నృసింహుడికి అలంకార వైభవం
ఉదయం మత్స్యరూపుడై, సాయంత్రం స్వర్ణ శేషవాహనంపై దివ్యదర్శనం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచనారసింహుడి అలంకార, వాహనా సేవలకు అర్చకులు సోమవారం ఆగమశాస్త్రం ప్రకారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉదయం స్వామివారు మత్య్సవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం దక్షిణ ప్రాకార మండపంలోని నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి పట్టువస్త్రాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా అలంకరించారు. పూజలు చేసి, హారతి నివేదించారు. అనంతరం వేదపండితులు, అర్చక బృందం, రుత్వికులు, పారాయణీకుల వేదమంత్రోచ్ఛరణ, మూలమంత్ర జపస్తోత్రాలతో మంగళవాయిద్యాలు మోగుతుండగా, భక్తజనులు గోవిందనామస్మరణ చేస్తుండగా ప్రధానాలయ తిరు, మాఢ వీధుల్లో అలంకార సేవను ఊరేగించారు.
ఆలయంలో సాయంత్రం
సాయంత్రం నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం శ్రీస్వామివారిని స్వర్ణ శేష వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, సిబ్బంది, పాల్గొన్నారు.
ఆలయంలో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీస్వామివారిని వటపత్రశాయిగా అలంకరిస్తారు. సాయంత్రం హంసవాహన సేవపై స్వామివారిని ప్రధానాలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
నృసింహుడికి అలంకార వైభవం
Comments
Please login to add a commentAdd a comment