. లేదా.. అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో మళ్లీ బోధన అందిస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడానికి నివేదిక రూపొందిస్తాం.
– రమేష్కుమార్, డీఈఓ, నాగర్కర్నూల్
సులభంగా ఉంది..
ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది.
– మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట
అర్థం అవుతున్నాయి..
మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి.
– భార్గవ్, 5వ తరగతి,
నారాయణపేట
సామర్థ్యాల మదింపు..
ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వెనకబడి ఉండే విద్యార్థులను గుర్తించి కంప్యూటర్ ముందు కూర్బోబెడతారు. ఇందులో ప్రధానంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించాల్సి ఉంది. ముందుగా విద్యార్థికి కేటాయించిన పెన్ నంబర్ (పర్మనెంటర్ ఎడ్యుకేషన్ నంబర్) ద్వారా ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి విద్యార్థి గత కొన్ని రోజులుగా చేస్తున్న పర్ఫామెన్స్, డెవలప్మెంట్, నేర్చుకున్న అంశాలు ఇందులో నిక్షిప్తమవుతాయి.

ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ

ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ

ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ

ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ

ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ
Comments
Please login to add a commentAdd a comment