గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
నాంపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
వేములపల్లి: లారీ బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మాడుగులపల్లి మండల కేంద్రం సమీపంలో గల ఐకేపీ కేంద్రం వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సింహ(36) బైక్పై మిర్యాలగూడకు వెళ్తుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న తమిళనాడుకు చెందిన లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment